బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
50 - ప్రతిమావిర్భావ నిరూపణమ్
ఓముని వరులార! అమ్మహీపతి యిట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి యాలోచనలో మునిగి దర్బలు పరచుకొని యా మీద బట్ట పరచుకొని యా దేవునిపై మనసు నిల్పి నాబాధను హరించు దేవదేవు దెవుడు ప్రత్యక్ష మగునని యనుకొనుచు నేలపై నిదురించెను.
జగద్గురువు ఆ నిదురించిన ఱేనికి స్వరూప దర్శన మను గ్రహించెను. శంఖ చక్ర గదా శార్జ్గములను దాల్చి చుట్టును నొక వెలుగు గుడిగట్ట యుగాంతా దిత్యప్రభతో గరుడుని మూపుపై నెక్కి యెనిమిది బాహువులతో దర్శన మిచ్చిన యా దేవ దేవుని ఱేడు దర్శించెను. అట్లు పొడ సూపిన యా స్వామి రాజుతో నిట్లనియె. ఈ క్రతువు చేత నీభక్తి శ్రధ్దల చేత నంతుష్టుడ నైతిని. ఊరక యేల పరితపింతువు. ఈ ప్రతిమ జగత్పూజ్యము. సనాతనము. (ఈనాటిది గాదు) ఇది నీవు వడయుట కుపాయము దెల్పెదను. ఈ రాత్రి గడచి సూర్యో దయము కాగానే సముద్ర జలముల కల్లంత చివర పలుచెట్ల గుబురులతో చెలియలి కట్ట నానుకొని సముద్ర జలము కెరటములతో గాన వచ్చును. అంత కవ్వలి గట్టున నొక చెట్టు నీళ్ళను నేలను గూడ దాకుచు నుండును. తరంగ ఘాతముననేని యది కంపింపదు. గొడ్డలి గొని నీవా నీటిలో నేకాకి వై యెట్టి జడుపు గొనక యట్టిటు దిఱిగి చూచి ఇట్టి చిహ్ణాలు గల యా తరువుంగని శంకింపక నఱకుము. ఆ అద్భుత వృక్షమును గని యాలోంచి దాన నా దివ్య మూర్తిని గావింపుము. నిన్ను తబ్బిబ్బు పరచునే మఱియే యాలోచన నైన సేయుకుము.
ఇట్లా హరి మహానుభావు డానతిచ్చి యంతర్ధాన మందెను. రాజు తన కలను గమనించి యెంతో యాశ్చర్య పడెను. ఆ ఱేయెల్ల యందే మనసు నిడి విష్ణు దేవతాకము లైన మంత్రములను విష్ణు సూక్తమును బారాయణము సేయుచు వేకువను లేచి యొండు తలంపు గొనక చక్కగ సాగర స్నానము సేసి గుఱ్ఱము లేదు వెంట కాలిబంటు లేడు ఏన్గు లేదు సారథియు లేడు ఒంటరిగ నా కడలి చెలియ కట్టం దిగి తేజో మయమైన పెను మొదలు గట్టిన సువిస్తృత మైన యా పుణ్య వృక్షమును గాంచెను. మిక్కిలి యెత్తుగ మిక్కిలి బోదెగల్గి జలము దరి నిద్రలో నున్న దట్టని మంజిష్టి వర్ణము (ఎఱుపు) గలిగిన యాతరు వేజాతిదో యేపేరిదో తెలియ రాదయ్యెను. నరనాథు డదిగని యానంద పడి పదునైన గొడ్డలిచే దానిని రెండు తునకలు గావింపనెంచి కొట్టెను. అది చూడ నాశ్చర్యము గొల్పు చుండెను. అంతట విశ్వకర్మయు (దేవశిల్పి) విష్ణువును విప్ర రూపము దాల్చి వచ్చిరి. ఇద్దరు నొకేరూపున దేజరిల్లు చుండిరి. దివ్య మాలలు ధరించిరి. దివ్య గంధము పూసికొనిరి. ఇంద్రునకు మిత్రుడైన యా రాజును గలిసి కొని మహారాజా! నీవిచట నేమొకో చేయు చున్నావు? ఈ మహా వృక్షము నెందులకు నఱికితివి? ఈ నిర్జనమైన కాఱడవిలో నీవు తోడు లేక మహోదధి యొడ్డున నొంటరిగ నీవెట్లి చెట్టును నఱకితివి?
అయ్యిరువుర మాటవిని యారాజు ముదమంది చంద్ర సూర్యులట కరుదెంచిన యా బ్రహ్మాణుల నానంద భరితుండై గని నమస్కరించి యా జగన్నాథుల సన్నిధి దలవాంచి నిలువబడి యిట్లనియె.
