బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
216 - నరక దుఃఖ నివారణాయ ధర్మాచరణ వర్ణనమ్
యమలోక మార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరము లైన నరకములు నరక ద్వారమును గురించి యాశ్చర్యమైన విషయములను నీవు దెలిపితివి. భయంకరమైన యా దారిలో సుఖముగ వెళ్ళుట కుపాయము కలదో లేదో తెలుపు మన వ్యాసులు యిట్లనిరి.
ఇహమందు ధర్మపరులై యహింసా నిరతులై గురు శుశ్రూష దేవ బ్రాహ్మణ పూజ చేసిన వారు భార్యా పుత్రాదులతో యమ మార్గమున వెళ్ళరు. బంగారు టెక్కెములతో గూడిన దివ్య విమానముల యందప్సరసలు సేవింప ధర్మరాజు పరమున కేగెదరు. బ్రాహ్మణుల కన్నదానము మొదలైన వానిని భక్తితో పవిత్రముగ చేసిన వారు దేవతా తరుణుల చేత సేవింప బడుచు విమానముల మీద వెళ్ళెదరు. సత్యము పల్కినవారు మనసులో మాటలో స్వచ్చమైన వారు విష్ణు తాత్పర్యముతో గోదానమ జేసిన వారప్సరసలు సేవింప ధర్మపురి కేగుదురు.
పాదరక్షలు గొడుగు మంచము ఆసనము వస్త్రాభరణముల నొసంగిన వారు గజాశ్వ రథముల నెక్కి బంగారు వెండి గొడుగులతో నేగుదురు. శుద్ధాంతఃకరణముతో పానకము అన్నము పూజించి యిచ్చిన వారు బంగారు విమానముల నేగుదురు. పాలు పెరుగు నేయి బెల్లము మంత్ర పూతముగా పరిమళ పుష్పముల నిచ్చిన వారు హం సవిమానముల మీద నరుగుదురు. నువ్వులను తిలధేను ఘృత ధేను దానములను శ్రద్ధతో శ్రోత్రియుల కిచ్చినవారు చంద్ర మండలము నట్లు ప్రకాశించు విమానముల మీద గంధర్వులు గానము సేయు చుండ యమపురికి జనెదరు. వాపీ కూప తటాకములు సరస్సులు దిగుడు బావులు పుష్కరుణులు మొదలైన శీతలోదక జలాశయము లను ద్రవ్వించిన వారు బంగారు విమానముల మీద దివ్య ఘంటా నాదము వినిపింప ఛత్ర చామరాదులచే వీవ బడుచు నేగుదురు. ఈ లోక మందు దేవాలయములు సువర్ణ రత్న మయములుగా నిర్మించిన వారు వాయు వేగములైన విమానములలో లోక పాలురతో నేగుదురు. మంచి నీళ్ళిచ్చిన వారు దారుమయ పాదుకులు పీఠములు ఆసనము లిచ్చిన వారు సుఖముగ స్వర్ణ మణి పీఠమందు గూర్చుండి విమానముల లోనేగుదురు. పుష్పో ద్యానములు పండ్ల తోటలు ప్రతిష్ఠించిన వారు చల్లని చెట్ల నీడలో దేవతా గానముల వినుచు నేగుదురు. బంగారము వెండి పవడము ముత్యము దాన మిచ్చిన వారు భూదాతలు సాలంకృత కన్యాదానము చేసిన వారు సుగంధాగరు కర్పూరములను పుష్పములను ధూప ద్రవ్యముల నొసంగిన వారు సుగంధ లిప్తులై సువేషులై సుప్రభులై సుభూషితులై ధర్మపుర మేగుదురు. దీప దానము చేసిన వారు సూర్య సదృశమైన విమానముల మీద దశ దెశలు మెరయించుచు నేగుదురు. గృహదానము చేసిన వారు బంగారు గృహముల వసింతురు. జల కుంభములను కుండికలను కూజాల నిచ్చిన వారేనుగుల మీద వెళ్ళెదరు. పాదాభ్యంగము. శిరో భ్యంగము చేయించిన వారు స్నానపానోదకముల నిచ్చిన వారు జాతి గుఱ్ఱము నెక్కి వెళ్ళెదరు. మార్గా యాసమున వచ్చిన బ్రాహ్మణులను విశ్రమింప జేసిన వారు చక్రవాక పక్షులు పూన్చిన వాహనముల నేగుదురు. