బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

195 - జరాసంధేన సహ రామ జనార్దన యుద్ధ వర్ణనమ్‌

మగదాధిపతి జరాసంధుని కూతుండ్రను అస్తి ప్రాప్తి అను వారిని కంసుడు పెండ్లాడెను. వారి భర్తను జంపినాడని యాదవుడైన హరిని దాను జంపుటకు జరాసంధుడు కోపము గొని వచ్చెను. వచ్చి మథురను ముట్టడించెను. వానితో నిరువది మూడ క్షౌహిణులు సేన యుండెను. బలరామ కృష్ణు లల్ప పరివారముతో వాని బలముతో బోరిరి. కొంత సేపటికి హలియు హరియు తమ పురాణాయుధములను జేకొన వలెనని సంకల్పించిరి. సంకల్ప మాత్రమున చక్రము శార్ఙము (విష్ణు ధనస్సు) అక్షయ బాణములు గల యమ్ముల పొదులు రెండు కౌమోదకి యను గదయు నింగి నుండి అవ్వీరుల దరి కేతెంచెను. బలరాముని నాగలి కూడ గగనము నుండి యాతని చేతి కందెను. మరియు నతని కిష్టమైన సునందమను ముసలాయుధము (రోకలి) గూడ బలరాముని కరమునం జేరెను. అవ్వల యుద్ధమున సేనతో మగధ రాజు నోడించి యవ్వీరులు వారి పురముం జొచ్చిరి.

ఆ దుష్టుడు ఓడిపోయెం గాని బ్రతికి పోయెనని కృష్ణుడు వానిం గెలిచి నట్లు కాదను కొనెను. వాడు బలముం గూర్చికొని మఱల వారిపై దిఱుగ బడెను. అప్పుడు వారి చేతిలో వాడు జితుడయ్యె. దుర్మదమున నాతడిట్లు పదునెన్మిది దండ యాత్రలు సేసి మాగధుడు కృష్ణ ముఖ్యులతో యాదవులతో బోరి అల్పావశిష్టమైన సైన్యముతో వెను దిరిగి పోవు చుండెను. అన్నింటను యాదవ సైన్యము పెక్కు తీరుల సురక్షిత మగుట కేవలము చత్రియగు విష్ణునంశము యొక్క సాన్నిధ్య ప్రభావమే. అది యాజగత్పతి యొక్క మానుషావతార లీలా విలాసమే. మనసు చేతనే జగమ్ముల సృష్టి సంహారములు సేయు భగవంతుడు శత్రువులపై ననేకము లయిన యస్త్రములను విడచుట శత్రు పక్ష క్షయమునకై సేయు ప్రయత్న విస్తరమది యెంత పాటిది? అయినను మానవులకు మానవ ధర్మాను వర్తనము ధర్మము కావున నీ కృష్ణుడును బలవంతులతో సంధియు దక్కు వారితో విగ్రహమును నీ మహానుభావుడు చేయును.

సామదాన భేదోపాయములు ప్రదర్శించి తుదకు దండోపాయ ముపయోగించి యొకప్పుడు పలాయనమును (పారి పోవుటను) గావించును. లీలా మానుష మూర్తియగు నా జగత్ప్రభువు స్వేచ్చాను సారము వర్తించును. మానవ శరీరుల చేష్టను గూడ యిట్ల నువర్తించును.