నారద మహా పురాణము - ఉత్తరార్థము
5 - అధ్యాయము
యమధర్మరాజు పలికెను :- ఓ త్రిభువనార్చితా శ్రీహరిలోక మార్గము. ఎల్లపుడు నడుచు మానవులచే సందడిగా యున్నది. శ్రీ మహావిష్ణులోకమునకు ఇంత అని ప్రమాణము లేదనుకొనుచున్నాను. ప్రపంచములోని జనసమూహముతో నిండులేదు. స్వకర్మ నిరతులు, స్వకర్మభ్రష్టులు, పవిత్రులు, అపవిత్రులు కూడా రుక్మాంగదాజ్ఞచే ఏకాదశినాడుపవసించి విష్ణులోకమునకు వెళ్ళుచున్నారు. ఆరుక్మాంగదుడు నాకు గొప్ప శత్రువు. మీకు విశేషించి శత్రువు. అతనిని అరికట్టవలయును. ఈ విషయమున సంశయములేదు. అతను వేయిసంవత్సరములు భూమండలమును పరిపాలించుచున్నాడు. అసంఖ్యాకజనమును చతుర్భుజములతో గరుడ వాహనముతో పీతాంబరధారణతో, చిత్రమాల్యానులేపనములతో, శ్రీ విష్ణులోకమును చేర్చుచున్నాడు. రుక్మాంగదమహారాజు ఈ భూమిపై యున్నచో భూమండలవాసులందరిని విష్ణులోకమును చేర్చును. ఇదిగో ఈ శిక్షాదండము, కర్మల వివరముల పట్టికను నీ పాదముల వద్ద విడుచు చున్నాను. ఆరుక్మాంగదుని గర్భమున ధరించిన స్త్రీ ధన్యురాలు. గుణాధికుడు తల్లి సర్వదుఃఖములను నశింపచేసెను. తల్లికి కష్టమును కలిగించుటకు మాత్రమే పుట్టిన పుత్రుడు నిష్ప్రయోజకుడు. జ్యేష్ఠమాసములో సూర్యునివలె శత్రువులను తపింప చేయనివాని జన్మము వ్యర్థము. మేఘములో మెరుపువలె కీర్తి విస్తరించినచో, విద్యచేకాని, బలముచేకాని పితృపక్షమును ఉద్ధరించని వాడు తల్లికడుపులో విపరీతముగా సంచరించువాడు మాతృఘాతకుడగును. అతని జీవితము వ్యర్థము. ఈ ప్రపంచమున నా వ్రాతను తుడిచివేయుటకు పుట్టిన రుక్మాందుడుతప్ప ఏ రాజు కూడా నా పటమార్జనమును చేసినట్లు వినియుండలేదు. చూసి యుండలేదు. ఇంతవరకు ఎపుడూ ఈ లోకమున హరిసేవలో నుండుచు ఘోరమగు పటహమును మ్రోగించుచు నాలోకపుమార్గమును లోపింప చేయు రాజును నేను తెలియను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున యమవిలాపమను అయిదవ అధ్యాయము సమాప్తము.
