మార్కండేయ మహా పురాణము

Table of Contents

76 - వైవస్వత మన్వంతర వృత్తాంతము

ఆదిత్య, వసు, రుద్ర, సాధ్య, విశ్వ, మరుత, భృగు, అంగీరసులను ఈ ఎనమండుగురు ఈ మన్వంతర మందు దేవతలు. వీరిలో ఆదిత్యాలు, వసు, రుద్ర గణాలు కష్యపుని సంతానము. సాధ్య, విశ్వ, మరుత గణాలు అను ఈ మూడు గణాలు ధర్ముని పుత్రులు. భృగు గణ దేవతలు భృగుని పుత్రులు. అంగీరో గణాలు అంగీరసుని పుత్రులు. ఓ ద్విజుడా! ఈ సర్గమును ఇప్పుడు మారీచ సర్గమని ఎరుగ వలెను. ఈ మన్వంతర మందు ఊర్జస్వి యను మహాత్ముడు ఇంద్రుడై యజ్ఞఫల భోగుడయ్యెను. పూర్వము ఇంద్రుడుగ నున్న వారు, తరువాత ఎవరు ఇంద్రుడగునో, ఇప్పుడు ఎవరు ఇంద్రత్వములో నున్నారో, వీరందరూ దేవేంద్రుని వలెనె సమ లక్షణము గల వారుగా విఖ్యాతి చెందిరి. అందరూ సహస్రాక్షులు, వజ్రధారులు, మరియు పురంధరులు.

అందరు ఇంద్రులు, వృషభ శృంగధారులు, మరియు గజగాములు వారందరూ శత యజ్ఞకారులు భూత పరాభవ కారులు, తేజో యుక్తులు. ఓ ద్విజుడా! వారందరూ పరిశుద్ద ధర్మాదులకు కారణమగుటచే ఆధిపత్య గుణ యుక్తులు, మరియు భూత, భవిష్యత్, వర్తమానములకు అధిపతులు. ఇప్పుడు త్రైలోక్యముల విభాగమును వినుము. ఈ లోకమును భూర్లోకమనీ, అంతరిక్షమును ‘దివ్య లోక’ మని స్వర్గమును ‘దివ్యాఖ్య’ మని అందురు. ఈ మూడింటిని త్రిలోకములని చెప్పిరి. అత్రి, వశిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, కుశిక నందనుడగు విశ్వామిత్రుడు మరియు మహాత్ముడు, భగవానుడు, ఋచీక నందనుడగు జమదగ్ని, ఈ ఏడుగురు మునులు ఈ మన్వంతరమున సప్తర్షులుగా నుండిరి.

ఇక్ష్వాక్షు, నాభాగ ధృష్ట శర్యాతి, నరిష్యంత, నాభాగ, దిష్ట, కరూశ పృషధ్రులు అను ఈ తొమ్మిది మంది వైవస్వత మనువు యొక్క దీప్తి మంతులు జగద్విఖ్యాతులగు పుత్రులు. హే బ్రాహ్మన్! నేను ఈ వైవస్వత మంవంతరమును నీకు వర్ణించితిని. ఓ మునిశ్రేష్టా! దీనిని వినిన వారు లేక చదివిన వారు వెంటనే అన్ని పాపములనుండి విడువబడి పుణ్యము ననుభవింతురు.