కూర్మ మహా పురాణము

Table of Contents

7 - సృష్టివర్ణనమ్

కూర్మస్వామి ఇట్లనెను.

ఆవిష్ణువు సృష్టిని గూర్చి ఆలోచించుచుండగా, ఆయాకల్పాలలో పూర్వము జరిగినట్లుగా, బుద్ధిపూర్వకము కాని అంధకారమయమైన సృష్టి ఆవిర్భవించెను.

మహాత్ముడైన ఆవిష్ణువునుండి తమోమోహము, మహామోహము, తామసము, అంధము, అవిద్య అని అయిదు విధములుగా తమయమైన సర్గము కలిగినది.

అభిమానము కలిగి ధ్యానించుచున్న ఆ భగవంతునికి అయిదుప్రకారములుగా ఉన్న సర్గము, కుండనే కప్పబడిన బీజమువలె చీకటితో కప్పబడి ఉండేను.

లోపల, బయట కూడ వెలుతురు లేనిదీ, జడముగా ఉన్నది. సంబంధరహితము, ముఖ్యములైన పర్వతములనీ చెప్పబడినది, ప్రధాన సరమని తలపబడినదీ.

ప్రభువైన విష్ణువు ఆసర్గము సమగ్రము కాదని తలచి మరోకసృష్టిని గూర్చి చింతించుచుండగా అడ్డముగా ఒక ప్రవాహము బయలు దేరినది.

ఆ ప్రపోహము అడ్డముగా ప్రసరించినందున తిర్యక్స్రోతమని చెప్పబడినది. బ్రాహ్మణులారా! భిన్నమార్గమును గ్రహించినందున అవి పశ్వాదులుగా ప్రసిద్ధములైనవి.

అది కూడ తృప్తికరము కాదని తలచి మరియొక సర్గమును సృష్టించినాడు. అది సత్వగుణ ప్రధానమైన దేవతజాతి సర్గము. ఊర్ధ్వస్తోతమని చెప్పబడినది.

ఆ దేవతలు సుఖములందు ఎక్కువ ప్రీతికలవారు, లోపల, బయటకూడ ఆవరణము లేనివారు, లోపలవెలుపల ప్రకాశముకలవారు స్వభావమును బట్టి దేవతలని పేర్కొనబడినారు.

తరువాత మరల ఆ బ్రహ్మ ధ్యానించుచుండగా అవ్యక్తరూపమునుండి, ప్రయోజనకరమైన అర్వాక్స్రోతస్సు ప్రాదుర్భవించినది.

దానియందు అధికప్రకాశము కలవారు, తమోగుణముచేత ఉద్రేకము పొందువారు, రజోగుణము ఎక్కువగా కలవారు, అధికదుఃఖముతో బాధపడువారు, సత్త్వగుణముతో కూడినవారు అగు మనుష్యులుగా వ్యవహరింపబడినారు.

ఆ రెండవ సృష్టిని చూచి భగవంతుడైన బ్రహ్మ ధ్యానించెను. ఆ సృష్టిని గూర్చి అతడు ధ్యానించుచుండగా ప్రాణులు మొదలగువానీతో కూడిన సృష్టి ఏర్పడినది.

అవి అన్నీ సంవిభాగముతోకూడి, పరిగ్రహించునవై, ప్రాణులనుతినేవి, శీలరహితములు అయిన భూతాదులుగా చెప్పబడినాయి.

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇవి అయిదు సర్గములు అని చెప్పబడినవి. వీనిలో మొదటిది మహత్తత్వము యొక్క సర్గము. అది బ్రహ్మకు సంబంధించినదిగా తెలియదగును.

రెండవది పంచతన్మాత్రలకు సంబంధించిన ప్రాణుల సృష్టిగా గుర్తింపదగినది. మూడవది తన్మాత్రల వికారములైన ఇంద్రియములకు సంబంధించిన సర్గము.

ఈవిధముగా బుద్ధిపూర్వకమైన సకల ప్రాకృతసర్గము ఏర్పడినది. నాలుగవ సర్గము ముఖ్యమైనది. అవి స్థావరరూపములైన పదార్థములుగా ముఖ్యసర్గముగా పేర్కొనబడినవి.

తిర్యక్స్రోతస్సుగా చెప్పబడినది అయిదవసర్గము. అదిపశుపక్ష్యాది రూప ప్రాణులతో కూడి ఉన్నది. తరువాత ఊర్ధ్వరేతస్సు కల దేవతల సర్గము (స్పషి) ఆరవవీభాగానికి చెందుతుంది.

