బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

44 - పురుషోత్తమ క్షేత్రదర్శనమ్‌

ఆరాజవంతీ నగర మందు (ఉజ్జయిని యందు) ప్రజలును స్వసంతాన మట్లు పాలించెను. సత్య వచనుడు శూరుడు సర్వ సుగుణ సంపన్నుడు ధార్మికుడు జ్ఞాని బుద్దిశాలి సర్వ శాస్త్రజ్ఞుడు. వర రాజుల గెల్చిన వాడునై యతడు ప్రతాపమున రవిని, రూపముచే నశ్వినీ కుమారులను, పరాక్రమమున నింద్రుని, ప్రజారంజమున జంద్రుని బోలి యుండెను. అశ్వ మేధాది యజ్ఞములను దానములను తపస్సులను నాచరించి అష్టైశ్వర్య సంపన్నుడై యుండెను. విప్రులకు బ్రతి యజ్ఞ మందును సువర్ణ మణి ముక్తాదులను నేన్గును గుఱ్ఱములను నొసంగెను. కంబళులు అజినములు వస్త్రములను ధన ధాన్యములను సర్వ సమృద్ధముగ నొసంగెను. భక్తిని ముక్తిని యిచ్చు సర్వ యోగేశ్వరుని హరిని సేవింప నిచ్చ జనించి సర్వ నిగమాగములను నితిహాస పురాణములను వేద వేదాంగములను పరిశోధించి ఋషులు దెలిపిన నియమములను బాటించి, వేదపారగు లయిన విప్రుల సేవించి గురు సేవలొనర్చి పరమావిధి ధర్మము నందుకని కృతార్థుడయ్యె.

వాసుదేవ తత్త్వము నంది భ్రాంతి జ్ఞానము వాసి మోక్షేచ్చ గొని యింద్రియము లెల్లని గ్రహించి భగవంతు నెట్లారాధింతునని అమ్మూర్తిని ధ్యానించుచు నుజ్జయిని నుండి సమంత్రి పురోహిత భృత్య పరివారముగ చతురంగ సైన్యముతో నంతఃపురాంగన లతో వంది మాగధులు మంగళ గానములు సేయ బ్రహ్మణాది చాతుర్వర్ణముల వారు వివిధ కులముల వారు వివిధ వ్యాపారులు కవులు గాయకులు పౌరులు గ్రామంతర మేగు తండ్రిని తనయు లట్లు తనను వెంబడింప దక్షిణ సముద్ర తీరమునకు బ్రస్థాన మొనరించెను. అక్కడ నానా రత్న పూర్ణము తిమి తిమింగలాది నానా జంతు సమాకలము, పరమ గంభీరమును, పవిత్రము మంగళము తీర్థముల కెల్ల నుత్తమ తీర్థము. సర్వ పుణ్య నద నదీ నాయకము నైన యా సాగరముల దర్శించి యాశ్చర్య మంది తత్తీర మందు విడిసెను. అవ్వార్థి తీరము సర్వ వృక్ష మనోహరము. సర్వర్తు కుసుమ ఫలభరితము చిలుకలు గోరు వంకలు నెమళ్ళ చకోర చక్రవాకములు కలకలా రావములు శ్రుతి మనోహర ముగ నందు వినిపించు చుండెను. మల్లికా కుందమందారాది మేమ వివిధ తరులకు సుమవాసన లిట నింపుగొల్పు చుండెను. విద్యాధర గంధర్వ కిన్నరాప్సరో గణము లందు నాడుచు పాడుచు నిత్యము విహరించు చుండును. నంద నోపమము లగు నుద్యానములు హంస కారండకాది జల పక్షుల విహార స్థానములు పద్మాకరము లందాశ్చర్య కరములయి యుండెను. ముల్లోకములకు బూజనీయ మగు పది యోజనములు పొడవు నైదు యోజనములు వెడల్పు గల నా దివ్య క్షేత్రము నాఱేడు దర్శించి యానంద వివశు డయ్యెను.