బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

209 - ద్వివిదవానరవధ వర్ణనమ్‌

బలరాముని లీల మఱి యొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవ విరోధి ద్వివిదుడను వానరు డుండెను. వాడు శత్రువులతో విరోధము వెట్టుకుని నరకుని జంపిన కృష్ణుని నిమిత్తముగా దేవతలకు బ్రతిక్రియ సేయుదు నని యజ్ఞ ధ్వంసము చేయుచు మర్త్య లోకమునకు హాని సేసెను. సాధువుల మర్యాదలం జెరచెను. జీవులం జంపెను. దేశమును బురములను గ్రామములను గాల్చెను. పర్వతము లెత్తి పడవేసి గ్రామములను గుండ గొట్టెను. శైలముల లేపి నీళ్ళలో సముద్రములో బడద్రొబ్బెను. సముద్రమున నిల్చి క్షోభింప జేసెను. దాన వార్ధి పొంగి చెలియలి కట్టదాటి దారి నున్న పుర గ్రామముల ముంచెత్తెను. కోరిన రూపు దాల్చి దూకుచు గంతు లిడుచు పంటల నెల్ల విథముల చూర్ణములు సేసెను. వానిచే నీ జగమెల్ల నపకరింప బడి నిస్స్వాధ్యాయ నషట్కారమై దుఃఖించెను.

ఒకతరి హలాయుధుడు రైవతో ద్యానమున మద్య పానము సేయు చుండెను. ఆయన భార్య రైవతి మఱి కొందరు రమణు లాతని ననుగమించిరి. వారు తన కీర్తిని గానము సేయ నడుమున నిల్చి కుబేరుడట్లు క్రీడించెను. అంతట ద్వివిద వానరుడు వచ్చి యాతని రోకలిని నాగలిం గైకొని యెదుట బడి వినోద మొనరించెను. ఆ తరుణుల యెదుట నిగిలించెను. నిండు కల్లు కుండల గిఱవాటు వెట్టెను. పగుల నడచెను. బలరాము డీసుగొని వానిని బెదరించెను. అయినను వాడతని నవమానించుచు కిలకిల ధ్వని సేసెను. అంతట లేచి హలి రోషముతో రోకలిం బట్టెను. వాడొక వెఱవు గొలుపు రాతి బండ నెత్తి విసరెను. హలి దానిని ఱొకట వేల తునకలు సేసి చిమ్మెను. ఆ కోతి దుమికి మీదబడ బలుడు రోసమున వాని వంచి ఱొమ్మునం గొట్టెను నడినెత్తిం గ్రుద్దెను. అంత ద్వివిదుడు రక్తము గ్రక్కికొని ప్రాణములు పోయి పడి పోయెను. పడు చున్నవాని యొడలున నా కొండ శిఖరమో మునులార! వజ్రియొక్క వజ్రమున గొట్ట బడినట్లు విరిగి పడెను. దేవత లంతట రామునిపై పూలవాన గురి పించిరి. వచ్చి బాగుబాగు గొప్పవని సేసినాడవని కొనియాడిరి. ఈ చెడ్ద కోతి దైత్యుల వైపుపకారము చేయ లోకమును బాధించి నాడు. భాగ్య వశమున వీడు నీచే గడతేర్ప బడి నాడనిరి. ఇట్లవంత మూర్తి విశ్వంభరా ధారి బలదేవుని లీల లనంతములు.