తరువాత ఏడవసర్గము మనుష్యులకు సంబంధించినది. అది అధోరేతస్కుల యొక్క సృష్టి ఊర్ధ్వరేతస్కులు కానివారిది. ఎనిమిదవది. భౌతికసర్గము. అది భూతములు మొదలగువానికి సంబంధించినది.

తొమ్మిదవది కౌమారసర్గము. ఈ సర్గములలో కొన్ని ప్రాకృతములు, మరి కొన్ని వైకృతములు. మొదటి మూడు ప్రాకృతసర్గములు, అవి బుద్ధిపూర్వకమైనవి.

మునిశ్రేష్ఠులారా! ముఖ్యతత్వము మొదలగునవి బుద్ధిపూర్వకముగా ప్రవర్తించును. బ్రహ్మ ముందుగా తనతోసమానులైన యీక్రిందివారిని మానసపుత్రులుగా సృజించెను.

సనకుని, సనాతనుని, అట్లే సనందనుని, క్రతువును, సనత్కుమారుని కూడ ప్రజాపతి అగు బ్రహ్మ సృజించెను.

ఓ బ్రాహ్మణులారా! ఈ అయిదుగురు యోగులు గొప్పవైరాగ్యము నాశ్రయించి, భగవంతునియందే మనస్సుగలవారై, సృష్టికార్యము నందు బుద్ధిని ప్రసరింపజేయరైరి.

వారు ఈరీతిగా కోరికలేని వారు కాగా ప్రజాపతియగు బ్రహ్మ లోకమును సృజించుటయందు, మాయామయుడైన పరమేష్ఠివలన మాయచే వెంటనే మోహితుడాయెను.

మోహితుడైన బ్రహ్మను, లోకమును మాయలోనింపిన నారాయణుడు, మహాముని, మహాయోగిస్వరూపుడు, యోగీశ్వరుల మనస్సును సంతోషపరచు వాడునై మాయనుండి మేలుకొలిపెను.

ఆనారాయణునిచేత మేలుకొలుపబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ తీవ్రమైన తపస్సును చేసెను. తపస్సుచేయుచున్న ఆభగవంతుడు ఇతరము దేనిని గూడ గుర్తించక ఉండెను.

తరువాత చాలా కాలమునకు తపస్సులోని క్లేశదుఃఖమువలన అతనికి కోపము కలిగినది. కోపముతో కూడిన ఆయన కన్నులనుండీ బాష్పబిందువులు జారీపడినవి.

బొమ్మముడిచేత వంకరయిన బ్రహ్మయొక్క నొసటినుండి, శరణుపొందదగినవాడు, నీలలోహితుడును అగు మహాదేవుడు (శివుడు) పుట్టెను.

అతడే భగవంతుడు, తేజస్సులసమూహము, అతిపురాతనుడు. ఎవనిని పండితులు తమ ఆత్మలయందున్న పరమేశ్వరునిగా భావింతురో అతడే ఆశివుడు.

అప్పుడు భగవంతుడైన బ్రహ్మ ఓంకారమును స్మరించి, శివునికి నమస్కరించి, చేతులు జోడించి, వివిధ ప్రజలను సృజింపుమని అతనితో పలికెను.

ధర్మము వాహనముగా కల శంకరుడు బ్రహ్మయొక్క వాక్యమును విని తనతో సమానులైన మరికొందరు రుద్రులను సంకల్పముతో సృజించెను.

వారు జటాజూటముకలవారు, మూడుకన్నులుకలవారు, ఆటంకరహీతులు, నీలలోహితులుగా ఉండిరి. భగవంతుడగు బ్రహ్మ శివునితో, జననమరణములు కల ప్రజలను.

సృజించుము. అని పలికెను. అప్పుడా శివుడు ఇట్లుపలికెను. నేను జరామరణములుకల జనులను సృజించను. ఓ జగన్నాథా! అటువంటి అశుభప్రజలను నీవే సృష్టించుము” అనెను.

అప్పుడు బ్రహ్మ శివుని వారించి స్థానాభిమానులైన అన్నిటిని సృష్టించినాడు. వానిని చెప్పుదును, తెలుసుకొనుడు.

జలము, అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, స్వర్గము, నదులు, సముద్రాలు,పర్వతాలు, వృక్షములు, తీగలును;

లవములు, కాష్ఠలు, కలలు, ముహూర్తములు, పగళ్ళు, రాత్రులు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరాలు, యుగములు మొదలగు కాలభేదములు.

