నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

56 - పురుషోత్తమ మహాత్మ్యమ్

వసువు పలికెను :

శ్రీపురుషోత్తమ క్షేత్రమున మహాపుణ్య ప్రదమగు మరియొక తీర్థ వ్రజమును గూర్చి చెప్పెదను విముము. ఈ తీర్థ రాజ సందర్శనము పాపనాశకము. ఇచట అనన నామముతో నున్న వాసుదేవుని దర్శించి భక్తితో నమస్కరించి సర్వపాప వినిర్ముక్తుడై పరమ పదమును చేరును. శ్వేతగంగలో స్నానమాడి శ్వేతమాధవుని దర్శించవారు ఉత్తమగతిని పొందెదరు. మత్స్యనామముతో ఉన్న మాధవుని దర్శించిన వారు శ్వేతద్వీపమును పొందెదరు. తుషార ప్రతిముడు, శంఖచక్రగదాధరుడు, సర్వలక్షణ సంయుక్తుడు, పుండరీకాయతేక్షణుడు, శ్రీవత్స వక్షుడు, సుప్రసన్నుడు,చతుర్భుజుడు, వనమాలాకృతోరస్కుడు, ముకుటాంగదధారి, పీతవస్రుడు, సుపీనాంసుడు, కుండలాలంకృతుడు, అగు మత్స్య నామ మాధవుని దర్శించవలయును. శ్వేతగంగాజలమును కుశాగ్రముచే స్పృశించిననూ సావధానులగు విష్ణుభక్తులు స్వర్గమును చేరెదరు. ఇచట శశిప్రభగలది శంఖగోక్షీర సంకాశము, సకల పాపవినాశిని, యగు ఈ ప్రతిమను దర్శించి ఒకసారి భక్తిచే నమస్కరించి సర్వకామనలను విడిచి విష్ణులోకమున విరాజిల్లును. అచటనే అన్ని మన్వన్తరములు దేవకన్యలచే కూడి గంధర్వ గానములతో సిద్ద విద్యాధర పూజితుడై యధేష్టముగా దేవతలతో కలిసి సకల భోగములననుభవించును. పుణ్యక్షయమున ఆటనుండి భూలోకమున కొచ్చి మానవులలో బ్రాహ్మణునిగా పుట్టును. వేదవేదాంగములను తెలిసినవాడు, ధీమంతుడు, భోగి, దీర్ఘాయుష్యము కలవాడు, గజాశ్వరధవాహనముల పై వెళ్ళు వాడు, ధనధాన్య సమన్వితుడు, పవిత్రుడు, రూపవంతుడు, బహు భాగ్యవంతుడు, పుత్రపౌత్ర సమన్వితుడుగా నుండును. మరల పురుషోత్తమ క్షేత్రము చేరి సాగరమున నున్న వట వృక్షమూలమున శ్రీహరిని స్మరించుచు దేహమును విడిచి శాంతిధామమును చేరును. శ్వేతమాధవుని చూచి, తత్సమీపమున రోహిత రూపమును ధరించి వేద హరణము కొరకు రసాతలమున నుండెను. భూమి పై ఈ స్థానమున మత్స్య రూపముగా నున్న స్వామిని ధ్యానించి తరుణరూపముతో మత్స్య మాధవునిగా నున్న మత్త్యుని భక్తి చే నమస్కరించి సకల కష్టలములనుండి విముక్తుడగును. సాక్షి 'త్తుగా శ్రీహరీయున్న పరమ పదమును చేరును. యధాకాలమున మరల ఇటకొచ్చి భూమండలమున రాజుగా పుట్టును. మరల మత్స్య మాధవమును చేరి దురాధరుడగును. దాత, భోక్త, యోద్ద, విష్ణుభక్తుడు, సత్యపాలకుడు, అగును. తరువాత శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. ఇట్లు నీకు మత్స్య మాధవ మాహాత్మ్యమును వివరించితిని. ఈ క్షేత్రమును దర్శించిన వారు సర్వాభీష్టములను బడయగలరు.

