నారద మహా పురాణము - ఉత్తరార్థము
40 - స్థలవిశేష స్నానఫలకథనమ్
వసువు పలికెను:- ఇక ఇపుడు ఆయా కాల విశేషములలో చేయు గంగా స్నానఫలమును చెప్పెదను. సావధానముగా వినుము. గంగానదిలో నిరంతరము మాఘస్నానమును చేయువాడు తన గోత్రము వారితో కలిసి ఇంద్రలోకమున నివసించును. యధావిధిగా నిరంతర గంగాస్నానమును చేయువారు కల్పకోటి శతాయుతములు బ్రహ్మలోకమున నివసించును. ఆరు నెలలు ఒకపూట భోజనము చేయుచు ఉత్తరాయాణ కాలమున ఒకమారు గంగా స్నానమును చేయువారు నూరు తరములను ఉద్దరించి విష్ణులోకమును చేరును. అన్ని సంక్రమణ కాలములలో గంగా జలమున స్నానము చేయువారు ఆరవర్ల విమానముతో విష్ణుమందిరమును చేరును. విషువ ఆయన సంక్రాంతులలో గంగా స్నానము విశేష ఫలప్రదము. కార్తీక మాసమున గంగా స్నానము తపస్సమఫలప్రదము. మేష సంక్రమణ కాలమున సూర్యోదయ కాలమున చేయు గంగాస్నానము మాఘస్నానాధిక ఫలప్రదమని బ్రహ్మాదులు చెప్పీయున్నారు. ఆక్షయతిథిన, కార్తీకమాసమున, వైశాఖ మాసమున చేయు గంగా స్నానము సంవత్సర గంగాస్నాన ఫలమును ఇచ్చును. మన్వాదికాలమున, యుగాదికాలమునగంగాస్నాన ఫలము త్రిమాస గంగా స్నాన సమమని చెప్పెదరు. శ్రవణానక్షత్రయుక్త ద్వాదశిన, పుష్యమీనక్షత్రయుక్త అష్టమిన, ఆర్తానక్షత్రయుక్త చతుర్దశిన గంగాస్నానము బహు దుర్లభము. మఘానక్షత్రయుక్త పూర్ణిమన, కార్తిక మాఘ అమావాస్యలలో గంగా స్నానము సుదుర్లభము. కృష్ణ పక్షాష్టమిన గంగాస్నానము సహస్రస్నానఫలము, సర్వపర్వకాలములందు గంగాస్నానము శతగుణ ఫలప్రదము, అమావాస్యనాడు, అష్టమిన, మాఘకృష్ణ పక్షమున గంగాస్నానము విశేష ఫలప్రదము. ఆల్రోదయపర్వము, కొద్ది తక్కువ మహోదయపర్వము. మహోదయపర్వమున శతగుణము, అరోదయమున లక్షగుణము గంగాస్నానము ఫలప్రదము. సూర్య చంద్రగ్రహణ కాలమున గంగా స్నానము మాసత్రయ స్నానఫలప్రదము. ఫాల్గునా షాఢమాసములలో గంగా స్నానము కూడా మాసత్రయస్నాన ఫలప్రదము. జన్మ నక్షత్రమున గంగా స్నానము చేసిన జన్మనుండి సంపాదించిన పాపమంతయూ నశించును. మాఘ కృష్ణ చతుర్దశిన వ్యతీపాత యోగము సుదుర్లభము. కృష్ణాష్టమిన వైధృతియోగము కూడా దుర్లభము. పూర్ణముగా మాఘమాసమునంతయూ విధిగా గంగాస్నానమును చేయివానికి ప్వూ జన్మజ్ఞానము కలుగును. సర్వశాస్త్రార్ధ జ్ఞానము కలవాడు రోగరహితుడగును. సంక్రాతికాలమున, పూర్ణిమా అమావాస్యలలో, సూర్యచన గ్రహణకాలమున గంగాస్నానము నాచరించినవాడు బ్రహ్మలోకమును పొందును. చంద్రునికి లక్షగుణములు, సూర్యునికి దశగుణములు సామాన్యముగా చెప్పబడి యున్నవి. కాని గంగాతీరమున చంద్రునికి కోటి గుణములు, సూర్యునికి దశ గుణములు గ్రహణకాల ఫలముగా చెప్పబడినవి. చైత్రకృష్ణత్రయోదశి వారు సమాయుక్తమైనచో