21 - వేణు గీతము

శ్రీశుక ఉవాచ

ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకరసుగంధినా

న్యవిశద్వాయునా వాతం సగోగోపాలకోఽచ్యుతః  

 బృందావనములోని సరస్సులలోని నీరు శరత్కాలము కారణముగా నిర్మలముగా నుండెను. వాటిలోని పద్మముల మీదనుండి వీచే గాలి వనమునంతనూ వ్యాపించెను. శ్రీకృష్ణ భగవానుడు గోవులతో, గోపాలకులతో గూడి ఇటువంటి వనమును ప్రవేశించెను.

  కుసుమితవనరాజిశుష్మభృంగద్విజకులఘుష్ట సరస్సరిన్మహీధ్రమ్

మధుపతిరవగాహ్య చారయన్గాస్సహపశుపాలబలశ్చుకూజ వేణుమ్  

మధువనప్రభుడగు శ్రీకృష్ణుడు బలరామునితో మరియు గోపాలకులతో కూడి గోవులను మేపుతూ బృందావనమును ప్రవేశించేను. ఆ వనములోని పుష్పించిన చెట్ల గుంపుల పంక్తులు, సరస్సులు, నదులు, పర్వతములు మత్తెక్కిన తుమ్మెదల మరియు పక్షుల గుంపుల ధ్వనులతో నిండి యుండెను. అప్పుడాయన పిల్లన గ్రోవిని వాయించెను.

తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయమ్

 కాశ్చిత్పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోఽన్వవర్ణయన్

 గోకులమునందలి గోపికలు కొందరు ప్రేమను వర్దిల్ల జేసే శ్రీకృష్ణుని ఆ వేణుగానమును దగ్గరగా వినిరి. తరువాత వారు గోకులములోనే ఉండి వినలేకపోయిన తమ స్నేహితురాండ్రకు వర్ణించి చెప్పిరి.

తద్వర్ణయికుమారభాస్స్మరంత్యః కృష్ణ చేష్టితమ్

 నాశకన్ స్మరవేగేన విక్షిప్తమనసో నృప

ఓ పరీక్షిన్మహారాజా! గోపికలా వేణుగానమును వర్ణించుట మొదలిడిరి. ఇంతలో వారికి శ్రీకృష్ణుని చేష్టలు గుర్తుకు వచ్చి ప్రేమావేశముచే మనస్సు చెల్లాచెదరై వర్ణించ లేకపోయిరి.

బర్హపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం

బిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీం చ మాలామ్

 రంధ్రాన్వేజోరధరసుధయా పూరయన్ గోపబృందైః

బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః

గొప్ప నటుని శరీరమువంటి శరీరము గల శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛముల ఆభరణమును, రెండు చెవులయందు కొండగోగు పువ్వులను, బంగారము వలె పచ్చనైన వస్త్రమును, ఐదు రంగుల పువ్వులతో తయారైన మాలను ధరించెను. ఆయన పిల్లన గ్రోవిని మోవిపై ఆనించి చిల్లులను పూరించుచుండెను. గోపాలకులు గుంపులుగా చేరి ఆయన కీర్తిని పాడుచుండిరి. ఆయన తన కాలి గుర్తులచే రమ్యమైన బృందావనమును ప్రవేశించేను. (ఈ విధముగా గోపికలు స్మరించిరి).

ఇతి వేణురవం రాజన్ సర్వభూతమనోహరమ్

 శ్రుత్వా వ్రజస్త్రీయస్సర్వా వర్ణయంత్యోఽభిరేభిరే

 ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా సకలప్రాణుల చిత్తమును దోచివేసే వేణుధ్వనిని గోకులములోని స్త్రీలందరు వినిరి. వారు కలుసుకున్నప్పుడు దానినే వర్ణిస్తూ ఒకరినొకరు కౌగిలించుకొనిరి.

