నారద మహా పురాణము - ఉత్తరార్థము
3 - యమస్య బ్రహ్మలోకగమనమ్
ఋషులుపలికిరి :- శ్రీహరి సంతోషించి సమిహితమునిచ్చు శ్రీమహావిష్ణువు ఆరాధనను సవిస్తరముగా తెలుపుము. లక్ష్మీపతి, జగన్నాధుడు సకలపాపనాశనుడు యే పూజతో ప్రీతిచెందునో తెలుపుము. శ్రీహరి ప్రీతితో చరాచరజగత్తుప్రీతి చెందును.
సౌతిపలికెను :- ఓ మహారాజా! హీృషీకేశుడు భక్తిచే గ్రహించబడును. ధనములచే వశుడు కాడు. భక్తిచే పూజించినచో శ్రీ మహావిష్ణువు మనోరథములను ప్రసాదించును. కావున సర్వకాలములందు శ్రీహరి భక్తికలిగి యుండవలయును. ఎవరు పూజించిననూ జగన్నాథుడు క్లేశములను హరించును. దప్పిగొనిన వాడు నీటితో సంతోషించినట్లు పూజచే శ్రీహరి సంతోషించును. ఈ విషయమును ఒకపాపనాశకమగు అఖ్యానము కలదు. రుక్మాంగద మహారాజునకు గౌతమఋషికి జరిగిన సంవాదము కలదు. రుక్మాంగదుడను మహారాజు క్షమశాలి. శ్రీమన్నారయణ ప్రియభక్తుడు, ఏకాదశీవ్రతము నాచరించువాడు. శ్రీహరికంటే ఇతరదైవములను చూడనివాడు. రుక్మాంగదమహారాజు ఏకాదశీదినమున ఏనుగుపై భేరినుంచి ఇట్లు చాటించేడివాడు. ఎనిమిది సంవత్సరములుపైబడినవారినుండి ఎనబదియైదు సంవత్సరముల వయసు కలవారు ఎవరైన శ్రీహరివాసరమగు ఏకాదశినాడు భుజించినచో వారు శిక్షాపాత్రులు వధ్యులు నగరమునుండి బహిష్కృతులగుదురు. అట్లు భుజించు వాడు తండ్రియైననూ, సోదరుడైననూ, పుత్రుడైననూ, భార్య అయిననూ, మిత్రుడైనను దొంగవలె నిగ్రహించదగువాడగును. ఏకాదశినాడు బ్రాహ్మణులకు దానములనిండు. గంగాజలమున స్నానము చేయుడు. ఇట్లు నా ఆజ్ఞను పాలించి నా రాజ్యమును అనుభవించుడు. శుక్లపక్షమున కృష్ణపక్షమున బంగారుతోడుగు తొడిగిన భేరిపై భూమండల మంతటా చాటించుటచే శ్రీహరిలోక మార్గము వెళ్ళువారిచే సంకులమాయెను. రుక్మాంగదరాజ్యమున మరణించువారందరు శ్రీవిష్ణులోకమునకు చేరుచుండిరి. రాజాజ్ఞ యను భయముచే లేదా మిషచే నైననూ ద్వాదశీవ్రతము నాచరించుచున్ననూ శ్రీహరిమందిర మును చేరుచుండిరి. ఏకాదశినాడు భుజించువాడు పృధివియందు గలపాపమును భుజించువాడే. ఏకాదశినాడు భుజించనివాడు భూమియందు గల ధర్మము నంతటిని పొందుచున్నాడు. బ్రాహ్మణుని చంపరాదు అనునది వైదికస్మృతి. శుక్షకృష్ణపక్షములలోని ఏకాదశులందు భుజించరాదు అనునది రుక్మాంగదస్మృతి. కావున సూర్యపుత్రుడగు యమధర్మరాజు వికారమును పొందెను. చిత్రగుప్తుడు కూడా వ్రాయుటనాపి విశ్రాని తీసుకొనెను. పూర్వమున చేసిన కర్మల వలన కలుగుపాపములను వ్రాసికూడా ఇపుడు తుడిచివేసెను. మానవులు స్వధర్మాచరణతో క్షణకాలమున విష్ణులోకమునకు వెళ్ళుచుండిరి. నరకములన్నియూ పాపప్రాణి రహితములై శూన్యములాయెను. ద్వాదశాదిత్యులతాపముతో యములోకమార్గము భగ్నమాయెను. జనులందరూ గరుడవాహనారూపుడులై శ్రీహరిలోకమునకు వెళ్లుచుండిరి. దేవలోకములు కూడా శూన్యము లాయెను. పితృయజ్ఞములు, దేవపూజలు తీర్థపూజలు దేవతా సత్కారములు సన్నగిల్లెను. రుక్మాంగదరాజ్యములోనిప్రజలు ద్వాదశీవ్రతమును తప్ప ఇతరపూజలను వ్రతములను తెలియకుండిరి. ఇట్లు స్వర్గము నరకము శూన్యముకాగా నారదమహర్షి యమధర్మరాజునసమీపమునకు వెళ్ళి ఇట్లు పలికెను.