ఇక ఇపుడు శుభప్రదమగు మార్కండేయ ప్రదమున చేయదగిన మార్జనమును వివరించేదను. ఈ మార్జనము భక్తిచే తన్మనస్కులై పుణ్యమును ముక్తిని ప్రసాదించు పురాతనమగు మార్జనమును చేయవలయును. మార్కండేయ ప్రదమున అన్నికాలములందు స్నానము విశేష ఫలప్రదముగా చెప్పబడినది. విశేషించి చతుర్దశీస్నానము సర్వపాపప్రణాశనముగా పేర్కొనబడినది. ఇట్లే సముద్ర స్నానము కూడా సర్వకాలములందు విశేష ఫలప్రదమే. పౌర్ణమిన సముద్రస్నానము అశ్వమేధ యాగ ఫలప్రదము. జ్యేష్ఠ పూర్ణిమన జ్యేష్ఠా నక్షత్రయోగమున్న నాడు విశేషించి ఈ తీర్థ రాజమునకు వెళ్ళ వలయును. కాయ వాజ్మానసములచే పరిశుద్దుడై, రాగమును వీడి, మాత్సర్యమును వదిలి, రమ్యమగు వట కల్ప వృక్షమును సాక్షాత్తుగా జనార్థన రూపమున నున్న దానిని సావధానముతో మూడు మార్లు ప్రదక్షిణము నాచరించవలయును. ఈ కల్ప వృక్షదర్శన మాత్రమున ఏడు జన్మల పాపములు నశించును. విపుల మగు పుణ్యము ఉత్తమ గతి లభించును. ఈ కల్ప వృక్షమునకు ప్రతియుగమున ప్రసిద్ధిని పొందిన నామములను చేప్పెదను. వటము, వటేశ్వరము, శాంతము, పురాణ పురుషుడు, ఈ నాముముల కృతాది యుగములందు చెప్పబడినవి. యోజనము, పాదహీనయోజనము, యోజనార్థము, తదర్ణము, కృతాదియుగములలో వట వృక్ష విస్తార ప్రమాణములు. పూర్వోక్త మంత్రముచే వట వృక్షమును నమస్కరించి, దక్షిణాభిముఖముగా మూడు వందల ధనుః ప్రమాణ దూరమును వెళ్ళవలయును. అచట మనోహరమగు స్వర్గ ద్వార చిహ్నము సాగరాంతర్గామమున ఆకర్షించబడు సర్వగుణాన్వితమగు కాష్ఠము కనిపించును. ఆ కాష్ఠమునకు నమస్కరించి చక్కగా పూజించి నిలువ వలయును. ఇట్లు ఆచరించినచోసర్వపాపముల నుండి పాపగ్రహాదులనుండి విముక్తుడగును. పూర్వ కాలమున ఉగ్రసేనుడు స్వర్గ ద్వారముచే సాగరమును సందర్శించి వెళ్ళి ఆచమనము చేసి శుచియై పరుడగు నారాయణుని ధ్యానము గావించి హస్త శరీర భాగములందు అష్టాక్షర మంత్రన్యాసమును గావించ వలయును. ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రమును జపించిన వారికి మనోవిభవ కారకములగు ఇతర మంత్రములచే పని యేముండును. ఓం నమో నారాయణాయ అను మంత్రము సర్వార్థసాధనము. జలములు నరసముత్పన్నములు కావున నారములనబడును. పూర్వము నారములే శ్రీ మహావిష్ణువునకు నివాస స్థానము కావున విష్ణువునకు నారాయణ నామము కలిగినది. వేదములు. నారయణ పరములు. బ్రాహ్మణులు నారాయణ పరులు. నారాయణ పరము జ్ఞానము. ప్రతికార్యము నారాయణ స్వరూపము. ధర్మము నారాయణ పరము. తపస్సు నారాయణ పరము. దానము నారాయణ పరము. వ్రతము నారాయణ పరము. సర్వలోకములు నారాయణ పరములు. దేవతలు నారాయణ పరులే. నిత్యము నారాయణ పరము. ప్రతిస్థానము నారాయణ పరము. భూమి నారాయణ పరమే. జలము అగ్ని, ఆకాశము, వాయువు నారాయణ పరములే. మనస్సు నారాయణ పరమే. బుద్ధి, అహంకారములు నారాయణ పరములే. భూతభవ్యభవిష్యత్తులు, సకల జీవ సంజ్ఞకములు, స్థూల సూక్ష్మములు, పరము అంతయూ నారాయణాత్మకమే. ఈ సృష్టిలో నారాయణునకంటే పరమైన దేదియూ లేదు. దృశ్యాదృశ్యము చరాచరమంతయు నారాయణునిచే వ్యాపించ బడియున్నది. శ్రీ విష్ణువునకు నివాసము జలములు. కావున శ్రీమహావిష్ణువు జలాధిపతి. కావుననే జలములలో శ్రీహరి యుండును. కావున నారాయణ స్వరూపములగు జలము సర్వపాపప్రణాశకము. విశేషించి స్నానకాలమున జలమున శుచియై నారాయణుని స్మరించి ధ్యానముచేసి హస్తములందు శరీరమునందు న్యాసమును గావించ వలయును. పోమకటియందు ఓంకారమును, దక్షిణకటియందు నాకారమును, నాభి దేశమున రాకారమును, వామ బాహువు నందు యకారమును, దక్షిణ భాహువు నందు సాకారమును, శిరస్సునందు యకారమును న్యాసమును చేయవలయును. అధోభాగమున, ఊర్థ్వ భాగమున హృదయమున, పార్శ్వములండు, పృష్ఠ భాగములందు, అగ్రభాగమున న్యాసమును కావించ వలయును. తరువాత నారాయణుని ధ్యానము చేసి, కవచము నారంభించవలయును.

