బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
45 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్
పురుషోత్తమ మను నా పుణ్య వైష్ణవ క్షేత్రము నా రాజు ససైన్య పరివారముగ సేవించి యందు బలరామ కృష్ణులను ప్రతిష్టించి పూజించె నని విందు మాకథ సవిస్తరముగ నానతిమ్మన బ్రహ్మ వారల కిట్లనియె
శ్రీదేవి యడుగగా మున్ను శ్రీహరి తెలిపిన పుణ్య కథను వినుండు. సుమేరు పర్వతము యొక్క సువర్ణ శిఖరము నందు సిద్ధ విద్యాధర కిన్నరులు, సంచరించు చోట, వాలఖిల్యాది మహర్షులు విహరించు చక్కని ప్రదేశమందు నానా తరులతా కుసుమ ఫల భరితమైన చోట కోకిలలు, చిలుకలు, నెమళ్లు మనోహరముగ కూయు తావున దేవతలు కొలువ గొలువున్న వాసుదేవుని జగన్నాధుని సమీపించి శిరసు వంచి నమస్కరించి శ్రీదేవి సర్వలోక హితము గోరి ఇట్లని ప్రశ్నించెను.
శ్రీదేవి:
శ్రీదేవి:
సర్వేశ్వరా! నా సంశయము వారింపుము. మర్త్య లోకమున మిక్కిలి యాశ్చర్యము గొలుపు నది కర్మభూమి (భారత వర్షము) అచట జన్మ యంత సులభము గాదు. లోభ మోహాదు లను మొసళ్లు సంచరించు కామ క్రోధము లను మహా సముద్రము నందు జనన మరణాదుల నుండి తరించుట కనువైన యుపాయము దెలుపుము. నీకన్న ఈ సంశయమును వారిపంగల వక్త లేడు. మాయెడల దయగొని తెలుప దలపు గలదేని యను గ్రహింపుము.
శ్రీదేవి పలుకులు విని దేవదేవుడు పరమ ప్రీతితో నమృతో పమానము సర్వవేద శాస్త్ర సారము నైన విషయము నిట్లు పనసించెను.
సుఖముగను, సులభముగను, నుపాసించి సాధింప దగిన మహా ఫలము నొసంగు దివ్య క్షేత్ర మొకటి పురుషోత్తమ మనుపేర ప్రసిద్ధమై యున్నది. అది కీర్తన, స్మరణ వందనాదు లచే సర్వ పాపముక్తి నీయ గలది. సురాసురులు మరీచ్యాది ముని వరులు గూడ దాని నెఱుగురు. అట్టి తీర్థ రాజమును గూర్చి నీకు దెలుపు చున్నాను. సుందరీ! ఏకాగ్ర చిత్తవై వినుము. కల్పాంత ప్రళయ మందు, స్థావర జంగమాత్మక మైన జగమెల్ల లయ మందెను. అంధకార బంధుర మయ్యెను. ఆ పెంజీకటి కవ్వల నున్న వాడు మేలు కొన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆయనయే సర్వభూత స్వరూవుడు. త్రి మూర్తులకు కర్త. వాసుదేవుడను వాడు. యోగీశ్వరుడు. అయన యోగనిద్ర నుండి మేల్కొని తన నాభి కమలము నుండి కమల దళకాంతి నంపన్న మగు బ్రహ్మ యనెడి యొక మూర్తిని సృజించెను. ఆ బ్రహ్మ పంచ భూత పంచీ కృతముయిన ప్రపంచమును సృజించెను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము లనెడి పంచ తన్మాత్రలకు కారణములైన ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదరము, భూమి యనెడి స్థూల సూక్ష్మము లైన పంచ భూతములను సృజించెను. ఆ మీద నా ప్రజాపతి మనసు నాత్మ వంకకు మరల్చి సంకల్పించి మరీచ్యాది మునులను సర్వ దేవతలను పితృ దేవతలను, యజ్ఞములను, విద్యాధరులను, గంగాది నదులను, నర వానర సింహ శార్దూలాది మృగములను, జరాయుజ, అండజ, శ్వేదజ, ఉద్భిజ్ఞము లను నాలుగు విథములైన చరాచర భూత జాలమును సృజించెను. బ్రహ్మ, క్షత్ర , వైశ్య, శూద్రులను నాలుగు వర్ణములను, అంత్యజులను, మ్లేచ్చులను వేర్వేర సృజించెను. పిపీలికాది జీవకోటి యాయన సృజించి నదే. ఆ సృష్ఠి కర్త తన కుడి భాగమందు తననే పురుష రూపముగా భావించి యెడమ భాగమున స్త్రీని భావించి స్త్రీ పుంస రూపమున ద్విధా భావము నంచెను. మానసిక సృష్టి యిట్లు జరిగిన తరువాత స్త్రీ పుంసాత్మక మిథునము నుండి సృష్టి యావిర్భ వించెను. అట నుండియే మైధున సంభవమైన సృష్టి యారంభ మైనది. ఉత్తమ, మధ్య మాధమ భేదమున తయారయిన యీ యుపాధు లన్నియు నా యొక్క క్షేత్రములు. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి యొనరించి యించుక నాలోచించి ధ్యాన నిష్ఠుడై వాసుదేవ తత్త్వమందు వాసు దేవత్మక మైన మూర్తిని ధరించెను. ధ్యాన మాత్రముచే నా జనార్ధనుడు తానే యా క్షణమున సహస్రాక్షుడు, సహస్ర పాదుడు, సహస్ర శీర్షుడు నైన పురుషుడై యావిర్భ వించెను. తెల్ల తామర పూల వంటి నేత్రముల సజల జలదచ్ఛాయ మైన శరీరము, శ్రీవత్స చిహ్నము, మొదలైన లక్షణము లతో నొక ప్రాకృత మంగళ స్వరూపమున సాక్షాత్కరించెను. లోకపితా మహుడగు బ్రహ్మ హఠాత్తుగా నమ్మూర్తిని దర్శించి అసన అర్ఘ్య పాద్య సమర్పణము చేసి యక్షతల బూజించి యభి వాదనము జేసి పరమ మంగళ స్తుతులచే స్తుతించెను. విరించి మనస్సును ఒదిగించి చేసిన యా స్త్రోత్రమును విని తండ్రి యిపుడు నను ధ్యానించుటకు కారణ మేమని ప్రశ్నించితిని.
