మార్కండేయ మహా పురాణము

Table of Contents

2 - చటకోత్పత్తి కథనము

అరిష్టనేమియను వానికి పక్షి రాజగు గరుత్మంతుడను కుమారుడుండెను. ఆ గరుత్మంతునకు సంపాతియను కుమారుడు గలడు. సంపాతికి వాయు దేవునితో సాటియగు పరాక్రమము, మహాశౌర్యము గల సుపార్శ్వుడు సుతుడు. సుపార్శ్వుని కుమారుడు కుంతి. కుంతి పుత్రుడు ప్రలోలుపుడు. ప్రలోలుపునకు కంకుడు, కందరుడు అను ఇద్దరు కుమారులు ఉండిరి. కంకుడొకనాడు కైలాస పర్వతమున, పద్మ పత్రముల బ్రోలు నేత్రములు కలవాడును కుభేరుని అనుచరుడు అగు విద్యుద్రూపుడను రాక్షసుని జూచెను. పానాసక్తుడైన ఆ రాక్షసుడు తెల్లని పుష్ప మాలలు వస్త్రములు ధరించి భార్యా సహాయుడై శుభము, నిర్మలమగు శిలాఫలకము నందు గూర్చొని యుండగా చూసెను. కంకుడు చూచుటచే రాక్షసునకు కోపము వచ్చెను. “ఓరీ ఖగాధమా! నీవిచ్చటి కెందులకు వచ్చితివని” యనెను. భార్యా సహితుడనై యున్న నా సమీపమునకు వచ్చుట కేమి కారణము? బుద్ది మంతులగు వారు స్త్రీ పురుషు లుండు నట్టి ఏకాంత రహస్య ప్రదేశముల జొచ్చుట యధర్మము గాన సమీపించరు.

ఓరీ రాక్షసా! ఈ శైలేంద్రము అందరికి సర్వ సాధారణ మైనది. నీకెట్లో నాకునూ అంతే. మనకే గాదు, సర్వ జంతువులకును గూడ నంతియే. ఇచ్చట నీకీ మమకార మెందులకు?

ఆ రాక్షసుడు ఇట్లు పలుకు చున్న కంకుని శిరస్సును తక్షణమే కోపముతో ఖండించెను. శిరచ్చేదముచే నెత్తురు గారుట వలన భయంకరముగా నుండి కంకుడు అచేతనుడై మరణించెను. క్రోధ మూర్చితు డైన ఆతని సోదరుడగు కంధరుడు కంకుని మరణ వార్త విని విద్యుద్రూపుని సంహరింప నిశ్చయించెను. అనంతరము అన్నయగు కంధరుడు కంకుడు మరణించిన కైలాస పర్వత మందే యాతని అంత్య కర్మ జేసెను. పిమ్మట కంధరుడు కోపము చేతను, అసహనము చేతను, నేత్రములు పెద్దవి చేయుచూ, సర్పము వలె బుసలు గొట్టుచూ సోదర హంతకుడగు రాక్షసుడున్న చోటికి బోయెను. అతడు బయలు దేరిన సమయమున గొప్పదగు రెక్కల గాలిచే పెద్ద పెద్ద పర్వతములు కంపించెను. వేగము వలన సముద్ర జలములు కల్లోలము లయ్యెను. కంధరుడు ఎఱ్ఱ బడిన కన్నులు గలవాడై, క్షణ మాత్రములో కైలాస పర్వతము నాక్రమించెను.

పక్షి శ్రేష్ఠుడగు కంధరుడు పర్వతము యొక్క పై భాగమున సువర్ణ శయ్య నాసీనుడై మధ్య పానముచే ఎఱ్ఱని కన్నులు, ముఖము గల విద్యుద్రూపుడను రాక్షసుని జూచెను. ఆ రాక్షసుడు శిఖ యందు పూల మాలలు ధరించి శరీరమంతట మంచి గంధము బూసుకొని కేతకీ పత్రముల వలె తెల్లని దంత పంక్తితో ఘోర రూపమున ప్రకాశించు చుండెను. కంధరుడు పుంస్కోకిల కంఠ ద్వని కలిగి నట్టిదియు, విశాలమగు నేత్రములు గలదియు, రాక్షసుని ఎడమ తోడ యందున్న యతని భార్యయగు మదనికను గూడ చూసెను. అనంతరము పక్షి శ్రేష్టుడగు కందరు డత్యంత కోపముతో పర్వత గుహ యందు గూర్చొని యున్న రాక్షసుని జూచి “ఓరీ! దుష్టాత్ముడా! నాతో యుద్ధము జేయమనెను. నీవు మదోన్మత్తుడవై నాయన్న యగు కంకుని చంపితివి. ఇందు వలన ఇప్పుడు మద సంసక్తుడవగు నిన్ను యమ సదనమున కనిపెదను.

