గణేశ పురాణము - ఉపాసనా ఖండము
51 – వరదగణేశ వ్రతవిదానం
బ్రహ్మ:
“ఓ వ్యాస మునీంద్రా! హిమవంతుని ఉపదేశాన్ని విన్న గిరినందన తిరిగి తన తండ్రినిలా ప్రశ్నించింది”.
పార్వతి:
“ఓ తండ్రీ! నీ ఉపదేశము నా చెవులకు అమృతజల్లై కురిసింది! ఐతే ఈ వరదగణేశ వ్రతాన్ని యింతకు పూర్వo ఎవరాచరించారు? ఎలాంటి సిద్ధుల్ని పొందారు? ఆ వివరాలు నాపై కృపవహించి తెలియజేయవలసిoది.”
హిమవంతుడు:
“అమ్మా! నీవూ, నీకై గణేశుని గాధలనూ వివరించే నేను కూడా ఇందువల్ల ధన్యులమౌటాము! ఎందుకంటే, గణనాథుని దివ్యలీలల కధనమూ, శ్రవణమూ కూడా అత్యంత కమనీయమైనవి! పరమపావనమైన ఆ కదావృత్తాతాన్ని నీకు తెలుపుతాను! విను!”
“ఓపార్వతీ! పూర్వం కైలాసంలో ప్రమధగాణాలతో సేవించబడుతూ సుఖాసీనుడైవున్న శంకరునికి అభివాధముచేసి, స్తుతించి, షణ్ముఖుడైన స్కందుడిలా ప్రార్ధించాడు :
స్కందుడు:
“భక్తులపాలిట కొంగుబంగారమైన, అభయ వరప్రదుడవైన ఓ శంకరా! నీయుక్క కృపావిశేషములచేత అనేక ఉపాఖ్యానాలను నీనుంచి తెలుసుకున్నాను! ఐన, ఆ దివ్యగాధల మకరందాన్ని ఎంతగా గ్రోలినా, తనివి తిరటంలేదు! అందుకని ఇప్పుడు సర్వార్ధసిద్ధికరమైన ఒక వ్రతము గురించి చెప్పు! ఎవరి సంబంధమైన వ్రతాన్ననుష్టించటంవల్ల జనులకు సర్వసిద్ధులూ కరస్థము కాగలవో, అట్టి వరప్రదుని వ్రతాన్ని నాకు ఉపదేశించవలసింది!” అంటూ వేడిన స్కందునితో శంకరుడిలా అన్నాడు.
వరదవ్రత ఫలం
“కుమారా! లోకోపకారార్ధమై నీవడిగిన ఈప్రశ్న ఎంతో ఉచితమైనది! నీయందు నాకుగల ప్రేమ, వాత్యల్యాలవల్ల భూలోకంలో సమస్త మహాసిద్ధులను యివ్వగల వ్రతాన్ని గురించి చెబుతాను! అదే వినాయకుని వ్రతము! ఇది సర్వవ్రతాలలోకీ శ్రేష్టమైనదేకాక అత్యుత్తమమైన ఫలాన్ని యివ్వగాలది!
ఓ కుమారా! యజ్ఞ, దాన, జప, హోమాదులనే ఉత్కృష్టములైన సాధనాంగాల గురించిన ప్రసక్తి ఏమాత్రం లేకుండా, సకల సిద్ధులను ప్రదానం చేసేదీ పుత్రపౌత్రాభివ్రుద్ధిని కల్గించేదీ, ఈ గణేశ వ్రతమేసుమా!
ఈ వ్రతప్రభావంవల్ల, రాజాధిరాజులూ,సమస్తమైన అధికారిక పురుషులు కూడా సులభంగా వశ్యులౌతారు! ఈ వ్రతానుష్టాన మహిమ అనేక జన్మార్జిత పాపకోటినoతటినీ భస్మంచేస్తుంది! అంతేకాదు ఈ వ్రతప్రభావంవల్ల మానవుడు దుర్లభమైన ముక్తినిసైతం బడయగలడు! ఈ వ్రతము సకలార్ధప్రదుడైన గాణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైనది! దీనితో సాటైనది మరోవ్రాతమేదీలేదు! ఈ వ్రతాన్ని ఆచరించినవాడు సకలసిద్ధులచేతా ఆశ్రయించబడతాడు!”
