బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

54 - మార్కండేయాఖ్యానమ్‌

 ఆ మార్కండేయుడు వట పత్రశాయి యయిన నాబాలుని గర్భమందు బ్రవేశించి సమస్త భూమండల మందు జూచెను. సప్త సముద్రములను, సప్త ద్వీపములను, సప్తకులాచలములను సర్వ రత్న నిధి యయిన మేరువును దర్శించెను. ఆ మేరు పర్వతము సర్వ రత్న నిధి నానా ముని సమాకీర్ణము. సర్వ వృక్షములకు స్థానము వింతల కెల్ల స్థానము. సింహ వ్యాఘ్రాదులకు నిలయము. ఇంద్రాది దేవతలు సిద్ధ చారణ గంధర్వాప్సరో వర్గములకు విహార స్థానము.

శ్రీమంతమగు నా మేరువును గాంచుచు నా బాలుని యుదర మందు జనిజని కురు క్షేత్రాది పుణ్య క్షేత్రములను బుణ్య నదులను, తీర్ధములను, కృషి గోరక్ష వాణీజ్యాది వృత్తులను జేయు మానవులను సర్వ జనావాస మయిన నగర గ్రామములను ఇది యది యననేల బ్రహ్మాది స్తంబ పర్యంత మయిన సర్వ బ్రహ్మాండమును, భూర్భుస్సర్‌ మహస్తప స్సత్యముల నూర్ధ్వ లోకములను అతల, వితల, పాతాళ, సుతల, రసాతన, మహాతల, తలాతల అధో లోకములను ఆ స్వామి యుదర మందీక్షించెను. ఆ దేవు ననుగ్రహమున నందాతని గతికడ్డుల కుండెను. అందట్లు తిరు గాడుచు నతడా విష్ణువు యొక్క శరీరమునకు తుద కానడయ్యెను. అంతట నవ్వరదుని నా ముని శరణు జొచ్చెను. అవ్వల నా మహా పురుషుడు ముఖము తెఱువ నందుండి తటాలున వాయు వేగమున వెలికి వచ్చెను.