మార్కండేయ మహా పురాణము

Table of Contents

128 - మరుత్త చరిత్రము

అవీక్షితుడు అచటకు చేరుకొని ధనుర్దారియై శస్త్రమును సంధించి యున్న పుత్రుని చూచెను. అతని ఉగ్ర శస్త్రము జ్వాలలచే అన్ని దిక్కుల వ్యాపించి యుండెను. ఆ అస్త్రము నుండి వెలువడు చున్న మహావహ్నిచే భూమి దీప్తివంత మయ్యెను. మరియు అసహ్యము, ఘోరము, భీకరమగు ఆ యగ్ని పాతాళ లోకమున గూడ వ్యాపించెను. అవీక్షితుడు కనుబొమలు ముడివడి క్రోధముగా నున్న మరుత్త రాజును చూచెను. అప్పుడు అతనితో నిట్లు పలికెను. ‘ఓ మరుత్తా! అస్త్రమును ఉపసంహరించుము. క్రోధమును విడువుము.’ అనేక మారులు వారి వచనములతో వర్ణక్రమము లుప్తమవ్వ సాగెను. అప్పుడు ఆ ఉదార బుద్ధి తండ్రి యొక్క పలుకులు విని, మాటి మాటికి తండ్రిని చూచుచూ, చేతిలోని ధనుస్సును వదలకయే తల్లి దండ్రులకు నమస్కరించి సగౌరవంగా నిట్లు పలికెను. తండ్రీ! ఈ పన్నాగ గణాలు నాకు అపరాధులు.

ఈ నాగులు నా శాసన కాల మందు నా బలమును లెక్క చేయక ఈ ఆశ్రమ మందు చేరి ఏడుగురు ముని కుమారులను కాటు వేసినవి. మరియు ఓ అవనీ పతీ! నా శాసన కాలమున ఈ దుర్వృర్తులగు సర్ప గణాలు ఆశ్రమ వాసులగు ఋషుల యొక్క అగ్నులను మస్త జలాశయములను కలుషితములను చేయు చున్నవి. అందు వలన ఓ తండ్రీ! మీరు ఈ విషయమున ఏమియును చెప్ప వద్దు. బ్రాహ్మణ ఘాతకులగు పన్నగముల యొక్క నిధన కార్యమును నివారింపకుడు.’

కుమారా! బ్రహ్మ హత్య చేసినచో వీరు మృతి చెందిన పిమ్మట నరకమును పొందుదురు. నీవు అస్త్ర ప్రయోగమును విరమించి నా పలుకులను గౌరవించుము.

“ఈ పాపులను దండింపనిచో నేనును నరకమునకు పోవుదును. అందుకే ఓ తండ్రీ ! నన్ను వారింప వలదు. దుష్టులగు ఈ అపరాధులను నేను క్షమించను.”

ఈ పన్నగ గణాలు నన్ను శరణు పొందినవి. ఈ కారణముచే ఓ కుమారా! నా ధర్మమును రక్షించుట కైనను నీవు నీ కోపమును తగ్గించుకొని అస్త్రమును ఉపసంహరించుము.

నేను దుష్టులగు ఈ అపరాధులను క్షమించను. నా ధర్మమును విడిచి మీ వచనముల నెట్లు రక్షింప గలను? దండనీయులగు ప్రజలను దండించి, శిష్టులగు పురుషులను పాలించుటచే రాజునకు సమస్త పుణ్య లోకములు సంప్రాప్తించును. కాని అట్టి దానిని ఉపేక్షించుట వలన నరక ప్రాప్తి కలుగును.

తండ్రి ఇట్లు మాటి మాటికి నివారించి నప్పటికీ పుత్రుడగు మరుత్తుడు తన అస్త్రమును ఉపసంహరించ లేదు. అప్పుడు తిరిగి అతడు పుత్రునితో ఇట్లనెను. ‘భీతి చెందిన ఈ పన్నగా గణాలు నన్ను శరణు బొందినవి. ఈ కారణముచే నేను నివారించి నప్పతికినీ నీవు వీటిని హింసించు చున్నావు. అందుచే నేను దీనికి తగిన ప్రతిక్రియ చేయవలసి యున్నది.’

