మార్కండేయ మహా పురాణము

Table of Contents

67 - ఔత్తర మన్వంతర వృత్తాంతము

అనంతరము ఆ మహర్షికి నమస్కరించి తన రథము నెక్కి ఆయన చెప్పిన ఉత్పలావత మను వనమును చేరుకొని, అక్కడ భర్త ఏ ఏ స్వరూపమును తెలిపెనో, అట్లే రూపము గల ద్విజ పత్నిని చూచెను. ఆమె శ్రీ (మారేడు) ఫలములను భక్షించు చుండెను. ఆమెను చూచి ఇట్లడిగెను. “ఓ భద్రా! నీ వెట్లు ఈ వనమునకు వచ్చితివి? నీవు విశాలుని యొక్క పుత్రుడగు సుశర్ముడను బ్రాహ్మణుని పత్నివా? కాదా? చెప్పుము.”

నేను వనవాసి యగు అతిరాత్రు డను బ్రాహ్మణుని కుమార్తెను. నీరు చెప్పిన విశాల పుత్రుని భార్యను నేను గృహము నందు నిద్రించు చుండగా దురాత్ముడగు రాక్షసుడు తల్లి, సోదరుల నుండి వియోగము చేసి నన్ను అపహరించి తెచ్చెను.

తల్లి, సోదరుడు మరియు ఇతర పురుషు లందరి నుండి వేరై నేను దుఃఖించుచూ ఇచట నున్నాను. ఎవడు నాకు ఇట్టి స్థితిని కలుగ చేసెనో, అట్టి ఆ రాక్షసుడు భస్మ మగుగాక. ఆ రాక్షసుడు నన్ను నిర్జన మగు దట్టమైన అడవి యందు తెచ్చి యుంచెను. అతడు ఏ కారణముచే నన్ను చెరచ లేదో, లేక భక్షింప లేదో నాకు తెలియదు.

ఓ ద్విజ నందినీ! నీ భర్త నను ఇటకు పంపెను. ఆ రాక్షసుడు నిన్ను ఇచట విడిచి ఎక్కడకు వెల్లెనో నీకు తెలియునా?

ఆ రాక్షసుడు ఈ వన ప్రదేశము నందే యున్నాడు. నీకు ఆతని భయము లేనిచో అటు వెళ్ళి చూడుము. నీకు కనుపించును.

ఆ బ్రాహ్మణి మార్గము చూపిన పిమ్మట రాజు అచటకు చేరుకొని పరివారముతో తిరుగు చున్న ఆ రాక్షసుని చూచెను.

ఆ రాజును చూచుటతోనే వెంటనే లేచి దూరము నుండి యే తలతో భూమిని తాకుచూ ఆ రాక్షసుడు అతని చరణములపై బడి ఇట్లు చెప్ప సాగెను.

నా యందు మహారాజుకు అనుగ్రహము కలుగుటచే నా గృహమునకు వచ్చితిరి. నేను మీ రాజ్యము నందు నివసించుదును. నాకు ఆజ్ఞ ఇండు. నేను ఏమి చేయవలెను? ఈ అర్ఘ్యమును స్వీకరింపుడు. ఈ ఆసనము నదిష్టింపుడు. నేను మీ సేవకుడను. మీరు సంకోచ రహిత మనస్కులై నాకు ఆజ్ఞ ఇండు.

ఓ నిశాచరా! నీవు నీ కర్తవ్యము లన్నియు చేసినావు. మరియు యథోచితముగా అతిథి సత్కారములు కూడా చేసితివి. కాని బ్రాహ్మణ వధువును దేని నిమిత్తము తీసుకొని వచ్చితివి? భార్యగా నుంచు కొనుటకని చెప్పలేను. ఎందుచేత ననగా ఆ బ్రాహ్మణ పత్ని రూపవంతురాలు కాదు. ఇంత అందమైన భార్య లుండగా ఈమె నెందుకు తెచ్చుదువు? ఒక వేల భక్షించుటకు తెచ్చినచో, ఆమెను ఎందులకు భక్షింప లేదు? ఇదంతయు నాకు చెప్పుడు.

రాజా! నేను మనుష్యులను భక్షించు రాక్షసుడను గాను. ఆ రాక్షసులు వేరు. పుణ్యమునకు ఎట్టి ఫల మున్నదో, దానిని భక్షించెదను. ఓ రాజా! ఏ కొంచెము పుణ్య ఫలమున్నదో దానిని మీకు చెప్పెదను. నేను క్రూరమును మరియు ప్రపంచమునకు భయమును కలుగ జేయు రాక్షసుని జన్మను పొందితిని. గౌరవమో, అగౌరవమో, ఏది ఏమైనను ఎల్లప్పుడూ నేను నరనారీ మణుల స్వభావములను భక్షించుదును. నేను జంతువులను తిను వాడను గాను, మరియు క్షమాయుక్త గుణ స్వభావములను భుజించుటకే మనుష్యులు క్రోథము గల వారగుదురు. ఎప్పుడు దుష్ట స్వభావములను భుజించెదనో అప్పుడు వారు గుణవంతు లగుదురు. ఓ భూపాలా! అప్సరసల వంటి రాక్షస భార్యలు అనేకు లున్నారు. వారుండగా మనుష్యుల నెందుకు అభిలషించెదను?

ఓ నిశాచరా! ఆ బ్రాహ్మణ పత్ని నీవు భోగించుటకు గాని లేక భక్షించుటకు గాని యోగ్యురాలు కానిచో నీవు ఏ కారణముచే బ్రాహ్మణుని ఇంటి లోనికి చోరపడి ఈమెను అపహరించితివి?

