నారద మహా పురాణము - ఉత్తరార్థము
9 - రుక్మాంగద ధర్మాంగద సంవాదః
సౌతిపలికెను :- రుక్మాంగదమహారాజు ఇహలోకమున మానుషభోగములను అనుభవించి, పీతాంబరధరుడగు శ్రీహరిని బహు విధములుగా పూజించి, రణశీలులగు శత్రువుల శిరస్సున పాదమునుంచి యమలోకమార్గమును శూన్యము గావించి, యముని గెలిచి, వైకుంఠమార్గమును మానవులతో సంపూర్ణము గావించి, సమయమును చూచి తనయుడగు ధర్మాంగదుని పిలిచి ఇట్లు పలికెను. ఓ పుత్రుడా? సమగ్రముగా వసుసంపూర్ణమగు సమస్తభూమండలమును ధర్మబుద్ధికలవాడవై నీపరాక్రమముతో పరిపాలించుము. సమర్థుడగు పుత్రునికి రాజ్యమునీయనివాని ధర్మము కీర్తి నశించును. సమర్థుడగు పుత్రునివలన సుఖమును పొందని తండ్రి ఈ మూడులోకములందు మహాపాతకియగును. తండ్రిభారమును భరించగల సామర్థ్యము ఉండి కూడా తండ్రి భారమును వహించని వాడు తల్లికడుపుకు బాధకలిగించు, విషరహితమగు సర్పము. తండ్రికంటే అధికమగు కీర్తిని సంపాదించిన పుత్రుడు సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేయునట్లు ఈలోకమును ప్రకాశింపచేయును. పుత్రుని అవినీతివలన రాత్రిపూట తండ్రి నిదురించనిచో ఆ పుత్రుడు ప్రళయకాలము వజకు నరకమున వసించును. తండ్రిమాటను ఆదరముతో ఇంటిలో ఆచరించుపుత్రుడు దేవతలచే స్తుతించబడుచు దేవసాయుజ్యమును పొందును. కావున పుత్రా! నేను ప్రజారక్షణార్థము భూమండలమున కర్మలలో ఆసక్తుడనై నిదురించలేదు. భుజించలేదు. స్వేచ్చగా పాలనలో ఉంటిని. నీవు అసమర్థునిగా ఉన్నపుడు నేను సుఖమును బొందలేదు. విష్ణు వాసరమున భుజించువారిని నిగ్రహించుటలో ప్రయత్నించితిని. ప్రజలలో కొందరు శివభక్తి పరాయణులు, కొందరు సూర్యభక్తులు, కొందరు బ్రహ్మభక్తులు, మరికొందరు పార్వతీభక్తులు. ప్రాతఃకాలము సాయంకాలము ఆసీనులై అగ్నిహోత్రముల నాచరించుచు ఉండిరి. బాలుడు కాని వృద్ధుడు కాని వృద్దురాలుకాని కుమారి కాని, రోగి కాని, అంగవికలులుకొని, ఉపవసించలేరు అని చెప్పువారిని నిరసించి పురాణవచనములచే చాలాదినములు బోధించి ప్రభోదించి, ప్రజాసుఖముకొరకు, నిగ్రహించి హరివాసరమున నిరాహారులను చేయుచున్నాను. విద్వాంసులను శాస్త్రదృష్టిచే, దండన పూర్వకముగా మూర్ఖులను శాసించి హరివాసరమున అందరిని నిరాహారులను చేసితిని. కావున ఈ భూమిమండలమున నేను సుఖముననుభవించలేదు. అయిననూ ప్రజలను కష్టములపాలుచేయరాదు. తనవారి నుండి ఇతరులనుండి వచ్చు కష్టములనుండి ప్రజలను కాపాడు రాజునకు అన్నిలోకములు అక్షయములని పురాణములలో చెప్పబడినది. కావున నేను ప్రజలకొరకే వ్యవహరించితిని. నా సుఖముకోరకు కాదు. ఇపుడు వేట మొదలగు విహారముల వలన కలుగు ఆనందమును అనుభవించదలచితిని. అంతేకాని పానమును ద్యూతమును నేనెపుడూ అభిలషించను. పానద్యూతములలో ఆసక్తుడగు మానవుడు త్వరలో నాశమును పొందును. కావున నీ ప్రీతివలన ఇపుడు నేను వేట అను మిషతో పర్వతములను అడవులను నదులను, బహువిధ సరస్సులను చూచుచు తిరుగుచు ఆనందమును అనుభవించదలచితిని. ఇట్లు నా హృదయమున కల అభి ప్రాయమును సమగ్రముగా తెలిపితిని. ఇట్లు చేసినచో నీకు గొప్పకీర్తి. చేయనిచో నరకప్రాప్తి యుండును.