పూర్వదిక్కున గోవిందుడు, దక్షిణమున మధుసూదనుడు, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున కేశవుడు కాపాడుగావుత. ఆగ్నేయమున విష్ణువు, నైరుతమున మాధవుడు, వాయవ్యమున హృషీకేశుడు, ఈశాన్యమున వామనుడు కాపాడు గావుత. భూతలమున వరాహస్వామీ, ఊర్థ్యమున త్రివిక్రముడు కాపాడు గావుత. ఇట్లు కవచమును ఆచరించి తరువాత ఆత్మస్వరూపమును చింతించవలయును. నేను శంఖచక్ర గదాధరుడగు నారాయణ దేవుడను. ఇట్లు ఆత్మ ధ్యానమును గావించి ఈ మంత్రమును పఠించవలయును.

అనునది మంత్రము. ఓద్విపాత్ పతీ! నీవు అగ్నివి. కామదీపకమగు రీతో నివాసము నీవే. సర్వభూతములలో ప్రధానుడవు. జీవులకు ప్రభువు నీవే. నీవు అవ్యయుడవు. అమృతమును ఉత్పత్తి స్థానము. దేవతలకు కారణ భూతుడవు. జలాధిపతివి నీవే. కావున నా సర్వ పాములను హరించుము. ఓ తీర్థ రాజా ! నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థము. ఇట్లు యధావిధిగా మంత్రమునుచ్చరించి తరువాత స్నానమును ఆచరించవలయును. ఇట్లు ఆచరించక చేసిన స్నానము సఫలము కాజాలదు. జలదేవతా మస్రములచే అభి షేకమును, మార్జనమును ఆచరించి నీటిలో అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించ వలయును. అశ్వమేధ యాగము సర్వపాహరమగునట్లు అఘమర్షణ సూక్తము సర్వపాపహరము. తరువాత జలమునుండి తీరమునకు వచ్చి దౌతములు నిర్మలమగు వస్త్రములను ధరించి, ప్రాణాయామము నాచరించి, ఆచమనము గావించి, సంధ్యావందనము చేసి సూర్యుని పూజించి, ఊర్థ్యమునకు పుష్ప జలాంజలిని చల్లి ఉపాసన గావించ వలయును. ఇట్లు ఉపస్థానము గావించి, ఊర్థ్వ బాహువుగా నిలిచి సూర్యుని ఆ చిహ్నములతో సేవించి, పరమ పవిత్రమగు గాయత్రీ మంత్రమును నూటా ఏనిమిది మార్లు జపించవలయును. సావధానముగా నిలిచి ఇతర సౌర మంత్రములను జపించి ప్రదక్షిణము నాచరించి, సూర్యునికి నమస్కరించి, కూర్చొని ప్రాజ్ఞునిగా స్వాధ్యాయమును అధ్యయనము గావించి దేవతలకు, మానవులకు తర్పణము గావించవలయును. స్వఋషులను, పితరులను యధావిధిగా నామగోత్రములతో నువ్వులు కలిపిన జలముచే తర్పణముగావించవలయును. హవన కాలమున, శ్రాద్ధ కాలమున ఒక హస్తముతో తర్పణము గావించవలయును. తర్పణమునుమాత్రము రెండు హస్తములచే చేయవలయును. ఇదియే అన్నివేళలలో విధి. సవ్యముగా అన్వారబ్దమగు దక్షిణహస్తముతో నామగోత్రములను చ్చరించి తృప్తి చెందుగాక అని పలికి. వాజ్నియమముచే, స్థిర కాయముచే తిలములచే తర్పణము గావించిన త్వఙ్మాంసరుధిరాస్తులచే తృప్తి పొందెదరు. నీటిలోఉండి భూమి పై నిచ్చిన తర్పణము, భూమి పై నుండి జలమున నిచ్చిన తర్పణము పితరులకు చేరదు. కావున భూమి మీద నిలిచి భూమి మీదనే తర్పణమును గావించవలయును. పితరులకు అక్షయ స్థానము భూమి అని బ్రహ్మ భూమిని ప్రదానముగావించెను. కావున పితరుల ప్రీతిని గోరువారు భూమి మీదనే తర్పణమును గావించవలయును. నీటిలోనుండియే భూమి పుట్టినది. భూమియందే జలముండును. భూమియందే జలము లీనమగును. కావున జలమును భూమియందే విడువవలయును. కొనలున్న దర్భలను భూమియందు పరిచి స్వస్వమంత్రములచే ఆవాహన చేయవలయును ప్రాచీనాగ్రములగు దర్బలందు దేవతలను, దక్షిణాగ్ర దర్బములందు పితరులను ఆవాహన చేయవలయున

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగమున మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబది యారవ అధ్యాయము.