బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

62 - సముద్ర స్నాన మాహాత్మ్యం

ఇట్లు నారాయణుని యథావిధి పూజించి సముద్రునకు నమస్కరించ వలెను. అపుడు ‘ప్రాణస్త్వం’ అను మంత్రమును జపింప వలెను. స్నానము చేసి వచ్చి యొడ్డున నారాయణుని బూజించి బలరాముని కృష్ణుని సుభద్రను సముద్రుని గూర్చి నమస్కారము సేసి యశ్వమేధ ఫలమును మానవుడు పొందును. అంతియే కాక సూర్య ప్రభమైన విమాన మెక్కి గంధ ర్వాప్సరసలు సేవింప నిరువది యొక్క తరముల వారి నుద్ధరించి విష్ణు లోకమున కేగును. నూరు మన్వంతరములు విష్ణులోక భోగముల ననుభవించి యీ భారత భూమి యందు శ్రీమంతుడై సర్వైశ్వర్య సంపన్నుడయి వేద శాస్త్ర వేత్తయై వర్తించి వైష్ణవ యోగమున మోక్షమును బొందును. ఈ సముద్రమున పుణ్య కాలమందు ననగా గ్రహణ సంక్రాంతి అయన విఘవ యుగాది షడశీతి వ్యతీపాతము దినక్షయ ఆషాఢీ కార్తికీ వైశాఖీ పూర్ణిమల యందు స్నాన దానాదులు చేసి పితృ తర్పణ పిండ ప్రదానాదులు చేసి యనంత పుణ్యనిధి యగును. పిండ ప్రదానము వలన నాయువు, కీర్తి భుక్తి ముక్తి సిద్ధించును. ఈ వార్త నాస్తికులకు జెప్పరాదు. పుష్కర తీర్థములు తమ తమ చెప్ప బడిన ఫలముల నీయ గలవు. ఈ తీర్థ రాజము సర్వతీర్థ ఫల ప్రదము. సాగరుడు సర్వ తీర్థ రాజు. సూర్యోదయ మందు జీకటి విరిసి నట్లు ఈ తీర్థరాజ సేవనమున పాపమెల్ల విరియును. స్నాన దాన తపో హోమాదు లిచట నక్షయ ఫల ప్రదములు.