నాచే జంపబడి, విశ్వాస ఘాతకులు, స్త్రీ హత్యలు, బాల హత్యలు జేసిన పాపులు బోవు నరకమునకు బోయెదవు గాక.

స్త్రీ సన్నిధానమున పక్షి రాజు ఈ ప్రకారము పలుకగా ఆ రాక్షసుడప్పుడు క్రోదావిష్టుడగు పక్షి రాజుతో తిరిగి పల్కెను. ఓరీ! ఖేచరా! నీ సోదరుని జంపి నా పౌరుష మెట్టిదో చూపితిని. ఇప్పుడు నిన్ను కూడ నీ ఖడ్గము చేతనే జంపి వైచెదను. ఓరీ! అథమ పక్షీ! క్షణ మాత్రము నిలువుము. ఇక్కడ నుండి బ్రతికి పోజాలవు అని పలికి కాటుక వలె నల్లని నిర్మలమగు ఖడ్గమును గ్రహించెను. పూర్వము దేవేంద్ర, గరుత్మంతులకు జరిగినట్లు పక్షిరాజ, యక్షరాజ భటులకు మహా యుద్ధము జరిగెను. అనంతర మా రాక్షసుడు కోపముతో నిర్వాణాంగారము (బొగ్గు) వలె నల్లనిదగు ఖడ్గమును వేగముగా పక్షిరాజు మీదకు విసిరి వైచెను.

పక్షి రాజా ఖడ్గమును గరుత్మంతుడు సర్పమును గ్రహించు రీతిగా భూతలము నుండి కొంచెముగా పైకెగిరి ముట్టెతో పట్టుకొనెను. అట్లు పట్టుకొనిన యా ఖడ్గమును ముట్టెతో, కాళ్ళతో విరిచి క్షోభమును కలిగించెను. ఆ ఖడ్గమట్లు భగ్నమైన తదుపరి బాహు యుద్ధ మయ్యెను. అనంతరము ఆ పక్షి రాజు రాక్షసుని రొమ్మునెక్కి చేతులను, పాదములను, శిరస్సును దేహము నుండి వేరు చేసెను. అట్లా రాక్షసుడు చచ్చిన పిమ్మట వాని భార్యయగు “మదనిక” భయ వ్యాకుల చిత్తురాలై, ఖగరాజును శరణు బొందేను. నీకు భార్య నయ్యెదనని పలికెను. ఖగ శ్రేష్ఠుడగు నా కందరుడప్పు డామెను దీసికొని తన ఇంటికి వచ్చెను. ఇట్లు తన సోదరుడగు విద్యుద్రూపుని చంపుట వలన కలిగిన దుఃఖమునకు ప్రతీకారముగా ఆ రాక్షసుని చంపి సోదరునికి నిష్కృతి గావించెను. మేనకా తనయయగు మదనిక పక్షి రాజగు కంధరుని యింటికి పోయిన బిమ్మట స్వేచ్చా రూప ధారిణి యగుటచే తాను గూడ పక్షి రూపమును పొందెను.

అప్పుడా కందరుడు పక్షి రూపధారిణి యగు ఆ మదనిక యందు, దుర్వాస శాపమను అగ్నిచే దగ్ధురాలు, అప్సరసలలో శ్రేష్ఠు రాలునగు వపువను నామెను పుత్రికగా గనెను. పక్షిరాజు ‘తార్క్షీ’ యని ఆమెకు పేరు పెట్టెను. ద్విజ సత్తములారా ఇట్లుండ, మందపాలుడను బ్రాహ్మణునకు నల్వురు కుమారులు గలరు. వారిలో “జరితారి” మొదటి వాడు. చివరి వాడు “ద్రోణుడు”. వారిలో నా ద్రోణుడు ధర్మాత్ముడు, వేద వేదాంగ నిష్ణాతుడు. కందరుని యనుమతముగా నా తార్క్షీయను నామెను వివాహము జేసికొనెను. కొంత కాలమునకు తార్క్షీ గర్భము ధరించెను. గర్భము ధరించిన మూడు మాసముల పదునేను రోజులగుచుండ నామె కురుక్షేత్రమునకు పోయెను. ఆ సమయమున అచట కౌరవులకు, పాండవులకు జరుగు మహా దారుణ యుద్ధము నందు, భవితవ్య మట్లుండుట వలన రథము యొక్క మధ్య భాగమున జొచ్చెను.