నారదమహర్షి పలికెను :- ఓ రాజా? నరకమున ఆక్రందనలు వినవచ్చుటలేదు. చిత్రగుప్తుడు పాపాత్ముల పాపములను వ్రాయుటలేదు. మునివలె మౌనముగాకూర్చొనియున్నాడు. పాపులెవరూ నీలోకమునకు వచ్చుటలేదు. మాయాకర్మపరులు దుష్టకర్మ రతులు ఎవరూ వచ్చుటలేదు. ఏమికారణము? ఇట్లు నారద మహర్షి అడుగగా యమధర్మరాజు కొద్ది దైన్యముతో నిట్లు పలికెను.
యమధర్మరాజు పలికెను :- ఓ నారదా! ఇపుడిక భూమండలముననున్నరాజు పురాణపురుషోత్తముడగు శ్రీహరియందు భక్తి కలవాడు. అతను పటహముతో ప్రజలను ఏకాదశినాడు భుజించరాదని బోధించుచున్నాడు. భుజించినవారిని దండించెదనని హెచ్చరిం చుచున్నాడు. అతని భయముతో ప్రజలందరు ద్వాదశీవ్రతము నాచరించుచున్నారు. మిషతోనైనను ద్వాదశీవ్రతము నాచరించుటచే నరకమునకు రాక విష్ణులోకమునకు వెళ్ళుచున్నారు. ద్వాదశీ సేవనమువలన హరిమందిరమునకు వెళ్ళుచున్నారు. కావున ఆరాజు ఇపుడు నాలోకమార్గమును లోపింపచేసెను. దేవలోకములను నరకలోకమును శూన్యము చేసెను. వారికి విశ్రాన్తి కలిగినది. వ్రాసిన దానిని తుడిచి వేయుచున్నారు. ఇది యంతయు ఏకాదశ్యుపవాసమహిమయే. బ్రహ్మహత్యాదిపాపములను అనుభవించకుండగనే ఏకాదశీఉపవాసములచే హరిమందిరమునకు వెళ్ళుచున్నారు. ఇపుడు నేను కాష్ఠమృగమువలె అయితి. నేత్రహీనుడును కర్ణహీనుడనైతిని. సంధ్యాహీనుడగు ద్విజునివలె అయితిని. స్త్రీ జితుడగు పురుషునివలె నపుసంకడగు ప్రీపతివలె కామనలను వదిలి ఇటువంటిలోకపాలత్వమును వహించుచున్నాను. కావున నాదుఃఖమును తెలుపుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నాను. ఒక కార్యమున నియమించబడినవాడు వ్యాపార శూన్యునిగా స్వామిధనమును అనుభవించినచో అతను నరకమునకు వెళ్ళును.