అది యంతము లేని యనంత మూర్తిని జగత్పతిని యారాధించుట కొక ప్రతిమను గావించుకొన వలెనని తలంపు గల్గినది కలలో నా దేవుని చేత నేను భావింప బడితిని. ఆ సంగతి మీకు తెల్పితిని.
అనవిని విశ్వేశ్వరుండు హరి నవ్వి సంతుష్టిగొని యిట్లు పలికెను.
బాగుబాగు నృప! నీ తలంపు మేలైనది. అంతులేని యీ ఘోర సంసారము అరటియాకు వగిది నిస్సారము. బహు దుఃఖ నిలయము. కామ క్రోథాకులము. ఇంద్రియము లిందు సుడులు, నానా వ్యాధులు. నీటి బుడగ వంటిది. విష్ణు నారాధింప నీకు దలపు గలుగుటచే నీవు ధన్యుడవు. సద్గుణ భూషణుడవు. నీ ప్రజలు పురగ్రామ శైల కాననములతో నాల్గు వర్ణములతో నీ పాలించు పృథివియు ధన్యులు. రారమ్మ చల్లని యీ చెట్టుదరి నీవు మాతో గూడ మాట లాడుకొంద మిట వచ్చి నిలువుము. ఈతడు నాతోడ వచ్చినాడు మహాశిల్పి. విశ్వకర్మతో సాటి యైనవాడు. ఎల్ల పనుల నెంతో నేర్పరి. నేనుద్దేశించిన ప్రతిమ నీతడు చేయును. ఒడ్డు దిగుము.
అన నా ద్విజుని మాట విని సముద్రము నొడ్డు నుండి జని యా చెట్టు నీడను నిలిచెను. ఆ వ్విశ్వరూపుడు విష్ణువా శిల్పి వరునకు బ్రతిమ చెక్కుమని యానతిచ్చెను.
తామర ఱేకులట్టి కన్నులు ఉరమున శ్రీవత్స కౌస్తుభములు హస్తము లందు శంఖ చక్ర గదా శార్జ్గములు గలిగిన దొకటి అచ్చము పాలవలె తెల్లనై స్వస్తిక ముద్ర నాగలి చేతను పూనిన అనంత మూర్తి యింకోకటి వాసుదేవుని చెల్లెలు బంగారు చాయగల పరమ శోభనము సర్వ లక్షణ లక్షితము నగు సుభద్రా మూర్తి మూడవది. ఇట్లు మూడు ప్రతిమలు గావింపు మనెను.
విశ్వకర్మ యామాట విని యా క్షణమున నాశుభ లక్షణములతో ముమ్మూర్తులను గావించెను. ఒకటి శరత్కాల చంద్రబింబ మట్లచ్చము తెల్లది. ఎఱ్ఱని కనులు పెద్ద శరీరము పాము పడగం బోలు మస్తకము నల్లని వలువయు గల బలరామ మూర్తి. ఒక్కటే కుండలము, దివ్య గదా ముసలాయుధము బూనినది. తెల్ల దామరల బోలు కన్నులు. నల్లని మేఘము అతసీ కుసుమము నట్లు నిగనిగ లాడు నీల తనువు, పీతాంబరము నురమున శ్రీవత్స లక్షణము చేతం జక్రాయుధము గల్గిన సర్వ పాపహరమైన శ్రీహరి మూర్తి రెండవది. మూడవది. స్వర్ణఛ్చాయ శరీరము రత్నహార కేయూరాది విచిత్ర భూషణములు కమల నయనములు విచిత్ర వస్త్రములతో నొప్పి పీనోన్న స్తనియైన సుభద్ర మూర్తి. ఆ రాజా యద్భుత శిల్పముంగని క్షణములో నిర్మించిన యా దివ్య మూర్తుల నీక్షించి మిక్కిలి వింతవడి యిట్లనియె.
ద్విజమూర్తు లందాల్చి యేతెంచిన మీరిద్దరు దేవతలు అద్భుత కర్ములు దేవ వర్తనులు అమానుష కర్ములునగు మీరు వేల్పులా యక్షులా విద్యాధరులా బ్రహ్మయు విష్ణువునా? వసువులా! కాక అశ్వినీ కుమారులా! ఎఱుగ నైతిని మాయా రూపమున నున్నారు మిమ్ము శరణ పోందు చున్నాము. మీ స్వరూపమును నాకు వెలువరింపుడు. అని అనియె.