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతముచ్చి (దయ చేయుడని గౌరవించి) సుఖాసన మిచ్చి పూజించిన వారు నమో బ్రహ్మణ్య దేవాయ (బ్రహణ్య మూర్తియైన భూ దేవునకు నమస్కారము) యని పాదములపై వ్రాలి నమస్కరించి పాపహరయను మంత్రముతో గోదానము చేసిన వారును సుఖ ప్రయాణము చేయుదురు. ద్విజ భుక్త శేషము అనగా బ్రాహ్మణులకు భోజనము పెట్టిన తరువాత శేషించిన యమృతమను పేరుగల యాహారము ప్రసాద రూపముగ నారగించిన వారు దాంఛిక వృత్తి యనృతము లేనివారు హంస విమానమున నేగుదురు. మూడు రోజు లుపవాస ముండి నాల్గవ రోజున నేక భుక్తము సేసిన వారు మూర్ఖత్వము డాంభికము లేనివారు నెమలి విమానములో నేగుదురు. మూడురోజుల కొకసారి వ్రతము పూని భోబనము సేయువారు గజ రథముల మీద నేగుదురు. ఆరు రోజుల కొక్కమారే శుచియై భోజనము చేసిన యాతడు దేవేంద్రు నట్లేనుగు నెక్కి వెళ్ళును. పక్షమున కొకతూరి భోజనము చేసిన వారు పులులు పూన్చిన రథమున నేగెదరు. నెల రోజు లుప వాసము సేసిన వారు గంధర్వ గానములు వినుచు విమాన యానము చేయుదురు. విష్ణుభక్తి తాత్పర్యముతో నారాయణ పరాయణతతో ప్రాణము బాసిన వాడు అగ్ని ప్రవేశము చేసిన వాడగ్ని వలె విలసించు రథమున నేగును. విష్ణు భక్తితో తనంతట తాను జలములో దిగి ప్రాణము వదలిన వాడు, తన శరీరమును గ్రద్దల కెరవెట్టిన వాడు బంగార విమానమున నేగును. గోరక్షణకు స్త్రీ రక్షణ కొరకు ప్రాణ మర్పించిన వాడు దేవతా స్త్రీలు గొలువ సూర్యప్రభతో నేగును. విష్ణు భక్తితో తీర్థయాత్ర సేసిన వారు యజ్ఞములు చేసిన వారు ఇతరుల కెట్టి బాధయు గల్గింపని వారు భక్తితో సేవచేయు నౌకర్లను భరించిన వారు ఓరిమి గల వారు సర్వభూత దయ గలవారు అభయ మిచ్చిన వారు కామాది గుణములు లేనివారు చంద్ర ప్రకాశమైన విమానమున దేవ గంధర్వుల కొలువ యమపురి కేగుదురు. బ్రహ్మ విష్ణు శివమూర్తులను భేదబుద్ధి లేకుండ పూజించిన వారు సూర్య ప్రభములగు విమానముల నేగుదురు. సత్య శౌచములు గల్గి మాంసము తినని వారును సుఖముగ నేగుదురు. భక్ష్య భోజ్యాదు లందు మాంసము కంటె రుచికరమైన పదార్థము లేదు. పర సుఖాభిలాషి దానిని తిన గూడదు. మాంసము ముట్టని వాడు గోసహస్ర దానముసేసిన వాడును సమాను లేయని వేదవేత్తల కెల్ల శ్రేష్ఠుడైన బ్రహ్మ చెప్పినాడు. సర్వ తీర్థ సేవనము సర్వయజ్ఞా చరణము వలన కల్గు పుణ్య మొక్క మాంస భక్షణ చేయనందు వలన కల్గును. దాన వ్రతధర్మ పరులైన మహానుభావులు సూర్య కుమారుడైన ధర్మ ప్రభువు యొక్క నగరమునకు సుఖముగ నేగుదురు.