గోప్య ఊచుః

అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః

సఖ్యః పశూనను వివేశయతోర్వయస్యైః

వక్త్రం వ్రజేశసుతయోరనువేణు జుష్టం

యైర్వా నిపీతమనురక్తికటాక్ష మోక్షమ్

గోపికలిట్లు పలికిరి --- ఓ చెలులారా! గోకులప్రభుడగు నందుని పుత్రులైన బలరామకృష్ణులు మిత్రులతో కలిసి పశువులను తోలుకుంటూ అడవిలో ప్రవేశించెదరు. వారిద్దరు తమను ప్రేమించే గోపాలకుల వైపు కటాక్షములను బరపుచుందురు. వారి పెదవుల పై వేణువు సిద్ధముగా నుండును. అట్టి వారి ముఖమును త్రాగుచున్నారా యన్నట్లు చూసినవారు పొందే ఆనందమేది గలదో, ఇదియే కన్నులు ఉన్నందులకు ఫలము. అంతకంటే గొప్ప ఫలము మాకైతే తెలియదు.

చూతప్రవాలబర్దస్తబకోత్పలాబ్జ.

మాలానుపృక్తపరీధానవిచిత్రవేషా

 మధ్యే విరేజతురలం పశుపాలగోష్ఠ్యాం

రంగే యథా నటవి క్వ చ గాయమానౌ

బలరామకృష్ణుల వస్త్రధారణము మామిడి చిగుళ్లు, నెమలి పింఛము, పూల గుత్తులు (తలపై), కలువలు (చెవులలో), పద్మములు (చేతిలో), పూల మాల (మెడలో) అనువాటితో మిళితమై అనేకములగు రంగులను కలిగియుండెను. వారు ఒకప్పుడు ఒకచోట గోపాలకుల సమావేశములో వారి మధ్యలో రంగస్థలమునందలి గొప్ప నటులు వలే పాడెడివారు.

గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణుః

దామోదరాధరసుధామపి గోపికానామ్

భుంక్తే స్వయం యదవశిష్ఠరసం హ్రదినో

హృష్యత్త్వచ్వోఽశ్రు ముముచుస్తరవో యథాఽఽర్యాః

ఓ గోపికలారా! ఈ పిల్లన గ్రోవి ఏమి పుణ్యమును చేసియుండును? ఎందుకంటే, ఇది గోపికల సొత్తెన దామోదరుని (నడుముకు కట్టబడిన త్రాడు గలవాడు) అధరామృతమును తాను తడి కూడ మిగలకుండా (తడి మాత్రమే మిగిలే విధముగా) ఆస్వాదించుచున్నది. ఈ వేణువు వచ్చిన  వెదురు పొదలకు నీటిని ఇచ్చిన నదులకు ఆనందముతో శరీరము పై గగుర్పాటు (వికసించిన పద్మములు) కలుగుచున్నది. ఆ చెట్లు తమ వంశములో పుట్టిన వేణువును తలచుకొని కులవృద్దులు వలె ఆనందాశ్రువులను విడిచి పెట్టుచున్నవి.

బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం

యద్దేవకీసుతపదాంబుజలబ్దలక్ష్మి

 గోవిందవేణుమను మత్తమయూరనృత్యం

ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్యసమస్తసత్త్వమ్

 ఓ చెలీ! బృందావనము భూలోకముయొక్క కీర్తిని విస్తరింప జేయుచున్నది. ఎందుకంటే, ఇచటి నేల దేవకీపుత్రుడగు శ్రీకృష్ణుని అడుగులలోని పద్మపు గుర్తుల శోభలు గలది. గోవులను కాచే నల్లనయ్యయొక్క వేణుగానమును విని మదించిన నెమళ్లు నాట్యము చేయుచుండగా, మిగిలిన ప్రాణులన్నియు కొండ చరియలయందు కదలిక లేకుండా ఆ నాట్యమును చూచుచున్నవి. (గానమును వినుచున్నవి).

