మార్కండేయ మహా పురాణము
59 - స్వారోచిష మన్వంతరము
ఈ విధముగా పలుకు చుండగనే ఆ ద్విజ పుత్రుని శరీరము నందు గార్హపత్య అగ్ని ప్రవేశించెను. దానిచే ప్రభా మండల మధ్యవర్తుడై ఆ బ్రాహ్మణుడు మూర్తీభవించిన అగ్ని దేవుని వలె స్వయముగా ఆ దేశమును ప్రకాశింప చేయ సాగెను. ఓ విప్రా! ఎప్పుడయితే వరూథిని అను పేరు గల అప్సరస ఈ విధముగా ఆ బ్రాహ్మణుని రూపమును చూచెనో, అప్పుడు అత్యంత అనురాగముచే ఇంకనూ అధికముగ మోహితురాలైనది. ఎప్పుడు ఈ ద్విజ కుమారుని యందు అగ్ని దేవుని ప్రవేశము కలిగినదో వెంటనే అతడు పూర్వము వలె శక్తి మంతుడై ప్రయాణించుటకు ప్రవృత్తు డయ్యెను. వరూథిని నిలిచి చూచు చుండగనే ఆ విప్ర కుమారుడు అత్యంత వేగముతో నడచి పోయెను. ఎపుడు ఈమెకు కనిపించ లేదో అపుడు ఆమె దీర్ఘముగా శ్వాస వదులుతూ కంపింప నారంభించెను.
తదనంతర మందు ఆ ఉత్తమ బ్రాహ్మణుడు క్షణ కాలముననే తన గృహమునకు చేరుకొనెను. మరియు పూర్వోక్త ప్రకారముగా నిత్య నైమిత్తిక సంపూర్ణ క్రియలు చేయ నారంభించెను. అక్కడ సర్వాంగ సుందరి యగు ఆ వరూథిని ఆ ద్విజ వరుని యెడల అసక్త చిత్తురాలై దీర్ఘ శ్వాసలను విడుచు చున్నదై ఆ దినము యొక్క శేష భాగమును, మరియు ఆ రాత్రి అంతయు గడిపెను. మదిరేక్షణా, సర్వాంగ సుందరి యగు ఆ అప్సర హా హా కారము చేయుచూ, రోదించుచూ నిందించు కొన సాగెను. ఆహార విహారములు, రమణీయ వనములు, మనోహరములగు పర్వతముల యొక్క కందరములు ఉన్ననూ, వేటి వలననూ ఆమె సుఖమును పొంద లేక పోవుచున్నది. రెండు చకోరములు రమించుట చూచి ఆమెకు రమించుట యందు స్పృహ కలిగెను. కాని ఆమె ద్విజ వరునిచే త్యజింప బడెను. అందుచేత ఆమె తన యౌవనమును నిందించు కొన సాగెను.