ఈ మాటలకు స్కందుడు తిరిగి యిలా ప్రశ్నించాడు. “తండ్రీ! యింతటి మహామహిమోపేతమైన వ్రతాన్ని ఎప్పుడు అనుష్టించాలి? దీని విధానమేమిటి? ఇదివరలో దీన్ని ఎవరు ఆచరించి శ్రేయస్సును పొందారు? ఈ వృత్తాంతాన్నటినీ దయతో సెలవివ్వండి!” అని అడుగగా.
వ్రాతానుష్టాన కాలం:
శంకరుడు:.
“ఓ కుమారా! ఈ వ్రతాన్ని శ్రావణశుద్ధ చవితినాడు ఆరంభించాలి! ఆ రోజున స్నానసంధ్యాదులను గావించుకొని, గురుగృహానికి వెళ్ళి సాక్షాత్ గణేశస్వరూపునిగా ఆయనకు సాష్టాంగనమస్కారము, పాద్యము, ఆచమనము, వస్త్రములను సమర్పించి, వారిని సంతుష్టపరచి వారినుంచి ఉపదేశంగా పొందాక, వారి అనుజ్ఞతో, ఈ వ్రతాన్ని ఆరంభించాలి!
అక్కడినుండి వచ్చి తన గృహంలో సుఖాసీనుడై, గురూపదిష్టమార్గంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి! దీనికి మృత్తికతో గజాననుని మూర్తిని తయారుచేసి ప్రతిదినమూ పూజించాలి! ఇలా భాద్రపద శుక్లచవితి వచ్చేవరకూ పూజిస్తుండాలి!
వ్రతనియమాలు.
బ్రహ్మచర్యము, అదఃశయనము, ఏకభుక్తము(నక్తం) తో గడపాలి. ఉప్పు, కారములను వర్జించి, మధురపదార్ధాలనే భుజిస్తూ, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి!
ప్రతిరోజూ వ్రతం ముగిశాక, గణేశ ఏకాక్షరి, షడక్షరీ, చతురక్షరీ, దశాక్షర, ద్వాదశాక్షరులలో ఒక మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి!
జపసంఖ్య.
“ఓ కుమారా! ప్రతిరోజూ యింత అని నియమముగాగాని లేదా పదివేలుగాని జపించాలి! ఇలా జపంచేస్తూ, గణేశుని హృదయపద్మంలో ధ్యానిస్తూ, సావధానమనస్కుడై ఉండాలి! భాద్రపద శుక్ల చతుర్థినాడు గజాననుని స్వర్ణమూర్తినీ, ఎలుక లేదా నెమలి వాహనాన్నీ చేయించాలి!
వ్రతవిధానం.
ముందుగా పూజాస్థలంలో ఒక మంటపాన్ని ఏర్పరచి, దానిపై ధాన్యంపోసి, బంగారం, వెండి లేదా రాగి కలశాన్ని స్థాపించి, దానిమీద యింకో లోహపాత్రనుంచి, దాన్ని వస్త్రద్వయంతో చుట్టబెట్టాలి!
ఆ కలశంలో పంచపల్లవాలనూ, పంచరత్నాలను ఉంచి ముందుగా పీఠపూజను చేయాలి! ఆ తరువాత కలశంపైన గణేశుని మూర్తిని స్థాపించి, మూలమంత్రాలతోనూ, వేదమంత్రాలతోనూ గజాననుణ్ణి ధ్యానించి పరమప్రీతితో ఆహ్వానించాలి!
ఇలా ఆవాహనచేశాక, గణేశమూర్తికి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం సమర్పించి, పంచామృతాలతోనూ, ఆ తరువాత శుద్దోదకంతోనూ స్నానంచేయించాలి.
