బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

181 - హరేరంశావతార నిరూపణమ్‌

భూభారము హరింప నీ భారత వర్షమందు హరి యవతరించిన వృత్తాంతము దెలిపెద. ఓ మునివరులార వినుండు. ధర్మహ్రాసము అధర్మాభి వృద్ది యయిన తఱి జనార్దనుడు తన మూర్తిని రెండు విధము లొనర్చికొని సాధు రక్షణకు ధర్మ స్థాపనకును దుష్టుల దేవ ద్వేషుల నిగ్రహమున కును యుగయుగ మందు నుదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై మేరువు నందున్న దేవ సమాజమున కేగి బ్రహ్మాది దేవతలకు మ్రొక్కి తన కష్టము నిట్లు మొఱవెట్టు కొనెను.

అగ్ని బంగారమునకు గురువు. గ్రహములకు సూర్యుడు గురువు. నాకును మఱి యెల్ల లోకములకు వంద్యుడైన గురువు నారాయణుడు. ఇపుడు కాలనేమి మొదలుగా గల యీ దైత్యులు మర్త్య లోకమునకు వచ్చి రేయిం బవళ్ళు ప్రజలను బాధించు చున్నారు. ప్రభువైన విష్ణువుచే కాలనేమి గూల్ప బడెను. ఉగ్రసేనుని కొడుకు కసుండను మహాసురుడు పుట్టి యున్నాడు. అరిష్టుడు ధేనుకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుందుడు మహోగ్రు డగు బాణుడు (బలికొడను) మఱి యెందరో రాజుల యిండ్ల బుట్టి నారు. వారిని లెక్కపెట్ట నుత్సహించను. దివ్యమూర్తి ధరులగు దేవతలు మదించి యున్న దైత్య రాజులుం గలిసి యక్షౌహిణు లనేకములు నామీద నున్నవి. ఆ బరువు సైప లేకున్నా నని మీకు విన్నవించు కొనుచున్నాను. నేను బాతాళమునకు గ్రుంగి పోకుండ యీ నా బరువును మీరు దింప వలయును. అని యవని మాట విని సురల ప్రేరణచే బ్రహ్మ భూభార హరణార్థ మయి యిట్లు పలికెను.

ఓ వేల్పులార! భూదేవి యిపుడన్నది యెల్ల నిజము. నేను భవుడు (శివుడు) మీరు మఱి యంతయు నారాయణ స్వరూపము. ఇవన్నియు హరి యొక్క విభూతులే. ఆ విభూతుల హెచ్చు దగ్గుల ననుసరించియే యొకరి నొకరు బాధింప బడువారు ఒకరు బాధించు వారుగ దోచు చుందురు. అందుచే మన మందరము పాలకడలి యొడ్డునకు వెళ్ళుదము. అచట హరిని యారాధించి యాయనకు విన్నవింతము. ఆ దేవుడు జగన్మయుడు భూమి యుపకారమునకై సత్వ గుణాంశమున నవనిపై నవతరించి ధర్మస్థితిని గావించును. అని నలువ సురలతో నేగి మనసు నిలిపి గరుడ ధ్వజునిట్లు స్తుతించెను.

సహస్ర మూర్తీ! సహస్ర పాద సహస్ర ముఖ సృష్టి స్థితి లయ కారణ అప్రమేయ నీకు నమస్కారము. సూక్ష్మాతి సూక్ష్మము. బృహ త్ప్రమాణము గొప్పవాని కెల్ల గొప్పది ప్రధానము బుద్ధి యింద్రియ ములు వాగ్రూప మయిన వేదములకు మూలము పరమునైన యో భగవంతుడా! ప్రసన్నుడ వగుము. ఈ భూమి భూమిం బుట్టిన మహా సురులచే బీడ నొందిన పర్వత బంధములు గలదై జగత్పరాయణ మైన నిన్ను భారము దింప గోరి యరు దెంచెను. ఈ మేము ఇంద్రుడు అశ్వినీ దేవులు. వరుణుడు ఇరుగో రుద్రులు వసువులు సూర్యులు వాయువు అగ్ని మొదలగు నెల్లర మరు దెంచితిమి. మా యొనరింప వలసిన పని యానతిమ్ము. నీ చెప్పినది విధేయులమై యొన రింతుము. దోషములు వాసి నీ హద్దున నిలుతుము.

