గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

60 – అంగారకచతుర్ధీ మహిమ

బ్రహ్మ:

కృతవీర్యునితండ్రి అంగారకచతుర్ధియొక్క ప్రాశస్త్యాన్ని చెప్పమని ప్రార్ధించగా అప్పుడు బ్రహ్మ యిలా చెప్పసాగాడు. “ఓ రాజా! అంగారకచతుర్ధియొక్క మహిమను వివరిస్తాను. సావధానంగా విను! పూర్వం అవంతీ నగరంలో భారద్వాజుడనే ముని ఉండేవాడు. అతడు యమ, నియమ సంపన్నుడై, వేదవేదాంగాలలోని తత్త్వమంతా అవపోశనపట్టి, శిష్యులకు మహోత్కృష్టమైన శిక్షణగరపుతూ నిరతాగ్నిహోత్రపరుడై ‘మరోఅగ్నిదేవుడా’ అన్నంత తేజస్సుతో ప్రకాశించేవాడు. అతడొకనాడు ఒక నదీతీరములో అనుష్టానంలో మగ్నుడై ఉన్నసమయంలో మహాసౌందర్యవతియైన ఒక అప్సరసను చూశాడు. ఆమెపట్ల కోరిక కలుగగా కామమోహితుడై మూర్ఛిల్లాడు. అప్పుడు వివశుడైన ఆతనికి రేతస్ఖలనం కలిగింది. ఆ వీర్యం నేలపైనిగల ఒక బొరియలోకి జారింది. ఆ రేతస్సునుండి జపాకుసుమం వంటి ఒక సుందరుడైన బాలకుడు ఉద్భవించాడు. ఆ బాలుని సంరక్షణాభారాన్ని భూదేవత స్వీకరించి పెంచసాగింది. ఇలా ఏడుసంవత్సరాలు గడిచాక ఆ బాలుడు ‘నాతండ్రి ఎవరు?’ ఏ కారణంచేత నాకు ఈ ఎఱ్ఱటిశరీరం కలిగింది? ఆ వివరం యిప్పుడు వెంటనే చెప్పు’ అంటూ ప్రశ్నించాడు.

భూదేవి:

అప్పుడు ‘ఓ కుమారా! భారద్వాజుని రేతస్సు నాయందు స్ఖలితమవ్వగా నీవు జన్మించావు. నావలన సంరక్షించబడుతూ యింతవాడవైనావు!’ అనగానే ఆ బాలకుడు

“ఐతే వెంటనే నాతండ్రియైన ఆ తపోనిధిని నాకు చూపించు!” అన్న ఆ బాలకుడిని తీసుకువెళ్ళి భారద్వాజుని ఆశ్రమం వద్దకుకొనిపోయి, ఆతడితో యిలా అన్నది. ‘ఓయీ! నీవీర్యంచేత ఉద్భవించిన ఈ బాలకుడు నాచేత సంరక్షింపబడ్డాడు. కనుక నీవిక వీనిని స్వీకరించు!’ అంటూ అప్పచెప్పి ఆ ముని వద్ద సెలవుగైకొని వెళ్ళిపోయింది! అప్పుడా ముని తన కుమారుని ఆలింగనం చేసుకొని, తలపై ముద్దాడి, తన వడిలో కూర్చుండ బెట్టుకున్నాడు. ఒకానొక సుముహూర్తంలో ఆ బాలకునికి ఉపనయనాది సంస్కారములు జరిపించి, వేదశాస్త్రాలను అభ్యసింపచేశాడు. చివరకు సకలార్ధప్రదమైన గణేశమంత్రాన్ని ఉపదేశించి, ‘నాయనా! దీనిని శ్రద్ధాభక్తులతో భక్తజనవల్లభుడైన గణేశునికి ప్రీతికలిగేలా అనుష్టించు! ఆ దీనపోషకుడి అనుగ్రహాన్ని పొందితివా ఆతడు నీ యెడల అమితప్రసన్నుడై నీకు సకలాభీష్టములను ప్రసాదిoచగలడు!’ యిలా తండ్రియైన భరద్వాజునిచేత ప్రేరితుడై ఆ బాలకుడు ఆతడి ఆదేశాన్ననుసరించి నర్మదానదీ తీరాన్ని చేరుకొని అక్కడ ఒకచోట పద్మాసనంలో కూర్చుని సకల ఇంద్రియాలనూ నిగ్రహించి, అంతర్ముఖుడై దీక్షగా తన హృదయకమలంలో గణేశునే ధ్యానిస్తూ, ఆతడి మంత్రజపం చేస్తూ – నిరాహారుడై వేయిసంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సును ఆచరించాడు! ఇలా చేస్తూన్న సమయంలో మఘమాసపు బహులపక్షంలో చవితినాడు చంద్రోదయకాలంలో నాలుగుచేతులతో, తలపై బాలచంద్రుని చంద్రకళగా ధరించి, సకల ఆయుధాలను ధరించి, దివ్యమైన దేవతావస్త్రాలతో సకలాభారణాలతో శోభిల్లుతూ సుందరమైనట్టి వంకరతిరిగిన తుoడముతో, ప్రకాశిస్తూన్న దంతమును కలిగి కుండలాలతో అలంకరించబడిన చేటలవంటి చెవులతో, వేయిసూర్యుల కాంతితో వెలుగుతూ గణేశుడు భక్తవరదుడై శుభంగా దర్శనాన్ననుగ్రహించాడు.

