బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
205 - అనిరుద్ధ చరిత్ర వర్ణనమ్
శ్రీకృష్ణునికి రుక్మిణి యందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులం దెల్పితిని. సత్యభామ యందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తి మంతుడు ప్రవక్షుడు మున్నగు వారు రోహిణి యందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతి కుదయించిరి. నాగ్నజితి యందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్య యందు సంగ్రామ జిత్తు మొదలయిన కొడుకులు గల్గిరి. మాద్రి కుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్ర వంతుడు మొదలగు వారిం గనెను. కాళిందికి శ్రుతాదు లుద యించిరి. మఱి యితర భార్యలందు చక్రికి ఎనిమిది అయుతములు నూరు వేలును కుమారులు జనించిరి. (అయుతము పదివేలు x 8 = 8000 + 100000 = అనగా ఒక లక్ష యెనుబది వేల మంది హరివంశ మన్న మాట) అందరిలో రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు మొదటి వాడు. అతని వలన అనిరుద్దు డుదయించెను. అతనికి వజ్రుడు పుట్టెను. యుద్ధము లందు అరుద్ధుడు = నిరోధింప బడనివాడు. కావున అనిరుద్ధుడను పౌరుష నామము నందిన యాతడు బలి పౌత్రిని బాణుని కుమార్తెను ఉషను బెండ్లాడెను. ఆ సందర్భముననే హరి హరులకు ఘోర యుద్ధమై బాణాసురుని వేయి బాహువులు చక్రిచే దెగగొట్ట బడినవి.
మునులు విని ఉషా నిమిత్తముగ నైన యయ్యుద్ధ విశేషముల పూర్తిగ దెల్పుము. విన గుతూహల మగు చున్నదన వ్యాసులిట్లనిరి.
బాణుని కూతురు ఉష శంకరునితో గ్రీడించు పార్వతిం గని తనలో దానెంతో ముచ్చట పడెను. అంత గౌరి యందరి డెందముల నెఱింగి నది కావున తాప పడకు! నీవును మగనితో నిట్లే క్రీడింతువు. లెమ్మనియె.
అది విని యా ముగ్ధ ఎప్పుడు నామగ డెవ్వడన
మరల పార్వతి వైశాఖ శుక్ల ద్వాదశి నాడు కలలో నీకు అభిభవము = తిరస్కారమును (మాన భంగమును) జేయేనో యతడోరాచ కన్నియ! నీకు భర్త కాగల డనియె.
చెలి చిత్రలేఖ మెల్లన లాలించు విశ్వాసము గల్గించి నంత ఉషాదేవి గౌరి పలికినది పలికి నట్లు చెలికత్తెకుం దెలిపి వాని కుపాయము సేయ మనియె.
అంతట చిత్రలేఖ పటము నందు సురలను దైత్యులను గంధర్వులను ప్రధానముగా మనుష్యులను లిఖించి చూపెను. ఆ బాలిక యందఱం దలగించి మనుష్యుల చిత్తర్వు లందు జూపుంచెను. వారిలో గూడ ఆంధక వృష్ణి వంశము లందు దృష్టి పెట్టెను. అందును కృష్ణుని బలరామునిం గని సిగ్గు దొలకి కన్నులు విప్పార ప్రద్యుమ్నునిం జూడ లజ్జ నిండిన చూపును బ్రసరింప జేసెను. అవ్వల ననిరుద్ధుం గాంచియు ఆ సిగ్గెటు వోయెనో అతడే యీతడు నాకని (నాకు కనబడిన వాడని బాహ్యార్థము) నాకు గావలసిన వాడని చెప్పగా సఖియగు నాచిత్రరేఖ నెచ్చెలి నోదార్చి యోగ శక్తిచే ద్వారవతి కేగెను.