ఆ తరువాత ఎఱ్ఱటి వస్త్రద్వయ్యాన్ని సమర్పించి, యజ్ఞోపవీతాన్ని, దివ్యాలంకారాలను సమర్పించాలి! గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది షోడశోపచారాలతో గణేశుని అర్చించాలి!
నైవేద్యం
ఇక నైవేద్య ద్రవ్యాలేమిటంటే, గారెలు, అప్పాలు, లడ్లు, అన్నపాయసము, మొదలైన మధుర పదార్థాలను నివేదనగా సమర్పించాలి! హస్తప్రక్షాళనo తరువాత, తాంబూలాన్ని సువర్ణ దక్షిణాదికాలతో సమర్పించి, గౌరవించి, ఛత్రంచామరం మొదలైన సకలమైన రాజోపచారాలను చేయాలి!
నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి అనంతరం గణేశుని సహస్రనామాలను పఠించాలి! ఆ తరువాత బ్రాహ్మణులను దానములతో సంతోషపరిచి, ఆ రాత్రి నృత్యగీతాలతో జాగరణ చేయాలి!
‘నాయనా! ఆ మర్నాడు ప్రాతఃకాలంలోనే స్నానసంధ్యాదికాలు చేసి ఇదివరకులాగే ఆ దేవదేవుని ఆరాధించి, హోమంచేయాలి! ఇలా హోమం ముగించాక, ఆ అధ్వర్యుని దక్షిణాదికాలచేత సత్కరించి, తన శక్తికొలదీ ఇరవైఒక్క మందికి తగ్గకుండా బ్రాహ్మణభోజనం పెట్టాలి!
బీదసాదలకు అన్నదానంచేసి, పిదప తాను బంధుమిత్రులతో కూడి భుజించాలి! ఓ స్కందా! ఇది ఈ వ్రతవిధానం! ఈ వరదవ్రతము మానవులకు భుక్తి, ముక్తిప్రదము! సకల కామనలనూ నేరవేర్చకలదు! ఇందుకు దృష్టాంతంగా నీకో పురాతన ఇతిహాసాన్ని వివరిస్తాను!
కర్దామోపాఖ్యానము
శంకరుడు:.
ఓ స్కందా! పూర్వం మహాపరాక్రమవంతుడైన కర్దముడనే రాజు యావద్భూమండలాన్నీ పరిపాలించేవాడు! ధర్మబద్ధమైన ఆతని పరిపాలనలో ప్రజలు చిరకాలం సంతుష్టులై గడిపారు! ఆతని గుణగణాలకు మెచ్చిన దేవతలు అదృశ్యరూపంలో ఆతని కొలువుకూటంలో ఉండేవారు.
ఒకనాడు మహాతపస్సంపన్నుడూ, త్రికాలవేదీయైన భృగుమహర్షి ఆతని గృహమునకు వచ్చాడు! తన సింహాసనంనుండి దిగ్గునలేచి ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనాససీనుణ్ణిచేసి పూజించి, భోజనమిడి, ఆ తరువాత స్వస్థచిత్తుడైన ఆ మహర్షిని యిలా ప్రశ్నించాడు:
“ఓ మహర్షీ! తాము త్రికాలవేదులు! మిమ్మల్ని ఒకచిన్న విషయమై ప్రశ్నిస్తాను. దయతో ఆ వివరం తెలియజేయండి!” పూర్వజన్మలో నేనేవడను? ఏ పుణ్యం చేయటంవల్ల ఇలా నిష్కంటకంగా ఈ మహాసామ్రాజ్యం ఏలగల్గుతున్నాను? ఇదివరలోగాని, ఇకముందుగాని ఇట్టి వైభవాన్ని మరెవ్వరూ పొందలేరు! దేవతలచేత గంధర్వులచేతా కూడా పూజనీయుదనైనాను! సాక్షాత్తూ యక్షుల అధిపతియైన అలకానగరాధిపతి కుబేరుని మించిన సిరిసంపదలతో తులతూగుతున్నాను! మూడు లోకాలలోనూ సర్వశ్రేష్ఠవస్తువులన్నీ నా చెంతనే ఉన్నాయి! కనుక ఓ మహర్షీ! ఏ పుణ్యప్రభావంగా నాకివన్నీ సంప్రాప్తించాయో ఆ వివరం దయతో సెలవియ్యండి! ఓ పుణ్యమూర్తీ! దాని వివరం చెబితే తిరిగి అలంటి పుణ్యకర్మనే చేస్తాను!”