ఆ మంగళప్రదునికి భక్తితో ప్రణమిల్లి ఆ బాలకుడిలా స్తోత్రం చేయసాగాడు!

“ఓ భక్తులపాలిట మందారమై, అభక్తులకు సకల విఘ్నకర్తనైన దీనజనావనా! నీకు నమో నమః! దేవతలకు, అసురులకు సకలగణములకు ఆధినాయకుడవైన ఓప్రభూ! నీకు నమస్కారం! సకల శక్తులను వికసింపచేసి విజృంభింపచేసే ఓ మూలశక్తిస్వరూపా! నీకు నా నమస్కారము! పరబ్రహ్మతత్త్వమువై, నిర్వికారుడవై, నిర్గుణుడవై, గుణభేదకుడవైన నీకు నమస్కారము! బ్రహ్మవిదులలో శ్రేష్టుడవునూ, సృష్టిస్థితిలయాలకు కారణభూతుడవైన నీకిదే నా ప్రణతి! మూడు లోకాలనూ ఏలే త్రైలోక్యపాలకా! నీకిదే నాసన్నుతి! ఓ దేవా! లక్ష్యాలక్ష్యస్వరూపుడవూ,సమస్త దుర్లక్షణములను నశింపచేసే నీకిదే ప్రణతి! పరేశుడవైన ఓ విఘ్ననివారకా! నీకు మరల మరల నమస్కారం!” అంటూ భక్త్యుత్సాహాలతో తనను స్తుతించి తన పాదాలమ్రోల వాలిన ఆతడిని లేవనెత్తి, చిరునవ్వు వెన్నెలలా వర్షిస్తూండగా అతడిని ఉత్సాహపరుస్తూ మృదుమధురంగా గజాననుడిలా అన్నాడు.

గణేశ:

‘ఓ బాలకా! నీ భక్తికీ, నీయీ స్తుతికీ నాకు ఎంతో సంతోషం కలిగింది! నీ ఉగ్రతపస్సు నన్ను తృప్తిపరచింది! అందుచేత నీవు బాలుడవైనప్పటికీ నీ సకల మనోభీష్టాలనూ అనుగ్రహించదలచాను! అవేమిటో కోరుకో!’

మంగళుడు:

ఆమాటకు స్వాంతనచెందిన ఆ భూమి పుత్రుడిలా ప్రార్ధించాడు. “ ఓ దేవాధిదేవా! మీ దర్శనభాగ్యంచేత నాజన్మ, నాకులము, పావనమైనాయి! మిమ్ములను ధరించుటచేత సకల పర్వతాలతోనూ, వనాలతో విలసిల్లే ఈ భూమి యావత్తూ ధన్యమైంది. అందరికీ ప్రభువువైన తమ దర్శనభాగ్యంచేత నా తపస్సూ, మూఢభావంతో కూడినదైనా నిన్ను స్తుతించటంచేత నావాక్కు ధన్యములైనాయి! ఓదేవ! సకలమంగళకారకా! నీవు సంతుష్టుడవైతే నన్ను స్వర్గలోకం చేర్చి, అక్కడగల దేవతలతోపాటూ నాకూ అమృతపానంచేసే భాగ్యం ప్రసాదించు. నేను మంగళుడన్న పేరిట లోకప్రసిద్దుడనౌదును గాక! నీ దివ్యదర్శనము నాకు సంప్రాప్తమైన ఈ చతుర్ధితిధి పుణ్యప్రదమై సర్వసంకష్టములనూ హరిoచునుగాక! నీ అనుగ్రహ విశేషంచేత ఈ చతుర్ధితిధినాడు వ్రతమాచరించినవారికి సకలాభీష్టములూ నేరవేరునుగాక!”