భూమండల మందు కేవలము నీ వొక్కడవే అస్త్ర వేత్తవు గావు. నేను కూడా అనేక అస్త్రములను ఎరుగుదును. ఓ దుర్వృత్తుడా! నా ముందు నీ పౌరుష మెంత? ఓ ముని పుంగవా! అవీక్షితుడు ఈ విధముగా పలికి క్రోధముచే తామ్రాలోచనుడై ధనస్సుపై త్రాడును బిగించి కాలాస్త్రమును గ్రహించెను. ఓ విప్రా! ఈ కలాస్త్రమును ప్రయోగించుటకు ఉద్య మించిన సమయమున మరుత్తుని సంవర్తకాస్త్రముచే తపించి నట్టి పర్వతములు, సముద్ర యుక్తమగు సంపూర్ణ జగత్తు క్షోభించినది.

మరుత్తుడు కూడా ఆ ఎక్కు పెట్టిన కాలాస్త్రమును చూసి హెచ్చు స్వరముతో నిట్లు పలికెను. “నా యొక్క సంవర్తకాస్త్రము దుష్టులకు శాస్తి చేయుటకు ఉద్యుక్త మైనది.”

నిన్ను వధించుటకు కాదు. అయిననూ సత్య పథము నవలంభించు నట్టి మరియు సర్వదా మీ ఆజ్ఞలను పాలించు పుత్రుని యెడల మీరు దేని నిమిత్తము కాలాస్త్రమును విడుచు చున్నారు? ఓ మహాభాగా! ప్రజలను పాలించుటయే నా కర్తవ్యము. మీరు నా వినాశనార్థము ఏ విధముగా నిట్లు అస్త్రమును విడుచు చున్నారు?

నేను శరణాగత పురుషులను రక్షింప వలెనని సంకల్పించి నాను. ఈ కార్యమునకు నీవు విఘ్నమును కలిగించు చున్నావు. ఈ కారణమున నీవు జీవించి యుండగా నా నుండి రక్షణ పొంద లేవు. ఇప్పుడు నీవు అస్త్ర బలముచే నన్ను నాశనము చేసి పిమ్మట దుష్టులగు ఉరగ కులమును వధింపుము. లేదా నేనే నిన్ను అస్త్ర సహాయముతో వధించి సర్పములను రక్షించెదను. శత్రు పక్షము వారైననూ ఆర్తులై శరణు బొంది వచ్చినచో ఏ మనుష్యుడు ఆతనిని రక్షింపడో, అతని జీవితము వ్యర్థము.

నేను క్షత్రియుడను. భీతావహులై ఇవి నన్ను శరణు బొందినవి. మరియు నీవు వీటికి అపకారము చేయు చున్నావు. అందు వలన నీవు నాచే వధింప బడుటకు యోగ్యుడవు ఎందుకు కావు?

మిత్రులు, తండ్రి లేక గురువు ఎవరైననూ ప్రజా పాలన యందు విఘ్నకారు లైనచో తప్పక వారు రాజుచే వధింప బడుటకు యోగ్యులు. ఈ కారణమున ఓ తండ్రీ ! నేను మీ మీదకు బాణములను వేశెదను. మీరు కోపగించకుడు. స్వధర్మ పరిపాలనయే నా కర్తవ్యము. మీపై నాకు క్రోధము లేదు.

ఇట్లు ఆ ఇద్దరు పరస్పరము వధించుటకు కృత నిశ్చయులగుట చూచి భార్గవాది మునులు వెంటనే అచటకు వచ్చి ఆ ఇద్దరి మధ్య నిలచిరి. మరియు మరుత్తునితో నిట్లు పలికిరి. “ నీవు కూడ విఖ్యాత కర్ముడగు ఈ పుత్రుని నాశనము చేయ రాదు.”

ఓ ద్విజులారా! నేను రాజును. దుష్టుల రక్షణ చేయుట నా ముఖ్య కర్తవ్యము. ఈ భుజంగములు దుష్టులు. అందువలన ఈ విషయ మందు నా దోష మేమున్నది?

ఓ విప్రులారా! శరణార్ధులై వచ్చిన వారిని రక్షించుట యే నా కర్తవ్యము. ఏ పుత్రుడు ఆ శరణార్ధులను నాశనము చేయు చున్నాడో, అతడు నాకు అపరాధి.

