కూర్మ మహా పురాణము
32 - వారణాశి మాహాత్మ్యము
బుద్ధిమంతుడైన ఆ వ్యాసముని శిష్యులతో కూడి మోక్షదాయకము, విశాలమునైన ఓంకార లింగ స్థలమును గూర్చి వెళ్ళెను.
అక్కడ ఆ మహాముని శిష్యులతో కూడి మహాదేవుని పూజించి, ఆ దేవుని గొప్పతనమును గూర్చి శ్రేష్ఠులైన మునులకు ఇట్లు చెప్పెను.
ఈ నిర్మలమైన లింగము ఓంకార నామము కలది, మంగళకరమైనది. మనుష్యుడు దీనిని స్మరించిన మాత్రముచేత అన్ని పాపముల నుండి ముక్తుడగును.
వారణాశిలో ఈచోట పంచాయ తన స్వరూపము, ఉత్తమము, పరమ జ్ఞానరూపము మోక్షదాయకమగు లింగము మునులచేత ఎల్లప్పుడూ పూజింపబడుచుండును.
ఈచోట పంచాయ తన విగ్రహము కలవాడు, భగవంతుడు, మహాదేవుడు అగు రుద్రుడు ప్రాణులకు మోక్షము నిచ్చువాడుగా విహరించు చుండును.
పశుపతికి సంబంధించిన జ్ఞానము ఏది పంచార్థము అని చెప్పబడుచున్నదో, నిర్మలమైన ఆ లింగ స్వరూపమే ఓంకార లింగ రూపముగా నెలకొని యున్నది.
శాంతికి అతీతమైనది, పరమైన శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అనుపేర్లతో క్రమముగా ఈశ్వర లింగము పంచార్థమని వ్యవహరింపబడును.
బ్రహ్మదేవుడు మొదలైన అయిదుగురు దేవతలకు ఆశ్రయభూతమైనది, ఓంకారము చేత ప్రతిపాదింపబడునది అగు లింగము పంచాయ తనమని చెప్పబడును.
ఈశ్వర సంబంధి, నాశరహితము అగు పంచాయ తన లింగమును దేహావ సాన కాలములో స్మరించవలెను. అప్పుడే తేజోరూపమైన ఆత్మ ఆనంద రూపములో లీనము కాగలదు.
ఇక్కడ పూర్వము దేవరులు, సిద్దులు, బ్రహ్మరులు, ఈశాన దేవుడగు రుద్రుని పూజించి పరమగతిని పొందినారు.
మత్స్యోదరి అను నది యొడ్డున మిక్కిలి రహస్యము, శుభకరము, పుణ్యమగు స్థానము కలదు. బ్రాహ్మణోత్తములారా! అదీ గోచర్మ మాత్ర పరిమాణము కలదై ఉత్తమమైన ఓంకారేశ్వరముగా ప్రసిద్ధమైయున్నది.
కృత్తివాసేశ్వర నామము గల లింగమును, శ్రేష్ఠమైన మధ్యమేశ్వర క్షేత్రమును, విశ్వేశ్వరుని మరియు ఉత్తమమైన ఓంకార కపర్దీశ్వర స్థానమును
బ్రాహ్మణోత్తములారా! వారణాశి యందు ఇవన్నియు రహస్యములైన శివలింగములు. శివుని అనుగ్రహము లేకుండ ఎవడును వీనిని తెలియ జాలడు.
ఈ విధముగా చెప్పి పరాశర పుత్రుడైన, గోప్పముని యగు వ్యాసుడు శంకరుని యొక్క కృత్తివాసేశ్వర నామకమైన లింగమును సందర్శించుటకు వెడలెను.
శిష్యులతో కూడ శివుని పూజించి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడునగు ఆ ముని శివుని యొక్క మాహాత్యమును బ్రాహ్మణులకు తెలియజేసెను.