అచ్చట నా తార్క్షీ సమస్త రాజులు శర, శక్తి మొదలగు ఆయుధములతో భయంకరముగా యుద్ధము జేయుట జూచెను. ఆ యుద్ధము దేవాసుర యుద్ధము వలె నుండెను. మరియు నచ్చట భగదత్తార్జునులు యుద్ధము జేయు చుండుట చూసెను. వారి బాణములచే నాకాశ మంతయూ ఎడము కాన రాకుండా శలభముల చేత కప్పబడిన దాని వలె నయ్యెను. అర్జున కోదండము నుండి యొక బాణము వెడలెను. అది నల్లని త్రాచుపాము వలె నుండి అతి వేగముతో వచ్చి అచట నున్న తార్క్షీ యొక్క గర్భచ్చేదము గావించెను. గర్భచ్చేదమైన వెంటనే నాలుగు అండములు భూమి మీద పడెను. అవి చంద్రుని బోలి యుండెను. ఆయుష్యము కలిగి యున్నందున ఆ అండములు దూది కుప్ప మీద బడినట్లు పడెను. ఆ అండములు క్రింద పడిన యదే సమయమున నొక ఏనుగు కంఠమందలి ఘంట నేలమీద పడెను. ఆ ఏనుగు పేరు సుప్రతీక మందురు. అది భగదత్తుని వాహనము. అర్జునుడా ఘంటను బాణముచే చేదించెను.

ఆ గంట పడుటచే భూమి బద్దలయ్యెను. ఆ నాలుగండముల మీద బడెను. వాటి కే మాత్రము హాని కలుగ కుండా రక్షణగా పైన గప్పి వైచెను. రాజైన భగదత్తుడు పిమ్మట యుద్ద మందు జనిపోయెను. పిమ్మట కౌరవ, పాండవ సైన్యముల పోరాటము చాలా రోజులు జరిగెను. అట్లు యుధ్ధము ముగిసిన తదుపరి ధర్మరాజు భీష్మాచార్యుని సమీపమునకు సమస్త ధర్మములను వినుటకు వెళ్ళెను. ఆ సమయమున ద్విజోత్తమా! శమీకుడను మునీశ్వరుడు గంటచే నాచ్చాదింపబడి రక్షణ బొండుచున్న, యా అండములున్న ప్రదేశమునకు వచ్చెను. ఆ మహర్షి యా గంటలో “చిచీకుచీ”యని కూయు చున్న శబ్దమును వినెను. ఆ పక్షి పిల్లలు గొప్ప విజ్ఞానము గలవైననూ చిన్న తనముచే వాక్యములు ప్రస్ఫుటముగా నుండెను.

అనంతరము ఆ మహర్షి శిష్య సహితుడై యా గంటను పైకి ఎత్తెను. మాతృ పితృ హీనములే గాక రెక్కలు గూడా రాని యా పక్షి పిల్లలను జూచి అత్యంత విస్మయము చెందెను. భగవానుడగు నా శమీక మహాముని యచ్చట ఆ విధముగా నేలమీద బడియున్న యా శిశువులను జూచి విస్మయా విష్ణుడై తన వెంబడి యున్న ద్విజ బాలకులతో నిట్లనియె: విప్ర బాలకులారా పూర్వము ద్విజ శ్రేష్టుడగు శుక్రాచార్యుడు దేవతలకు భయపడి పారిపోవు చున్న దైత్య సైన్యమును చూసి మంచి వాక్యము లనుపదేశించెను. వాటిని చెప్పెద వినుడు. దైత్య సైనికులారా! పారిపోకుడు. వెనుకకు మరలుడు. భయపడి పారిపోవుట ఎందులకు? మీ శౌర్యము, కీర్తిని బోగొట్టు కొని యెక్కడికి బోయెదరు? మృత్యువును దప్పించుకొన గలరా? పూర్వము బ్రహ్మ దేవుడు మన కర్మ ననుసరించి తన మనస్సున యెట్లు తలచునో యంత వరకు యుధ్ధము చేసిననూ నశించము. అంత వరకు మరణ భయముండదు. కొందరు స్వగృహ మందు మరణింతురు. కొందరు పారిపోవుచూ, కొందరు భుజించుచూ, కొందరు త్రాగుచూ మరణించిరి.

