బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
210 - కృష్ణ నిర్యాణ కథనమ్
ఇట్లు కృష్ణుడు బలదేవుని సాయమున విశ్వ రక్షణకునై దుష్ట రాజన్య శిక్షణము సేసెను. ఫల్గునునితో గూడి నారాయణుడు అక్షౌహిణు లన్నింటిం గూల్చి భూదేవి బరువుం దించెను. ఇటు సేసి విప్రు లిచ్చిన శాపము నెపమున యదుకులముం గూడ యుప సంహరించెను. ద్వారకను వదలి మానవాకరము విడిచి యా స్వయంభువు నిజాంశమున తిఱిగి నిజ స్థానమును విష్ణు పదముం బ్రవేశించెను.
ఆతడు విప్రశాప మిషమ్మున స్వకులము నెట్లు పసంహరించెను. మనుష్య దేహము నెట్లు వదలెను? అన వ్యాసుడిట్లు పలుక దొడంగెను.
యదు కుమారులు పిండారక మను తీర్థమున కణ్వ నారద విశ్వామిత్రులం గాంచిరి. నడిప్రాయంపు మదము చేత భావికార్య ప్రేరణము చేతను జాంబవతీ పుత్రునికి సాంబునికి ఆడు వేసము వేసి సాగి నడచి ప్రణామ పూర్వకముగ వారిం గూర్చి ఈవిడ కొడుకు గావలయును నను చున్నది. స్వామీ! పుత్రుం గన గలదా? అనిరి. యదు బాలురచే వంచితులై యమ్మునులు దివ్యజ్ఞాన సంపన్నులు గావున సువ్రతులు గావున వారి నాశనమున కప్పుడు శాప మిచ్చిరి. కుపితులై ఈమె ముసలముం గన గలదనిరి. దాన నఖిల యాదవ కులము విచ్ఛిన్నము కాగల దనిరి. ఇట్లు శపింప బడి యయ్యాదవ బాలురు వోయి యుగ్రసేనునికి యథాతథముగా తెలిపిరి. సాంబుని కడుపు నందుండి ముసలము పుట్టెను.
ఉగ్రసేను డా ముసలము నినుప రజనుగా గొట్టించెను. అది సముద్రమునం బడవేయ బడి మేకపెంటిక లట్లు పొడియయ్యె ఇనుప రోకలి యది చూర్ణితమై ఇనుప గుదియగా (తోమరముగా) తయారయ్యె గాని దానిని మఱి వారు పొడిసేయ లేని దానిని గూడ కడలిం బడవేసి నంత నొకచేప దానిని మ్రింగెను. ఆ చేపం జంపి దాని కడుపు నుండి యా యినుప గుదియ నొక జాలరి గైకొనెను. మధు వైరి భగవంతుడా నిజ మెఱింగియు విధి వశుడై దానిని మఱొక లాగున జేయుట కిచ్ఛగింప డయ్యె.
దేవతలు వంప నొక దూత వచ్చి కేశవునికి ప్రణతి సేసి యేకాంత మందు నేను దేవ దూతను ఏలిన వారి కడకు దేవత లంప వచ్చితిని. వసువు లశ్వినులు మరలత్తులు రుద్రాదిత్యులు సాధ్యులం గూడి యింద్రుడు తమ కిట్లు విజ్ఞాపనము సేయు చున్నారు.
ఇదె వినుండు త్రిదశుల పార్థనచే భూభార హరణమునకై నూరేండ్లకు పైని భగవంతుడ వీ ధరణి నవతరించితివి. దుష్ట దైత్యులు నీచే హతులైరి భూమి బరువు దింప బడినది. ముక్కోటి దేవత లిప్పుడు ననాథులైరి. (దిక్కుగల వారైరి) దేవాధి పత్య మందుదురు గాక! జగన్నాథ! నూరేండ్లు గడచి నవి. తమకభిమత మేని యిపుడు స్వర్గమునకు దయచేయ వలయును మఱియు నీ కిక్కడన (భూలోక మంద) యభిలాష యేని యిక్కడనె యుండ నగును. ఏలిన వారి సేవకులము మేమిట్లు సేయుమని చెప్పదగిన వారము గాము.
అంతట భగవంతు డిట్లనియె. నీవన్న దంతయు నేనె ఱుంగుదును. కాని యాదవుల యొక్క క్షయము గూడ నాచే నారంభింప బడినది. ఎవ్వరికిం జంపరాని యాదవులచే గూడ భూమికి బరు వనునది తప్పదు. దీని నేడు రాత్రులలో సత్వరమ దింపెదను. సముద్రమునకు గొంపో బడిన ద్వారకను దిఱిగికొని వచ్చి యాదవుల నుప సంహరింప జేసి స్వర్గము నలంకరింతును. మానవ దేహము వదలి సంకర్క్షణునితో నటకు వచ్చినాడ ననియె యింద్రుడు దేవతలును ననుకొన వలసినది. భూభార కారణమైన జరాసంధాదులు హతులైరి. వారి వలన వసుధ భారము యాదవుల పైకెత్త బడినది. ఆయా భారమును నేను దింపి యమర లోక పరిపాలన మునకు రాగలను.
ఇట్లు వాసుదేవునిచే దెలుప బడి దేవదూత యాయనకు బ్రణమిల్లి దేవ యానమున నింద్రుని సన్నిధి కేగెను.
భగవంతుడు నప్పుడు దివ్య భౌమాం తరిక్షములైన యుత్పాతములం గని వెంటనే ప్రభాస తీర్థమున కేగుద మనియె. అప్పుడు పరమ భాగవతుడు (భగవద్భక్తుడు) ఉద్ధవుడు ప్రణతుడై హరితో నిట్లనియె. ఇప్పుడునా చేయ వలసిన పని సెలవిమ్ము. ఏలిన వారిప్పుడు యదుకుల మెల్ల నుప సంహరింతు రని తోచు చున్నది. యదుకుల నాశనము కాగల నిమిత్తములను జూచు చున్నాను. అన భగవంతుడిట్లనియె.
