నారద మహా పురాణము - ఉత్తరార్థము
22 - కార్తిక మాహాత్మ్యమ్
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు ధర్మాంగద మహారాజు తండ్రి ఆజ్ఞచే హరివాసరమును పాలించుచు రాజ్యమును చేయుచుండెను. ధర్మాంగదుని రాజ్యమున ధర్మమున నిలువని వాడొకడు కూడా లేకుండెను. సుఖము లేనివాడు కాని, సంతానము లేని వాడుకాని రోగికాని అతని రాజ్యమున లేకుండెను. ధర్మాంగదుని రాజ్యములోని ప్రజలందరూ సంతోషముతో నుండిరి. భూమి నిధుల నిచ్చుచుండెను. ఆవులు తన దూడలను తృప్తి పరిచి ఘటముల కొలది పాలనిచ్చుచుండెను. ప్రతి పుటమున తేనె ద్రోణ మాత్రముగా ప్రతి వృక్షమున లభించుచుండెను. భూమి సంతోషముతో సర్వవిధ ధాన్యముల నిచ్చుచుండెను. త్రేతాంతమున ద్వాపర యుగమున కూడా కృత యుగముతో పోటీపడుచుండెను. వర్ష ఋతువు గడిచి ఆకాశము నిర్మలముగా నుండెను. సుగంధము కలపైరులు పంటకొచ్చి ప్రకాశించుచుండెను. అంతటా నదులు మధ్యమ ప్రవాహములు కలిగి యుండెను. నదీ తీరములలో మొలచి పూచిన కాశపుష్పములచే తెల్లని వెంట్రుకలు గల స్త్రీవలె శోభించెను. లోకమంతయూ చంద్రకాంతివలె తెల్లనాయెను. దివాకరుడు ఎక్కువ తీవ్రముగా లేడు. ఆ సమయమున చాలా మంది ప్రజలు తీర్థ స్నానములను బయలు దేరిరి. అంతటా రాజులు విజయ యాత్రకు బయలుదేరిరి. ఆశ్వయుజ మాసాంతమున జగద్గురువగు శ్రీ మహా విష్ణువు యొక్క ప్రబోధ సమయమున మోహినీ దేవి కామ పీడితయై సర్వ భావముచే బహు విధ సౌఖ్యములతో రుక్మాంగద మహారాజును రమింప చేసెను. వనములలో, పర్వత శిఖరములలో, నదీ సంగమములలో పద్మములతో కూడియున్న సరస్సులలో, మలయ పర్వతమున, మందర పర్వతమున, వింధ్యపర్వతమున, మహేద్ర పర్వతమున, విబుధాలయమున, సహ్య పర్వతమున, హిమవత్పర్వతమున,కైలాస పర్వతమున ఇతర పర్వత ప్రాంతములందు, స్వర్గ స్థానాదులలో దివ్య రూపము గల మోహిని ప్రతి దినము రాజును రమింప చేసెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినిని పొంది అన్ని పనులను వదిలెను. కాని ఒక ఏకాదశీ వ్రతమును మాత్రమును ఉపేక్షించలేదు. దశమి నుండి మూడు దినములు రాజు మోహినితో క్రీడించుట ఆపివేయును. ఇట్లు రుక్మాంగదుడు క్రీడించు చుండగా సంవత్సరము గడిచినది. అంతట కాలజ్జులకు శ్రేష్ఠము శుభప్రదమగు కార్తీక మాసము వచ్చినది. శ్రీ మహా విష్ణువునకు నిద్రను తొలగించునది కావున కార్తిక మాసము పుణ్యదాయకము. ఈ మాసమున విష్ణు భక్తులగు మానవులు చేయు సుకృత మంతయూ అక్షయ మగును. విష్ణులోక ప్రదాయక మగును. కార్తీక మాసముతో సమానమగు మాసము లేదు. కృతయుగముతో సమానమగు యుగము లేదు. దయా తుల్యమగు ధర్మము లేదు. కంటితో సమమగు వెలుగులేదు. వేద సమమగు శాస్త్రము, గంగా సమమగు తీర్థము, భూదాన సదృశమగు దానము, భార్యా సమమగు సుఖము, కృషి సమమగు ధనము కామధేనువు