భృగువు:
“ ఓ రాజా! నీవడిగిన వివరాన్ని దివ్యదృష్టితో గ్రహించి తెలియజేస్తాను!
కర్దముని పూర్వజన్మ చరిత్ర.
“ ఓ కర్దమా! నీవు పూర్వజన్మలో ఒక దుర్బల క్షత్రీయుడవై జన్మించావు! కుటుంబపోషణమే గగనమై అనేక కర్మలు చేసేవాడివి! ఐతే ఎన్నివిధాల శ్రమించినా నీ ఆర్జన సరిపోయేదేకాదు! దానికితోడు భార్యాపుత్రులుకూడా నిన్ను అనేక నిష్టూరాలాడుతూ అనేకరకాల భాదించేవారు. ఆ బాధనుండి దూరమవటానికి ఎవరికీ తెలియరాని ఘోరారణ్యంలోకి వెళ్ళవు! ఆ అరణ్యంలో అటూయిటూ తిరిగి చిట్టచివరకు ‘సౌభరి’ అనే ఋషిని దర్శించావు! ఆయన సిద్ధాసనంలో కూర్చుని అనేక మునులచేత సేవించబడుతూ దుఃఖనివారణకరమైన మహావిద్యను ఉపదేశిస్తుండగా వారిని దర్శించి, భక్తితో సాష్టాంగ దండప్రణామాన్ని ఆచారించావు!
అప్పుడాముని నిన్ను ఆదరంతో ఉచితాసీనుణ్ణి చేసాడు. ఒక శుభతరుణంలో ఆ సౌభరినిలా ప్రశ్నించావు:
“ఓ స్వామీ! భార్యాబిడ్డల నిరసనవాక్యాలచే తీవ్రంగా నొచ్చి,ఈ సంసారకూపంలో చిక్కుకొని అమితమైన కేశాన్ననుభవిస్తున్నాను. సుఖదుఃఖాలనే ద్వంద్వాలతో తీవ్రంగా పీడిoచబడుతున్న నాకు, ఈ సంసార సాగరాన్ని తరింపచేసే ఉపాయాన్ని సెలవియ్యండి!”
“నాయనా! స్కందా! ఆ కర్ణముని మాటలకు విచలితుడైన మహర్షి ఆతడి బాధానివారణకై యోచించసాగాడు! కొంతతడవైనాక ఆ క్షత్రీయుణ్ణి చేరబిలిచి ఈవిధంగా ఉపదేశించాడు:
“ఓరాజా! నీయోక్క సకల దుఃఖాలనూ పోగొట్టి, సమస్త శుభాలనూ ప్రసాదించగల మహోత్కృష్టమైన వ్రతమొకటున్నది! దానిని “వరదగణేశవ్రత”మని అంటారు. ఈ వ్రతాన్ని అనుష్టించి పూర్వం నాలుగు వర్ణాలవారు, (బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు), ఋషులూకూడా సమస్త దుఃఖాలనుండి విముక్తులై సర్వసిద్ధులనూ పొందారు! ఈ వ్రతం చతుర్విధ పురుషార్ధాలను నిస్సంశయంగా యిస్తుంది!”