ఓ రాజా! ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మంత్రములు తెలిసిన వాడు. అతడు తరచుగా అన్ని యజ్ఞము లందు గమన పూర్వకముగా రక్షోఘ్న మంత్ర పాఠముచే నన్ను ఉచ్చాటన చేయు చున్నాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా మంత్రము వలన ఉచ్చాటన చేయు చున్నాడో అపుడు నేను ఆకలి కలవాడ నగు చున్నాను ఎచటికి పోవుదును? ఆ బ్రాహ్మణుడు అన్ని యజ్ఞము లందు ఋత్విక్కుగా ఉండును. ఈ కారణముచే అతని మనస్సు నందు ఉద్వేగమును కలిగించితిని. ఎందుచేత ననగా పురుషుడు భార్య లేనిచో యజ్ఞ కర్మలకు అనర్హుడగు చున్నాడు.

దీని కొఱకు మహామతీ! యగు బ్రాహ్మణుని చిత్త మందు ఉద్వేగమును కలిగించితిని. అని ఈ విధముగా రాక్షసుడు పలికిన వచనములను వినుత తోడనే రాజు అత్యంత విషాదమును పొందెను. మరియు “విప్రుని చిత్తము నందు వైకల్యమును కలిగించితిని” అని చెప్పి ఆ రాక్షసుడు నన్ను గూడ నిందించెను. ఇంతకు పూర్వము ఆ ముని సత్తముడు కూడా నన్ను ఈ కారణము చేతనే అర్ఘ్యమునకు అయోగ్యుడనని చెప్పెను.

ఇప్పుడు ఈ రాక్షసుడు కూడా “నా వలననే భార్యా హీనుడైన ఆ బ్రాహ్మణుని చిత్తము నందు ఉద్వేగము ఉత్పన్న మైనది” అని చెప్పు చున్నాడు. అందు వలన నేను గూడా భార్యా హీనుడనై ఘోర సంకటమున పడితిని.

ఓ మునీ! రాజు ఈ విధముగా చింతించు చుండెను. ఆ సమయమున రాజుకు నమ్రతతో ప్రణమిల్లి చేతులు జోడించి ఆ రాక్షసుడు తిరిగి చెప్ప సాగెను. ఓ నరేంద్రా! నేను నీ రాజ్య మందున్న రాక్షసుడను. అందు వలన ప్రణతుడ నైన ఈ భ్రుత్యునకు ఆజ్ఞ ఇచ్చి అనుగ్రహింపుడు.

ఓ నిశాచరా! నీవు “నేను స్వభావములను భుజించుదును” అని చెప్పితివి. అందువలన ఎట్టి కార్యమును కోరు చున్నానో, అది చెప్పెదను వినుము. ఇప్పుడు నీవు ఈ బ్రాహ్మణ స్త్రీ యొక్క దుశ్చరిత్రమును భుజింపుము. ఎందుచేత ననగా నీ వలన ఈమె దుస్స్వభావము భక్షింప బడినదో ఆమె పునీతు రాలగును.

ఆ తర్వాత ఓ నిశాచరా! ఈమె ఎవరి భార్యయో అతని గృహమున ఉంచి రమ్ము. ఈ విధముగా చేసినచో నీ వలన నాకు అతిథి సత్కారము చేసి నట్లగును.

అనంతరమా రాక్షసుడు తన మయా బలముచే ఆ బ్రాహ్మణి యొక్క అంతస్సు యందు ప్రవేశించి రాజు యొక్క ఆజ్ఞానుసారము నిజ శక్తిచే ఆ బ్రాహ్మణి యొక్క దుస్స్వభావమును భక్షించెను. అప్పుడు అతి ప్రచండమైన దుస్స్వభావముచే విడువ బడినదై ఆ ద్విజ పత్ని రాజుతో ఇట్లు చెప్పా సాగెను. రాజా! నేను నా కర్మ ఫలముచే మహాత్ముడగు నా స్వామిచే వియోగమును పొందితిని. ఈ నిశాచరుడు దానికి కేవలము కారణ మాత్రుడు. ఈ రాక్షసుని దోషము లేదు. మరియు మహాత్ముడగు నా భర్త యొక్క దోషము కూడా లేదు. దోషము నాది కాక మరెవ్వరిదీ కాదు. ఎందుచేత ననగా నేను చేసిన కర్మ ఫలమును తప్పక అనుభవింప వలసి యుండును.

నేను వెనుకటి జన్మ యందు ఎవరికో వియోగము కలిగించితినని తెలియు చున్నది. ఈ కారణముచే నా భర్తచే నాకు వియోగము కలిగినది. మహాత్ముడగు ఈ నిశాచరుని దోష మేమున్నది.

ప్రభూ! నీ అగ్నచే ఇప్పుడే ఈమె భర్త గృహమునకు ఈమెను తీసికొని వేల్లెడను. ఓ రాజా! ఆజ్ఞాపింపుము. ఇపుడు తమకు మరియే కార్యము చేయ వలెను?

ఓ రజనీ చరా! ఈ కార్యము చేయుటచే నీవు నా కార్యు లన్నియు చేసినట్లే ఇంతేకాక, ఓ వీరా! అవసరము కలిగి నపుడు స్మరించగానే నీవు ఉపస్తితుడవు ఆగుము.

ఆ తర్వాత రాక్షసుడు ఈ విషయమును అంగీకరించి దుస్స్వభావము నశించి శుద్దురాలైన ఆ బ్రాహ్మణుని భార్యను ఆమె భర్త గృహమునకు తీసుకొని పోయెను.