బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

211 - కృష్ణ నిర్యాణ కథనమ్‌

కృష్ణునిచే నిట్లు తెలుప బడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి యాయన చెప్పి నట్లేగెను. ఏగి ద్వారక కర్జునుని గొని వచ్చి వజ్రుని రాజుం జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మక మయిన తన యంశమును బ్రహ్మ మందారోపించి సర్వ భూతము లందు ధరించెను. సర్వాత్మ భావము నందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట యైనందున) దానిం గౌరవింని మోకాలి పై పాదముంచి యోగ సమాధిం గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలి యందు మిగిలిన యినుప ముక్కతో తయారైన బాణముం గొని యొక లేడి కాలి యడుగు వలెనున్న హరి పాదముం జూచి బాణముతో గొట్టెను. కొట్టి యాదరికి వెళ్ళి నాలుగు బాహువులతో నున్న యొక నరమూర్తిం జూచెను. ఆయనకు ప్రణామము సేసి క్షమింపు మని మఱిమఱి వేడుకొనెను. తెలియక యొక లేడి యనుకొని కొట్టితిని. నా పాప కర్మము చేత తగల బడుచున్న నన్ను నీవు తగలబెట్ట వలదు అనెను. వానింగని భగవంతుడు నీకణు మాత్రమేని భయము లేదు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమున కేగుమని హరి పలికెను.

శ్రీహరి వాక్యానంతర మప్పుడే విమాన మేతెంచెను. ఆ బోయ హరి ప్రసాదము వలన నది యెక్కి స్వర్గమున కేగెను. అతడేగి నంతట భగవంతుడు నారాయణుడు మనసున కందని యమేయము అమలము జన్మ జరా మరణములు లేనిది సర్వాత్మకము నైన యాత్మ యందు (తన యందు) ఆత్మను (తనను) వాసుదేవ రూపమూర్తి యందు సంయోజించి మానుష దేహముం బాసి త్రివిధ మయిన గతిని బొందెను. సాలోక్య సారూప్య సాయుజ్య రూపమైన పరమ ముక్తిని బొందెను.