సౌభరిఋషియొక్క మాటలు ఆ క్షత్రియుని హృదయంపై పన్నీటిజల్లులా కురిసాయి! ఆ మాటలకు అతడి అంతరంగమంతా చంద్రుడిని చూసిన కడలిలా సంతోషంతో ఉప్పొంగింది! అతడు సౌభరిమహర్షి నిలా ప్రశ్నించాడు :
“ఓమహార్షీ! ఆ గణేశుడెవరు? ఎట్టివాడు? ఆతని మహిమలెలాంటివి? ఆతడు ఏయే లీలలను చేశాడు? ఆతడేలా ఆవిర్భవించాడు? ఆ వివరాన్నంతటినీ నాకు దయతో తెలియజేయవలసింది!”
అప్పుడా సౌభరిమహర్షి తన ప్రశాంత మృదుభాషణను యిలా కొనసాగించాడు.
“నిర్వికారము, శోకరహితము, ఆదిమధ్యాంత రహితము, జ్ఞాన స్వరూపమైన ఏ పరబ్రహ్మతత్త్వం వేదాలచేత వర్ణించబడుతున్నదో, అట్టి పరబ్రహ్మస్వరూపమే గజాననుడని వేదవిదులు చెబుతారు!
ఆయననుండే ఆదిలో ప్రణవనాదం ఓoకారంగా ఉద్భవించింది! సకలజగత్తూ, వేదాలూ ఆయననుండే ఉద్భవించాయి! ఆతడే ఈ యావద్బ్రహ్మాండమంతా వ్యాపించినవాడు! సృష్టిచేయగోరిన చాతురాస్యుడెవరికై నూరుసంవత్సరాలు ఘోరమైన దివ్యతపస్సు ఆచరించాడో, సకల ఉపచారములతో ఎవరిని పూజించి, సిద్ధిబుద్ధియనే తన కుమార్తెలను సమర్పించాడో, ఎవరివల్ల ఆ బ్రహ్మ ఏకాక్షరీ విద్యను పొందాడో ఆ ఘనుడో విఘ్నేశుడైన గజాననుడే! ఆ ఎకాక్షరీ మంత్రప్రభావంచేతనే బ్రహ్మ ఈ సృష్టికార్యాన్నీ గణేశానుగ్రహంవల్ల నిర్వహించగలిగాడు.
అలాగే షడక్షర మంత్రముద్వారా విష్ణువుచే జపించబడి, ఆరదింపబడ్డవాడూ, తన అనుగ్రహాన్ని కురిపించి లోకపాలనశక్తిని విష్ణువుకు ప్రసాదించినదీ ఆ భక్తవత్సలుడే!
కనుక విశ్వమే రూపమైనట్టివాడూ, అనాదినిలయుడూ, కారణాలకే కారణమైనవాడు ఐన ఆ గజాననుని ఆరాధించి, ఓరాజా! నీవు సఫలీకృతుడవు కావలసింది! ఆయన అనుగ్రహాన్ని పొందిననాడు సకలమూ నీకు సులభసాధ్యమౌతుంది! నీవు సకల దుఃఖాలనుండీ విముక్తుడవు అవుతావు!”
అప్పుడు ఆరాజు మహర్షితో తనకా వ్రాతవిధానాన్ని, ఆచరిoచటానికి అనువైన సమయాన్ని తెలియజేయమని శ్రద్ధగా కోరాడు! అప్పుడు సౌభరిమహర్షి చిరునవ్వు చిందిస్తూ ప్రసన్నంగా యిలా తెలియజేసాడు.
“ఓరాజా! ఈ వరదగణేశ వ్రతాన్ని శ్రావణశుద్ధ చవితినాడు ఆరంభించాలి! అక్కడినుండి భాద్రపదశుద్ధ చవితివరకూ చేయాలి! ప్రతిదినమూ ఒక నూతనమైన పార్ధివగాణేశమూర్తిని నిర్మించి షోడశోపచారాలతోనూ పూజించాలి! వ్రాతంతములో బ్రాహ్మణభోజనాన్ని దక్షిణపూర్వకంగా సమర్పించాలి! నీవుగనుక ఈవిధంగా శ్రద్ధతో ఆచరించినట్లైతే నీకు సర్వదుఃఖశాంతీ అవటమేకాక నీయొక్క సకలాభీష్టాలూ తప్పక నెరవేరతాయి!