భగవంతుడిట్లు స్తుతింప బడి పరమేశ్వరుడు గావున వారి ననుగ్రహింప తన రెండు శిరోజములను తెలుపు నలుపు వానిని నూడ బెరికి వారికి జూపి యీ కేశములు వసుధ యంద వతరించి భూభార క్లేశమును హరింప గలవు. సుర లెల్లరుం దమదమ యంశములచే నవనీ తలమంద వతరించి మదోన్మత్తులయి పుట్టి యున్న మహా రాక్షసులతో యుద్ధము నొనరింతురు గాక! అందుచే నానాయుధ హతులై యశేష దైత్య కూటము నశించును. సందియము లేదు. వసుదేవుని ధర్మపత్ని దేవతా సమానురాలు దేవకి. ఆమె యెనిమిదవ గర్భముగ నీ నాకేశమవ తరించును. కంసాదులను సంహరించును అని హరి యంతర్థాన మందెను.

అదృశ్యుడయిన య మ్మహాత్మునికి నమస్కరించి యా దేవతలును మేరుగిరి నెత్తమున కేగి యట నుండి యవనికిం దిగిరి. నారద భగవానుడు కంసుని కడకేగి దేవకి యెనిమిదవ గర్భము (శిశువు) అవతరించు నని తెల్పెను. కంసుడు విని కోపగించి దేవకీ వసుదేవులను కారాగారమున నుంచెను. తాను మున్నిచ్చిన మాట ననుసరించి వసుదేవుడు పుట్టిన వానిం బుట్టినట్లు బిడ్డలంగొని పోయి కంసుని కప్పగించెను.అట్లు జనించిన కొడుకు లార్వురు. తొలి జన్మమున హిరణ్య కశిపుని పుత్రులట. విష్ణు ప్రేరణము నొంది నిద్రాదేవి (యోగనిద్ర) గర్భము నందు వారి నావేశించెను. ఆమె వైష్ణవి యైన మాయ అవిద్యా రూపమైన యా మాయ చేతనే జగమెల్ల మోహిత మగు చుండును. ఆమెంగని హరి యిట్లనియె.

ఓ నిద్రా! నా యాజ్ఞచే నీవేగి పాతాళ మందున్న వారి నొక్కక్కని గొని దేవకీ జఠరముం జేర్పుము. కంసునిచే వారు చంప బడగా శేషుని యంశమున బుణ్యమూర్తి యా దేవకి యేడవ గర్భ మగును. గోకులము నందు వసుదేవుని భార్య రోహిణి గలదు. అమె ప్రసవ సమయ మందు ఈ సప్తమ గర్భముం గొని యేగి యామె యుదర మందునుపుము. భోజరాజగు కంసుని వలని జడుపుచే బంధన ముచే దేవకి గర్భము భంగమైన దని జనశ్రుతి పుట్టును. గర్భ సంకర్షణముచే నా శిశువు “సంకర్షణుడు” అని పేరొందును. అవ్వల నేనా దేవకి శుభస్థాన మైన గర్భమం దుందును. నీవప్పుడు యశోద యుదరము నందు విలంబము లేకుండ నుండ దగును. వర్షర్తువున శ్రావణ బహుళాష్టమి నాడర్థ రాత్రి నేను బుట్టెదను. నా శక్తి ప్రేరణ మందిన బుద్ధితో వసుదేవుడు దేవకి ప్రక్కలో నున్న నిన్ను యశోద ప్రక్కలోనికిం జేర్చును. కంసుడు నిన్ను బట్టి ఒక కొండబండ పైకి విసరి కొట్టును. నీ వంతరిక్షమున కెగిరి నిలుతువు. అంతట నిన్నింద్రుడు నామీది గౌరవముచే పలుమారులు నమస్కరించి తలవంచి తన చెల్లెలుగా గారవించును. అటుపై నీవు శుంభ నిశుంభాది దైత్యులను వేల కొలది సంహరించి పృథివి యందు వేఱు వేఱు స్థానము లందు వేఱువేఱు రూపములచే నలంకరింతువు. నీవే భూతివి సన్నతివి కీర్తివి కాంతివి పృథివివి ధృతివి లజ్జ పుష్ఠి రుపా (రోషము) మఱి యేమేమి శక్తులు గల వన్నియు నీవే. ఆర్య దుర్గ వేద గర్భ అంబిక భద్ర భద్రకాళీ క్షేమ్య క్షేమంకరి యని ప్రాతః కాలమునం దపరాహ్ణమున జనులు వినతులై నిన్ను బెక్కురీతుల స్తుతింతురు. వారి వాంఛిత మెల్ల నా ప్రసాదమున సమకూరును కల్లు మాంసము భక్ష్య భోజ్యములు నివేదించి పూజించిన మానవుల యెల్ల కోరికల నెవ్వరికి నీవు ప్రసన్నవై యను గ్రహింతువో వారందఱు నన్నివేళల నా యనుగ్రహమున భద్రమూర్తు లగుదురు. సందేహము లేదు. దేవి! నే నుడివినట్లు చనుము.