బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

226 - ముని మహేశ్వర సంవాదే వాసుదేవ మహిమ వర్ణనమ్‌

ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయు విని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆ సమయములో శిపుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రా ప్రసంగమున అచటికి వచ్చి చేరి యున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమును కోరి తమకు గల సంశయమును ప్రశ్నించిరి.

ఓ త్రిలోచనా! దక్షయజ్ఞ వినాశనా! జగన్నాథా! మా హృదయ మందున్న సంశయమును అడుగు చున్నాము. మహా ఘోరమయి భయంకరమయి గగుర్పాటు కలిగించు ఈ సంసారములో అల్పప్రజ్ఞ కలవారగు మానవులు ఎంతో కాలము జన్మావృత్తి పొందు చున్నారు. వీరు జన్మ సంసారముల బంధము నుండి విడుదల పొందు ఉపాయమును వినగోరు చున్నాము చెప్పుము.

ఓ బ్రాహ్మణులారా! కర్మ పాశములచే బద్ధులయి దుఃఖములను అనుభవించు చున్న మానవులకు వాసుదేవుడు తప్ప వేరు ఉపాయము లేదు. శంఖచక్ర గదా ధరుడగు ఆ దేవుని మనో వాక్కర్మలతో లెస్సగా పూజించు వారు మోక్షమును పొందుదురు. జగద్రూపు డగు వాసుదేవుని వైపునకు మరలి యుండని మనస్సు కలవారు పశువుల వలెనే ఆహార నిద్రాది చేష్టలతో ఈ లోకమున జీవించుట వలన ప్రయోజనము ఏమున్నది?

ఓ పినాక ధారీ! భగుడను ఆదిత్యుని నేత్రము పోగొట్టిన వాడవు సర్వ లోకముల నమస్కృతు లనందుకొను వాడవు అగు శంకరా! వాసుదేవుని మాహాత్మ్యమును వినగోరు చున్నాము.

బ్రహ్మ కంటెను మేలగు వాడు శాశ్వతు డగు పురుషుడు హరి. అతడే కృష్ణుడు. మేఘములు లేని ఆకాశమున ఉదయించిన సూర్యుని వలె బంగారు కాంతితో ప్రకాశించు వాడు. పది బాహువులు మహా తేజస్సు కలిగి రాక్షస సంహారి యయి శ్రీవత్సమను మచ్చతో కూడి విషయేంద్రియ ములకు అధిపతియై సర్వ దేవతా సమూహమునకు ప్రభువగు వాడు. అతని ఉదరము నుండి బ్రహ్మ శిరస్సు నుండి నేను జన్మంచితిమి. శిరోజముల నుండి జ్యోతిస్సులు రోమముల నుండి దేవ దానవులు దేహము నుండి ఋషులు శాశ్వతము లగు లోకములు జనించినవి. అతడు సాక్షాత్‌ బ్రహ్మకును సర్వలోకముల కును గృహము. ఈ పృథివిని అంతటిని సృష్టించువాడు, త్రిలోకములకు ఈశ్వరుడు, రక్షకుడు. చరాచర భూతముల సంహరించు వాడు. తానే దేవతలకును దేవుడు, రక్షకుడు. పరుల తపింప జేయువాడు. సర్వజ్ఞుడు సర్వము సృష్టించు వాడు అంతట ఉండు వాడు. అన్ని వైపులకు ముఖములు కలవాడు. మూడు లోకము లందును అతని కంటె మేలగు తత్త్వము ఏదియు లేదు. సనాతనుడు, ఎల్లప్పుడు ఉండు వాడు. మహాభాగుడు గోవిందుడు సర్వధర్మ రక్షకుడు అని ప్రసిద్ధి కలవాడు. మహా మానవంతు డగు ఆ వాసుదేవుడు దేవ కార్యార్థమై మానవ దేహము ధరించి యుద్ధమున రాజుల నందఱను సంహరించును. ఈ త్రివిక్రముడు లేనిదే ఈ లోకమున దేవతలును తమ కార్యములను నెరవేర్చు కొనజాలరు. అతడు సర్వ భూతముల నమస్కారముల నందుకొను సర్వభూత నాయకుడు. ఆతనికి నాయకులు ఎవరును లేరు. దేవతలకు రక్షకుడు కార్య జగద్రూపుడు పరబ్రహ్మ తత్త్వరూపుడు బ్రహ్మర్షులను శరణ్యుడు అగు అతని నాభియందు బ్రహ్మ శరీరము నందు నేను అందఱు దేవతలును సుఖముగా ఉన్నాము. ఆ దేవుడు పద్మ నేత్రుడు. లక్ష్మి తన గర్భ మందున్న వాడు లక్ష్మితో కూడి యుండు వాడు శార్జ్గము చక్రము ఖడ్గము గరుడ ధ్వజము కలిగి ఉత్తమ మగు సుశీలము శౌచము బహిరింద్రియ నిగ్రహము పరాక్రమము వీర్యము దేహ సౌందర్యము చక్కని ఆకృతి ఎత్తు సరి ఋజు స్వభావ సంపద సౌమ్యత రూపము బలము కలవాడు. ఆశ్చర్య కరమగు రూపములు కల సర్వ దివ్యాస్త్రములు కలవాడు. యోగ మాయచే వేయి కన్నులు విరూపము లగు కన్నులు కలవాడు. ఉన్నత మనస్సు కలవాడు. వాక్కుతో తన మిత్ర జనుల మెచ్చువాడు. జ్ఞాతులకును బంధు జనులకును ప్రియుడు. క్షమా గుణము కలవాడు. అహంకారము లేనివాడు. బ్రహ్మత్వమును ఇచ్చువాడు. భయముచే భాధ నొందువారి భయమును పోగొట్టు వాడు. మిత్రుల ఆనందమును వృద్ధి చేయువాడు. సర్వ భూతములకు శరణ్యుడు. దీనుల పాలించుట యందు ఆసక్తుడు. వేద శాస్త్రముల అధ్యయనము యోగ్యత కలవాడు. ఆశ్రితులకు రక్షకుడు. శత్రు భయంకరుడు. నీతి తత్త్వమును ఎఱిగి ఆచరించు వాడు. వేద వేదాంగ తత్త్వము ప్రవచించు వాడు. ఇంద్రియముల జయించిన వాడు.

