నారద మహా పురాణము - ఉత్తరార్థము
26 - అధ్యాయము
రుక్మాంగద మహారాజు పలికెను:-
ఓ పుత్రా! నా కీర్తి నశించిన నశించనిమ్ము ! నేను అసత్యవాక్కును అయిన కానిమ్ము. ఘోరమగు నరకము వచ్చిన రానిమ్ము. కాని ఏకాదశి నాడు నేనెట్లు భుజించగలను? ఈ మోహినీదేవి బ్రహ్మలోకమునకు వెళ్ళనిమ్ము. మూర్ఖురాలు, దుర్బుద్ధియగు ఈ మోహిని మాటి మాటికి నాతో నాకే కోరిక లేదు. రాజ్యముతో పనిలేదు. రాజ్యముతో పనిలేదు. కేవలము ఏకాదశి నాడు రాజు భుజించుటయే కావలయును అని పలుకుచున్నది. నాకు క్రిమి జన్మ వచ్చిననూ రానిమ్ము. కాని నేను మాత్రము ఏకాదశినాడు భుజించజాలను. ఈ లోకమున చాలా పెద్ద దుందుభి ప్రజలను బోధించుచున్నది. ఆ దుందుభి ఎట్లు వ్యర్థమగును? తినరాని దానిని తిని, పొందరాని స్త్రీని పొంది, పానముచేయరాని దానిని పానము చేసి నూరు సంవత్సరములు బ్రతికిననేమి ప్రయోజనము? ఈ భూమండలమున రాజనీతిని వదిలి, రాజ్యాధికారమును కూడా వదిలెదను. అసత్యవాక్కునను అపనిందను కూడా భరించేదను. ప్రజలందరూ ధిక్కరించిననూ ఏకాదశినాడు మాత్రము భుజించను. మోహినీ వియోగముచే మరణము సంభవించిననూ మేలేకాని ఏకాదశినాడు మాత్రము భుజించను. అతి దుఃఖముతో యమలోక మార్గమున ప్రజలను పంపుచు యమధర్మరాజునకు సంతోషమెట్లు కలిగించగలను? నీకాదశినాడు భుజించినచో ఇదివరకు శూన్యములుగా చేయబడిన నరకశ్రేణులు ఇపుడు పరిపూర్ణములగును. సమర్థుడైకూడా శత్రువులకు ఆనందము కలిగించువానిని ఏ తల్లీ గర్భమున ధరించరాదు. ఈ మోహిని ఏకాదశినాడు భుజించుటనే యాచించుచున్నది. సురాసురులు యాచించిననూ ఆ వరమును ఈయజాలను. విషమునైనను త్రాగెదను. అగ్నిలో కూడా దూకెదను. పర్వతాగ్రము నుండి క్రింద పడెదను. ఆకాశమున ప్రకాశించు ఖడ్గముచే నా శిరస్సును కూడా ఖండించుకొందును. కాని రుక్మాంగద మహారాజు మాత్రము ఏకాదశి నాడు భుజించడు. ఏకాదశ్యుపవాసము చేతనే రుక్మాంగద నామము మూడు లోకములలో ప్రసిద్ధి గాంచినది. అదియే నేను సంపాదించిన యశము. అట్టి నేను ఏకాదశినాడు భోజనము చేసి నేను సంపాదించిన కీర్తిని నేనే ఎట్లు నశింప చేతును. ఈ మోహిని మరణించిననూ, వెడలిపోయిననూ, పతనమైననూ, ఖండ ఖండములుగా నశించిననూ, ఇట నుండి విరమించిననూ, నానిశ్చయము మాత్రము మోహినీ కారణమున మాత్రము మారజాలదు. నా ప్రజలతో భార్యా పుత్రులతో నా జీవితమును కూడా విడిచెదను కాని పరమ పవిత్రమగు ఏకాదశీ దీనమున మాత్రము నేను భోజనము చేయజాలను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ఇరువది యారవ అధ్యాయము.
