బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
16 - స్యమంతక ప్రత్యానయనమ్
భజమానుని సుతుడు రథముఖ్యుడు, విదూరథుడు, విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికి దత్త, అతిదత్త, శోణాశ్వ, శ్వేత వాహన, ళమి, దండశర్మ, దంతశత్రు, శత్రుజిత్తులు అను సుతులు. శ్రవణ, శ్రవిష్ఠ యును కుమార్తెలు కలగిరి, శమికుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులు భీమ పరాక్రములు. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. శతధన్వ మధ్యముడు, దేవాంతకుడు, నరాంతుడు, భిషక్కు, పైతరుణుడు, సుదాంతుడు, అతిదాంతుడు, నికాశ్యుడు, కామదంభకుడు, అనువారు కలిగిరి. దేవాంతకుని పుత్రడు విద్వంసుడగు కంబల బర్హిషుడు. వాని కొడుకులు అసమౌజుడు నాసమేజుడు అను వారు. పుత్ర సంతతి లేని అసమౌజసునికి సుందష్ట్రుడు సుచారువు కృష్ణుడు అను కుమారులను అంధకుడిచ్చెను. వారు అంధకులను పేరందిరి. గాంధారి మాద్రి కోష్ఠుని యొక్క భార్యలు. గాంధారి తనయుడు మహా బలశాలి యగు అనమిత్రుడు. మాద్రి తనయులు యుధాజిత్తు దేవమీఢుషుడు. ఇతడు శత్రువులకు గూడ మిత్రుడు. శత్రుజేత యగు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకు లిద్దరు. ప్రసేనుడు సత్రాజిత్తు. వీరు శత్రుసేనల జయించిన వారు.
సత్రాజిత్తు ప్రసేనుడు ద్వారపతిలో నుండెను. స్యమంత మను దివ్యమణిని సూర్యో పాసన చేసి వడసెను. అతనికి సూర్యుడు ప్రాణ సమానుడైన మిత్రడు. అతడొక నాడు వేకువ జామున రథమెక్కి యొక జలా శయమున కేగి స్నానము చేసి సూర్యో పస్థానము సేయు చుండగా సూర్య భగవాను డెదుట స్పష్టమైన మూర్తితో తేజో మండలా కారముతో సాక్షాత్కరించెను. రాజాయనను జూచి యిట్లనియె. గగనము నందు నిత్యము నిన్నెట్లు చూచు చున్నానో అట్లే తేజో మండలా కారమున నెదుట నిపుడు చూచు చున్నాను. జ్యోతిస్సుల కెల్ల నధిపతివి నీవు నీతోనిట్లు చెలిమి నొందిన నాకు నీ వలన గలుగు విశేషమేమి? అనిన,
దీనిని విని యినుడు తన కంఠము నుండి తీసి స్యమంతక మణిని ఏకాంతమున నుంచెను. అంత నా భానుని సాకారముగ నా రాజప్పుడు దర్శించెను. మఱియు నతనితో ముహూర్త కాలము సంప్రీతితో ప్రసంగిచెను. అటుపై భాస్కరుడు బయలు దేరబోవు తఱి నా ఱేడు ప్రభూ! ఏ రత్నము దాల్చి నీవు లోకము లన్నిటిని బ్రకాశింప జేయు చున్నావో యా మణి రత్నమును నాకు దయ సేయు మని కోరెను. ద్యుమణి యమ్మణిని యారాణ్మణి కిచ్చెను. అది దాల్చి అమ్మహేశుడు రాజధానిం బ్రవేశించెను. ఆ పురజను లంతట నిడుగో సూర్యుడ వనికిం దిగి వచ్చు చున్నాడని యాతనిం గూర్చి పరువిడిరి. అట్లు పట్టణ మెల్ల నాశ్చర్యమున ముంచి యంతఃపురమున కరిగెను. ఆ రత్నము నక్కడ తన తమ్ముడు ప్రసేనజిత్తునకు బ్రీతితో నొసంగెను. అ మణి యావృష్ణ్యంధ కులయింట బంగారమును వర్షించు చుండెను. అది వచ్చిన తరువాత మేఘుడు సకాలమున వర్షించు చుండెను. అందెందును వ్యాధి భయము లేదయ్యె. గోవిందుడా ప్రసేనుని మణి రత్నమును దీసికొన నెంచెను. కాని యతడు శక్తుడయ్య దానిం గైకొన డయ్వెను. అది దాల్ఛి యొకప్పుడు ప్రసేనుడు వేటకుం బోయి యమ్మణింగని బెదరి మీద బడిన సింహము నోట బడి మృతి నందెను. అయ్యెద వానిం జంపి పారిపోవు మృగ రాజును ఋక్షరాజు సంహరించి యా రత్న రాజముం గొని దన గుహం జొచ్చెను. వృష్ణ్యంధ కులయ్యెడ ప్రసేనుడు హతుడవుట విని, అంతకు మున్నా మణి నిమ్మని కోరి యున్నందున నిది కృష్ణుని పని యోమోయని శంకించిరి. అట్లు తనను అనుమానించుట యెరింగి యా పని తాను జేయని వాడయ్యు నయ్య పవాదు తొలిగించు కొన నెంచి హరి యమ్మణింగొని తెత్తునని ప్రతిన నేసి వన మేగెను.