ధర్మాంగదుడుపలికెను :- ఓ తండ్రీ! మీరు చెప్పిన దంతయూ చేయగలను. మీకునచ్చిన భోగములను అనుభవించుడు. మీరు వహించు రాజ్యభారమును నేను తీసుకొని మా భారమును తొలగింతును. నాకు మీ ఆజ్ఞను పాటించుట కన్నా మరియొక ధర్మము తెలియదు. ఎన్ని ధర్మములనాచరించువాడైననూ పితృవాక్యమును పరిపాలించని వాడు అధోగతిని చెందును. కావున చేతులు జోడించి మీ ఆజ్ఞను పాటింతును. ఇట్లు ధర్మాంగదుడు పలుకగా రుక్మాంగద మహారాజు సంతోషించెను. చాలా మృగములున్న అరణ్యములను తెలుసుకొని వెళ్ళదలచేను. ధర్మాంగదుడు కూడా సంతోషముచే ప్రజలను పిలిచి ఇట్లు పలికెను. మీకు హితమును కూర్చి పరిపాలించమని తండ్రి గారిచే నియమించబడితిని. ధర్మమును కోరి నేను పితృవాక్యపరిపాలన గావించవలయును. ఓ ప్రజలారా! పుత్రునికి పితృవాక్యపరిపాలనను మించిన వేరొకధర్మములేదు. నేను దండధరుడనై పాలించుచుండగా ఎచటా యమధర్మరాజు కనపడకూడదు. ఈ విషయమును తెలిపి మీరు శ్రీహరిని స్మరించవలయును. బ్రహ్పార్పణ విధానముతో జనార్ధనుని పూజించవలయును. మమకారమును విడిచి స్వస్వజాతివిహితములైన ధర్మములననుసరించి పూజించినచో మాలోకములు అక్షయ లోకములు లభించును. ఇది పితృమార్గమునకంటే ఉత్తమమార్గమును మీకు చూపితిని. జ్ఞానకోవిదులందరూ బ్రహ్పారణక్రియలను ఆచరించుడు. హరివాసరమున భుజించరాదు. దీనివలన పితృమార్గము శాశ్వతము కాగలదు. మి బ్రహ్మస్థితిని విశేషముగా సూచించితిని. కావున తత్త్యమును తెలిసినవారు పునరావృత్తి రహితమగు విధానమును అనుసరించుడు. హరివాసరమున తప్పక ఉపవసించవలయును. ఇట్లు ప్రజలందరికి బోధించి వారిని ఓదార్చి పంపెను. ధర్మాంగదుడు రాత్రికాని పగలుకాని నిదురించుటలేదు. తన శౌర్యముతో భూమిని నిష్కంటకముగా చేయుచు అంతటా తిరుగు చుండెను. ఏనుగు కుంభస్థలము పైన భేరిని మ్రోగించుచుండెను. హరీవానరమున భుజించక మమకారరహితులైమనోవాక్కాయకార్యములందు దేవేశుని చింతించు చుండవలయును. శ్రీహరియేహవ్యమును కవ్యములను వహించువాడు. సూర్యోదయకాలమునుండి అన్నికాలములలో శ్రీహరిని స్మరించవలయును. ధర్మార్థకామములను కోరువారందరు శ్రీహరిని స్మరించవలయును. స్వజాతివిహితమగు ధర్మము కూడా నిదియే. ఇదియే సన్మార్గముకూడా. శ్రీమన్నారయణుడే భోక్త. భోగ్యముకూడా ఆపురుషోత్తముడే. సర్వకర్మలలో అతనికే వినియోగమును చేయవలయును. ఇట్లు బ్రాహ్మణోత్తములు భేరిపై చాటించుచుండిరి. ఇట్లు రుక్మాంగదుడు ధర్మాంగదుడాచరించు ధర్మమునుచూచి, క్రియాయుక్తుడగుపుత్రుని చూచి సంతోషముతో అపరలక్ష్మివలె నున్న భార్యను చూచి ఇట్లుపలికెను. ఓ సంధ్యావలీ! నేను ధన్యుడను. నీవు కూడా ధన్యురాలివి. మనిద్దరికి కలిగిన పుత్రుడు ఈ భూమండలమున చంద్రునివలె స్వఛ్ఛ ముగా ప్రకాశించు చున్నాడు. ఇంతవరకు ఎవరైననూ మోక్షమును చేవులతో వినిరే కాని కనులతో చూచియుండలేదు. కాని సత్పత్రుని వలన ఆమోక్షమును మనము పొందగలిగితిమి. పుత్రుడు వినయసంపన్నుడు చక్కని నడవడి శౌర్యము కలవాడు, ప్రతాపము కలవాడైనచో తండ్రికి ఇంటిలోనే మోక్షముకనబడును. ఆనందము బ్రహ్మస్వరూపము. పుత్రునిచే శతానందమును సత్కర్మలను శుభకర్మలను చేయు తండ్రియే పొందును. స్థావర జంగమాత్మకమగు ఈప్రపంచమున తండ్రిభారమును వహించు పుత్రునితో సమానమగునది వేరొకటిలేదు. కావున నేను ప్రజారక్షణకొఱకు పాపవిముక్తుడనై సంతోషముతో మృగములను శిక్షించుటకు విహారశీలినై అరణ్యమునకు వెళ్ళెదను. స్వేఛ్ఛగా అంతటా సంచరించెదను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున రుక్మాంగద ధర్మాంగద సంవాదమను తొమ్మిదవ అధ్యాయము.