ధన్యాస్స్మ మూఢమతయ్యోపి హరిణ్య ఏతా

యా నందనందనముపొత్తవిచిత్రవేషమ్

ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణసారాః

పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకైః

ఈ ఆడు లేళ్లు వివేకము లేనివే ఐననూ, ధన్యములు గదా! ఎందుకంటే, ఇవి మగ లేళ్లతో కలిసి వేణుగానమును విని, రంగు రంగుల వేషమును దాల్చిన నందసూనుడగు శ్రీకృష్ణుని అనురాగపు చూపులతో చూస్తూ, ఆ చూపులే పుష్పములు కాగా పూజను చేసినవి.

కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం

శ్రుత్వా చ తత్క్వణితవేణువిచిత్రగీతమ్

దేవ్యో విమానగతయస్స్మరనున్నసారా

భ్రశ్యత్ప్రసూనకబరా ముముహుర్వినీవ్యః

శ్రీకృష్ణుని రూపము, స్వభావము యువతులకు ఉత్సాహమును కలిగించును. విమానముల పై వెళ్లే దేవతాస్త్రీలు ఆయనను చూచి, ఆయన వాయించిన వివిధస్వరముల వేణుగానమును కూడ విని .  వ్యామోహమును పొందిరి. వారి ధైర్యమునకు మన్మథుడు పరీక్ష పెట్టినట్లాయెను. వారి జుట్టు ముడుల పూలు, కోకముడులు జారెను.

గావశ్చ కృష్ణముఖనిర్గతవేణుగీత

పీయూషముత్తభితకర్ణపుటైః పిబంత్యః

 శావాస్స్నుతస్తనపయఃకవలాస్స్మ తస్థుః

గోవిందమాత్మని దృశ్వాశ్రుకలాస్స్పృశంత్యః

 గోవులు గోపాలకుడగు శ్రీకృష్ణుని చూపు గుండా మనస్సులో ఆలింగనము చేసుకొని కళ్ల వెంబడి ఆనందబాష్పములను విడిచి పెట్టుచున్నవి. అవి శ్రీకృష్ణుని నోటినుండి వెలువడే వేణుగానమనే అమృత మును చెవుల దొప్పలను రిక్కించి పానము చేయుచున్నవి. దూడలు స్రవించే పొదుగు పాలు గుక్కెడు నోటిలోనుండ అటులనే నిలబడినవి.

ప్రాయో బతాంబ విహగా మునయో వనేకస్మిన్

కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతమ్

ఆరుహ్య యే ద్రుమభుజాన్ రుచిరప్రవాలాన్

శృణ్వంత్యమీలితదృశో విగతాన్యవాచః

అమ్మా! ఈ బృందావనమునందు పక్షులు ప్రకాశించే చిగుళ్లు గల చెట్టు కొమ్మలపై శ్రీకృష్ణుడు కనబడే విధంగా కూర్చుండి కళ్లు మూయకుండా ఇతరధ్వనులను కట్టిపెట్టి, ఆ శ్రీకృష్ణుని నోటినుండి వెలువడే వేణుగానమును వినుచుండును. ఆ గానముయొక్క మాధుర్యమును మాటలలో చెప్పుట వీలు కాదు. ఆశ్చర్యము! బహుశః ఆ పక్షులు మహర్షులే అయి ఉండును.

నద్యస్తదా తదుపధార్య ముకుందగీతం

ఆవర్తలక్షితమనోభవభగ్నవేగాః

 ఆలింగనస్థగితమూరిభుజైర్మురారేః

గృహ్ణంతి పాదయుగలం కమలాపహారాః

 అప్పుడు నదులు మోక్ష ప్రదాతయగు ఆ శ్రీకృష్ణ భగవానుని వేణుగానమును శ్రద్దగా విన్నవి. వెంటనే అనురాగముచే వాటి వేగము కుంటు వడినదని వాటియందలి సుడిగుండములు సూచించుచున్నవి. ఆ నదులు కెరటములనే చేతులతో మురారి పాదముల జంటకు పద్మములను సమర్పించినవి. అవి ఆ కేరటములతో ఆయన పాదములను పట్టుకొని ఆలింగనముచే కప్పివేసినవి. 