ప్రసేనుడు వేటాడిన తాపు నందాతని యడుగు జాడలను, ఆప్త జనమ్ము వలన విని గుర్తించి, ఆజాడం బట్టి పోయి పోయి ఋక్షవంత మను గిరిని వింద్య పర్వతమున వెదకి వెదకి అలసి సొలసి తుదకు గుఱ్ఱముతో గూడ కూల్ప బడిన ప్రసేనుం గాంచెను. గాని మణిని మాత్రము గానడయ్యె, ప్రసేనుని శరీరమునకు దగ్గర భల్లుకముచే హతమై పడియున్న సింహమును జూచెను. అడుగుల గుర్తులం బట్టి యా చంపినది భల్లుకమని మాత్రము గ్రహించెను. అట్లే పయనించి యల్లంతలో నొక గుహను జూచెను. ఆ యెలుగు బంటి బిల మందొక సుందరి యెలుంగు విన వచ్చెను. అట నొకదాది జాంబవంతుని తనయు నొక బాలు నెత్తుకొని స్యమంతక మణిం జూపుచు, నాడించు చున్న దానిం జూచెను.
సింహము ప్రసేనుని గూల్చినది. అ సింగము జాంబవంతుని చే గూలినది. ఓ సుకుమారుడా! ఏడువకు ఈ స్యమంతక మణి నీదే సుమా! అని యనుచున్న మాట ఆ మాట యొక్క వ్యక్తిం బట్టి వెను వెంటనే హరి బిలముం జొచ్చెను. కృష్ణ భగవానుడు బిలద్వార మందు బలరామునితో గూడ యదువుల నిక్కడుండుడని నిలిపి శార్ఙ్గధనువూని లోనికిం జొచ్చి జాంబవంతుని జూచెను. ఆ గుహ యందాతనితో వాసుదేవుడు యుద్ధము సేసెను. ఇరువది యొక్క రోజులు వానితో బాహు యుద్ధము గావించెను.
కృష్ణుడు బిలమం బ్రవేశించిన తరువాత బలరామాదులు ద్వారవతి కేగి కృష్ణుడందు హతు డయ్యెనని తెలిపిరి. వాసు దేవుండో, జాంబవంతుని గెలిచి, యా ఋక్షాధిపతి తనయను జాంబవతిం బొంది తన యపవాదు పోవ నెలుగుల ఱేని నను నయించి స్యమంతక మణిం గైకొని యుపాయమున నా గుహ వెలువడి యావల కేగెను. ఆయనతో విధేయు లయిన పరివారము వెన్నంటి వచ్చిరి. ఇట్లాతడు మణిం గొని వచ్చి అత్మ విశోధనము సేసికొని సర్వసాత్వత జన సమావేశ మందు దానిని సత్రాజిత్తున కొసంగెను. అరిజన సంహారి యైన హరి లేనిపోని యపవాదు నకు గురియై యది పాపు కొనెను.
సత్రాజిత్తు భార్యలు పదిమంది. వారి యందు నూర్గురు కుమారులు దయించిరి. అందు ప్రఖ్యాతి గలవారు ముగ్గురు. అంద గ్రజుడు భంగకారుడను వాడు, వాతపతి, వసుమేధుడు, వాని తరువాతి వారు. కూతరులు ముగ్గురు, వారిలో సత్యభామ ఉత్తమ (పెద్దదన్న మాట) రెండవది ఉత్తమ వ్రతాచార పరాయణ యగువ్రతిని. ప్రస్వాపిని అనునది మూడవ యామె. వారిని సత్రాజిత్తు కృష్ణున కిచ్చెను. భంగకారి కొడుకు లిద్దరు. కీర్తిమంతులు, రూప వంతులు సభాక్షుడు, నావేయుడను వారు. (క్రోష్టు భార్యయగు) మాద్రి యందు గల్గిన వాడు వృష్ణిపుత్రడు, యుధాజిత్తు. వృష్ణి కుమారులు శ్వఫల్కుడు, చిత్రకుడు నని యిద్దరు. శ్వఫల్కుడు, కాశిరాజ తనయం బెండ్లాడెను. అమె గాందిని యను పేరిది. అమె తండ్రి యామెకు గోవుల నెప్పుడు నిచ్చెడు వాడు (అందున నాపేరు ప్రఖ్యాతికి వచ్చినది) అమె యందు పండితుడు, అతిథి ప్రియుడు మహా వీరుడు బహు దక్షిణ నిచ్చువాడు మహానుభావు డగు అక్రూరుడు దయించెను. అక్రూరుడే గాక ఉపమద్గువు, మద్గువు, మదురుడు, అరిమర్దనుడు, అరిక్షేపుడు, ఉపేక్షుడు, అరిమేజయుడు, ధర్మపరుడైన ధర్ముడు, గృధ్రభోజుడు, అంధకుడు, ఆవాహుడు, ప్రతివాహుడు, నను వారును సుందరి యగు వసుంధర యను కుమార్తె యును శ్వఫల్కునికి కలిగిరి. వసుంధర విశ్రుతాశ్వుని వివాహ మాడి పట్ట మహిషి అయినది. ఈమె రూప యౌవన సంపన్న సర్వసత్వ మనోహరయునై యొప్పెను. అక్రూరుని కుగ్రసేన యందు కుల నందను లైన నందను లిద్దరు గల్గిరి. వసుదేవుడు, ఉపదేవుడు అనువారు. దేవ వర్చస్కులు. చిత్రకుని కుమారులు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహుడు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, ధర్ముడు, ధర్మభృత్తు సుబాహువు, బహుబాహువు, యను పుత్రులు, శ్రవిష్ఠ, శ్రవణ యను కూతుళ్లు కలిగిరి. కృష్ణుని యీ యపవాద వృత్తాంతము విన్న వానికి ఎన్నడును ఆపదల స్పర్శ యుండదు.