దేవేశ! స్వర్గ ద్వారమునకు దారులు, యజ్ఞ దాన వ్రతములు, యోగము, సత్యము, శ్రద్ధ వివిధ తీర్థములు తెలుప బడినవి. అయ్య నుష్ఠానము దుర్లభము. వాని నన్నిటిని మించిన సులభ సాధనము లోక హితము కొఱకు తెల్పుము. ఓ వాసుదేవ! పరమోత్తమ మయిన పుణ్య స్థానము నానతిమ్ము. అన విధాత పలుకులు విని యాతని కిట్లు చెప్పితిని.
సంసార తారకము సర్వోత్తమ క్షేత్రము, చాతుర్వర్ణ సుఖ సాధనము. భుక్తిముక్తి ప్రదము, శీఘ్ర సిద్ధిదము, చతుర్యుగము లందును సుస్థిరమై సేవింప దగినది. సర్వదేవ దానవ యోనులకును సుసేవ్యమై యున్న తీర్థ రాజము పురుషోత్తమునికి నావాస మైన “పురుషోత్తమము” అను క్షేత్రము గలదు. ఆది దక్షిణ సముద్ర తీర ముందున్నది. పది యోజనములు వైశాల్యము గలది. అటవొక మఱ్ఱి వృక్షము గలదు. కల్పాంత మందు కాలాగ్ని విజృంభించి నపుడు కూడ యది నశింపదు. నేను స్వయముగా నచటనే యున్నాను. ఆ వట వృక్షమును దర్శించి యా క్రింది నీడలో విశ్రమించిన వాడు బ్రహ్మ హత్యా పాపము నుండి విడివడును. తక్కిన మహా పాపము మాట చెప్పనేల! దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన వారు విష్ణు లోకమున కేగుదురు. ఆ మఱ్ఱి కించుక దక్షిణమున కేశవుని యాలయ మున్నది. అది ధర్మమయము. భగవంతుడు తానే నిర్మించు కొన్న ప్రతిమ (విగ్రహం) గలదు. దానిని దర్శించిన వారు అనాయాస ముగ వైకుంఠము కేగుదురు. అట్లేగు చున్న జీవులను చూచి యమ ధర్మరాజు నాకడ కేతెంచి శిరసు వంచి మ్రొక్కి యిట్లనియె.
జగన్నాధ స్వామీ! నీకు నమస్కారము. శ్రీవత్స వక్షస్థల, పద్మమాలా భూషిత, పీతాంబరధారీ, శంఖచక్ర గదా ధరా! హార కేయూర భూషితా! కిరీటాం గద ధారియునై సాక్షాత్కరించు జగద్గురు వగు నీకు సగుణమూర్తికి వందనము. ప్రకృతికి నవ్వలనై సర్వేంద్రియ రహితుడై కేవల జ్ఞాన జ్యోతియై సర్వ సాక్షియై నిర్విశేష సుఖానుభవము జ్ఞానము స్వరూపముగా గల్గియున్న కేవలాత్మను నిన్ను నమస్కరించు చున్నాను. అన విని పరమాత్మ నన్ను నీ విపుడెందులకు స్తుతించితివో క్లుప్తముగా నానతిమ్ము అని పురుషోత్తము డనియె. స్వామీ! పురుషోత్తమము” అను నీ పుణ్యాలయమున ఇంద్ర నీలమణి మయమైన యీ ప్రతిమ సర్వాభీష్టములను దీర్చునది. దానిని శ్రద్ధతో దర్శించి ఏకాగ్ర చిత్తమున సేవించి మానవులు నిష్కాములై శ్వేత భవన మునకు వెళ్ళుదురు.
కావున పాపులన్న వారు లేరు. పాపులను దండించు నధికారము నాకున్నను దాని యవసరము లేనందున నా పదవికి గౌరవము పోయినది. కావున నీ ప్రతిమ నుపహరింపు మనెను. అది విని యిసుకలో దాచెద నంటిని. అన్నట్లు నేను దాచితిని. బంగారు తీగల పొదరింట దాచి యముని దక్షిణ దిశకు పంపితిని.
ఇంద్రనీల ప్రతిమట్లు మరుగు పడిన మీదట జరిగిన కథను విష్ణువు లక్ష్మికి చెప్పెను. ఆ చెప్పిన విషయ సంగ్రహము మూలము వలననే సుభముగ తెలియు చున్నది. కావున పునరుక్తిగా ననువాదము చేయబడ లేదు.