ఉద్ధవ! నా ప్రసాదముచే నీవు దివ్య గమనమున గంధ మాదన పర్వత మందున్న పుణ్యమగు బదరి కాశ్రమ మునకు జనుము. మహీతల మంతటిని బవిత్రము సేయు నా నర నారాయణ స్థానమందు నాపై మనసుంచి నా ప్రసాదమున నక్కడ నీవు సిద్ధి నంద గలవు. నేను కులమెల్ల నుపసంహరించి స్వర్గమున కేగుదును. నేను విడిచిన ద్వారకను సముద్రుడు ముంచును.
అని పలుక విని ఉద్ధవుడు పదముల వ్రాలి నారాయణా నుమోదితుడై నర నారాయణ స్థానమున కేగెను.
అవ్వల నయ్యాదవు లందరు శీఘ్రగము లైన రథముల నెక్కి కృష్ణ బలరాములతో ప్రభాసమునకుం జనిరి. కుకు రాంధకులు వారు నియమము పూని వాసుదేవు నామోదమున సురాపాన మొనరించిరి. అట్లు తప్ప ద్రావిన వారికి అన్యోన్య సంఘర్షణమున కలహాగ్ని రేగి యాదవ వంశ క్షయహేతు వయ్యెను. వారు దైవముచే బలాత్కరింప బడిన వారై శస్త్రాస్త్రముల నొండొరులం గొట్టు కొనిరి. శస్త్రములయి పోయి దగ్గర నున్న ఏరకమును (గుంద్రమూలా తృణమును గడ్డి పోచను) బట్టిరి. వారది పట్టినంత వజ్రమట్లు కనిపించెను. దానితో మిగుల దారుణముగ నొకరి నొకరు గొట్టు కొనిరి. ప్రద్యుమ్న సాంబాదులు కృతవర్మ సాత్యకి అనిరుద్ధాదులు పృధువు విపృధువు చారువర్మ చారువు అక్రూరుడు ఏరకా రూపమైన వజ్రములచే గొట్టి కొనిరి.
హరి వారిని, వారు హరిని వారించు కొనిరి. హరి సాయపడ వచ్చి నాడను కొని యొండొరుల గొట్టు కొనిరి. కృష్ణుడును కుపితుడై యేరకా తృణ పుంజము గుప్పిట బట్టెను. అది యాదవ వధ కనువైన ముసలము. (గుప్పెడు ఇనుప దుడ్డు) అయ్యెను. ఆతతాయులై దానిచే యాదవులను హరి నిశ్శేషముగా గొట్టెను. వారుం ద్వరగ వచ్చి నొండొరులం బాదు కొనిరి.
అటుపై నర్ణవ మధ్యము నుండి చక్రాయుధుని జైత్ర రధము (జయ శీలమైన యరదము) దారుకుడు (సారథి) చూచు చుండగనే ఆశ్వములచే గొంపో బడెను. చక్రము గద (కౌమోదకి) శార్ఙ్గ (హరివిల్లు) తూణము (అమ్ముల పొది) శంఖము(పాంచజన్యము) కత్తి (నందకము) హరికి ప్రదక్షిణము సేసి ఆదిత్య మండల మార్గముం బట్టి యేగెను. (స్వరాదిత్యే అనుశ్రుతి ననుసరించి స్వర్గమాదిత్య మండలమని రహస్యము) ఒక్క క్షణము లోనే యట యాదవ వంశ క్షయ మయ్యెను. మహాశూరు లొక్క కృష్ణుడు దారుకుడును (రథసారధి) మిగిలిరి. ఒక చెట్టు మొదట నాసనము వైచికొని కూర్చుండి యున్న బలరాముని దరికి డేకి వారిద్దరు నాతని ముఖము నుండి వెడలుచున్న మహా సర్పముం దర్శించిరి. ఆ సర్పము పెద్ద పడగలతో నాతని మొగము వెలువడి సిద్ధులు నాగులు పూజింప సముద్రమున కేగెను. సముద్రు డర్ఘ్యముం గొని యెదురేగెను. మహేంద్రులచే బూజితుడై యానీటం బ్రవేశించెను. బలరామ స్వామి నిర్యాణముం గని హరి దారుకునితో నిట్లనియె.
బలరాముని నిర్యాణము యాదవ కులక్షయ మిది యెల్ల నీవు వసుదేవునికి నుగ్రసేనుని కిందెల్పుము. నేనును యోగ సమాధి నిలిచి యీ కళేబరమును విడిచితి నని ద్వారకా వాసి జనమునకుం జెప్పుము. ఈ ద్వారకా నగరమును సముద్రుడు ముంచి వేయును. అందు వలన సిద్ధముగా బూన్ప బడిన రథములతో నర్జునుని రాక కెదురు చూడుడు. పాండవు డాతడు నిష్క్రమింపగా ద్వారకా మధ్య మందు మీరుండ వలదు. అతడెట కేగు నటకాతనితో మీరు నేగ వలయు. నీవేగి కుంతీ కుమారుని కర్జునునకు నా చెప్పిన మాట చెప్పుము. నా పరిగ్రహము (భార్యా వర్గము) నీవు నీశక్తి కొలది పాలింప దగినది. అని పలికి యర్జురునితో గూడి నీవు ద్వారవతి యందలి జనముం గొని వెశ్లుదువు గాక! వజ్రుడు యాదవులకు రాజు గాగలడు.