స్థానాభిమానులైన వానిని సృజించి మరల సాధకములను సృష్టించెను. మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వసిష్ఠుడు, ధర్ముడు, సంకల్పుడు అనువారిని;

బ్రహ్మదేవుడు ప్రాణమునుండి దక్షుని సృష్టించినాడు. కన్నులనుండి మరీచిని, శిరస్సునుండి అంగిరసుని, హృదయము నుండి భృగువును సృజియించినాడు.

కన్నులనుండి అత్రియనుపేరుగల మునిని, తన వ్యవసాయమునుండి ధర్మపురుషుని, సంకల్పమునుండి సంకల్పదేవతను, సర్వలోక పితామహుడైన బ్రహ్మ సృష్టించినోడు.

ఉదానవాయువునుండి పులస్త్యుని, వ్యానవాయువునుండి పులహుని, అపానమునుండి విచలితుడుకాని క్రతువును, సమానవాయువునుండి వసిష్ఠుని సృజించెను.

ఈ చెప్పబడినవారందరు బ్రహ్మదేవునిచే సృజింపబడిన సాధకులైన గృహస్థులు. మానవశరీరమునధిష్టించి వారిచేత లోకములో ధర్మము ప్రవర్తింపచేయబడినది.

తరువాత దేవతలను, అసురులను, పితరులను, మనుష్యులను నాలుగువర్గాలుగా సృజించదలచినవాడై భగవంతుడైన సృష్టికర్త, తనను ఆకార్యములో నిమగ్నునికావించుకొనెను.

తనను నియమించుకొన్న ప్రజాపతి నుండి తమోగుణముయొక్క పరిమాణము వృద్ధిచెందెను. అప్పుడతని జఘనభాగమునుండి ముందుగా కుమారులుగా అసురులు జన్మించిరి.

అసురులను సృజించిన తరువాత పురుషోత్తముడు ఆపూర్వ శరీరమును విడిచి పెట్టెను. అతడా శరీరము విడువగానే వెంటనే రాత్రి ఏర్పడెను.

ఆరాత్రి చీకటీ ఎక్కువగా కలదైనందున దానియందు ప్రజలు నిద్రించుచుండిరి. అప్పుడు భగవంతుడు సత్త్వగుణము ప్రధానముగా గల మరియొక శరీరమును స్వీకరించెను.

తరువాత ప్రకాశించుచున్న అతని ముఖమునుండి దేవతలు జన్మించిరి. అప్పుడా శరీరము కూడ అతనిచే విడువబడెను. తరువాత సత్త్వగుణాధికమైన పగలు ఏర్పడెను.

అందువలన ధర్మయుక్తులైన దేవతలు సత్త్వగుణము మాత్రమే స్వరూపముగాగల మూర్తినే సేవించుచుండిరి. తరువాత ఆభగవానుడు మరొక శరీరమును స్వీకరించెను.

తండ్రివలె భావించుచున్న ప్రజాపతికి పితృదేవతలు జనించిరి. పితరులను సృష్టించిన తరువాత ఆ శరీరమును కూడ విశ్వద్రష్ట అగుదేవుడు వదలిపెట్టెను.

అతనిచేత అశరీరము కప్పివేయబడినది. అప్పుడే సంధ్య ఏర్పడెను. అందువలన దేవతలకు పగలు రాక్షసులకు రాత్రిగా ఆయెను.

ఆ పగలు రాత్రులకు మధ్యలో పితరులకు సంధ్యారూపమైనమూర్తి గొప్పదిగా ఉండెను. ఆ కారణమువలన దేవతలు, అసురులు, మునులు, మనుష్యులు అందరుకూడు అప్పుడు రాత్రికి, పగటికి మధ్యమందున్న సంధ్యారూష. శరీరమును ఎల్లప్పుడు సేవింతురు. తరువాత బ్రహ్మ రజోగుణము మాత్రము ముఖ్యముగా కల ఇతర శరీరమును కల్పించెను.

పిమ్మట ఆయనకు ఆశరీరము నుండి రజోగుణముచేత కప్పబడిన మనుష్యులు కుమారులుగా జన్మించిరి. అప్పుడు ప్రజాపతి ఆశరీరము కూడ శీఘ్రముగా విడిచిపెట్టెను.

బ్రాహ్మణులారా! ఏది పూర్వసంధ్య అని చెప్పబడుచున్నదో, అది వెన్నెలగా అయినది. తరువాత భగవంతుడైన ఆబ్రహ్మ, తమస్సు, రజస్సు అనుగుణములు అధికముగాకల శరీరమును ధరించి మరల పూజించెను. అప్పుడాయనకు చీకటిలో ఆకలితో కూడిన రాక్షసులు పుట్టిరి.

