బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

42 - ఉత్కల క్షేత్ర వర్ణనమ్‌

విరజమను క్షేత్ర మందు విరజయను తల్లి సరస్వతీ దేవి సుప్రతిష్ఠింప బడినది. ఆమెను దర్శించి మనుజు డేడు తరముల వారిని బవిత్రులను జేయ గలడు. ఆ దేవి నొక్క మారేని దర్శించి పూజించి మ్రొక్కిన వాడు దన వంశము నుద్ధరించి నా లోకమున కేగును. ఆ విరజ క్షేత్రమున లోకమాత లింక నెందఱో యున్నారు. వారు సర్వపాప హారిణులు భక్త వత్సలలు, వర ప్రదాత్రులు. అక్కడ సర్వపాప హారిణి వైతరిణీ నది యున్నది. అందు స్నానము చేసిన నరోత్తముడు సర్వపాప విముక్తు డగును. అక్కడనే వరాహ మూర్తియై హరి తన కూడా వెలసి యున్నాడు. ఆయనను భక్తితో దర్శించి మ్రొక్కి విష్ణు పరమాత్మం బొందుదురు. విరజ క్షేత్ర మందున్న కపిల తీర్థము గోగ్రహము సోమము ఆలాబు తీర్థము మృత్యుంజయము క్రోడము (వరాహము) వాసుకము సిద్ధకేశ్వరము నను పేరుగల యీ యెనిమిది తీర్థము లందు బుద్ధి మంతుడు ఇంద్రియముల నిగ్రహించి యధా విధిగ స్నానము చేసి దేవతలకు మ్రొక్కి సర్వపాప ముక్తుడై దివ్య విమాన మెక్కి గంధర్వులు గానము సేయుచు గీర్తింప నేగి నాలోక మందు పూజ్యు డగును.

విరజ క్షేత్రమున పితరులకు బిండ దానము చేసిన నది యక్షయ తృప్తికర మగును. ఈ నా క్షేత్ర మందు శరీరము విచిడిన వారు ముక్తు లగుదురు. ఇచట సముద్ర స్నానము సేసి కపిలుడను పేరనున్న విష్టువును వారాహి యను దేవతను దర్శించి స్వర్గ మందును. ఇచట పుణ్య తీర్థములు ఆలయములు పెక్కు లున్నవి. అవి ఆ యాత్రా సమయ మందు తెలిసి కొని సేవింప దగును. సముద్రము నుత్తరపు టొడ్డున గల ప్రదేశ మందు గుహ్యమైన ముక్తి క్షేత్ర మున్నది. అందంతట నిసుక మేటలు నున్నవి. పది యోజనముల వైశాల్యము గలది. అశోకాది నానాఫల వృక్షములు మందారాదులు పూలచెట్లు ఖర్జూ రాదులు సర్వర్తు ఫల కుసుమ గంధ భరితములు పక్షి కూజిత మనోహరము లెన్నో కలవు. దిగుడు బావులు పుష్కరిణులు తామర కొలనులు లెక్కే లేదు. స్థల జలచరములగు పక్షులు పెక్కు లున్నవి. స్వవర్ణ ధర్మానుసారులు గృహస్థాద్యా శ్రమముల వారక్కడ నున్నారు. స్త్రీలు పురుషులు హృష్ణులును పుష్టులును. అది సర్వ విద్యా సదనము. సర్వ ధర్మ గుణాకరము. అట్టి క్షేత్రము మతి దుర్లభము.

అక్కడ పురుషోత్తము డను పేర విష్ణు వున్నాడు. ఉత్కశ దేశము సరిహద్దు వరకు గల దేశమా కృష్ణా నుగ్రహముచే పుణ్య తమము. నేను రుద్రుడు ఇంద్రుడు అగ్నిముఖు లగు దేవతలు నచ్చటనే యెల్ల వేళల వసింతుము. గంధర్వు లప్సరసలు పితరులు మనుష్యులు మునులు వాలఖిల్యాదులు కశ్యపాదులు గరుడలు కిన్నరులు నాగులు సాంగము లైన వేదములు సర్వ శాస్త్రములు ఇతిహాస పురాణాదులు యజ్ఞములు పుణ్య నదులు తీర్థములు గిరులు సాగరములు నక్కడనే యున్నవి. ఇట్లు దేవ ఋషి పితృసేవితమై సమస్తోప భోగములతో గూడిన పవిత్ర తమమైన దేశమున నివాస మెవనికి రుచింపదు? దాని కంటె అథికమైన శ్రేష్ఠత్వ మే దేశమున నుండును? బ్రాహ్మణులారా ముక్తి ప్రదుడైన పురుషోత్తముడు స్వయముగ సన్నిహితుడై యున్న యుత్కళ దేశవాసులు ధన్యులు.

అక్కడ తీర్థ స్నానము చేసి పురుషోత్తముని సేవించిన వారు స్వర్గమున కేగుదురు. వారు యమా లయమునకు బోరు. ఉత్కల దేశము నందలి పురుషోత్తమ క్షేత్ర నివాసుల జీవితము ధన్యము. ప్రసన్నములై విశాల నేత్రములు చక్కని కను బొమలు కేశ పాశము కిరీటము నింపైన చెవి కమ్మలు చిఱునవ్వు చక్కని పలు వరుసయు గల్గి కిరీటా లంకృతుడైన యా కృష్ణ పరమాత్మ యొక్క ముఖ పద్మము త్రిలోకానంద జనకము.