గంగాతీరమున నున్నచో నూరు సూర్యగ్రహణ సమమని చెప్పబడినది. జ్యేష్ట శుద్ద దశిమినాడు మంగళవారము హస్తా నక్షత్రయుక్తమున ఈ గంగానది పర్వతము నుంచి మర్త్యలోకమునకు దిగియున్నది. ఈ స్థితియే గంగానదికి ఆది దశ. కావున ఆనాడు ఈ భూలోకములోనున్న అన్ని పాపములను హరించును. ఈ దినమున స్నానము నాచరించినచో నూరు అశ్వమేధయూగముల కంటే నూరు రెట్లు అధిక పుణ్యమును ప్రసాదించును. ఈ భూలోకమున నున్న మహా పాతక సంఘములు ఇతర సకల పాపములనన్నింటినీ గోవింద ద్వాదశిని పొంది ఓ. గంగాదేవీ! సంపూర్ణముగా హరించుము. పూర్ణిమ తిధిన మఘానక్షత్రముండి చంద్రుడు గురువుతో కలిసియున్నచో ఆ తిథి చాలా మహత్వమును సంతరించుకొనును. ఇటువంటి మహత్తత్వము గంగా తీరమున లభించినచో నూరు సూర్యగ్రహణములతో సమానమగును. ఇక ఇపుడు ఆయా దేశ వివేషములందు గంగా స్నానఫలమును చేప్పెదను.
ఇతర పుణ్యక్షేత్రముల కంటే కురుక్షేత్రమున గంగా స్నానము దశ గుణము ఫలమును ప్రసాదించును. వింధ్య పర్వతముతో కలిసియున్న గంగానదీ స్నానము కురుక్షేత్ర స్నానమున కంటే శతగుణము అధిక ఫల ప్రదము. కాశీపురిలో గంగా స్నానము వింధ్య గంగా స్నానమున కంటే శత గుణము ఫలప్రదము. ఇట్లు కురుక్షేత్ర వింధ్యకాశీపురులలోని గంగా బహు దుర్లభము. గంగా ద్వారమున, ప్రయాగలో గంగాసాగర సంగమమున స్నానమునాచరించిన వారు స్వర్గమును పొందెదరు. ఈ విశేష స్థలములలో మృతి చెందినచో మరల జన్మించరు. గంగా ద్వారమున కుశావర్తమున స్నానమాచరించినచో పుణ్యఫలమును వినుము. ఏడు రోజ సూయయాగముల ఫలము, రెండు అశ్వమేధముల ఫలము లభించును. ఈ ప్రదేశములలో మాసార్ధము నివసించినచో ఆరు విశ్వజి ద్యాగముల ఫలము లభించును. ఒక లక్ష గోవులను దానము చేసిన ఫలము లభించును. ఈ ప్రదేశములలో స్నానమాచరించి కాని సరోత్తమమున గోవిందుని, కనఖల క్షేత్రమున రుద్రుని దర్శించి కాని అక్షయ పుణ్యమును పొందును. సౌకర తీర్ధము మహాపుణ్యప్రదము. ఈ తీర్థముననే పూర్వము అచ్యుతుడు వరాహాకారమున ఆవిర్భవించెను. ఈ తీర్థమున స్నానము నాచరించిన మానవుడు శతాగ్ని చిత్పుణ్యమును, రెండు జ్యోతిష్ణోమ యాగముల ఫలమును, వేయి అగ్నిష్టోమ యాగముల ఫలమును పొందును. ఈ తీర్థమున నున్న బ్రహ్మ తీర్ద మున స్నానమాడినచో పదివేల జ్యోతిష్ణోమయాగముల ఫలమును, మూడు అశ్వమేధ యాగముల ఫలమును పొందును. కుబ్జతీర్థమున స్నానము నాచరించినచో అఖిల వ్యాధులు నశించును. అన్ని జన్మలలో సంచితములగు సకల పాపములు హరించబడును. ఇచటనే మరియొకటి కపిల తీర్ధమని కలదు. ఇచట స్నానమాచరించిన నరుడు ఎనుబది వేల కపిల గోవుల దానఫలమును లభించును. గంగా ద్వారమున, కుశావర్తమున, బిల్వ క్షేత్రమున, నీల పర్వతమున, కనఖల