బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
225 - ఉమా మహేశ్వర సంవాదే దేవలోక ప్రాప్తి కారణ కథనమ్
ఏ శీలము ఏ ఆచరణము కలిగి ఏ కర్మము లాచరించి ఏ దానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?
బ్రాహ్మణులను ఆదరించుచు దీనులు ఆర్తులు బీదలు అగు వారికి భక్ష్యములు భోజ్యములు అన్న పానములు వస్త్రములు ఉదార బుద్ధితో దానము చేయ వలెను. బాటసారులకు ఆశ్రయములను సభా మండపము లను కోనేరులను నిర్మించుచు నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ప్రయతుడై శుచియై చేయుచు ఆసనములు శయనములు వాహనములు గృహములు రత్నము ధనము పొలములు పైరులు స్త్రీలు మొదలగు నవి ప్రశాంత మనస్సుతో నిరతము దానము చేయు నతడు దేవ లోకమునకు ఏగును. అచ్చట చాలకాల ముండి శ్రేష్ఠములగు భోగముల అనుభవించి అప్సరసలతో కూడి నందనో ద్యానము మొదలగు చోట సంతోషముతో గడిపి అక్కడి నుండి క్రిందికి జారియు భూ లోకము నందు ధనధాన్యము లతో నిండిన మహాభాగుల ఇంట జన్మించును. అచ్చట అన్ని కోరికల ననుభవించుచు సంతోషించుచు మహా భోగములను అనుభవించును. మహా కార్యములు చేయును. ధనవంతు డగును. అందరకు చూడ ముచ్చట యగు బ్రాహ్మణు డగును.
ఉండియు దానము చేయక అన్నము పెట్టక దీనులను అంధులను పేదలను భిక్షుకులను అతిథులను చూచియు వారు యాచించు చున్నను నాలుక కదలించి మాటనైన ఆడక ధనము సువర్ణము వస్త్రములు భోగములు గోవులు వివిధము లగు అన్నములు దానము చేయక లోభులై నాస్తికులై అవివేకులై ఉండు వారు నరకము పొందుదురు. ఇట్టివారు నరక యాతన లైన తరువాత మానవులుగా జన్మించినను ఆకలి దప్పులు భాధలు పడుచు జనులచే వెలి వేయబడి ఏ భోగములను అనుభవించు ఆశయు లేక జీవ నాధారము లేక తక్కువ భోగములతో బీదలై ఉందురు. కపటులై గర్వము కలిగి అల్ప బుద్ధులై పీఠముతో గౌరవించ దగిన వారిని అట్లు గౌరవించక త్రోవ ఈయ వలసిన వారికి త్రోవ ఈయక పూజించ దగిన వారిని పాద్యము ఆచమనీయము మొదలగు వానితో పూజించక గురువులతో ప్రేమగా శుభము అభిమతము అగు మాట లాడక దురభిమానము లోభము కలవారై సమ్మానించ దగిన పెద్దలను సమ్మానించక పోగా అవమానించు వారు అందరును నరకమును పొందుదురు. ఎన్నోవేల ఏండ్లు నరక మనుభవించి మరల మానవులై పుట్టినను శునక మాంసము వండి తిను వారి వంటి బుద్ధి హీనుల నింద్యుల ఇండ్లలో నింద్యులుగా పుట్టుదురు.
దంభము దురభిమానము లేక దేవతలను లతిథులను గౌరవించుచు జనులచే పూజింప బడుచు పెద్దలను నమస్కరించుచు తీయని మాటలాడుచు సర్వ కర్మలచే ఇతరులకు ప్రీతి కలిగించుచు ఏ ప్రాణిని ద్వేషించక మంచి ముఖ లక్షణములు స్నేహ భావము కలిగి ఎదుటి వారికి స్వాగతము పలుకుచు యథార్థముగా సత్కార పూర్వకముగా త్రోవ ఈయ దగిన వారికి త్రోవ ఇచ్చుచు గురువుల గౌరవించుచు అతిథులను అభ్యాగతులను పూజించు నరుడు స్వర్గము పొందును. తరువాత కూడ మానవ లోకమున గొప్ప ఇంట పుట్టి సర్వ రత్నములు శ్రేష్ఠ వస్తువులు లభించి సర్వ భోగములను పొంది తగిన విధమున దానము చేయుచు ధర్మముల నాచరించుచు సర్వ ప్రాణుల సమ్మానమును నమస్కారము లను అందుకొను వాడగును. మొత్తము మీద మనుష్యుడు ఎప్పుడును తాను చేసిన కర్మమునకు అనుగుణ మగు ఫలమును పొందును. అని నిర్ణయము. విధాత బ్రహ్మ స్వయముగనే చెప్పిన ఈ ధర్మమును నీకు చెప్పితిని. సర్వ ప్రాణులకు భయమును కలిగించు ప్రవర్తనము కలిగి హస్తముల తోనో పాదములతోనో త్రాటితోనో కఱ్ఱతోనో గడ్డలతోనో స్తంభముల వంటి ఇతరో పాయముల తోనో ప్రతీకార బుద్ధితో ప్రాణులను బాధించుచు భయ పెట్టుచు ఉండు వాడు నరకమును పొందును ఎంతో కాలము తరువాత అతడు మనుష్యుడై పుట్టినను జనులకు ద్వేష్యుడై అధముడై జ్ఞాతులకు బంధువులకు ఇష్టుడు కాక యుండును.