సౌతిపలికెను :- యమధర్మరాజు ఇట్లు పలికి నారదునితో చిత్రగుప్తునితో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట యమధర్మరాజు మూర్తిమంతులకు మూర్తిరహితలకు ప్రీతిపాత్రుడు, వేదప్రియుడు, జగద్బీజభూతుడు, అందరికి ప్రపితామహుడు, స్వయంభూ, భూతనిలయుడు, ఓంకారాఖ్యుడు, కల్మషరహితుడు, శుచి, శుచిపదుడు, హంసరూపుడు, దర్భలాంఛనుడు లోకపాలురచే దికాల్పురచే సేవించబడువాడు, ఇతిహాసములు, పురాణములు, వేదములు, సముద్రములు, నదులు, సరోవరములు, అశ్వత్థాది వృక్షములు, వాపీకూపతటాకాదులు, సర్వతములు, ఆహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళాకాష్ట నిమేషములు, ఋతువులు, అయనములు, యుగములు, మన్యర్తములు, కల్పములు, నిమేషములు, ఉన్మేషములు, ఋక్షములు, యోగములు, కరణములు, పౌర్ణములు, అమావాస్యలు. సుఖములు, దుఃఖములు, ద్వంద్వములు, అన్నియు ఆకారములను ధరించి సేవించుచుండగా ,ధర్మపాలకుడుగానున్నవాడు, కర్మవిత్తులగు పురుషులచే, అనురూపులచే సేవించబడువాడు, సత్త్వరజస్తమోగుణములచే శాంత,మూఢ, అతఘోరములను ప్రాకృత వికారములచే శ్లేష్మపిత్తాదివాయువులచే ఆతంకమూర్తములచే ఇంకాచెప్పబడనివి. ఇతరభూతములచే సేవించబడుచు ఆనందముతో విశ్వాత్మ,పరమధర్మమును ఆశ్రయించి యున్నవాడు, లోకకర్త, కటు కావ్యాది దురుస్తులు మూర్తిమత్తులై ఉపాసించుచుండగా విరాజిల్లు బ్రహ్మను ఆసీనుని సందర్శించెను. వారిమద్యకు సిగ్గుపడుచున్న పెళ్ళి కూతురువలె ప్రవేశించెను. క్రింద చూచుచు తలవంచుచు చూచుచుండెను. అట్లు చిత్రగుప్తుడు నారదుడు వెంటరాగా ప్రవేశించిన యముని అచటివారు చూచి ఆశ్చర్యము చెంది ఏమిటి? యముడు ఇచటనున్నాడు అనుకొనిరి. లోకకర్తయగు బ్రహ్మను చూడవచ్చెను. ఇతను వ్యాపారరహితముగా ఒక క్షణము కూడా ఉండడు. ఎపుడూ కార్యవాపృతుడుగా నుండును. అటువంటివాడు ఎందుకోచ్చేను? దేవతలు కుశలముగా నున్నారా? అట్లే చిత్రగుప్తుడు కూడా వ్రాసినదానిని. తుడిచి దీనముగా వచ్చియున్నోడు. ఇతని పటమును ఇంతవరెకెవ్వరూ తుడిచి యుండలేదు. ఇదివరకు చూడనిదానిని వినని దానిని చూచుచున్నాము. ఇట్లు అనుకొనుచున్నవారు, చూచుచుండగా యమధర్మరాజు మూలమును ఛేదించిన వృక్షమువలె కాపాడుము, కాపాడుము" నాకు పరాభవము జరిగినది. నా పటములోని వ్రాతను తుడిచి వేసిరి. నీవు నాధుడవుండగా దిక్కులేని వానినైతిని. ఇట్లు అనుచు బ్రహ్మముందు పడెను. ఇట్లు నిశ్చేష్టునిగా యమధర్మరాజుండుటను చూచి సభలో కోలాహలము మొదలాయెను. ఇతను స్థావరజంగమాత్మకములగు సకలలోకములను ఏడిపించువాడు ఈనాడు ఎందువలన తానే రోదించుచున్నాడు. జనులకు సంతాపమును కలిగించువాడు తానే స్వయముగా పరితపించును, అనుమాట యధార్థముగా నున్నది. దుష్కృతమును చేయువాడు మంచిని పొందజాలడు కదా? అనుకొనిరి. అంతట వాయువు వారిని వారించెను. సమచిత్తులగు లోకుల, బ్రహ్మ అభిప్రాయమును తెలుసుకొని అట్లు చేసెను. శంకను వారించి యమ ధర్మరాజును మెల్లగా లేపి ఉదారబుద్ధియగు వాయువు పారిపోవుచున్న భయపడుచున్న యమధర్మరాజును బలిష్ఠములైన తన భుజములచే స్థానమున కూర్చుండబెట్టెను. మరియు వ్యోమమూర్తి కాయస్తుడు అగు సూర్యపుత్రుని గూర్చి ఇట్లు పలికెను. నిన్నెవరు అవమానించిరి. ఎవరు నిన్ను స్థానభ్రష్టుని చేసిరి? నీ లోకపటమును ఎవరు తుడిచివేసిరి? దీనినంతటిని వివరముగా చెప్పుము. సర్వనాధుడు నీకు మరల ఉన్నతిని ప్రసాదించగలడు. నీహృదయములోని దుఃఖమును నశింపచేయగలడు. ఇట్లు వాయువు ఓదార్చగా యమధర్మరాజు అతని ముఖమును చూచుచు జగద్గురువుతో మెల్లగా ఇట్లు పలికెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున యముడు బ్రహ్మలోకమునకు వెళ్ళుటయను మూడవ అధ్యాయము.
