బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
35 - పార్వతీ తపో వర్ణనమ్
అఖిల దేవతా మండలి యా జగజ్జనని కడకేగి, ఓదేవీ! తపము వలదు. శీఘ్ర కాలములో నా నీలకంఠు డేతెంచి నీకు భర్త కాగలడు. అని నచ్చజెప్పి ప్రదక్షిణము చేసి వెళ్ళిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున నున్న యశోకము క్రింద నామె వసించెను. అంతట నిందు తిలకుడు సురార్తిహరుడునగు హరుడు వికృత రూపియై పొట్టి చేతులు, సొట్ట ముక్కు, రాగి జడలు, వికృత ముఖము, మఱిగుజ్జు నైవచ్చి దేవి! నిన్ను నేను వరింతు ననియె. ఉమయు యోగ సిద్ధిచే నాతని శంకరునిగా గ్రహించి విశుద్ధాంతరంగయై ఆర్ఘ్య పాద్యాదులు మధు పర్కములు నొసంగి బ్రాహ్మణా కారమున నున్న స్వామిని బ్రాహ్మణ ప్రియ గావున యధావిధి నర్చించి యిట్లనియె.
పార్వతి:
పార్వతి:
“స్వామీ! నేను అస్వతంత్రను. మా తండ్రి శైలాధిపతి యింట నున్నారు. ఆయన కన్యా దానము చేయ సమర్థుడు. అతని నర్థింపుము. ఆయన నన్ను నీకిచ్చునేని యది నా కుచితము”. అంత నా విప్రుడు గిరిరాజు కడకేగి “తనకు కన్యా దానము చేయుమని” యర్థించెను. ఆతడీ వికృత రూపని శివునిగా గ్రహించి శాప భీతిచే నిట్లనియె.
భూ దేవులగు విప్రుల నవమానింప బోను, నాయ భిప్రాయము మనవి చేసెద. మా అమ్మాయి స్వయంవరమున నెవ్వని వరించునో యత డామెకు భర్త యగును.” అన వృషభ ధ్వజుడు తిఱిగి వచ్చి “దేవీ! మీ తండ్రి స్వయంవరమున నీవెవ్వని వరింతువు వాని కిచ్చునని వినికిడి. నీవు నీకీడగు రూపవంతుని విడచి తగని వాని నేల వరింతువు.” కాన నాకందవు. నీతో జెప్పి వెళ్లుచున్నా ననెను.
అంత నా యుమాదేవి యమ్మాటను భావన చేసి తనపై నాతడిడిన భారమును గ్రహించి దానితో బాటు చూపిన మనః ప్రసన్నతను నాలక్షించి “దేవేశ! నీకు నుఱొక తలంపు వలదు. నేను నిన్ను వరించెద. ఆశ్చర్య మక్కరలేదు. సందేహ మున్నదా? ఇదిగో యిక్కడే నా కోరిక విభుడవగు నిన్ను నేను వరించు చున్నాను. అని పుష్పగుచ్ఛ మొక్కటి రెండు చేతలం గొని శంభుని మూపున నుంచి యాదేవి దేవ దేవుంగని యిప్పుడ వరింప బడితి వనియె. అంతనా శివుడామె కూర్చుండిన యా శోకముంగని దానికి మాటచే ప్రాణము పోయు చున్నాడా యన్న ట్లిట్లనియె.
“ఓ అశోకమా! నీ పూల గుత్తిచే నేను వరింప బడినాడ గావున నీకు ముదిమి యుండదు. అమర మయ్యెదవు గాక! నీవు సర్వాభరణ కుసుమ ఫలభరితమై కామ రూపివై సర్వ కామప్రదమై, కామ పుష్పమవై సర్వాన్న భక్షకమై అమృతా స్వాదివై సర్వ పరిమళ పూర్ణమై దేవతల కత్యంత ప్రియము కాగలవు. నీ కెందును భయము గల్గదు. నీవు సంపూర్ణ తృప్తుడ వయ్యెదపు. ఈ యశో కాశ్రమము చిత్ర కూటమను ఖ్యాతినంద గలదు. ఇటకు యాత్ర చేసిన వా డశ్వమేధ యాగఫల మందును. ఇచట ప్రాణోత్ర్కమణ మందిన యతడు దేవి యొక్క తపస్సుతో గూడి మహా గణపతి యగును.
పై ప్రకారము అశోకమునకు వరమిచ్చి శివుడు గిరి కన్యతో వెళ్ళి వత్తునని చెప్పి యంతర్ధాన మందెను. ఆయన వంకనే మోము నిలిపి యాదేవి యచట నొక శిల యందు చంద్రుడు లేని రాత్రి యట్లు విరహ వ్యధాకుల మనస్కయయి యుండెను. అంతలో శైలకన్య యాశ్రమ సమీపమున నుదక పూర్ణమైన సరస్సు నందు నార్తుడైన యొక్క బాలుని మాట వినెను. శివుడు బాలరూప దాల్చి యా సరోవర మందు క్రీడించుచు మొసలి పట్టు కొన్నట్లు సృష్టి హేతువైన యోగ మాయంబూని నటించి యిట్లనియె.
