నారద మహా పురాణము - ఉత్తరార్థము
19 - మోహినీ ప్రణయ వర్ణనమ్
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు ప్రియురాళ్ళచే అనుమతిని పొందిన రుక్మాంగద మహారాజు సంతోషించిన వాడై ధర్మాంగదునితో ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఎప్పుడూ ప్రమాద రహితుడవై మొదట దుష్టులను వధించి సప్తద్వీపములు గల ఈ భూమండలమును పరిపాలించుము. సత్కాలమున సదాచారమును పరిశీలించుచు, జ్ఞానివై వాణిజ్యము నందు ప్రీతి కలవాడవై, ఎప్పుడూ పర్యటించుచు, సర్వకాలములందు దానములను చేయుచు కుటిలత్వమును విడిచి సదాచారమునందు ప్రీతికలవాడవై యుండుము. ఓ పుత్రా ! ఇపుడు నీవు చేయవలసిన మరియొక పనిని వినుము. రాజులు ఎప్పుడూ అందరి యందు అవిశ్వాసమునే కలిగి యుండవలయును. జనుల కోశమును తెలియుచుండ వలయును. పూవుల నుండి తుమ్మెద మరందమును పరిగ్రహించునట్లు పాదరసమువలె అంతటా పరిభ్రమించుచు ప్రజల నుండి ధనమును గ్రహించవలయును. ఇక నేను నీచే లభించిన యౌవనమును పొంది చంద్రముఖి, అపూర్వ సౌందర్య రాశి, అగు మోహినిని భార్యగా పొంది సప్తద్వీప భూ భారమును నీ కప్పగించి సుఖముగా ఆనందించెదను. పుత్రా! మనుష్యలోకమున యావనవంతుడు సమర్థుడగు పుత్రుడుండగా దంత భ్రంశమును చెంది, తలపండి, ముడుతలు పడిన శరీరము కల తండ్రి స్త్రీ సౌఖ్యమును కోరుట సిగ్గును కలిగించు విషయమే. అయిననూ నేను వృద్దుడనై కూడా యువకుడనే. కావున అన్ని లోకములలో శ్రేష్టురాలగు, నా కొరకు దేవతలను కూడా వదలివచ్చిన, మన్మధ బాణ విద్దయగు ఈ మోహినిని, చారునేత్రను స్వర్ణ వర్ణ దేహను, ఏకాంత శీలుడనై నిండు మనసుతో, రహస్యముగా సుందరములగు సెలయేరులలో నదీ తీరములందు రమించెదను. దేవతలందరిలో శ్రేష్ఠురాలగు ఈ మోహిని నాజీవితము కంటే అధికురాలు. సుఖముగా నుంచదగినది. లక్ష్మీదేవి కొరకు దేవతలు లోకపాలులు మూఢులైనట్లు ఈ మోహిని కొరకు దేవతలందరూ మోహితులైరి. ఇట్లు పలికిన తండ్రి మాటను విని సుబుద్ధియగు ధర్మాంగదుడు జననీ సమేతముగా జనకునికి ప్రణమిల్లి, తండ్రి భోగము కొరకు బహువిత్త సంచయమును సమకూర్చెను. తండ్రి కొరకు ఆజ్ఞావిధేయులగు దాసులను దాసీ జనమున నియమించి కామబాణార్హుడగు తండ్రికి అన్ని సౌకర్యములను సమకూర్చి భూరక్షణమును ఆచరించెను. ధర్మాంగదుడు రాజులచే స్తుతించబడుచు సప్తద్వీప సమన్వితమగు భూమండలమును పర్యటించుచు పరిపాలించు చుండగా ప్రజలు పాపమునందు బుద్దిని విడిచిరి. ఫలములు పుష్పములు లేని చెట్లు లేకపొయేను. యవశాలి రహితమగు క్షేత్రము లేదు. గోవులు ఘట పూర్ణముగా పాల నిచ్చుచున్నవి. ఆ పాలు శర్కరవలె తీయనివి. ఎక్కువ నేయి కలవి. సుఖముగా త్రాగదగిన పాలు. అందరి ఆర్తిని నశింప చేయునవి. పాపములను తొలగించగలవి. పుష్టిని పెంచునవి. ప్రజలలో ఏ ఒక్కరూ సంపదను దాచరు. భర్తతో భార్య పరుషముగా మాటలాడదు. వినయశీలులగు పుత్రులు తండ్రి ఆజ్ఞను పాలించువారు. కోడలు అత్త చేతుల్లో నిలుచు. ప్రజలందరూ బ్రాహ్మణుల ఉపదేశములో నిలుచువారు. బ్రాహ్మణులు వేదోక్త ధర్మములను ఆచరించువారు. ఏకాదశినాడు ఏ ఒక్కరూ భుజించరు. నదులు ఎండిపోవుటలేదు. భోగములందు కోరికగల మానవులు భోగములననుభవించుచున్ననూ వారి సంపదలు తరుగుట లేదు. నదులలోని నీరువలే సంపదలు