“భయముచే చంచల నేత్రులగు భుజంగములు” ఏ బ్రాహ్మణులను దుష్ట పన్నగములు కాటు వేసినవో, మేము వారిని జీవింప చేయుదుమని చెప్పు చున్నవి. అందు వలన ఇప్పుడు యుద్దము చేయ వలసిన అవసరము లేదు. ప్రసన్నత చెందుము. మీరిద్దరును రాజ శ్రేష్ఠులు మరియు ఇద్దరును ఏ విధముగా ధర్మ వేత్తలో అట్లే పాలకులు కూడా అని పలికిరి.

ఆ సమయమున వీరాదేవి అచ్చటకు వచ్చి పుత్రుడగు అవీక్షితునితో నిట్లనెను. నా వచనముల ననుసరించియే నీ పుత్రుడు సర్ప వినాశము చేయుటకు ఉద్యుక్తు డయ్యెను.

ఎప్పుడైతే మరణించిన బ్రాహ్మణులు తిరిగి జీవించెదరో, అప్పుడు ఈ కార్యము సంపన్న మయ్యెను. అందువలన నీ ఈ శరణార్థులు కూడ విముక్తులైరి.

పాతాళ వాసులగు ఈ సర్పములు పూర్వము నన్ను ఈ విధముగా అభయ మిమ్మని ప్రార్థించిరి. ఈ కారణమున నేను నా భర్తను ఈ విషయ మందు కోరితిని. ఇప్పుడు నా భర్త మరియు పుత్రుడు అనగా మీ పుత్రుడు మరియు పౌత్రుని వలన ఈ కార్యము అందమైన రీతిలో సంపన్న మైనది.

అనంతరము నాగ దేవతలు దివ్య ఔషదములచే విషమును హరించి ఆ బ్రాహ్మణులను బ్రతికించినవి. అటు పిమ్మట మహీపతి యగు మరుత్తుడు కూడా తల్లి దండ్రుల చరణములపై బడి నమస్కరించెను. అవీక్షితుడు మరుత్తుని ప్రీతిచే ఆలింగనము చేసుకొని ఈ విధముగా ఆశీర్వదించెను.

“శత్రువుల మానమును నాశనము చేయు వాడ వగుదువు గాక సదా భూమిని పాలింపుము. పుత్రా పౌత్రాదులచే సుఖముగా కాలమును గడుపుము. మరియు నీ శత్రువులు నాశనమును పొందుదురు గాక” పిమ్మట బ్రాహ్మణుల మరియు వీరి యొక్క ఆజ్ఞను పొంది రాజు లిద్దరు భామినిని రథముపై ఎక్కించుకొని తమ నగరమునకు వెళ్ళిరి. మరుత్త రాజు కూడ నలు దిక్కులా నున్న శత్రువులను ఓడించి, ధర్మానుసారముగా పృథ్వీ పాలన చేయుచూ అనేక భోగ సుఖము లనుభవించెను. విదర్భ కన్య మహాభాగ యగు ప్రభావతి, సువీరుని కన్యయగు సౌవీరీ, మగధీశ్వరుడగు కేతువీర్యుని కుమార్తె “సుకేశీ”, ముద్ర రాజగు సింధు వీర్యుని పుత్రిక, కేకయుని కుమార్తె “కేకయీ”, సింధు రాజు యొక్క పుత్రిక “సైందవీ” మరియు చేది రాజు యొక్క కన్య “వపుష్మతి” ఈ యందరు లలనామణులు అతనికి భార్యలైరి.

ఓ ద్విజుడా! ఈ భార్యల గర్భము నుండి ఆ రాజుకు పదునెనిమిది మంది పుత్రులు జన్మించిరి. వారిలో “నరిష్యంతు”డను పుత్రుడు జ్యేష్టుడు మరియు శ్రేష్టుడు. మహారాజు, మహా బలవంతుడు నగు మరుత్తుని వీర్యము ఎట్టిదన ఏడు ద్వీపము లందును అతని చక్రము అప్రహతిమై యుండెను. బల విక్రమశాలి, అమిత తేజస్సుడగు ఆ రాజర్షితో సమానుడగు వేరు రాజు పుట్ట లేదు. మరియు పుట్ట బోడు. ఓ ద్విజశ్రేష్టా! ఆ మహాత్ముడగు మరుత్తుని చరిత్ర విని నంతనే సంపూర్ణ పాపముల నుండి విముక్తిని పొందుదురు. మరియు మరణించిన పిమ్మట శ్రేష్ఠ మగు జన్మను పొందుదురు.