వంటి లాభము, ఉపవాసమున కంటే వేరు తపము, అంతరింద్రియ నిగ్రహము వంటి శుభము, జిహ్వ వలన పొందు తృప్తి వంటి తృప్తి. బ్రాహ్మణ సముడు, ధర్మముతో సమమగు మిత్రుడు, సత్యముతో సాటివచ్చు యశము, ఆరోగ్యముతో సమానమగు ఐశ్వర్యము, కేశవుని మించిన దైవము, కార్తీకముతో సమానమగు పావనమైనది ఈ లోకమున ఇంకొకటి లేదు. కార్తికము చాలా ఉత్తమమగు మాసము. విష్ణువునకు కూడా ప్రియమగు మాసము. దామోదర ప్రియమగు. కార్తిక మాసమును ప్రతరహితముగా గడిపిన వాడు సర్వధర్మ బహిష్కృతుడై పశువుగా జన్మించును.
మాంధాత పలికెను :-
రుక్మాంగద మహరాజు కార్తిక మాసము రాగానే మోహముతో నున్న మోహినిని ఎట్లను భవించెను? విష్ణుభక్తుడు, శ్రుతిపరుడు, రాజులలో ఉత్తముడు, పుణ్యతమమగు కార్తీక మాసమున ఏమి చేసెను?
వసిష్ఠ మహర్షి పలికెను :-
హరిని మేల్కొల్పు కార్తిక మాసము వచ్చుట చూచిన ముగ్గుడగు రాజేంద్రుడు మోహినితో ఇట్లు పలికెను. ఓదేవీ! నీతో చాలా సంవత్సరములు రమించితిని. నీ కవమానము కలుగునను భయముచే నేనేమియు అనలేదు. కాని ఇపుడు చెప్పదలుచుకున్నాను. తెలియుము. నీతో కలిసియున్న నాకు చాలా సంవత్సరములు చాలా కార్తికములు గడిచినవి. ఒక ఏకాదశీవ్రతము తప్ప కార్తిక మాసము వ్రత రహితముగా గడిచినది. కావున ఈ కార్తికమును వ్రతముతో సేవించదలుచుకున్నాను. కార్తికమును వ్రత రహితముగా గడిపిన మానవులు ఆచరించు ఇష్టా పూర్త ధర్మములు కూడా వ్యర్థములు. వేట యందాసక్తి గల, మాంస భుజులగు రాజులు కూడా కార్తీక మాసమున మాంసమును విడిచి విష్ణులోకమును చేరిరి. సామాన్యముగా భుజించు వాటిని కార్తీక మాసమునవిడిచినచో విష్ణు రూపమును పొందెదరు. ఎంత ధనమున్ననూ, హృదయమునకు ఆయాసమును కలిగించు దానములెన్ని యున్ననూ కార్తీక మాసమున దీప దానముతో స్వర్గమును పొందును. ఆ దీపదానము చేయలేనివాడైనచో భక్తి భావముతో పరుల దీపమును వెలిగించవలయును. ఇట్లు సరదీప ప్రబోధనము సర్వదానాధికమని జ్ఞానులు చెప్పుచున్నారు. అన్ని దానములు ఒకవైపు, దీపదానము మరియొక వైపుంచినచో దీపదానము సర్వశ్రేష్టము. కార్తీక మాసముతో సమానమగునది, దీప దానమున కంటే ఉత్తమమగునది. పరదీప ప్రభోధనము. కావున భక్తి భావముచే పరదీప ప్రబోధనమును గావించిన సర్వదానాధిక ఫలమును పొందును. శ్రీ విష్ణు నాభి సరోరుహము నందు కార్తిక తిధిని గావించి జన్మ నుండి చేసిన అన్ని పాపముల నుండి విముక్తి పొందును. ఈ విషయమున సంశయముతో పనిలేదు. కార్తీక మాసమున ప్రజోపవాస నియమములతో గడుపువాడు దేవ విమానముచే ఉత్తమగతిని పొందును. కావున ఓ మోహినీ ! నీవు నా యందు మోహమును విడిచి వెంటనే నాకు అనుజ్ఞ నొసగుము. కార్తిక వ్రతము నాచరించెదను. ఓ పంకజాక్షీ ! నీ స్తనముల పూజను విరమించి వ్రతధరుడనై శ్రీ హరిని పూజించెదను.