సర్వ భూతములను దయతో మైత్రితో చూచుచు వానికి తండ్రి వలె మెలగుచు వైరము చూపక ఇంద్రియముల జయించి హస్త పాదాదులతో ప్రాణుల హింసించక భయ పెట్టక అన్ని ప్రాణులకు విశ్వసనీయుడై శుభ కర్మలను ఆచరించు చుండు వారు స్వర్గమును పొంది అచ్చట దేవతల వలెనే దివ్యమగు భవనమున సంతోషము నొందును. స్వర్గ సుఖానుభవము ముగిసిన తరువాతను కూడ మానవుడుగా పుట్టి శ్రమలు భయములు లేక సుఖమును అనుభవించును.
మానవులలో కొందఱు ఊహలు అపోహలు విషయముల వింగడించు కొనుట చేయుటలో నేర్పు కలిగి ఆధ్యాత్మిక విషయ జ్ఞానము లౌకిక విషయము లలో విజ్ఞానము కలిగి ప్రజ్ఞా వంతులై అర్ధ విషయము లలో నేర్పు కలిగి యున్నారు. మఱి కొందఱు ప్రజ్ఞా రహితులై జ్ఞాన విజ్ఞానములు లేక యున్నారు. కొందఱు పుట్టు గ్రుడ్డి వారు రోగార్తులు నపుంసకులు, అశక్తులు అగు చున్నారు. ఏ కర్మ ఫలముగా వీరు ఇట్లు వైవిధ్యము పొందు చున్నారో సర్వ ధర్మముల నెఱింగిన వారిలో శ్రేష్ఠుడ వగు ఓ విరూపాక్షా! నాకు తెలిపి నా సంశయము తీర్చుము.
వేదార్థముల నెఱిగిన బ్రాహ్మణులను సిద్ధులను ధర్మముల నెఱిగిన వారిని అను దినము మంచి చెడులను అడుగుచు అశుభ కర్మముల విడిచి శుభ కర్మలను ఆచరించు వాడు ఇహలోకమున సుఖముల అనుభవించి పరమున స్వర్గమును పొందును. అతడు మరల మానవుడై పుట్టినను మేధావంతుడు యజ్ఞాది కర్మల యందాసక్తితో కూడిన శుభమగు శాస్త్ర సంస్కారము కల వాడగును. దుష్ట స్వభావముతో పరదారలను చెడు చూపు చూచువాడు పుట్టుగ్రుడ్డి యగును. వివస్త్ర యగు స్త్రీని అధిక దుష్ట మగు మనస్సుతో చూచువాడు ఈ దుష్కృతమునకు ఫలముగా రోగములచే బాధ నొందును. మూఢులై దురాచరణము కలిగి యోనికాని చోట్ల మైథునము చేయువారు ప్రజ్ఞా రహితులు నపుంసకులు అగుదురు. మైథునము నకై పశువులను బంధించు వారు గురు పత్నితో సంగమించు వారు వివిధములుగ మైథునము చేయు వారును నపుంసకు లగుదురు.
ఓ దేవశ్రేష్ఠా! దోషముతో కూడిన ఏ కర్మను విడిచి దోషరహిత మగు ఏ కర్మను ఆచరించి మానవుడు శ్రేయమును పొందును?
శ్రేయస్సు కలిగించు మార్గమును ధర్మములను సద్గుణములను కోరుచు అవి ఎరిగిన బ్రాహ్మణులను అడిగి తెలిసి ఆచరించు వాడు స్వర్గము నొందును. తరువాత మనుష్యుడై పుట్టినను ఇంద్రియ నిగ్రహము మేధ ధారణాశక్తి కల ప్రాజ్ఞుడుగా జన్మించును. మానవుడు క్షేమము కలిగించు సన్మార్గము ఇది. మానవుల శ్రేయము కోరి నీకు తెలిసితిని.
ఓ పరమేశ్వరా! కొందఱు అల్ప విజ్ఞానము ధర్మ ద్వేషము కలవారై వేద ధర్మముల నెఱిగిన బ్రాహ్మణులను ధర్మము నడిగి తెలిసికొన గోరక ఉన్నారు. మంచి నియమములను కర్మలను ఆచరించక నియమ భ్రష్టులై రాక్షసుల వలె ఉందురు. మఱి కొందఱు మంచి వ్రతముల నాచరించుచు శ్రధ్ధ ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞాదుల నాచరించుచు మూఢత్వము లేక యుందురు. ఏ కర్మములకు ఫలముగా ఇట్ల గుదురో తెలుపుము.
పూర్వులు నిర్మించిన ధర్మ శాస్త్రముల లోక ధర్మముల వ్యవస్థలను శాస్త్ర ప్రమాణా నుసారము ఆచరించు వారు దృఢ వ్రతులై ఆయా శాస్త్రీయ కర్మలను గట్టిగా ఆచరించు వారుగా నున్నారు. అజ్ఞాన వశమున అధర్మమును కూడ ధర్మము అని చెప్పుచు సద్ర్వతముల నాచరించక శాస్త్ర మర్యాదలను విడిచిన వారు బ్రహ్మ రాక్షసు లగుదురు. కాలము ననుసరించి పనుల నాచరించుచు హోమము వషట్కారము వంటి వైదిక కర్మా నుష్ఠానమునకు దూరముగా నుండు వారు నరాధము లగుదురు. ఓ దేవీ! నీ సర్వ సంశయము లను ఛేదించుటకు గాను మానవుల శ్రేయమునకు అశ్రేయమునకును హేతువగు ధర్మ సముద్రమును ఈ విధముగా వివరించితిని.