దృష్ట్వాఽఽత పే ప్రజపశూన్ సహ రామగోపైః  

సంచారయంతమను వేణుముదీరయంతమ్

ప్రేమప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః

సఖుర్వ్యధాత్స్వవపుషాంబుద ఆతపత్రమ్

శ్రీకృష్ణుడు బలరామునితో, గోపాలకులతో కూడి గోకులముయొక్క పశువులను బాగుగా మేపుతూ, వాటి వెనుకనుండి వేణువును ఊదు చుండెను. తన మిత్రుడైన (తనతో సవర్ణుడైన) ఆయనను చూచి నీటితో నిండిన మేఘము ప్రేమతో పెద్దదయ్యెను. అది నింగి పైకి చేరి పూలవంటి నీటి బిందువులతో ఆయనను తడిపి తన దేహముతో గొడుగు పట్టెను.

పూర్ణాః పులింద్య ఉరుగాయపదాబ్జరాగ-

శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన

 తద్దర్శనస్మరరుజస్తృణరూషి తేన

లింపంత్య ఆననకుచేషు జహుస్తదాధిమ్

బోయస్త్రీలు కృతార్థలు. ఎందుకంటే, వారికి గొప్ప కీర్తి గల శ్రీకృష్ణుని పద్మముల వంటి పాదముల ఎరుపుతో కూడి శోభిల్లిన కుంకుమ ఆయన నడచినప్పుడు గడ్డికి లగ్న మై లభించినది. అది ప్రియురాలగు గోపిక వక్షఃస్థలమునకు అలంకారమై ఆయన కాలికి తగుల్కున్న కుంకుము. దానిని చూడగానే వారి హృదయములలో ప్రేమ అనే హ్యాధి కలిగినది. దానిని వారు తమ ముఖములకు, స్తనములకు అందుకోని ఆ ప్రేమవ్యాధిని పోగొట్టుకొనిరి.

హంతాయముద్రిరబలా హరిదాసవర్యో

యద్రామకృష్ణ చరణస్పర్శప్రమోదః

మానం తనోతి సహగోగణయోస్తయోర్యత్

పానీయసూయవసకందరకందమూలైః

 చెలియలారా! చూచేరా! ఈ గోవర్ధనపర్వతము శ్రీకృష్ణ భగవానుని భక్తులలో గొప్పది. ఎందుకంటే, ఇది బలరామకృష్ణుల పాదముల స్పర్శచే ఆనందముతో పొంగిపోవుచున్నది. పైగా, వారిద్దరు గోవులతో మరియు గోపాలకులతో కలిసి వచ్చినప్పుడు. వారి విశ్రాంతికి గుహలను, అందరికీ త్రాగే నీటిని, పశువులకు పచ్చని గడ్డిని, వారికి కందమూలఫలముల భోజనమును ఇచ్చి గొప్పగా సత్కరించుచున్నది. 

గా గోపకైరనువనం నయతోరుదార -

వేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః

 అస్పందనం గతిమతాం పులకస్తరూణాం

నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్

 ఓ చెలియలారా! గోపాలకులతో కూడి బలరామకృష్ణులు గోవులను .. ప్రతి అడవియందు నడిపించేదరు. (భుజములపై) ఆవుల కాళ్లను కట్టే త్రాళ్లతో వారిని గుర్తు పట్టవచ్చును. వారు వేణువులపై మధురములైన పదములను పలికిస్తూ ఉంటే (వినేవారికి) ఆనందము కలుగును. ఆ వేణుగానము దేహధారులలో చలనము గల పశుపక్ష్యాదులకు కదలని స్థితిని, కదలని చెట్టు చేమలకు గగుర్పాటు (కదిలే ప్రాణుల ధర్మము) ను, కలిగించుట విచిత్రమే.

ఏవంవిధా భగవతో యా బృందావనచారిణః

 వర్ణయంత్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః  

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

 పూర్వార్ధే ఏకవింశోధ్యాయః

బృందావనవిహారియగు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకారముగా అనేకలీలలను నేర పెను. గోపికలు వాటిని ఒకరితో నొకరు వర్ణించి చెప్పు తన్మయత్వమును పొందిరి.

 శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో వేణుగీతమును వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).