నారద మహా పురాణము - ఉత్తరార్థము
12 - సమయకరణమ్
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు మోహిని హృద్యముగా మాటలాడగా పద్మముల వంటి నేత్రములను తెరిచి, మోహినిని చూచుటచే ముగ్ధుడై గద్గద స్వరముతో నిట్లు పలికెను. ఓ బాలా నేను చాలా మంది సౌందర్యవంతులను చూచియుంటిని. అనుభవించి యుంటిని. కానీ, ఇంతటి సుందర దేహమును చూచి యుండలేదు. నీవు ధరించిన రూపము లోకమోహనము. ఇట్టి నీ రూపమును చూచినంతనే మన్మధ బాణములచే కొట్టబడి భూమిపై పడితిని. నీ తేజస్సుచే మోహించబడి మాటలు వచ్చుట లేదు. కావున ఓ కర భోరూ? నా యెడ ప్రసన్ను రాలవు కమ్ము. నీ మనసులో నున్నదంతయూ ఇచ్చెదను. నీ అనురాగముచే బద్ద చిత్తడగు వానికి ఈయరానిదేదియు నుండదు. భూధర భూషితాంగి, సముద్ర వస్త్ర, శశిసూర్యనేత్ర, ఘనస్తని, వ్యోమ సుబద్ద దేహ, నిష్కానన, వామశీల, పాతాలగుహ్య, బహువృక్ష రోమ, సప్తధర, సకోశబద్ద, గజవాజిపూర్ణ, సమన్త్రి హృద్య, నగర సమేతయగు ఈ భూమినీయగలను. నీ సంగమముకొరకు నన్ను కూడా ఇచ్చుకోగలను. ఇక ధనరత్నముల గూర్చి చెప్పనేల? కావున నా యెడ ప్రసన్నురాలవు కమ్ము. అనగా రాజును లేపి, మధురమగు మాటలతో ఇట్లు పలికెను. ఓ రాజా? పర్వతములతో కూడియున్న భూమిని నేనడుగుట లేదు. సమయమొచ్చినపుడు నేను చెప్పిన పనిని శంకించక చేయవలయును. అపుడు సందేహము లేకనే నిన్ను సేవించెదను. అట్లు శపథమును చేయుము.
రాజు పలికెను :-
ఓ దేవీ ! నీవే శపథముచే తృప్తి చెందదవో ఆ శపథమును చేసెదను. నీ సంగమము లేనిచో నా శరీరము దశావస్థలను పొందుచున్నది.
మోహినిపలికెను:- ఓరాజా? అనేకధర్మములనాచరించియున్న నీదక్షిణహస్తమును నాచేతిలోనుంచుము. అపుడు నీమాటపై నాకు విశ్వాసము కలుగును. ఈ మూడు జగములలో నీవు ధర్మశీలుడవగురాజువు. సత్యకీర్తివి. అవసరమున్నపుడు కూడా అసత్యమును మాటలాడవు. ఇది లౌకికమార్గము. ఇట్లు మోహిని పలుకుచుండగా కామముచే పీడించబడు రాజు సుప్రసన్నమగు మనసుతో ఇట్లు పలికెను. ఓ వామోరూ? నేను పుట్టిన నాటినుండి యధేచ్ఛావిహారములలో కూడా ఎపుడూ ఆ బద్ధమును మాటలాడలేదు. అయినను ఈనమ్మకమును కలిగించువట్టిమాటలేల? ధర్మమునకు చిహ్నమగునా ఈ దక్షిణహస్తమును ఇచ్చుచున్నాను. నేను నీమాటను చేయనిచో పుట్టిన నాటినుండి నేను చేసిన పుణ్యకర్మలఫలమంతయూ నీకు చేరును. ఇదిగో నాహస్తమునిచ్చుచున్నాను. ధర్మబద్ధముగా నాకు భార్యవు కమ్ము. నీరూపముచే నాకు తాపము కలుగుచున్నది. నేను ఋతధ్వజునిపుత్రుడను. నాపేరు రుక్మాంగదుడు. ఇక్ష్వాకువంశ సంభూతుడను. నాపుత్రుడు ధర్మాంగదుడు. నేను వేటయను మీషచే అరణ్యమునకు వచ్చితిని. ఆయరణ్యమున సుందరమగు వామ దేవమహర్షి యాశ్రమమును చూచితిని. అచట వామదేవమహర్షి నీకు అన్నియు సమకూరునని చెప్పెను. అటనుండి అశ్వమునధిరోహించి మందరపర్వతమున తిరుగుచుండగా నీగానము నాచెవిన బడినది. ఆగానముచే ఆకర్షింపచబడి నీసమీపమునకు చేరితిని. నీవు నాచూపున పడితివి. అంతట నేను స్పృహను కోల్పోయి మూర్ఛిల్లితిని. నీవాక్యామృతముచే ఇపుడే స్పృహ వచ్చినది. ఓలోకమోహినీ నాకు మరల జన్మ లభించినదని తలచుచున్నాను. నామాటలకు బదులు పలికి నన్ను అనుగ్రహించుము. రాజిట్లుపలుకగా మోహినీదేవి ఈవిధముగా బదులుపలికెను. నేనుబ్రహ్మమానసపుత్రుని. నీకొరకే ఇటకొచ్చితిని. నీకీర్తిని విని మదనపీడితనై మందరపర్వతమునకు వచ్చితిని. బ్రహ్మ మొదలగు దేవతలనందరిని విడిచివచ్చితిని. ఇచట సావధానమగు మనసుతో తపస్సును చేయుచున్నాను. శంకరుని గీత దానముచే పూజించుచున్నాను. గీతదానము దేవతలకు అతిప్రియమని తలచుచున్నాను. ఈగీతదానము అన్నిదానములలో ఉత్తమదానము అనన్తమగు మోక్షమును ఇచ్చునది. ఈగీతదానము. ఆనన్తమగు మోక్షమును ఇచ్చునది. ఈగీతదానముచే శంకరుడు ప్రీతిచెంది వెంటనే ఉపకార మును చేయును. నేను కోరిన రాజువగు నీవు నన్ను చేరితివి. నన్ను మెచ్చితివి. నేనుకూడా నిన్ను వరించుచున్నాను. ఇంద్రుని యష్టివలె నున్న యామోహిని రాజుతోఇట్లుపలికి భూమిమీద పరుండి యున్న రాజును చేయిపట్టుకొని లేపెను.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున ఉత్తరభాగమున సమయకరణమను పన్నెండవ అధ్యాయము.