తీర్ధమున స్నానము నాచరించిన సకల పాపములు నశించి స్వర్గమును చేరును. సర్వతీర్ణోత్తమ తీర్ధమగునది. పవిత్ర తీర్థమున స్నానమాచరించినచో రెండు విశ్వజిద్యాగముల ఫలము లభించును. దీని తరువాత వేణీ రాజ్యతీర్థము కలదు. ఇచట గంగా నదితో సరయూనది. ఆక్కొచెల్లెళ్ళవలే కలిసియున్నది. శ్రీహరి దక్షిణ పాదము నుండి పుట్టినది గంగానది వామపాదము నుండి పుట్టినది సరయూనది. ఇదియే మానస సరోవర సంజాత. ఈ తీర్థమున రుద్రుని పూజించిన రుద్రత్వమును, విష్ణువును పూజించిన విష్ణుత్వమును పొందును. ఈ తీర్థమున స్నానము వలన అయిదు అశ్వమేధ యాగము ఫలము లభించును. తరువాత గాండవతీర్థము కలదు. ఇచటనే గంగానదితో గండకీ నది కలిసియున్నది. ఇచట స్నానము సహస్ర గోదానసముము. తరువాత రామతీర్థము వైకుంఠమునకు సమీపముననున్నది. సోమతీర్థమున నకులముని నివసించును. ఈముని చక్కగా శివుని పూజించి ధ్యానించుచు గణత్వము పొందెను. గంగోత్తర వాహినియగు చంపక తీర్థ ము కలదు. ఈ తీర్థ ము మణికర్ణికతో సమము. మహాపాతకనాశనము. తరువాత కలశతీర్థము కలదు. ఇచటనే ఆగస్త్య మహర్షి కలశమునుండి ఉద్భవించెను. ఇచటనే అగస్త్యుడు రుద్రుని పూజించి మహర్షి ఆయెను. తరువాత మహాపుణ్యకరమగు సోమద్వీప తీర్థము వారాణసీసమము కలదు. ఇచటనే చంద్రుడు రుద్రుని పూజించి రుద్రుని శిరమును అధిష్ఠించెను. విశ్వామిత్రుని ప్రియసోదరియగు కౌశికి నది గంగతో కలిసిన తీర్థమున స్నానము నాచరించిన వాడు ఇంద్రునికి ప్రియాతిథి యగును. మహాతీర్థమగు జహ్ను ప్రదమున స్నానము నాచరించినవాడు ఇరువది యొకటి తరములను తరింపచేయును. తరువాత అదితి తీర్థము కలదు. ఇచటనే అదితి కశ్యపమహర్షి వలన శ్రీహరిని పొందెను. ఇచట స్నానము నాచరించిన మహాఫలము లభించును. తరువాత శిరోచ్చయమను మహాతీర్థము కలదు. ఇచటనే తపమాచరించిన మానవులు ఈ తీర్థ మహిమ వలన తృణాదులతోపాటు స్వర్గమును చేరెదరు. తరువాత ఇంద్రాణీ తీర్థము గలదు. ఇచటనే శచీదేవి తపమును చేసి ఇంద్రుని పతిగా పొందెను. ఈ తీర్థమును ప్రయాగతుల్యముగా సేవించవలయును. తరువాత స్నాతక తీర్థము కలదు. ఇచట క్షత్రియుడగు విశ్వామిత్రడు ఈ తీర్థమును సేవించుచు తపము నాచరించి బ్రహ్మర్షిత్వమును పొందెను. తరువాత ప్రద్యుమ్న తీర్థము మహా ప్రసిద్దము. ఇచ్చటనే శ్రీహరికి ప్రద్యుమ్నుడను పుత్రుడు కలిగెను. ఇచట స్నానము మహోదయప్రదము. తరువాత దక్ష ప్రయాగ తీర్థము కలదు. ఇచటనే గంగ నుండి యమున విడివడినది. ఇచట స్నానము నాచరించినచో ప్రయాగాస్నానము వలె అక్షయ పుణ్యము లభించును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గంగా మాహాత్మ్యమున స్థల విశేష స్నానఫలకధనమను నలుబది యవ అధ్యాయము.
