బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

53 - మార్కండేయ ప్రళయ దర్శనమ్‌

అంతట నేన్గులట్లు మెఱుపు దీవల మెఱయు మేఘములు వింతగా నింగి నలము కొనియె. అవి కొన్ని నల్ల కలువల వలె నల్లనివి కొన్ని తెల్ల కలువల వలె తెల్లనివి కొన్ని పద్మ కింజల్కము లట్లు ఎర్రనివి. కొన్ని పసుపు పచ్చనివి కొన్ని యాకు పచ్చనివి కొన్ని కాకిగ్రుడ వంటివి. కొన్ని తామర రేకు లట్టివి కొన్ని యింగువ ఛాయ గలవి అయి యుండెను. కొన్ని పెద్ద నగరములు గను కొన్ని పర్వతము లట్లు కొన్ని కాటుక కొండలట్లు, మరకత వరములునై మెఱుపు దీవల నలుము కొని మహా మేఘములు క్రమ్ము కొనెను. అవి కుండపోతగా వర్షించు వర్షధారలచే నీ మేధిని నలు దెసల బెందడి యయ్యెను. ఆ వర్షపాతముచే నింతకు మున్నేర్పడి యగ్ని యుత్పాతము వశమించెను. పరమేశ్వర ప్రేరణచే మేఘము లవిరామముగా పంద్రెండేండ్లు వర్షింప సముద్రములు పొంగి చెలియల కట్టులు దాటి జగమ్మును ముంచెత్తెను. పర్వతములు పిండిగుండ యయ్యె. ఆ భూమి నీటిలో మునిగి పోయినది. అట్లువ్వెత్తుగ గ్రమ్మిన కారు మబ్బులెల్ల నల్లంతలో వీచిన పెను గాలులకు పింజపింజలై విడిపోగియెను. ఆ తొలి తామర గద్దియపై నున్న విష్ణువు ప్రళయ కాల మారుతమును త్రోసివైచి యా ప్రళయ పయోధిపై హాయిగ నిద్రవోయెను. అపుడు సర్వ జీవకోటి వినష్ట మయ్యెను.

అంత మార్కండేయ మహర్షి విశ్రమించి పురుషోత్తముని ధ్యానించి కనుదెఱచి యివ్వసుంధర యెల్ల నీట మునిగి నట్లు గమనించెను. అంత మున్నుగల యా పెనుమర్రి లేదు. భూమి లేదు. దిక్కులు లేవు. భాస్కరుడు లేడు. చంద్రుడు లేడు. అగ్ని లేడు గాలి లేదు. సురాసురులు లేరు. ఏకార్ణవమై కేవలము కారు చీకటి క్రమ్మిన యత్తరి నిరాశ్రయమైన యా నీట మునిగి యీద యత్నించెను. అట్టిటు నీత కొట్టుచు నాయాస పడజొచ్చెను. తుదకందు మునిగెను. కాని రక్షకుని కానలేడయ్యె. ఆయన ధ్యానమునకు తనివి చెంది పురుషోత్తము డపుడదరి చెదరి పోవుచున్న మునిని గని యిట్లనియె.

వత్స! ఆలసి పోయితివి. పిల్ల వాడవు. నాకు భక్తుడవు. వ్రత నిష్ఠుడవు. ఇటు రారమ్ము. మార్కండేయ! నాదరికి రమ్ము. భయపడకు. నా ముందున్నావు.

అన్న నమ్ముని మిగుల కుపితుడై మరిమరి వెఱగు పడుచు న్నిట్లనియె.

ఎవడు వీడు? నా తపస్సును కించ పరచి మాటలాడు చున్నాడు. పెక్కు వేలేండ్లు యీదు గల నా శరీరమును బెదిరించు చున్నాడు. దేవతలలో కూడ నీలాగ నన్ను తేలిక జేసి మాటలాడు నాచారము లేదు. దేవేశుడు బ్రహ్మ కూడ నన్ను దీర్ఘా యుష్మంతుడ వని యనెనే ఎవడురా! జీవితము కడముట్టిన వాడు. తపముచే గట్టి వడిన తలకాయ గల నాకు నన్ను ఇట్లు మార్కండేయ! అని పేరెత్తి పిలిచి నావలన చావునొంద గోరు చున్నాడు.

అని పలికి చింతంగొని “ఇది కలయా! మోహమా! ఈ వింత యేమను కొన్న యతనికి నంతలో నిశ్చల చిత్తంబున ధ్యానించుటయు నాతనికి సకల దుఃఖ విధ్వంసని యగు మనశ్శక్తి యార్భూతం బయ్యెను.

అపుడతడు పురుషోత్తముని భక్తితో శరణొందెద నని మనసు నిలిపి శరణంది యా వెంటనే యా నీటి మీద విశాలమైన వట వృక్షమును జూచెను. ఆచెట్టు పెను గొమ్మపై పరుచు కొని యున్న విశ్వకర్మ నిర్మిత మయిన చక్కని వింతయిన పర్యంకమును గాంచెను. అది వజ్ర వైడూర్య నిర్మితము. మణి విద్రుమ శోభితము. పద్మరాగాది మఱి గణాలంకృతము. నానావిధా స్తరణము. నానారత్న శోభితము. వింత లన్నిటికి నెలవు. విచిత్ర ప్రభామండల మండితము. అందు కోటి సూర్య పభాజిష్ణుని, తోజో మూర్తిని, చతుర్భుజుని, సుందరాంగుని, పద్మపత్ర నేత్రుని, శ్రీవత్స వక్షుని, శంఖ చక్ర గదా ధరుని, వన మాలాంకృతోరస్కుని, దివ్య కుండల మండితుని, హార భారావనమ్ర గ్రీవుని బాల కృష్ణుని దర్శించెను.

మార్కండేయ డచ్చెరువడి విచ్చిన కన్నులు పులకించిన మేనుంగొని వ్రాలి ఆహా! ఈ ఏకార్ణవ మందు చరాచర మడిగిన తఱి నీ బాలు డెవ్వడొ భయము లేక మసలు చున్నాడు అనుకొనెను.

భూత భవ్య భవిష్యము నెఱింగియు నమ్మహా ముని మాయా మోహితుడై యాదేవు నెఱుంగ డయ్యెను.

మఱియు నా తప శ్శక్తి వ్యర్థము నా జ్ఞానము వృధా సుదీర్ఘ మయిన నా బ్రతుకు వ్యర్ధము. నామానుషముత్తది. ఈ పర్యకమున నిదురించు బాలుదెవ్వడో నెఱగనైతి.

ఇట్లను కొనుచు నీదుచు మైమఱచి మార్కండేయుడు మిగుల వగచెంది రక్షణ కొఱకు తడుము లాడెను. కాని బాల సూర్యుడట్లు తన మహిమచే వెఱయుచు నున్న తేజోమయు నా బాలుని చూడ నేరడయ్యె. ఆ పిల్లవాడట్లు వచ్చు చున్న మునింగిని మేఘ గంభీరముగ నిట్లు పలికెను.

వత్సా! చాల అలసితివని యెఱుంగుదును. నన్ను శరణందిన నిన్ను గాపాడుటకే వచ్చితిని. నా శరీర మందిపుడ ప్రవేశింపుము. నీకు విశ్రాంతి కల్గును.

అనవిని వకాని యే భయము నెఱుగక యేమియు మాటలాడక యా బాలుడు మోము నందు వివశుడై ప్రవేశించెను.