మార్కండేయ మహా పురాణము
105 - రవి మాహాత్మ్య వర్ణనము
విశ్వకర్మ ఈ విధముగా దివస్పతి యగు సూర్యుని స్తుతించి అతని తేజస్సు యొక్క పదునారవ భాగమును మండల మందుంచెను. అప్పుడు తేజస్సు యొక్క పదిహేను భాగములు వేరగుటచే సూర్యుని ఆకారము అతి సుందరము, కాంతి యుక్తముగా నుండెను. సూర్యుని వలన విడువ బడిన తేజస్సుచే శత్రువుల వినాశ నార్ధము విష్ణువునకు చక్రము, శివునికి త్రిశూలము, కుబేరునికి పల్లకి, యమునికి దండము, కార్తికేయునికి శక్తి మఱియు అన్యాన్య దేవతలకు దీప్తి వంతము లగు అస్త్రములను విశ్వ కర్మ నిర్మించెను. ఈ విధముగా క్షీణ తేజుడైన మార్తాండుడు శోభిల్ల సాగెను. శత్రు నాశన నిమిత్తము అతని శరీరము అత్యంత మనోహరముగా నయ్యెను.
మరియు అత్యంత తీవ్రతా రహితమగు తేజస్సుచే సమస్త అవయవములచే శోభాయ మానమగు శరీరమును ధరించెను. పిమ్మట స్థితుడై తన భార్యను ఆడ గుఱ్ఱము రూపములో నుండగా చూచెను. ఆమె ఉత్తర కురు దేశము నందు సమస్త భూతములకు ఆధర్షితురాలై అత్యంత నియమ సహితముగా తపస్సు చేయు చున్న సంజ్ఞా దేవి సమీపమునకు సూర్యుడు కూడ అశ్వ రూపమును ధరించి వెళ్ళెను. అప్పుడు ఆడ గుఱ్ఱము రూపములో నున్న సంజ్ఞా దేవి అతడు వచ్చు చుండుట చూచి పర పురుషునిగా తలచి తనను రక్షించు కొనుటకు యోని రక్షణ తత్పరు రాలై అతనికి ఎదురుగా బోయెను. అప్పుడు ఒకరి కొకరు సమీపముగా వచ్చుటచే ఆ యిద్దరి నాసికలు కలిసెను. ఆ సమయమున వివస్వానుని తేజస్సు నాసికా యుగళము ద్వారా ఆడ గుఱ్ఱము గర్భమున ప్రవేశించెను. దాని వలన భిషక్శ్రేష్ఠు లగు ఇద్దరు అశ్వినీ కుమారులు జన్మించిరి. అశ్వము యొక్క ఆ ముఖము నుండి వెలువడిన “నాసత్య” మరియు “దస్ర” అను ఈ యిద్దరు.
అశ్వ రూప ధారుడగు మార్తాండుని పుత్రులే. వీర్యము యొక్క శేష భాగము నుండి కవచ యుక్త శరీరుడు. ఖడ్గధారి ధనుర్ధారియై గుఱ్ఱము పైనెక్కి బాణములతో నిండిన అంబుల పొదితో రేవతుడు అనువాడు జన్మించెను. అనంతరము అంశుమాలి యగు సూర్యుడు తన నిర్మల స్వరూపమును కనబరిచెను. అతని ఆ శాంత స్వరూపము చూచి అతి ప్రసన్న చిత్తురాలై సంజ్ఞా దేవియును తన స్వరూపమును ధరించెను. అప్పుడు వారి శోషకు డగు భాస్కరుడు ప్రీతి మతి యగు భార్యను తన నివాసమునకు తీసుకొని పోయెను. సంజ్ఞాదేవి యొక్క జ్యేష్ఠ పుత్రుడు వైవస్వత మనువయ్యెను. రెండవ కుమారుడగు యముడు శాపము వలన మరియు అనుగ్రహము యొక్క కారణముచే ధర్మ దృష్టిగా మారెను. యముడు ఆ శాప కారణమున అత్యంత వ్యధితుడై,
ధర్మాచరణ యందు ప్రవృత్తు డయ్యెను. అందుచే అతడు “ధర్మరాజు” అను పేరుతో కీర్తింప బడు చున్నాడు. అతని తండ్రి “కృములు నీ పాదము నుండి మాంసమును గ్రహించి పృథ్వీతల మందు పడు గాక,” అని ఈ విధముగా శాపాంతమును చేసెను. యముడు ధర్మ ప్రవృత్తుడై శత్రు మిత్రుల యందు సమానముగా వ్యవహరించు చుండెను. ఈ కారణముచే సూర్యుడు ఆతనిని ధక్షిణ దిక్కు యొక అధికారము నందు నియమించెను. ఓ విప్రా! భగవానుడగు దివాకరుడు పరితుష్టుడై ఆతనిని లోక పాలనాధి కారము నందును. మఱియు పితరుల ఆధి పత్యమును కూడ ప్రసాదించెను. పిమ్మట తండ్రి యమునను కళింగ దేశమున అంతర్వాహినిగా ప్రవహించు నదిగా నియమించెను. మహాత్ముడగు ఆ తండ్రి ఇద్దరు అశ్వినీ కుమారులను దేవతలకు వైద్యులుగ నియమించెను. రేవంతుని గుహ్యకాధి పతిగా నియమించెను.
తరువాత లోక భావనుడగు సూర్య భగవానుడు ఆతనితో ఇట్లు పలికెను. “ఓ కుమారా! నీవు అశేష లోకముల లందు పూజింప బడుదువు గాక, మానవులు, వనములు, శత్రువులు, చోరులు మొదలగు వానిచే భీతి చెంది నిన్ను స్మరించినచో, నీవు వారి నందరిని ఆపదల నుండి కాపాడుదువు గాక, మరియు మానవులు నిన్ను పూజించినచో వారి యడల సంతుష్టుడవై వారికి శుభము, సుఖము, సుబుద్ది, రాజ్యము, ఆరోగ్యము, కీర్తి మరియు ఉన్నతులను ప్రసాదించెదవు గాక. ఛాయా సంజ్ఞ యొక్క సావర్ణి అను మహా యశ వంతుడగు పుత్రుడు భవిష్యత్తు నందు “సావర్ణిక మనువు” అను పేరుతో ఎనిమిదవ మనువగును, ఈ సమయమున ఆతడు మేరు పర్వతము నందు ఘోర తపస్సు చేయు చున్నాడు. అతని సోదరుడగు శనైశ్చరుడు ఆదిత్యుని ఆజ్ఞచే “గ్రహ” మయ్యెను.
ఓ ద్విజోత్తమా! ఆదిత్యుని కుమార్తె లోక పావని యగు యమున, నదులలో శ్రేష్ఠమైనది. జ్యేష్ఠ పుత్రుడు వైవస్వత మనువు ప్రస్తుతము యీతని సృష్టి జరుగు చున్నది. అతని వంశ విస్తారమును పిమ్మట వర్ణించెదను. ఈ సూర్య పుత్రులగు దేవతల జన్మ కథలను మరియు రవి యొక్క మహాత్మ్యమును ఏ పురుషుడు వినునో, లేక చదువునో, అట్టి పురుషుడు తనకు సంభవించిన ఆపదల నుండి విడువ బడిన వాడి గొప్ప యశస్సును పొందును. మరియు ఆది దేవుడు, మహాత్ముడు నగు మార్తాండుని మహాత్మ్యమును వినుట వలన అహో రాత్రములు చేసిన సంపూర్ణ పాపములు నశించును.