అట్లు వచ్చిన ధర్మాత్ములకు యముడు స్వయముగా స్వాగతము పల్కి పాద్యార్ఘ్యా సనాద్యు పచారములు సేసి సత్కరించును. మీరు ధన్యులు మహానుభావులు మీ హిత వేదియో తెలిసి పుణ్యము సేసినారు. ఇదిగో దివ్యస్త్రీ భోగ భాజనమైన యీ విమాన మెక్కి సర్వకామ సమృద్ధమైన స్వర్గ మునకు వెళ్ళుడు. మహాభోగము లట నను భవించి దాన మీ పుణ్యము చెల్లిన తరువాత శేషించి యే దైనను కొంచెము పాపమున్న యెడల దాని నిక్కడ యనుభవింపుడు. పుణ్య ఫలముగ సౌమ్యమైన మనస్సుతో తనకు తండ్రియైన యముని పితృ దేవతా రూపమున దర్శింతురు. కావున ధర్మము భుక్తి ముక్తుల నిచ్చునది యవశ్యము సేవింప వలసినది. ధర్మము వలననే యర్థ కామములు మోక్షము గూడ సిద్ధించును. ధర్మము తల్లి తండ్రి సోదరుడు. దిక్కు ధర్మము యజమానికి మిత్రుడు రక్షకుడు ధాత పోషకుడును. ధర్మము వలన యర్థము అర్థము వలన కామము కామము వలన సుఖ భోగములు ధర్మము వలన సర్యోత్త మైశ్వర్యము ధర్మము వలన స్వర్గ గతి పరమ గతియు ధర్మము నాచరించిన నది మహా భయము నుండి రక్షించును. దేవత్వము భూ దేవత్వము దాని వలననే. పూర్వ పాపము నశించి నపుడే జీవులకు ధర్మబుద్ధి గల్గును. వేల కొలది జన్మముల తరువాత గాని లభింపని మానుష్యమును బొంది గూడ ధర్మము నాచరింపని వాడు దైవ వంచితుడు. ధర్మదూరు లైనవారే నీచులు దరిద్రులు విరూపులు రోగులు నౌకరులు మూర్ఖులు నైనగుదురు. దీర్ఘా యుష్మంతులు శూరులు పండితులు భోగులు ధనికులు నరోగులు సురూపులు నగువారు పూర్వము ధర్మము సేసిన వారన్న మాట. ధర్మరతు లుత్తమగతి కేగుదురు.అధర్మ రతులు పశు పక్ష్యాది యోని నందుదురు. నరక ధ్వంసియైన వాసుదేవుని సేవించు వ్రతము గలవారు గలలో గూడ కాలుని నరకములను జూడరు. ఆద్యంతములు వేని దేవుని దైత్య దానవ నాశకుని పరమేశ్వరు నచ్యుతుని త్రికరణ శుద్ధిగ శరణొందిన వారిని యము డేమియు చేయజాలడు. నారాయణుని నమస్కరించు వారు విష్ణు స్థానముం దప్ప మరియొక చోటునకు బోరు. వారికి యమ దూతలు యముడు యమపురి నరకములు కానిపింపవు. పొరవడి పెక్కు పాపములు చేసిన వారుకూడ సర్వపాప హరుడగు హరిని నమస్కరించి రేని నరకమునకు బోరు. మోఢ్యము చేతనైనను జనార్దన స్మరణ సేసినవారు శరీరమును విడిచి విష్ణు లోకమునకు పోదురు. పగచే నైన నొక్క తఱి హరినామ ముచ్చరించిన జాలును శిశుపాలు డట్లు ముక్తి నందును.