దేవతల మేలు కొఱకే ఆ వాసుదేవుడు ఉత్తమ బుద్ధి శాలియై ధర్మముచే సంస్కరింప బడినను ప్రజాపతి యొక్క శుభ మార్గమున మహాత్ముడగు మనువు వంశమున జన్మించును. మనువునకు అంశుడు అతనికి అంతర్ధాముడు అతనికి పూజ్యుడగు హవిర్ధాముడను ప్రజాపతి అతనికి ప్రాచీన బర్హి జనింతురు. అతనికి ప్రచేతసుడు మొదలగు పదిమంది కుమారులు పుట్టుదురు. వారిలో ప్రచేతసుని కుమారుడగు దక్షుడు ప్రజాపతి యగును. దక్షుని పుత్త్రికలు దాక్షాయణులను నక్షత్రములు. ఆదిత్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ వైవస్వత మను వంశమున ఇల అను నామెయు సుద్యుమ్నుడును జన్మింతురు. ఇలా కుమారుడు బుధుడు. ఆతనికి పురూరవసుడు ఆతనికి ఆయువు అతనికి నహుషుడు అతనికి యయాతి అతనికి యదువు అతనికి మహా బలశాలి యగు క్రోష్ట అతనికి వృజినీకాన్‌ అతనికి పరాజయమునే ఎఱుగని వీరుడగు ఉషంగుడు అతనికి శూరుడగ్గు చిత్రరథుడు అతనికి కడసారి కుమారుడుగా శూరుడను వాడు కలుగును. ప్రసిద్ధ మగు వీర్యము కలిగి సత్ప్రవర్తనము సద్గుణములు కలిగి యజ్ఞముల నాచరించిన పవిత్రుల వంశమున జన్మించిన క్షత్రియ శ్రేష్ఠుడు మహా వీర్యము మహా యశస్సు కల ఆ శూరుడను నతడు తన వంశమును విస్తరింప జేయువాడును అభిమాన శాలియు వసుదేవుడని ప్రసిద్ధి పొందిన వాడును అగు ఆనక దుందుభిని కుమారునిగా పొందును. అతనికి కుమారుడు చతుర్బాహుడగు వాసుదేవుడు. యదు వంశ సంజాతుడగు అతడు దాత బ్రాహ్మణుల నాదరించు వాడు బ్రాహ్మణులకు ప్రీతిపాత్రుడు బ్రాహ్మణుల యందు ప్రీతి కలవాడు. గిరివజ్రము నందలి మగధ రాజగు జరాసంధుని అతడు జయించి అతనిచే బద్ధులై యున్న రాజులను అందఱను విడిపించును. పృథివి యందే తన కెదుఱు లేని వీర్య వంతుడగు ఆ వాసుదేవుడు శ్రీకృష్ణుడు సమస్త రాజశ్రేష్ఠులచే ఆశ్రయింప బడును. సమస్త రాజులకు రాజై విక్రమము కలిగి శూరునకు ఉండ దగిన దృడ దేహ నిర్మాణము కలిగి ఆ ప్రభువు ద్వారక యందు వసించుచు చెడు మనస్సు కలవారగు శత్రువుల జయించి భూదేవిని పాలించును. మీరు అతనిని ఆశ్రయించి బ్రాహ్మణులకు చేయ దగిన మేలైన పూజలతో శాశ్వతు డగు పర బ్రహ్మమును వలె శాస్త్ర న్యాయాను సారము అర్చింతురు. లోక పితా మహుడగు బ్రహ్మను నన్నును దర్శింప గోరువారు ప్రతాప వంతుడును భగవానుడు నగు వాసుదేవుని దర్శింప వలెను. అతనిని దర్శించుట నన్ను దర్శంచుటయే. అందు సందేహము లేదు. బ్రహ్మయు వాసుదేవుడే అని ఓ తపోధనులారా! తెలిసి కొనుడు. పుండరీకాక్షు డగు వాసుదేవ కృష్ణునకు ఎవరిపై ప్రీతి కలుగునో వారి విషయమున బ్రహ్మది దేవత లందఱు ప్రీతు లగుదురు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మానవునకు కీర్తియు స్వర్గమును లభించును. ధార్మికుడు అగు వాసుదేవుడే ఇతరులకు సర్వధర్మ ములను పదేశించు వాడగును. ధర్మము ఎఱిగిన వారెల్లరును దేవతలకు ప్రభువు అచ్యుతుడు తన్నాశ్రయించిన వారిని అధోగతికి పోనీయని వాడు అగు వాసుదేవుని నమస్కరింప వలెను. విభుడగు ఆ శ్రీకష్ణుని ఆసక్తితో అర్చించి నచో ధర్మమే లభించును.