అటులనే కొందరు విలాసముగా నున్నవారు, కాముకులు, ఆరోగ్యవంతులు, శాస్త్రములచే క్షత గాత్రులు కానివారు, కాలవశులై చనిపోయిరి. కొందరు తపోనిష్టులై ఉండగా, మరికొందరు యోగాబ్యాసరతులై యుండగా యమ భటులచే తీసికొని పోబడిరి. ఎవ్వరు మృత్యువును పొందక యుండలేక పోయిరి. పూర్వము వజ్రపాణియై దేవేంద్రుడు శంబరాసురుని వక్ష స్థలమునకు వజ్రాయుధమును విసిరి వైచెను. అయిననూ నా శంభరాసురుడు చావలేదు. కాల మాసన్నమగు సరికి యా దేవేంద్రుడే యా వజ్రాయుధముచే సకల రాక్షసులను తత్ క్షణమే చంపి వైచెను. కావున మీరీ విషయమును తెలిసికొని భయము జెందకుడు. కర్తవ్యమునకై వెనుకకు మరలుడు. ఇట్లు చెప్పిన పిమ్మట నా దైత్యులు మృత్యు భయమును వీడి వెనుకకు మరలిరి. అతి మానుషమగు నిట్టి కురు పాండవ యుద్ధమున గూడ మృత్యువును బొందని ఈ పక్షి శిశువులు శుక్రాచార్యుని వచనములను సత్య మొనర్చినవి.

ద్విజ బాలకులారా! మాంస వసారక్తములచే నాచ్చాదింప బడిన భూమి యందు, అండములు గంటయు నేక కాలమున బడుట యెంత యాశ్చర్యము? ఈ పక్షి శిశువు లేమైననూ సామాన్యము లైనవి గాదని తెలియు చున్నది. బాలకులారా! లోకమున దైవానుకూల మున్నచో మహా భాగ్యములు కలుగు చుండును. ఆ మునీశ్వరుడిట్లు చెప్పి ఆ ముని బాలకుల జూచి మఱియు నిట్లనియె. పక్షి బాలకులను తీసికొని ఆశ్రమమునకు మరలి పొండు. పిల్లులు, యెలుకలు, ముంగిసలు మరియు నితరములగు పక్షుల యొక్క భయము లేని ప్రదేశము నందుంచుడు. విప్ర బాలకులారా! అతి ప్రయత్నమూ చేసిననూ ప్రయోజనమే ముండును? జీవులు వారు వారు చేసికొనిన కర్మలచే పుట్టు చుందురు. ఇంత వరకీ పక్షి శిశువుల నెవరు రక్షించిరి?

అట్లని యూరుకొన రాదు. అన్ని కర్మల యందును మానవుడు గట్టి ప్రయత్నము చేసి తీరవలయును. మానవ ప్రయత్నము జేసిననూ కానిచో వాని దోష ముండదు. సత్పురుషులచే నిందింప బడడు. ఇట్లు మునివర చోదితులగు నా ముని కుమారులా పక్షి బాలకులను తీసికొని తరువిటప సమాశ్రితములయి యున్న తుమ్మెదల గుంపులు గలదియు, తాపస రమ్యమునగు వారి యాశ్రమమునకు బోయిరి. ఆ శమీక మహర్షియు, తన కభీష్టములగు వన మందలి ఫల,మూల, పుష్ప, కుశలను సేకరించి, యాశ్రమమునకు బోయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యమ, అగ్ని దేవుల నారాధించెను. మరియు నా ద్విజోత్తముడు వాయు, వరుణ, బృహస్పతి, కుభేర, ధాత, విధాతల పూజలు, వేదోక్త వైశ్వ దేవాది వివిధములగు సత్ క్రియలు జేసెను.