కూర్మ మహా పురాణము

Table of Contents

6 - అథ పృథివ్యుద్ధారః

కూర్మస్వామి చెప్పెను

మొట్టమొదట ఈ సృష్టి ఒకేసముద్రమయముగా, విభాగరహితముగా, భయంకరముగా, చీకటితోనిండి, వాయువుమొదలగునవి విరమించినట్లు, ఏమియు తెలీయరాకుండ ఉండెను.

అప్పుడు స్థావర జంగమాలన్నీ నశించి, ఒక సముద్ర రూపములో జగత్తు ఏర్పడినప్పుడు, వేయికన్నులు, వేయి పాదములు కలిగిన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను.

వేయి శిరస్సులు కలవాడు, బంగారు వర్ణము కలవాడు, ఇంద్రియములను జయించిన వాడు అగుపురుషుడు, నారాయణుడను పేరుకల పరబ్రహ్మ ఆసముద్ర జలముపై శయనించెను.

ఈ సందర్భములో నారాయణునిగూర్చి యీ శ్లోకమును ఉదాహరింతురు. ప్రపంచముయొక్క సృష్టికి కారణభూతుడు, నాశరహితుడు అగు బ్రహ్మరూపుడైన దేవుని గూర్చి ఇట్లు చెప్పుదురు.

నారములనగా ఉదకములు. అవి మనుష్యులకు ప్రభవ కారణములు. అతనికి అవి మార్గము అయిన కారణముచేత నారాయణుడని చెప్పబడుచున్నాడు.

వేయి యుగాలకు సమానమైన రాత్రిమయమైన కాలాన్ని గడిపి, రాత్రి గడిచిన తరువాత ఆభగవంతుడు సృష్టికార్యకారణముగా మరల బ్రహ్మ రూపమును ధరించును.

తరువాత నీటిలో మునిగియున్న భూమిని, అనుమాన ప్రమాణముతో గుర్తించి, దానిని నీటినుండి పైకి తీయుటకు సృష్టికర్త అయిన ప్రజాపతి తలచినవాడై జలక్రీడలయందు మనోహరముగా ఉండు వరాహరూపమును ధరించినవాడై, ఇతరులకు మనస్సుచేత కూడ చలింప జేయుటకు శక్యముకాని బ్రహ్మ అనుపేరుగల వాజ్మయమును, భూమినీ జలమునుండి ఉద్ధరించుటకు పాతాళమును ప్రవేశించి, వరాహరూపుడు తన కోరతో భూమిని పైకి ఎత్తినాడు. అప్పుడు తనకు తానే ఆధారముగా కలిగిఉండెను.

వరాహ పురుషుని దండ్రకొనపై నిలుప బడిన భూమిని చూచి, జనలోకమందున్న సిద్దులు, బ్రహ్మరులు, తన పరాక్రమమును ప్రదర్శించిన విష్ణువును ప్రశంసించిరి.

ఋషులు ఇట్లన్నారు :

దేవతలకు దేవుడవు, పరమేష్ఠివి, బ్రహ్మదేవుడవు, పురాణపురుషుడవు, శాశ్వతుడవు, జయ రూపుడవు అగునీకు వందనము.

స్వయంభువు అయిననీకు, సమస్త విషయములు తెలిసిన సృష్టికర్తవు, హిరణ్యగర్భుడవు, పరమాత్మ స్వరూపుడవు, బ్రహ్మవు అగునీకు నమస్కారము.

వాసుదేవుడవు, ప్రపంచమునకు కారణభూతుడవు, సర్వవ్యాపివి, దేవతలకు మేలు చేయువాడవు, నారాయణదేవుడవైన నీకు నమస్కారము.

నాలుగు ముఖములు కలిగి, శార్జ్ఞమనే ధనుస్సు, చక్రము, ఖడ్గమును ధరించి, సమస్త ప్రాణులకు ఆత్మరూపుడవు. కూటస్థ పురుషుడవగు నీకు వందనము.

వేద ప్రతిపాద్యరహస్యములు కలవాడవు, వేదములకు కారణభూతుడవు, జ్ఞానాత్మకుడవు, నీర్మలాత్ముడవు అగునీకు నమస్కారము.

ఆనందస్వరూపుడవు, లోకములకు సాక్షిభూతుడవు, అంతములేనివాడవు, కొలుచుటకు శక్యము కానివాడవు, కార్యభూతుడవు, కారణ రూపుడవును అయిన నీకు నమస్కారము.

పంచభూతాత్మకుడవు, పంచభూతముల వ్యక్తరూపుడవు, మూల ప్రకృతివి, మాయారూపుడవు అయిన నీకు వందనము.

వరాహరూపుడవు, మత్స్యరూపమును ధరించినవాడవు, యోగసాధనచేత తెలియదగినపోడవు, ఇంద్రియములను నిగ్రహించువాడవు అగునీకు నమస్సులు.

త్రిమూర్తి స్వరూపుడవు, మూడులోకములు నివాసముగా కలవాడవు, దివ్యమైన తేజస్సు కలిగిన సంకల్పసిద్దుడవు, పూజింపదగినవాడవు, సత్త్వరజస్తమోగుణములనే మూడిటి విభాగముచేయు నీకు నమస్కారము.

సూర్యస్వరూపుడవు, కమలము జన్మస్థానముగా కలవాడవు, ఆకార రహితుడవు, మూర్తిమంతుడవు, లక్ష్మీపతివి అగునీకు వందనము.


 

ఈ సమస్తము నీచేతనే సృష్టిచేయబడినది. నీయందే అదిఅంతా నిలిచిఉన్నది. ఈ సమస్తలోకాన్ని కాపాడుము. నీవే రక్షకుడవు, శరణమైన వాడవు. దిక్కునీవే.

ఈవిధముగా ఆవిష్ణువు సనకాదిమునులచేత స్తోత్రము చేయబడినవాడై, వరాహరూపము ధరించిన ఆ భగవంతుడు వారియందు అనుగ్రహము చూపెను.

తరువాత భూమిధరుడైన ఆవరాహపురుషుడు, భూమిని తనపూర్వపు స్థానమును పొందించి, మనస్సులో ధ్యానించుకొని ఆవరాహ రూపమును విడిచిపెట్టెను.

ఆనీటి సమూహము యొక్క పైభాగములో భూమి పెద్దనామవలే నిలిచి ఉండెను. దాని ఆకారము చాలా విశాలముగా వ్యాపించిఉన్నందు. వలన భూమి నీటిలో ప్రయాణము చేయకుండెను.

వరాహరూపి యగునీశ్వరుడు భూమిని సమానముగాచేసి, దానియందు పర్వతములను నిలిపెను. పూర్వకల్పములో నశించినవానినన్నిటిని మరల సృజించుటకు సంకల్పించెను.

శ్రీ కూర్మపురాణములో షృథివ్యుద్ధారమను ఆరవ అధ్యాయము సమాప్తము.