మార్కండేయ మహా పురాణము

Table of Contents

33 - మదాలసోపాఖ్యానము

తల్లిచే ఈ ప్రకారము ఉపదేశింప బడిన పిమ్మట ఋతధ్వజుని కుమారుడగు అలర్కుడు యౌవనము పొందగానే విధి ప్రకారముగా వివాహమాడెను. క్రమముగా పుత్రులను గనెను. వివిధములగు యజ్ఞములు చేసెను. నిరంతరము తండ్రి యొక్క ఆజ్ఞ ననుసరించి యుండెను. చాలా కాలము గడచిన పిమ్మట ధర్మాత్ముడగు ఋతధ్వజుడు వృద్దుడగుటచే భార్యా సహితుడై వనమునకు బోదలచి కుమారుడగు అలర్కునకు రాజ్య పట్టాభిషేకము చేసెను. అప్పుడు తల్లియగు మదాలస పుత్రునికి కామ భోగముల నుండి విరక్తి కలిగించ వలెనని తుది వాక్యములను ఇట్లు చెప్పెను.

కుమారా! ఎప్పుడు నీకు ప్రియమైన బంధువులచే అసహ్యమగు దుఃఖము కలుగునో లేక శత్రు బాధలు గాని, గృహ ధర్మావలంబివియై రాజ్యము చేయు నీకు ప్రియ బంధువుల వియోగము గాని కలుగ వచ్చును. అసహ్యమగు దుఃఖము కలుగ వచ్చును. గృహస్థుడు ఎల్లప్పుడు మమకారము కల వాడగుటచే దుఃఖితు డగుచున్నాడు. ఆ కారణము చేత గృహస్థ ధర్మావలంబివై రాజ్యము చేయుచుండ దుస్సహమగు దుఃఖము ప్రాప్తించి నపుడు నేను ఇచ్చు ఈ అంగుళీయకము నుండి పత్రమును బైటకు తీసి దాని మధ్య యందున్న సూక్ష్మమైన అక్షరాములచే వ్రాయ బడిన శాసనమును పఠించుము.

మదాలస ఇట్లు చెప్పి తన సువర్ణాంగుళీయకమును ఇచ్చి గృహస్థాశ్రమ మందున్న వారికి యోగ్యములగు ఆశీర్వచనములను చేసెను. అనంతరము ఆ కువలయాశ్వుడు భార్యయగు మదాలసయు, ఆ రాజ్యమును పుత్రున కిచ్చి, తపస్సు కొరకు అడవికి బోయిరి.