“ఓ కార్దముడా! నీవీరీతిగా పలికిన సౌభరిమహర్షి స్వాదువచనాలని ఆలకించి, శ్రద్ధగా ఆయన ఆశ్రమంలోనే ఈ వరదగణేశవ్రతాన్ని నిర్వహించావు! అలా నీచేత వ్రతం పరిపూర్తి చేయబడగానే గణేశానుగ్రహంచేత దాసదాసీజనంతోనూ, వేధఘోషలతో ప్రతిధ్వనించే, గోధన, సంపదలతో కూడిన ఒక సుందరమైనభవనం ఏర్పడింది! నీ సంతానంకూడా అందులో దివ్యవస్త్రాలంకార భూషితులై ఉండటాన్ని చూచావు! నీభార్య ఈ విశేషాన్ని అంతటినీ చూసి నీకై నిరీక్షించసాగింది. నీవు మునివద్ద అనుజ్ఞ తీసుకొని యింటికి తిరిగి చేరుకున్నావు!
నీ భార్యచేత పంపబడిన సేవకులు నీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతూ అమితోత్సహముతో యింటికి తీసుకెళ్ళారు. నీవు ఆ గణేషుని ప్రభావానికి అత్యంత ఆశ్చర్యచకితువడై, ఇదంతా ఆయన అనుగ్రహమేనని భావించావు! ఆ వ్రతాన్ని ఆనాడు ఆచరించినందువల్లనే యిప్పుడిలా ఘనకీర్తి వహించిన మహారాజువైనావు!”
అంటూ భ్రుగుమహర్షి తాను దివ్యదృష్టిద్వారా దర్శించిన కర్దముడి పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడికి వివరించాడు. అప్పుడు ఆనందంతో పులకాంకితుడైన కర్దముడు తిరిగి అదేవిధంగా ఘనంగా వరదగణేశుని వ్రతాన్ని అనుష్టించి, ఆ వ్రత ప్రభావంవల్ల జ్ఞానవైరాగ్య సంపన్నుడై, ఇహంలో సర్వసౌఖ్యలనూ అనుభవించి, తన కుమారులకు పట్టంకట్టి, పునరావృత్తిరహితమైన గణేశలోకానికి చేరుకున్నాడు.
‘ఓస్కందా! ఈ వ్రతం సర్వార్ధసాధకమైనది. దీనితో సాటియైన వ్రాతంగానీ, దానంకానీ మరొకటిలేదు! కనుక నీకు యిచ్చవుంటే దీన్ని అనుష్టించు! దీన్ని అనేకమంది దేవతలు, గంధర్వులు, మానవులుకూడా చేసారు! నలుడు, ఇందుమతి, చంద్రాంగదుడు మొదలైనవారు ఈ వ్రతాన్ని ఆచరించి, తమ ఇష్టార్ధములు పొంది, చివరకు గణేశపదాన్ని పొందారు!’ అంటూ పరమశివుడు అనూగ్రహించాడు.
“కనుక ఓపార్వతీ! నీవూ నీభర్తతో సాన్నిధ్యాన్ని కోరావు. అందుకై ఉత్తమవ్రతాన్ని ఉపదేశించమని కోరావు కనుక, ఆ వ్రతాన్ని ఇతిహాసంతో, కూడా ఉపదేశించాను. నీవు మనసా ఆ వరడుదినే ధ్యానిస్తూ, ఈ వ్రతాన్ని నిష్టతో ఆచరించితే నీ మనోభిష్టాన్ని ఆవశ్యం పొందగలవు! అమ్మా! నీయందుగల ప్రేమచేత ఈ వ్రతాన్ని చెప్పను. ఇది ఇతరులెవ్వరికీ ప్రకటించకు! పరమ గోపనీయమైనదీ మహత్తర ఫలప్రదమైనదీ ఈ వరదగణేశ వ్రతము!” అన్నాడు హిమవంతుడు.
Chapter 51 complete