మోహిని పలికెను :-
ఓ రాజ సత్తమా? ఈ కార్తిక మాసము సర్వపుణ్యకరమనీ చెప్పితివి కదా? కావున కార్తీక మాస మాహాత్మ్యమును సవిస్తరముగా తెలుపుము. ఈ కార్తిక మాస వ్రతము, మాహాత్మ్యము విశేషముగా ఎక్కడ చెప్పబడినదో చెప్పుము. కార్తిక మాహాత్మ్యమును విని నా ఇష్ట ప్రకారముగా నాచరింతును.
రుక్మాంగద మహారాజు పలికెను :-
ఓ సుందరముఖీ ! కార్తిక మాస మహాత్మ్యమును తెలిపెదను. అపుడు నీకు శ్రీహరిని పూజించుటలో భక్తి కలుగును. కార్తీక మాసమున కృఛ్ఛ్ర వ్రతము నాచరించువాడు, లేదా ప్రాజాపత్యము నాచరించువాడు, ఏకాంతరోపవాసమును చేయువాడు, త్రిరాత్రములు పవసించువాడు, దశాహము కాని పక్షముకాని, మాసముకాని ఉపవాసముతో గడుపువాడు శ్రీహరి యొక్క పరమ పదమును పొందును. ఏక భుక్తము నాచరించుటచే అనగా రాత్రి మాత్రమే భోజనము చేయువాడు, అయాచిత వ్రతము నాచరించువాడు కూడా శ్రీ హరీ పదమును పొందును. ఈ మాసమున భూమియందు దీపమాలను చేయువాడు, విశేషించి పుష్కర తీర్థమున కొని, ద్వారవతి యందుకాని, వారాహ క్షేత్రమున కాని ఆచరించుట పరమ పదమును ప్రసాదించును. ఈ కార్తిక మాసము వ్రత దానార్చనాదులచే విశేషభక్తి ప్రదము. ఈ కార్తికమున ఏకాదశి మరీ పుణ్య ప్రదము. భీష్మ పంచకము విశేష ఫల ప్రదము. జాగరణతో ఈ మాసమున ఏకాదశీ వ్రతము నాచరించువాడు ఎంత పాపము నాచరించిన వాడైననూ, మరల తల్లి కడుపులో నుండడు. ఈ ఏకాదశినాడు సాంఖ్య యోగము లేకనే మండలమును చూడగలవాడు పరమ పదమును పొందును. కార్తిక మాసమున మండలమును చూచి, లేదా వరాహ క్షేత్రమున వరాహ స్వామిని దర్శించి, లేదా కేక వరాహమును దర్శించి, మరల జన్మ పొందడు. కాయిక వాచిక మానసీక పాపముల నుండి విముక్తుడగును. కుబ్ధ క్షేత్రమున శ్రీధర మండలమును దర్శించవలయును. కార్తిక మాసమున తైలమును, తేనెను, మాంసమును, స్త్రీలను పరిత్యజించ వలయును. విష్ణుతత్పరుడు కార్తిక మాసమున నిష్పావములను