ఈ ప్రదేశము నందు పూర్వమొక రాక్షసుడు ఏనుగు రూపమును ధరించీ, నిత్యము శివుని పూజించునట్టి బ్రాహ్మణులను చంపుటకు వచ్చెను.
అప్పుడు శివుడు ఆ బ్రాహ్మణులను రక్షించుటకు లింగమునుండి ఆవిర్భవించెను. విప్రవరులారా! భక్త వత్సలుడగు త్రిలోచనుడు తన భక్తులను కాపాడుకొనెను.
గజరూపములోనున్న రాక్షసుని, శివుడు శూలముతో చులకనగా చంపి, ఆ యేనుగు చర్మమును వస్త్రముగా చేసికొనెను. అందువలన కృత్తి పోసేశ్వరుడాయెను.
ఇచ్చట పూర్వము, మునులు, మునిశ్రేష్ఠులు గొప్ప సిద్ధిని పొందిరి. తమ ఆ శరీరముతోనే పరమపదమును చేరుకొనిరి.
విద్యావిద్యలకు ఈశ్వరులైన శివరూపులగు ఏరుద్రులు మీకు తెలుపబడిరో, వారు కృత్తివాసేశ్వర నామక లింగమును ఎల్లప్పుడూ పరివేష్టించి యుందురు.
కలియుగము అధర్మముతో నిండినదని, ఘోరమైనదని తెలిసికొని జనులు కృత్తివాస తీర్థమును విడిచివెళ్ళరు. అట్టి వారు ధన్యులనుటలో సందేహములేదు.
ఇతర స్థలములలో వేల కొలది జన్మలెత్తుట ద్వారా మోక్షము లభించునో లేదో? ఈ కృత్తి వాస తీర్థమందు మాత్రము ఒక్క జన్మతోనే మోక్షము లభించును.
సమస్త సిద్దులకు ఆలయము వంటిదని స్థానమును గూర్చి చెప్పుదురు. ఇది దేవదేవుడు, మహాదేవుడు అగు శివునిచేత రక్షింపబడు స్థలము.
ప్రతి యుగము నందును ఇక్కడ ఇంద్రియ నిగ్రహము కలవారు, వేద పారగులు అయిన బ్రాహ్మణులు మహాదేవుని పూజింతురు. శతరుద్రీయమును జపింతురు.
త్రియంబకుడు, మహాదేవుడునగు దేవుని, అంతటా వ్యాపించియున్న స్థాణువగు శివుని హృదయములో ఎల్లప్పుడు ధ్యానించుచూ స్తోత్రము చేయుదురు.
సిద్దులు ఇక్కడ గీతములను పాడుచుందురు. ఏ బ్రాహ్మణులు వారణాసీ యందు నివసింతురో, ఎవరు కృత్తివాస దేవుని శరణు పొందుదురో, వారికీ ఒక్క జన్మముతోనే మోక్షము లభించును.
లోకములకు ఇష్టమైన, మిక్కిలి కష్టముతో పొందదగిన బ్రాహ్మణ కులములో జన్మను పొంది, ధ్యానమవలంబించి రుద్రుణ్ణి జపింతురు. సన్యాసులు మనస్సులో మహేశ్వరుని ధ్యానము చేయుదురు.
వారణాశి పట్టణములో నివసించే మునీశ్వరులు ప్రభువైన ఈశ్వరుని ఆరాధింతురు. కపటములేనివారై యజ్ఞములతో పూజింతురు. రుద్రునీ స్తోత్రము చేయుదురు. శంభునికి నమస్కరింతురు.
స్వచ్ఛములైన భావములకు స్థానమైన భవునికి వందనము. పురాణ పురుషుడు, గిరీశయనుడైన శివుని శరణుపొందుతున్నాను. హృదయములో నివసించియున్న రుద్రుని స్మరించుచున్నోను. బహురూపధారియగు మహాదేవుని గుర్తించుచున్నాను.
శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అను ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