పేరుగుచున్నవి. దూర్వాత్పణము జలముచే పెరుగుచున్నది. ధర్మాంగద మహారాజు రాజ్యపాలన చేయుచుండగా సమస్త లోకము ధన్యత నందెను. భోగానుభవముచే సౌఖ్యములను పొందుచున్నారు. హరి దినమును సేవించుటచే గడుపుచున్నారు. రాజ్యములలో ఎవ్వరూ దొంగల భయముచే తలుపులు మూయుట లేదు. స్వేచ్చాచారులు లేరు. గోపాలకులకు ఇతర వృత్తులను ఇచ్చుటలేదు. గోవులు పుష్కలముగా బహుఘట పూర్ణములుగా పాలనిచ్చును. దూడలయందు ప్రీతి కలవి. శాంతిని కలిగించునవిగా యున్నవి. నాగలి దున్నకనే క్షేత్రములన్నియూ సస్యములు పెరిగి పండుచున్నవి. తల్లులలోను బాలతో శిశువులు పుష్టిని పొందుచున్నారు. భర్తల అనురాగముచే భార్యలు సంతుష్టలు. రాజులచే ప్రజలు, ప్రజలచే రాజులు పుష్టి తుష్టి కలవారుగా నుండిరి. సత్యముచే కూడిన ధర్మము పుష్టి నొందెను. శ్రీహరి యందు భక్తి కల ధర్మాంగద మహారాజు ధర్మప్రీతి కలవాడై పరిపాలన చేయుచుండగా ప్రజలు సంతోషముతో నుండిరి. కాలము సుఖదాయకముగా గడుచు చుండెను. లోకమంతయూ రోగ రహితము. సంపద్యుతము. వర్ష సమృద్ది ఉత్సవ సమృద్ధి కలిగియున్నది. రుక్మాంగద మహారాజు కూడా మోహినీ దేవి చేష్టలచే సౌఖ్యము కలవాడై మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజు మోహినీ మోహములో పరవశుడై పగలును, రాత్రిని, పక్షమును, మాసమును, సంవత్సరమును తెలియజాలక పొయెను. శుభకరముల చేష్టలు కల బ్రహ్మపుత్రికయగు మోహినీ సంగమమున మిక్కిలి మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజునకు మోహినీ సంభోగమున శక్తి అధికమాయేను. మోహినిని అనుభవించుచున్నపుడల్లా అతని బలము అధికముగా జొచ్చెను. శుక్ల పక్షమున చంద్రునివలే రుక్మాంగదునికి మోహినీ సంగమమున శక్తి ప్రతిదినము తరుగుట లేదు. అమృతపానమును చేసిన దేవతలవలె మోహినిని స్పృశించుచు స్పృశించుచు పునర్నవత్వమును పొందుచుండెను. మనోహరముగా పానము సేవించుచు మధుర పదయుక్తముగా గానమును వినుచు రూపవతుల రూపమును చూచుచు, మోహినీదేవి వక్రమును తాకుచు, ఉన్నతములు, సుఖముతో బాగుగా బలిసియున్న, మాంసముతో వృద్ధి చెందిన, బంగారు కలశముల వలెనున్న, హార భూషములచే కప్పబడియున్న మోహినీదేవి యొక్క ఘనములగు స్తనములను చేతితో మర్ధించుచు ఎక్కువగా పెరుగని త్రివళులను మనోహరముగా లోమశరాజి శోభితముగా నుండుటచే స్తనరూపమును పొందుటచే మోహినీ గాత్రములందు దృష్టిని నిలిపెను. బ్రహ్మ స్వయముగా మోహింప చేయుటకు స్త్రీలు మనసారా ఆశించు సుందర రూపమును మోహినికి సమకూర్చెను. యేనుగు తొండము వంటి పిక్కలు రోమ రహితముల కొంచన సన్నిభములు, పలువరుస చంద్రకాంతి సన్నిభములు, జనమోహకములగు నిగూఢగుల్పములు. సుందర విశాల నేత్రములు మోహినీదేవి యొక్క రూపమును ఆపాదమస్తకమును చూచుచు దేవతలందరిలో తానే అధికునిగా భావించెను. తనను కృతార్థునిగా తలించెను. ఆహా! ఈ సుందరి విశాలనేత్ర అడిగినదేదైనను తప్పక ఈయదగినది. సుందరమగు ఈమె సమాగమము కొరకు నా సంపదనంతటిని ఈయగలను. దుర్లభమైన దానినైనను, ఇతరులకు ఈయరానిదైను ఈమె కోరినచో ఈయదగినదే. ఈయరాని నా ప్రాణమును కూడా ఈయగలను. ఒక్క నాకుమారుని తప్ప ఇక దేనినైననూ ఈమె కోరినచో ఈయగలవాడను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ ప్రణయ వర్ణన మను పందొమ్మిదవ అధ్యాయము.