పరిత్యజించవలయును. ఇట్లు చేసినచో సంవత్సరకాలమున చేసిన పాపముల నుండి విముక్తుడగును. పొరబాటున ఒకమారు భుజించినచో రాజ వంశమున పుట్టును. కార్తిక మాసమున సూకర మాంసమును భుజించువాడు అరువది వేల సంవత్సరములు గౌరవ నరకమున పాకము గావించబడును. అటనుండి వెలువడి మలమును భుజించు గ్రామ సూకరముగా పుట్టును. కార్తీక మాసమున మాంసమును భుజించిన వాడు చండాలునిగా పుట్టును. కొద్ది వ్రతమును స్వీకరించిననూ కార్తీక మాసము సర్వపాపములను నశింప చేయును. కార్తిక మాసమున వ్రతమును స్వీకరించినవానికి మరల జన్మయుండదు. కావున సర్వవిధ ప్రయత్నములచే కార్తీక మాసమున వ్రతమును స్వీకరించవలయును. వ్రతమును స్వీకరించనివాడు చేయునదంతయూ వ్యర్థమగును. కార్తిక మాసమున దీక్షను స్వీకరించని వాడు పశువుగా పుట్టును. కార్తీక మాస వ్రతమును గృహమున ఆచరించరాదు. కార్తికీతిధిని విశేషించి ఆచరించరాదు. తీర్థమున కార్తికీతిధిని ఆచరించినవాడు శ్రీహరి పదమునుచేరును. కార్తిక శుక్ల ఏకాదశినాడు వ్రతము నాచరించి, ద్వాదశి ప్రాతః కోలమున శుభకరములగు కలశములను దానము గావించి, శ్రీహరి మందిరమును చేరును. సంవత్సర కాలము వ్రతముల నాచరించువారికి కూడా సమాప్తి చేయవలసిన కాలము కార్తికమాసమని చెప్పియుండిరి. శ్రీహరి నాభిసరోరుహము నందు, ఈ మాసమున అయిదు దినములు వివాహమునకు ప్రశస్తములు. ఉత్తరాయణ కాలముకాకున్ననూ, లగ్న శుద్ధి లేకున్ననూ, వివాహములు జరిగినచో పుత్రపౌత్ర ప్రవర్ధకములు. కావున ఓ మోహినీ ! కార్తీక మాసమున అశేష పాపనాశము కొరకు, నీకు ప్రీతి పెరుగుట కొరకు వ్రతమును స్వీకరించెదను.
మోహినీ దేవి పలికెను :-
సాటిలేని కార్తిక మాహాత్మ్యమును తెలిపితిని. అటులే చాతుర్మాస్య వ్రత విధిని ఉద్యాపనను కూడా తెలుపుము. ఓ రాజా? వ్రతములు ఏ విధానముచే పరిపూర్ణములగును. ఏ విధానముచే వ్రతము యొక్క పుణ్య ఫలము వ్యర్థము కాదో ఆ విధానమును కూడా తెలుపుము.
