కూర్మ మహా పురాణము

Table of Contents

30వ అధ్యాయము

వ్యాస మహర్షి పలికెను.

బ్రాహ్మణులకు హితమును కలిగించుటకు సకల దోషములను తొలగించుటకు శుభకరమగు ప్రాయశ్చిత్త విధిని తెలిపెదను. విధించిన కర్మల నాచరించకున్ననూ, నిషేధించిన కర్మల నాచరించిననూ దోషమును పొందును. ప్రాయశ్చిత్తము వలననే ఆ దోషములు తొలగును. బ్రాహ్మణుడైనవాడు దోషముల నాచరించినచో ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఆచరించకుండరాదు. బ్రాహ్మణులు శాంతులు విద్వాంసులు చెప్పిన దాని నాచరించవలయును. వేదార్థ జ్ఞానము గలవాడు, శాంతుడు ధర్మ కాముడు ఆహితాగ్నీ ద్వీజుడు ఒకడు. చెప్పినను అదీ పరమ ధర్మమే యగును. వేదార్థపారగులైన వారు, ఆహితాగ్నులు కానీ మువ్వురు ధర్మకాములై చెప్పినదే ధర్మము. ఇక అనేక ధర్మ శాస్త్రములను తెలిసినవారు, ఊహాపోహ విశారదులు వేదాధ్యయన సంపన్నులు ఏడుగురు చెప్పినది ధర్మమగును. మీమాంసకత్వము తెలిసినవారు, వేదాంత కుశలులగు ద్వీజులు 21మంది ప్రాయశ్చిత్తమును చెప్పగలరు. బ్రహ్మ హత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, దొంగ, గురు భార్య సంగతి చేసినవాడు వీరు మహాపాపు లనబడుదురు. వీరితో కలిసుండుపోగు కూడా మహాపాతకులే అగుదురు. మహా పాతకులనీ తెలిసిననూ ఒక సంవత్సరము వారితో కలిసి యాన శయ్యా ఆసనాదులలో కలిసి నిలిచినచో పతితుడగును. మహాపాతకి అని తెలిసికూడా యజ్ఞములను చేయించుట, యోని సంబంధమును అనగా వివాహము జరుపుకోనుట వేదాధ్యయనము చేయించుట భోజనాదులు చేసినచో వెంటనే ప్రతీతుడగును.

అజ్ఞానము వలన మోహము వలన ఇటువంటి పాపులతో అధ్యయనము కాని అధ్యాపనము కానీ జరిపినచో ఒక సంవత్సరమున పతీతు డగును.

బ్రహ్మ హత్య గావించినవాడు అడవిలో కుటీరమును నిర్మించుకొని 12 సంవత్సరములుండవలయును. శవ శిరాకారమును ధ్వజముగా ధరించీ ఆత్మశుద్ధి కొరకు భిక్షాటనము గావించ వలయును. భిక్షలో బ్రాహ్మణ గృహములను దేవ మందిరములను విడువవలయును. తాను చంపిన బ్రాహ్మణుల తలచుకోనుచు తనను తాను నిందించుకొనుచు ముందు నిశ్చయించుకోన కుండా ఏడు ఇండ్లలో భీక్ష నాచరించవలయును. ఆ ఇండ్లలో పొగ రాకున్నపుడు నిప్పు చల్లారిన తరువాత, ఇంటిలోని వారందరూ భుజించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్యను నరులకు తెలుపుచు ఒకేసారి దీనమునకు భిక్షాటన గావించవలయును. ధైర్యము నవలంబించి వన్యమూల ఫలములతోనైనా జీవించవలయును. కపాల పొయై మంచము కోడును చేత పట్టుకొని బ్రహ్మచర్య పరాయణుడై 12 సంవత్సరములు ఆచరించినచో బ్రహ్మ హత్యా పాపము తొలగును. ఇది కూడా తెలియక చేసిన పాపమునకు మాత్రమే. తెలిసి చేసినచో బ్రతికున్నంత వరకు ప్రాయశ్చిత్తముల నాచరించి మరణించిన తరువాతనే శుద్దీయని తెలియవలయును. తెలిసి బ్రహ్మహత్య చేసినవాడు ఆ మరణ నిరాహారి కావలయును. ఎత్తు నుండి దూకి మరణించవలయును. మండుచున్న అగ్నిలోకానీ నీటిలో కొని పడవలయును. బ్రాహ్మణుని రక్షణ కొరకు, గోరక్షణ కొరకు ప్రాణములను విడువ వలయును. లేదా దీర్ఘ రోగి యోగి బ్రాహ్మణుని రోగమును శాంతింప చేసిననూ, దుర్భిక్షములలో బ్రాహ్మణునికి అన్నము పెట్టిననూ బ్రహ్మ హత్య పాపము తొలగును.

రామేశ్వర క్షేత్రమునకు వెళ్ళి సముద్రమున స్నాన మాచరించి బ్రహ్మచర్య పాలనతో రుద్రుని దర్శించిన బ్రహ్మహత్యా పాపము తొలగును. కపాల మోచనమను శివక్షేత్రమునకు వెళ్ళి స్నానమాచరించి పితృదేవతలను పూజించి బ్రహ్మ హత్యా పాతకము తొలగించు కొనవచ్చును. పూర్వము కపాలమోచన క్షేత్రమున అమీత తేజస్వీయగు భైరవుడు బ్రహ్మ కపాలమును ప్రతిష్ఠించెను. ఇచట భైరవ రూపుడగు శిపుని చక్కగా పూజించి స్నానమాచరించి పితృ తర్పణము గావించి బ్రహ్మ హత్య నుండి విముక్తుడగును. అశ్వమేధావభృథకమున స్నానము చేసిననూ శుద్ధి పొందును. వేదవిత్తైన బ్రాహ్మణునకు తన సర్వస్వమును అర్పించిననూ విశుద్ధుడగును. ప్రసిద్ధమగు సరస్వతి అరుణా నదీ సంగమమున మూడు పూటలా స్నానము చేసి మూడు రాత్రు లుపవసించిననూ బ్రహ్మ హత్యాపాతకము నుండి విముక్తుడగును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరి విభాగమున 30వ అధ్యాయము.