తమోరజోగుణ ప్రాయులైన, బలవంతులు, రాత్రించరులు అగుకుమారులు కలిగిరి. సర్పముల వంటి ఆయుధాలు కలవారు మరియు గంధర్వులు జన్మించిరి.

తరువాత రజస్తమోగుణములతో కూడియున్న ఇతరప్రాణులను బ్రహ్మ సృజించెను. పక్షులను సృష్టించి తరువాత తన హృదయస్థలము నుండి సర్పములను సృజించెను.

ముఖము నుండి మేకలను, పొట్టనుండి గోవులను సృష్టించినాడు. పాదములనుండి గుఱ్ఱములను, ఏనుగులను, గాడిదలును, గవయములను, ఇతర మృగములను సృష్టించినాడు.

ప్రజాపతి తనమోచేతి నుండి ఒంటెలను, కంచరగాడిదలను సృజించెను. అతని రోమములనుండి ఓషధులు, పండ్లు, దుంపలు పుట్టినవి.

ప్రజాపతి తన మొదటి ముఖమునుండి గాయత్రీమంత్రమును, ఋక్కులను, త్రివృత్ స్తోమమును, రధంతరమను మంత్రమును, యజ్ఞములలో అగ్నిష్టోమమును సృజించెను.

యజుర్వేద మంత్రములను, త్రిష్టుప్ఛందస్సులోని మంత్రసమూహమును, బృహత్సామ మంత్రములను, ఉర్ధస్తోత్రమంత్రమును, దక్షిణపు ముఖమునుండి నిర్మించెను.

సామమంత్రములను, జగతీఛందస్సుల సమూహమును పదునేడింటిని, వైరూపము, అతిరాత్రము అను పేర్లుగల మంత్రసూక్తములను పడమటి ముఖమునుండి సృష్టించెను.

ఇరువదియొక్క అధర్వశాఖలను, ఆప్తోర్యామ శాఖను, వైరాజముతోకూడిన అనుష్టుప్ ఛందమును ఉత్తర ముఖమునుండి సృజించెను.

ప్రజలను సృజిస్తున్న ప్రజాపతియగు బ్రహ్మయొక్క అవయవాల నుండి ఉచ్ఛనీచములైన ప్రాణులు జన్మించినవి.

యక్షులను, పిశాచాలను, గంధర్వులను, కల్యాణరూపులైన అప్సరసలను సృష్టించి, దేవతలు, ఋషులు, పితరులు, మనుష్యులు అను సొలుగు విధముల సర్గమును కల్పించి,

తరువాత స్థావరములు, జంగమములు అగు భూతములను సృష్టించెను. మనుష్య, కిన్నర, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగములను, సర్పములను సృష్టించినాడు.

స్థావర జంగమములు రెండుకూడ నశించనిది, నాశము పొందునది అని రెండు విధములుగా ఉండును. వానిలో ఏవి ఏకర్మలను సృష్టికి పూర్వము పొందియుండేనో;

ఆకర్మలనే అవి మరల మరల సృజించబడినప్పుడు పొందుచుండును. హింసించునది - అహింసకలది, మృదువైనది - క్రూరమైనది, ధర్మము - అధర్మము, ఋతము - అనృతము;

దానిచేత భావింపబడి ఆశ్రయింతురు. అందువలన అదీవానికి రుచించును. మహాభూతములయందు అనేకత్వమును, ఇంద్రియములకు విషయములైన శరీరములందు ప్రాణుల వినియోగమును కూడ బ్రహ్మయే స్వయముగా సృజించెను. నామరూపములను, ప్రాకృతములైన భూతముల విస్తారమును ఆమహేశ్వరుడు వేదశబ్దములనుండియే ఆదికాలమున నిర్మించెను. ఋషిప్రోక్తములైన నామములు, వేదములందు చెప్పబడిన సృష్టులు,

రాత్రిముగిసిన తరువాత మరల జనించిన వారికి మరల పూర్వపు పేర్లనే బ్రహ్మ కల్పించుచున్నాడు. పునః సృష్టిలో ఎన్ని ప్రతిలింగములు, నానారూపములు కలవో, యుగాది యందు మరల ఆయాభావములు నామరూపాదులతో కన్పించును.

శ్రీ కూర్మపురాణములో ఏడవ అధ్యాయము సమాప్తము.