రుక్మాంగద మహారాజు పలికెను :-
ఓ ప్రియురాలా? ఏక భుక్తము చేయుచు రాత్రి భోజనము చేయువారు బ్రాహ్మణుని షడ్రసములచే భుజింప చేయవలయును. అయాచీత వ్రతము నాచరించినవారు బంగారముతో వృషభమును దానము చేయవలయును. మాంసాహారమును త్యజించిన వారు దక్షిణతో గోదానమును గావించవలయును. ధాత్రీస్నాన వ్రతము నాచరించిన వారు దధిపాయసములను దానము గావించవలయును. ఫలనీయము నాచరించు వారు ఫలదానమును గావించవలయును. తైలమును త్యజించినవారు ఘృతమును, ఘృతమును త్యజించినవారు పాలను దానము చేయవలయును. ధాన్యమును పరిత్యజించినవారు శాలి దానమును కొని వదిలిన ధాన్యమును కాని దానము చేయవయలును. భూశయనము నాచరించినవారు తూలికా గండకాన్వితముగా శయ్యాదానమును చేయవలయును. పత్ర భోజన వ్రతము నాచరించినవారు ఘృత సహితమగు భోజన పాత్రను దానమును చేయవలయును. మౌన వ్రతము నాచరించినవారు బంగారముతో ఘంటనుకొని తిలలను కాని దానము చేయవలయును. దంపతులను భుజింపచేసి ఇద్దరికీ శయ్యను సకలభోగములతో దక్షిణతో వ్రత పరిపూర్తికీ దానము గావించవలయును. ప్రాతస్నాన వ్రతముల నాచరించినవారు అశ్వదానమును, స్నేహ వ్రతము నాచరించిన వారు ఘృతసక్తులను దానమును చేయవలయును. నఖములను కేశములను ధరించినవారు దర్పణ దానమునుచేయవలయును. పాదరక్షలను త్యజించినవారు పాదత్రాణములనే దానమును చేయవలయును. లవణ త్యాగము చేసినవారు గోదానమును చేయవలయును. మాంసమును త్యజించినవారు దూడతోపాటు కపిలా దానమును చేయవలయును. నిత్య దీప దాన వ్రతము నాచరించినవారు అభీష్ట వ్రత పరిపూర్తి కొరకు కాంచన దీప పాత్రనుకొని, తామ్ర దీప పాత్రను కాని ఘృత సహితముగా దీప దానమును చేయవలయును. వస్త్రములను ఛత్రమును కూడా శ్రీహరి భక్తునకు దానము చేయవలయును. ఏకాంతరోపవాస వ్రతము నాచరించినవారు క్షౌమ వస్త్రమును దానము చేయవలయును. త్రిరాత్ర వ్రతము నాచరించినవారు కాంచన సహితముగా సాలంకృత శయ్యా దానమును చేయవలయును. షడాత్రోపవాస వ్రతము నాచరించినవారు ఛత్ర సహితమగు శిబికను (పల్లకిని) వాహ పురుషులతో పాటు మినమును వృషభమును దానమును చేయవలయును. ఏకభుక్త వ్రతమునాచరించినవారు అజావికాది దానములను చేయవలయును. ఫలహార వ్రతము నాచరించినవారు సువర్ణదానమును చేయవలయును. శాకాహార వ్రతము నాచరించినవారు సువర్ణ సహితముగా ఘృత దానమును చేయవలయును. సర్వరసత్యాగమును చేసినవారు, చెప్పని వాటిని త్యజించిన వారు కూడా తమ శక్తి కొలది రజిత పాత్రను కాని, సువర్ణపాత్రను కాని దానము చేయవలయును. యధోక్త విధిగా దానమును చేయనివారు, యధోక్త విధి నాచరించని వారు కూడా విష్ణుస్మరణ పూర్వకముగా ప్రియ వాక్యములను పలుకవలయును. బ్రాహ్మణ వాక్యములను వ్యర్థమని భావించువారు, దక్షిణా దానము చేయని వారు కూడా నరకమును పొందెదరు. ప్రతలోపమును పొంది కుష్టురోగిగా కాని అంధునిగా కాని పుట్టును. బ్రాహ్మణుల వ్యాకములలోనే దేవతలు పుణ్యతీర్థములు, యజ్ఞములు నిలిచియున్నవి. కావున విద్వాంసుడెవ్వడు బ్రాహ్మణ వాక్యమును లంఘించ జాలడు. శ్రేయస్కాముడు కూడా అతిక్రమించజాలడు. పూర్వకాలమున శ్రీ హరి బ్రహ్మకు తెలిపిన పరమ రహస్యయుతమగు ఈ వ్రత విధానమును నీకు తెలిపితిని. ఈ విధానమును నీకు తెలిపితిని. ఈ విధానమును అందరికీ తెలుపరాదు. ఈ వ్రతము ఫల ప్రదము. శ్రీహరి సంతోషకారణము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున కార్తీక మహాత్మ్యమను ఇరువది రెండవ అధ్యాయము.