మహా తేజస్సు కలవాడును పురుష శ్రేష్ఠుడును అగు ఆ వాసుదేవుడు ప్రజల హితమును కోరి ధర్మమును ఉద్ధరించుటకై ఋషులను సృష్టించెను. సనత్కుమారుడు మొదలగు ఆ ఋషులు తపో వంతులై గంధమాదన పర్వతమున నున్నారు. అందు వలన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ధర్మజ్ఞుడును ధర్మ ప్రవచన సామర్ద్యము కలవాడును అగు ఆ వాసుదేవుని నమస్కరించి నచో అతడును వారిని నమస్కరించును. అట్లే తన్నా దరించిన వారిని తానాదరించును. తన్ను దర్శించిన వారిని తాను దర్శించును. తన్నా శ్రయించిన వారిని తానాశ్రయించును. తన్నర్చించిన వారిని తానర్చించును. ఇట్లు మానవ లోకమున సజ్జనులు దోష రహితుడు సద్గుణ శాలి ఆది దేవుడు పూజ్యుడు నగు విష్ణుని విషయమున తప మాచరింతురు. సనాతనుడు శాశ్వతుడు అగు ఆ దేవుని దేవతలును అర్చింతురు. తమకు తగిన అభయముతో శరణా గతితో ఆయనను అనుష్ఠించుచు ద్విజులు మొదలగు వారు త్రికరణము లతో నమస్కరించుచు యత్న పూర్వకముగా దర్శనము చేసికొన వలెను. ఓ ముని శ్రేష్ఠులారా! నేను వ్యవస్థ చేసిన మార్గము ఇది. సర్వ దేవులకు ఈశు డగు ఆ వాసుదేవుని దర్శించినచో సర్వదేవ శ్రేష్ఠులను దర్శించి నట్లే. మహా వరాహ రూపుడు సర్వలోక సృష్టికర్త జగములకు రక్షకుడు అగు ఆ వాసుదేవుని నేనును నిత్యము నమస్కరించు చుందును. నేను మొదలుగా సమస్త దేవతలును ఆయన దేహమున వసింతుము. కనుక ఆయన దర్శనముచే త్రిమూర్తుల దర్శనము జరుగును. ఆ వాసుదేవుని అన్న వెండి కొండల కాంతి వంటి కాంతి కలిగి హలి హలము ధరించిన వాడు బలుడు అని ప్రసిద్ధుడై భూమిని రక్షించును. అతడు సహస్ర శిరస్కుడగు శేషుడే. దేవుడును ప్రభువును పరమాత్మ రూపుడు నగు అతని అంతమును కశ్యపుని కుమారుడును బలశాలయు నగు గరుడుడును తన వీర్యముతో చూడజాలక పోవుటచే అతడు అనంతుడు అన బడెను. ఆ శేషుడే సంతోషముతో కూడి భూమ్యంత ర్భాగమున భూమిని చుట్టుకొని తన పడగలతో భూమిని ధరించుచు చరించుచు వసించు చున్నాడు. ఆ విష్ణువే ఈ యనంతుడు. అట్లే సర్వ ధరాధరు డగు హృషీకేశు డగు వాసుదేవ కృష్ణుడే ఈ బలరాముడు. ఈ పురుష శ్రేష్ఠు లిరువురును దివ్యులు దివ్య పరాక్రమము కలవారు. చక్రమును నాగలిని ధరించిన ఈ ఇరువురను మీరు నర్చించి పూజించ వలెను. ఓ తపోధను లారా! మీకు నేను తెలుపు చున్న అనుగ్రహము ఇదియే. కనుక మీరు ప్రయత్న పూర్వకముగా ఆ యదు శ్రేష్ఠుని పూజించ వలెను.