ఎవడేని నన్ను మొసలి బారినుండి రక్షించుగాక! అయ్యో! మొసలి నోట బడి నాడను. నాకై నా దేహమునకై నే నేడ్వను. కాని నాకై యింట నెదురు చూచు నా తల్లిదండ్రుల గూర్చి చింతించు చున్నాను. వారికి నేనొక్కడనే తనయుడను. నా యందెంతేని ప్రేమ, మక్కువ గొన్న వారు. గావున యీ విషయము విని ప్రాణములం బాసెదరు. ఎంత కష్టము వచ్చినది. బాలుడను. అకృతాశ్రముడను. (ఉపనయన మేని కాని వాడను) ఈ మొసలి వాతబడి మృత్యువాత కెఱయ య్యెదను గదా! అని దుఃఖించెను.
బాలకుని మాటలు విని యా కల్యాణి అయ్యిందువదన బయలుదేరి సుందరు డగు నా బాలకుని మొసలి నోటబడి కొట్టుకొను చున్నట్లు చూచెను. ఆ మొసలి యును దేవిని చూచి యా బాలుని నోట గఱుచుకొని సరస్సు లోనికిం బాఱను. బాలకు డాక్రందించు చుండెను. అది చూచి పార్వతి మొసలితో నిట్లనియె.
ఓ గ్రాహరాజ! మహా పరాక్రమా! ఈ బాలకుని త్వరగ విడిచి పెట్టుము. ఈతడు తల్లిదండ్రులకు నేకైక పుత్రుడు
దేవి! ఆఱవ రోజున ముందుగా నీ సరస్సున కేతెంచు నతడు నీకా హారమగు నని నాకు బ్రహ్మ యేర్పాటు చేసెను. నేడీతడు లభించెను. బ్రహ్మ ప్రేరణమిది. వీనినేమైన వదల ననియె. అంత వారి కిరువురకు నిట్లు సంవాద మయ్యెను.
ఓ మకర రాజమా! హిమగిరి శిఖర మందు నేను జేసిన ఉత్తమ తపస్సు ఫలము నీవు తీసికొని ప్రతి ఫలముగ నీ బాలుని విడిచి పెట్టుము. నీకు నమస్కారము.
ఓ దేవీ! తపము వ్యయ పరచకుము. నే చెప్పినట్లు చేయుము. అట్లైన నితడు ముక్తుడగును.
హే గ్రాహాధిప! సత్పురుషులు నిందింపని యే పనియైన చెప్పుము. తప్పక చేసెదను. సందేహము లేదు. బ్రాహ్మణులు నాకు మిక్కిలి యిష్టులు.
ఓ దేవి! నీవు చేసిన తపము స్వల్ప మైనను నుత్తమ మైనది. ఆ తపము సర్వమును నాకిమ్ము. అట్లైన నీ బాలుడు ముక్తుడగును.
ఓ మహాగ్రాహమా! మంచిది. ఆజన్మము నేచేసిన పుణ్యమేది గలదో యది సర్వము నీ కొసగు చున్నాను. బాలుని విడువుము.
ఇట్లన్యోన్య భాషణములు జరిపిన వెంటనే మొసలి యాదేవి తపస్సు సర్వము స్వీకరించి మధ్యందిన భానుని వలె వెలుగొందెను. మరియు లోకోద్ధారిణి యగు దేవిం గని సంతుష్టాంతరంగుడయి యిట్లు పల్కెను.
దేవీ! తపస్సు సంపాదించుట కష్టము దానిని త్యజించుట ప్రశస్తము గాదు. కావున తపస్సును, నీ బాలుని కూడా నీవే స్వీకరింపుము. నీ బ్రాహ్మణ భక్తికి మెచ్చితి నని మకరము పలుక మహావ్రత ధారిణి యగు నామె యిట్లనియె.
దేహముతో నైనను విప్రుడు నాకు రక్షణీయుడు. తపస్సు మరల సాధించ గలను గాని బ్రాహ్మణుడు సాధ్యుడు కాడు గదా! విప్రుల కంటె తపస్సు గొప్పది కాదు. నేనిచ్చినది మరల స్వీకరింపను. ఇది నీకివ్వ బడినది. ఇచ్చిన దాని నెవ్వడును తిరిగి తీసుకొనడు. తపస్సు నీదె. బాలుని మాత్రము విడిచి పుచ్చు మనియె.
అన విని యమ్మకరము దేవికి నమస్కరించి యాదిత్యుడట్లు వెలుంగుచు నచ్చటనే యంతర్ధాన మయ్యెను. ఆ బాలుడును సరస్తీరమున మొసలిచే విడువ బడి కలలో గన్న వస్తువు వలె నచ్చటనే యంతర్ధాన మయ్యెను. దేవియు తన తపః ఫలము బాలుని నిమిత్తముగా వ్యయ మగుట గని మరల తపస్సు నాచరింప బూనెను. శంకరుడది యెరిగి నీ వింక తపస్సు చేయ వలదు. నీ చేసి నదంతయు నా కర్పించితివి. అది నీ కక్షయము కాగల దనెను. అట్లు వరమును బొంది యా దేవి స్వయంవరము కొఱకు నిరీక్షించు చుండెను. పరమేశ్వరుని యీశిశు లీలను జదివిన వాడు దేహపాతా నంతరము పవిత్రుడై కుమార తుల్యుడై గణా ధీశుడగును.