గణేశుడు:

“నాయనా! భూమిసుతుడవైన నీవు రక్తవర్ణము కలవాడవటంచేత నీకు అంగారకుడవన్నపేరుతో వర్ధిల్లు! అంగారకచతుర్ధినాడు వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్ళకు ఒక సంవత్సరంపాటు సంకష్టీవ్రతంవల్ల కలిగేంతపుణ్యం కలుగుతుంది. ఈ అంగారక చతుర్ధీవ్రత ఆచరణవల్ల సర్వ కార్యములయందూ అవిఘ్నత నిస్సందేహంగా కలుగుతుంది. నీవు ఎంతో ఉత్తమమైనదీ, అమితఫలవంతమైన ఈ వ్రతాన్ని అనుష్టించటంచేత ఈ పుణ్యప్రభావంవల్ల నీవు అవంతీదేశానికి రాజువవుతావు!” అంటూ అంతర్హితుడైనాడు.

ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా కృష్ణ అంగారక చతుర్ధినాడు సకలాభీష్టప్రదమైన అంగారక చతుర్ధీవ్రతాన్ని అనుగ్రహించి, ఆతడి సకలాభీష్టములనూ ప్రసాదించి సకల జగన్మోహనకరమైన తన దివ్యమంగళవిగ్రహంతో దర్శనమిచ్చి గణేశుడు అంతర్ధానం చెందాడు! ఆతరువాత ఆ మంగాళుడు పదిబాహువులుగల సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్టించి గజాననుని సంతుష్టికోరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాక ఆమూర్తికి “మంగళమూర్తి” అన్న నామకరణం చేశాడు. అప్పటినుండీ ఆ ప్రదేశము ‘కామదాతృ క్షేత్రము’ అన్నపేరుతో ప్రసిద్ధిచెందింది.

ఈ క్షేత్రములో జరిపే అనుష్టానము, పూజ, దర్శనములు మోక్షదాయకములు! ఆ తరువాత గజాననుడు తన వైనాయకగణాలను తోడిచ్చి, బౌముని తనవద్దకు తీసుకురావటానికి ఉత్తమమైన విమానమును పంపించాడు. అప్పుడా దూతలు ఆ భౌముని సశరీరునిగా గజాననుని సన్నిధికి తీసుకువెళ్ళారు. మంగళవారం చవితి కలిసివచ్చిననాడు సంకష్టహర చతుర్ధీవ్రతాన్ని ఆచరించటంవల్ల అతడు ముల్లోకాలలోనూ ‘బౌముడు’ అన్న పేరుతో ప్రసిద్ధిచెందాడు. ఆ తరువాత ఆతడికి దేవలోకంలో దేవతలతోపాటు అమృతపానముచేసే భాగ్యం సంప్రాప్తించినది’. అంటూ వ్యాసభగవానునికి చెప్పిన గాధనే కార్తవీర్యుని తండ్రియైన కృతవీరునికీ తెలిపి బ్రహ్మ యింకా యిలాఅన్నాడు.

బ్రహ్మ:

“ఓరాజా! పారినేర నగరానికి పశ్చిమభాగంలో ‘చింతామణి’ అన్నపేరిట సర్వవిఘ్ననివారకుడైన మంగళమూర్తి ఆవిధంగా వెలిశాడు. అప్పటినుంచి అంగారకచతుర్ధీ లోకంలో ప్రఖ్యాతమైంది. ఇప్పటికి ఆ మంగళమూర్తి సన్నిధికి నిత్యం చంద్రోదయ సమయంలో సిద్ధులు, గంధర్వులూ చేరి పూజిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు భక్తులయొక్క సకల మనో రధాలనూ పూర్తిచేసి పుత్రపౌత్రాది సంపదలనూ ప్రసాదిస్తూన్నాడు.”

Chapter 60 complete