నారద మహా పురాణము - ఉత్తరార్థము
69 - కామాక్షా మాహాత్మ్యమ్
మోహిని పలికెను : -
మానవుల పాపములను తొలగించి పుణ్యమును ప్రసాదించు కామోదాఖ్యానమును వింటిని. ఇక ఇపుడు కామాక్షామాహాత్మ్యమును వినగోరుచున్నాను.
వసువు పలికెను :
ఉత్తము రాలగు కామాక్షాదేవి పూర్వ దిక్కున సాగర తీరమున కలదు. మానవులకు సిద్ధిని ప్రసాదించును. ఇచటికి వెళ్ళి నియమిత భోజనుడై కామాక్షను పూజించి ఒకరాత్రి యున్నచో కామాక్షాదేవిని చేరగలడు. ఈదేవి భీమరూపముతో మానవులకు దర్శనము నిచ్చును. ఆమెను చూచి భయపడని వాడు మాత్రమే వాంఛితార్థసిద్ధిని పొందగలడు. దేవరాజ్జి భయంకర రూపిణియగు కామాక్షిని చూచి ఆసనమునుండి చలించినవాడు పతనమగును. ఇచటనే పార్వతీపుత్రుడగు సిద్ధనాధుడుండును. ఇతను ఉగ్రమగు తపమునాచరించుచు లోకులకు కనబడడు. కృతవ్రేతా ద్వాపయుగములలో అందరిచే చూడబడెడివాడు. కలియుగమున ఒకపాదము గడుచు వరకు అంతర్థానముగా నుండును. ఒక పాదము గడిచిన తరువాత ఘోరమగు భూమండలమున ప్రత్యక్షమై సకల జనులను సాధించును. మోహనాధ్యుపాయములచే మేచ్చప్రాయులగు జనులను తన వశమున నుంచుకొని కలి మూడు పాదములను గడుపును. ఇచటికి వెళ్ళి భక్తి భావసమన్వితుడై కామాక్షాదేవిని పూజించు సిద్దేశుని ఒక సంవత్సరము ధ్యానించినచో స్వప్నమున సిద్దేశుని దర్శించును. దర్శనాంతమున సిద్దేశుడు సూచించిన లోకత్రయమున గల సకల వస్తువులను తీర్చుచు సంచరించును. ఇచట నుండు మత్స్యనాధుడు విజ్ఞాన పారంగతుడు ఘోరతపము నాచరించుచు లోకాభిమతములను ప్రసాదించుచు దృష్టిగోచరుడుగాన యుండును. ఈ మత్స్యనాధుడు అడ్డులేని గతి కలవాడై సకల లోకములను అనేక యుగములు తిరుగుచు కాలవేగమున అభిభూతుడు కాక ఇపుడు కూడా తపములో యుండెను. పూర్వ భవమున ఒక బ్రాహ్మణుని పుత్రుడు గండాంత జాతుడుండెను. ఇతను పుట్టగానే పుష్కర ద్వీపమున తండ్రి సముద్రమున విడిచెను. సముద్రమున ప్రవేశించగనే విధి నియోగము వలన ఒక మత్స్యము మ్రింగెను. ఆ మత్స్యదరముననే ఇతను చాలా యుగములు జరామరణములు లేక యుండెను. అంతట ఒకసమయమున ప్రియురాలి కోరికచే శివుడు పార్వతీ దేవితో కలిసీ తత్యోప దేశమును చేయుటకు లోకా లోకాచలమునకు వెళ్ళెను. ఈ పర్వత శృంగమున మణి ప్రకాశమున శ్రీహరియందు మనసునుంచి ఒక క్షణార్థము గడిపి తాపత్రయముచే ప్రాణులను మోహింపచేసి శక్తిచే పార్వతీ దేవిని ప్రబోధించి ద్వాదశాక్షరార్థ నిజ స్వరూపమగు పరమ రహస్యమునుపదేశించెను. అంతట ఆ పార్వతీదేవి మారాంతకుడగు శివుని నమస్కరించి తత్యము తెలియక నిలిచి యున్నంతలోమహాసముద్రమున నున్న మత్స్యము త్వరగా ఎగిరి ఆ శృంగముల చేరెను. మత్స్యదరమున నున్న బాలుడు తత్త్యసిద్ధిని పొంది అఖిల బంధవిముక్తుడై మత్యోదర మునుండి బయలు వెడలి పార్వతీ పరమేశ్వరుల ముందు నిలిచి నమస్కరించెను. అంతయూ తెలిసియున్ననూ మహేశ్వరుడు ఆ బాలకుని మతోదర ప్రవేశమునకు కారణము నడిగెను. ఆ బాలకుడు వారి ముందు జరిగిన వృత్తాంతము నంతటిని వివరించెను. అంతట పార్వతీ దేవి ఆ వృత్తాంతమును విని ప్రసన్నురాలై మహేశ్వరుని అనుమతిని పొంది అతని పుత్రునిగా చేసుకొని తన వడిలో నిడుకొని మోమును ముద్దాడెను. అఖి తత్యము తెలిసిన ఈసిద్ధనాధుడగు మత్స్యనాధుడు నా పుత్రుడు. ఇపుడు ఇతను తన ఇష్టానుసారముగా అన్ని లోకములలో తిరుగుచు కీర్తిని మాకు ఆనందనమును విస్తరింప చేయుగాక అని పార్వతీ దేవి పలికెను. అప్పటి నుండి పార్వతీ పుత్రుడగు ఈ మత్స్యనాధుడు యధేష్టముగా సకల లోకములను తిరుగుచు సిద్ద పీఠమును చేరి తపస్సులో నుండెను. ఈ సిద్ధ నాధుని మనసులో ధ్యానించినవారు సమస్త కామములను పొందును. సమగ్ర విద్యను పొంది తన వాక్యజాతమును పండిత వర్గమునంతనూ నిలుపును. జగత్సవిత్రమగు ఈ కథను విననివారు ఇహమున అన్ని కామనలను పొంది దేవతల పూజల నంది స్వర్గమును చేరును. ఇట్లు శ్రీసిద్ధ నాథ చరిత్రయుతమగు కామాక్షో మాహాత్మ్యమును సకల పాప నాశనమును నీకు తెలిపితిని. ఇంకేమి చెప్పవలయునో తెలుపుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున సిద్ధనాధ చరిత్రయుక్తమగు కామాక్షా మాహాత్మ్యమను అరువది తొమ్మిదవ అధ్యాయము.
