కూర్మ మహా పురాణము
3వ అధ్యాయము
ఈశ్వరుడిట్లనెను.
అవ్యక్త తత్త్వమునుండి కాలము పుట్టినది. ప్రధానము, పరమపురుషుడు కూడ పుట్టెను. వాని నుండి యీ సమస్తము కలిగినది. అందువలన ప్రపంచము బ్రహ్మమయము.
బ్రహ్మము అన్నివైపుల వ్యాపించిన చేతులు, కాళ్లు కలది, అంతట కన్నులు, తలలు, ముఖములు కలిగినది, అన్నివైపుల శ్రవణములు కలిగి మొత్తము నావరించి యుండును.
అన్ని ఇంద్రియముల గుణముల యొక్క ఆభాసము కలది, అన్నీ ఇంద్రియముల నుండి విడువబడినది, అన్నిటికాధారమైనదీ, అంతములేనిది, వ్యక్తమునిది, భేదశూన్యమైనది బ్రహ్మ స్వరూపము.
సమస్తోపమాన శూన్యమైనది, ప్రమాణముల కతీతముగా గోచరించునది, వికల్పశూన్యము, ఆభాసరహితము, అన్నిటికాధారభూతము, శ్రేష్ఠమై అమృతరూపమైనది.
భిన్నముకానిది, భిన్నమైన కూర్పుకలది, శాశ్వతము, స్థిరము, నాశరహితము, గుణశూన్యము, గోప్పతేజస్సు అగు ఆ జ్ఞానమును పండితులు తెలిసి కొందురు.
సమస్త భూతములకు అతడాత్మరూపుడు, అతడు బాహ్య, ఆభ్యంతరరూపుడు. అట్టి నేను అంతట నిండినవాడను, శాంతుడను, జ్ఞానరూపుడగు పరమేశ్వరుడను.
స్థావర జంగమరూపమైన ఈ విశ్వమునాచేత వ్యాప్తమైయున్నది. సమస్త ప్రాణులు నాయందున్నవి. అట్టి వానిని వేదవేత్తలు తెలిసి కొందురు.
ఆ తత్వము ప్రధానము, పురుష రూపము అనీ చెప్పబడినది. ఆ రెండిటి యొక్క సంయోగము వలన పుట్టినది, అనాది యగు కాలమనీ చెప్పబడినది.
ఈ మూడు ప్రధానము, పురుషుడు, కాలము ఆద్యంత రహితము అవ్యక్త తత్త్వము నందు నిలిచియున్నది. దాని స్వరూపము కలది, తద్భిన్నమైనది అగునట్టి రూపము నొదిగా తేలిసికొందురు.
మహత్తత్త్వము మొదలు విశేషమువరకు సమస్తలోకమును సృజించును. ఆ ప్రకృతి యేది కలదో అదీ సర్వప్రాణులను మోహింపజేయును.ప్రకృతి యందున్న జీవరూప పురుషుడు ప్రకృతి గుణముల ననుభవించుచు, అహంకార విముక్తుడయినందున 25వ తత్వముగా చెప్పబడును.
ప్రకృతి యొక్క మొదటి వికారము ‘మహత్తు’ అని చెప్పబడును. తెలిసికొను శక్తి కలిగి యుండుట వలన దాని నుండి అహంకారము కల్గినది.
మహద్రూపమైన ఆత్మఒక్కటే. అది అహంకారమని చెప్పబడును. తత్త్వవిమర్శకులచేత జీవుడని, అంతరాత్మయని, ఆ ఆత్మయే పేర్కొనబడు చున్నది.
జన్మలయందలి సమస్త సుఖదుఃఖములు దానిచేతనే తెలియబడును. ఆ యాత్మ విజ్ఞానాత్మకము. మనస్సు దానీ కుపకరించును.
దానిచేత తన్మయమైన సంసారము జీవునకు కలుగుచున్నది. ఆ జీవపురుషుడు కాలముచేత, ప్రకృతి సంబంధము వలన వివేక శూన్యుడగు చున్నాడు.
కాలము భూతములను సృజించును. కాలము ప్రజలను సంహరించును. అన్నియు కాలమునకు వశములగును. కాలము దేనికిని వశము కాదు.
ఆ కాలము సనాతనము. అది యీ సర్వమును మించును. అది భగవంతుడని, సర్వజ్ఞమని, పురుషోత్తముడని చెప్పబడుచున్నది.
మనస్సు శ్రేష్ఠమైనదని పండితులు చెప్పుదురు. మనస్సు కంటే అహంకారము, అహంకారముకంటే మహత్తత్వము గొప్పదనికూడ వారు చెప్పుదురు.
మహత్తుకంటే అవ్యక్తము పరమైనది. అవ్యక్తమున కంటే పురుషుడు అధికుడు. పురుషుని వలన భగవద్రూపమైన ప్రాణము (జీవుడు) కలుగును. ఈ సర్వలోకము ఆ జీవునిది.
ప్రాణముకంటే పరతరమైనదీ ఆకాశము, ఆకాశమునకతీతమైన అగ్ని యీశ్వర రూపుడు. అట్టి నేను నాశరహితమైన బ్రహ్మను, శాంతుడను. ఈ జగత్తు మాయకతీతమైనది.
నా కంటే పరమైన ప్రాణిలేదు. నన్ను తెలిసికొని ముక్తిని పొందును. ప్రపంచములో స్థావర జంగమాత్మకమైనది ఏదియు నిత్యము లేదని తెలిసికొనుడు.
అవ్యక్తుడను, ఆకాశరూపుడను, మహేశ్వరుడను అగు నన్ను విడిచి నిత్యమేదియులేదు. ఆ నేను సమస్త విశ్వమును సృజింతును మరల సంహరించుచుందును.
మాయామయుడు, మాయలు కలవాడు నగు ఈశ్వరుడు కాలముతో కలియగా, ఈ కాలము నా సన్నిధిలో సకల లోకమును సృజించును. అనంతాత్మస్వరూపుడగు భగవంతుడు సమస్తమును నియమించును ఇది వేదములయందు చెప్పబడిన అనుశాసనము.
శ్రీ కూర్మపురాణము ఉత్తరార్ధములో ఈశ్వరగీతోపనిషత్తునందు, బ్రహ్మవిద్యయగు యోగశాస్త్రములో ఋషివ్యాససంవాదమను తృతీయాధ్యాయము సమాప్తము.
