కూర్మ మహా పురాణము

Table of Contents

8వ అధ్యాయము

అష్టమాధ్యాయము బ్రాహ్మణోత్తములారా? మరొక పరమ రహస్య జ్ఞానమును తెలుపుచున్నాను. దీనిని తెలిసిన పురుషుడు సంసార సాగరమును దాటును.

నేను పరబ్రహ్మను,శాంతుడను, శాశ్వతుడను, నీర్మలుడను, అవ్యయుడను ఒక్కడినే, భగవంతుడను. కేవలుడను. పరమేశ్వరుడను. మహర్రహ్మా నాయోని, దానీ యందు మాయ అనబడు గర్భమును ధరించెదను. దాని నుండి ఈ సకల జగత్తు పుట్టినది, ప్రధానము, పురుషుడు, ఆత్మ, మహత్తత్త్వము, తామసాహంకారము పంచతన్మాత్రలు, పంచమహాభూతములు ఇంద్రియములు పుట్టినవి. తరువాత కోటిసూర్య సమకాంతిగల బంగారు గుడ్డు పుట్టినదీ, ఆ అండమందు సో శక్తిచే పెరిగిన మహా బ్రహ్మ పుట్టెను. ఇంకనూ నా స్వరూపులైన చాలా మంది జీవులు ఉద్భవించుకొని వారందరూ నా మాయతో మోహితులై తండ్రినైన నన్ను చూచుట లేదు ఇట్లు సకల యోనుల యందు ఉద్భవించు ప్రాణులు వారందరికి తల్లి మాయ నేను తండ్రిని. నన్ను బీజప్రదునిగా తండ్రినిగా తెలియువారు ధీరులు. మోహమును పొందరు.

అన్ని విద్యలకు నేనే అధిపతిని. అన్ని ప్రాణులకు నేనే పరమేశ్వరుడను. నేనే ఓంకార స్వరూపుడను. భగవంతుడను. బ్రహ్మను ప్రజాపతిని. అన్నీ ప్రాణులందు సమరూపినిగా ఉండువాడను. నశించు వారలలో కూడా నశించక ఉండు వాడనని తెలియువాడే తెలివి గలవాడు, అన్నీ ప్రాణులలో సమము నుండు వానినీగా తెలిసి తనను తాను హింసించుకొనని వాడు పరమపదమును పొందును. సప్త సూక్ష్మములు ఆరు అంగములు గల మహేశ్వరుని తెలిసి ప్రధానమును విని యోగములను తెలిసినవారు పరమాత్మను చేరగలరు.

సర్వజ్ఞత్వము, తృప్తి, అనాదియగు జ్ఞానము స్వాతంత్ర్యము ఎల్లపుడు లోపించని శక్తి, అనంతశక్తి అనునవి మహేశ్వరుని ఆరు అంగములు, పంచ తన్మాత్రలు మనస్సు ఆత్మలను ఏడు సూక్ష్మములు. హేతు రూపముగా నుండు ప్రకృతిని ప్రధానమందురు. ప్రకృతిలో ఏర్పడు బంధమే వినియోగము. ప్రకృతిలో లీనమగు శక్తిని వేదములలో బ్రహ్మ యోని అందురు. అద్వితీయుడు పరమేష్ఠి పరాత్పరుడు సత్యరూప మహేశ్వరుడు బ్రహ్మయోనికి పురుషుడు.

 ఆ పురుషుడే బ్రహ్మ, యోగి, పరమాత్మ, మహాన్, సర్వవ్యాపి వేదవేద్యుడు, పురాణుడు, అద్వితీయుడు, రుద్రుడు, మృత్యువు, అవ్యక్తము ఏకము, బీజము, విశ్వము. ఆ పురుషుని కొందరు ఒక్కనిగా కొందరు అనేకులుగా మరికొందరు అతనినే అద్వితీయాత్మ అందురు. చిన్నవాటిలో చిన్నవాడు, పెద్దవాటిలో పెద్దవాడు మహాదేవుడని వేద విదులందురు. ఇట్లు అఖిల జీవాంతర్యామిగా పరునిగా ప్రభువుగా పురాణ పురుషునిగా, విశ్వరూపునిగా, హిరణ్మయునిగా, బుద్ధిమంతులకు పరమగతిగా తెలిసినవాడు బుద్ధిమంతుడు పరమపదమును పొందును.

ఇది షట్సాహస్ర సంహితయను న ఉత్తర విభాగమున ఈశ్వరగీతలో అష్టమాధ్యాయము.