బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

198 - బలరామ క్రీడా వర్ణనమ్‌

మాయా మానుష రూపమున నొకానొక పనికై యవని నవతరించి గోపకులతో బృందావనమున సంచరించు చున్న తన ఫణా మండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని యవతారమై మహత్తర కార్యములను నిర్వహించు చున్న బలరాముని యుప భోగము కొఱకు

వరుణుడు వారుణి యను తన శక్తిం గూర్చి ఓ మదిరా! నీవు అనంతుని కెంతయు నిష్టమైన దానవు. అతడు నిన్నాలకించుటకు అనువుగ అచటి కరుగుము అన

యవ్వారుణి సంకర్షణుని సన్నిధానము నకు అరిగెను. బృందావన మందున్న కదంబ (కడిమి) వృక్షము యొక్క తోఱ్ఱలో వసించుచు బలదేవు డద్భుత మైన మద్య పరిమళము నాఘ్రాణించి తొలుతటి చవి గుర్తించి హర్ష మొందెను. అవ్వల నా చెట్టు నుండి పడుచున్న మధ్యధారను జూచి మిగుల సంతోషించెను. గోపికలతో గోపకులతో గూడి గీతవాద్య నిపుణులు తన యశో గానము చేయ ఆ వారుణుని ద్రావెను. శ్రమచే క్రమ్మిన చెమట బిందువులు ముత్యముల వలె భాసిల్ల నతడు యమునకు వచ్చి స్నానము చేయుదు నని పలికెను.

ఆ నది యాతని మాట విని తప్పత్రాగి మత్తుచే నన్నమాట యని యనుమానించి యామె రాదయ్యెను. దాన గోపించి యాతడు నాగలి గైకొని మద వివశుడై ఆ నది యొడ్డున బెల్లగించి లాగెను. పాపాత్మురాల! రానైతివి. మరి యెచటి కేని నీ యిచ్చ ననుసరించి పొమ్మనెను. ఆ నదీ దేవత యట్లు తటాలున నాకర్షింప బడి మార్గము విడిచి బలదేవు డున్న అవ్వనము నంతటను ముంచెత్తెను. మరియు శరీరము దాల్చి బెదరిన చూపులతో ఓ హలాయుధా! అనుగ్రహము జూపుము. నన్ను వదలి పెట్టుమని పల్కెను. అతడు నా శౌర్యమును బలమును నీవు కించ పరతు వేని నా నాగలిచే నిన్నుడచి వేయిపాయల వెంట నిన్ను నడిపించెదను. అన నామె మిక్కిలి జడిసి పోయి బ్రతిమాలి నంతట ఆమె ముంచెత్తిన భూభాగ మందామెను వదలెను.

అవ్వల నతడందు స్నానము చేయగా నద్భుత కాంతి వచ్చెను. తరువాత లక్ష్మి నొక నల్ల గలువను శిరో భూషణము గను వరుణుడు కానుక పంపిన కుండలము వెట్టుకొని వాడిపోని తామర పూమాలను సముద్రుని కుచితము లైన రెండు దివ్యాంబరములను బలభద్రునకు కానుక పెట్టెను. నీలాబ్జము నవతంసముగ ధరించి మణి కుండలము చెవికి బెట్టుకొని యా నీలాంబరములు గట్టు కొని పూలమాల దాల్చి కాంతి నొంది బలరాముడు మిక్కిలి శోభించెను. అచట రెండు మాసములు క్రీడించి మధురకు జని రైవత రాజు కూతురును రేవతిని పరిణయ మాడెను. ఆమె యందతడు నిశఠుడు ఉన్ముఖుడు అను నిర్వురు పుత్రులం గనియెను.