మార్కండేయ మహా పురాణము
115 - ఖనిత్ర చరిత్రము
మునివరా! అప్పుడు ఖనిత్ర సోదరుని పురములు వేరై నప్పటికిని పురవాసులు ఒకే సమయమున ఏ ప్రకారముగా నాశనము పొందిరో సమస్త లోకమునకు గొప్ప ఆశ్చర్యము కలిగెను. మునివరా! అటు పిమ్మట ఖనిత్రుని సోదరుని యొక్క పురోహితుడు, మంత్రి, విశ్వవేదియు దగ్ధమగుట విని మునిసత్తమా! ఇట్లు అగుటకు కారణములు తెలియక మహా రాజగు ఖనిత్రుడు చాలా విస్మయము జెందెను. తరువాత ఆ రాజు తన గృహమునకు వచ్చిన వశిష్ఠ మహర్షిని సోదరులు మంత్రి పురోహితులు నాశము చెందిన కారణ మేమిటని యడిగెను ఇట్లు రాజు అడుగగా వశిష్టుడు శౌరికి మంత్రి చెప్పినది, మంత్రితో శౌరి చెప్పినది, జరిగిన దంతయు చెప్పెను.
ఆ దుష్ట మంత్రి ద్వారా సోదరుల యందు భేదాభిప్రాయము కలిగించుటకు ఏ ఏ కార్యములు చేసిరో, పురోహితులు ఏమి చేసిరో, మఱియు శత్రువు యెడల కూడా దయ జూపునట్టి ఆ పురోహితులు ఏ కారణముచే నిరపరాధియైన రాజుకు అపకారము చేయుటకు సంవిద్దులై నష్ట పోయిరో దాని నంతయు యధాతధముగా చెప్పెను. ఓ ద్విజుడా! రాజు ఈ విషయములను విని “హా హతోస్మి” అని చెప్పి వసిష్ఠుని ఎదుటనే తనను తాను నిందించు కొన సాగెను.
నేను సంపాదన చేయలేదు. నేను అల్ప భాగ్యహీనుడను. దైవము నా యడల ప్రతి కూలముగా నుండెను. మఱియు నేను సర్వ లోకము లందును నిందితుడను, పాపిని, నను ధిక్కరింప వలెను, ఎందు వలన యనగా నా కారణమున నలుగురు బ్రాహ్మణులు మృత్యువును పొందిరి. అందు వలన ఈ భూ మండలమున నన్ను మించిన మహా పాపాత్ముడు ఎవ్వడు ఉండును?
నేను ఈ భూమి యందు పురుషునిగా జన్మించినచో, నా సోదరులు పురోహితులు మృత్యువును పొందెడి వారు కారు. నేనే బ్రాహ్మణుల నాశన మునకు కారకుడ నైతిని. నా ఈ రాజ్యము మరియు గొప్ప రాజ కులమందు కలిగిన నా ఈ జన్మకు ధిక్కారము. నా సోదరుల పురోహితులు ప్రభువుల ప్రయోజన సిద్ది కొఱకై నష్ట పోయిరి. అందు వలన వారు దోషులు కారు. వారి నాశనమునకు కారకుడ నైన నేనే దోషిని. ఇప్పడు నేనేమి చేయుదును? ఎక్కడికి పోను? బ్రహ్మ హత్యా కారకుడ నయిన నాతో సమానమగు పాపాత్ముడు భూమి యందు మరి యోక డుండడు, ఈ ప్రకారము మహీ పాలకుడగు ఖనిత్రుడు ఉద్విగ్న చిత్తుడై వనమునకు బోవ నిశ్చయించి పుత్రుని రాజ్యాభిషిక్తుని జేసెను.
రాజు క్షుపుడను కుమారుని రాజ్యా భిషిక్తుని జేసి ముగ్గురు భార్యలతో తపస్సు చేసు కొనుటకు వనమునకు బోయెను. నృప సత్తముడు వనమున ప్రవేశించి వానప్రస్థ విధాన క్రమముగా మూడు వందల యేబది సంవత్సరములు తపస్సు చేసెను. అటు పిమ్మట ఓ ద్విజోత్తమా! రాజకుల తిలకుడు వనవాసి యగు నా రాజు తపస్సు వలన దేహము క్షీణించెను ఇంద్రియము లన్నియు నిరోధించి ప్రాణములు వదిలెను. ఏ రాజులు గూడ వందల కొలది అశ్వమేధ యజ్ఞములు చేసినను పొందని అక్షయ లోకములను మహా రాజగు ఖనిత్రుడు మరణించిన పిమ్మట పొందెను. అతని యొక్క ముగ్గురు భార్యలును యజమానితో గూడి ప్రాణ త్యాగము చేసి ఆ మహాత్మునితో కలిసి ఆయనతో సమానమగు లోకముల బొందిరి. ఓ మహా భాగా! ఈ ప్రకారము ఖనిత్ర చరితము చెప్ప బడెను. ఈతని చరిత్ర వినుటచే లేక చదివినను సమస్త పాపములు నశించును. ఇప్పుడు నీకు క్షుప మహారాజు చరిత్ర వర్ణించెదను.
