మార్కండేయ మహా పురాణము

Table of Contents

20 - కువలయాశ్వ చరితము

ఇట్లు చాలా కాలము గడచెను. ఒక రోజున సుతుని జూచి రాజు మరల యిట్లనియె. కుమారా! బ్రాహ్మణ రక్షణార్థమై భూమండలమును సంచరించుము. త్వరగా బొమ్ము. నీవు ప్రతి దినము ప్రాతః కాలమున నీ గుఱ్ఱము నారోహించి బ్రాహ్మణ శ్రేష్ఠుల కున్నట్టి బాధల నన్వేశించ వలెను. దుష్ట ప్రవర్తన గలవారు, పాప బుద్ధులగు దానవులు వందల కొలది గలరు. నీవు మునులకు వారి వలన బాధ లేకుండు నట్లు చేయుము. రాజ కుమారుడు తండ్రి యట్లు చెప్పిన పిమ్మట ఆ ప్రకారముగానే సమస్త భూమండలమును తిరిగి వచ్చి, జనకుని చరణములకు ప్రణమిల్లెను. నృపపుత్రుడు ప్రతి రోజు పూర్వాహ్ణమున పృథివీ పర్యటనము జేయుచు, శేష సమయమున సుమధ్య యగు మదాలసతో విహరించు చుండెను.

ఆ రాజ నందను డీప్రకారము సంచరించు చుండగా నొకానొక సమయమున పాతాలకేతుని తమ్ముడగు తాలకేతు డనువాడు యమునా తీరమున ఆశ్రమము నిర్మించుకొని యుండుట చూసేను. మాయావి యగు నీ దానవుడు ముని రూపమును ధరించి యుండెను. వాడు పూర్వ వైరమును దలచుకొని యా రాజ కుమారునితో నిట్లు పలికెను. రాజపుత్రా! నేను చెప్ప బోవునది మంచిది యని నీకు దోచినచో దానిని చేయుము. సత్య ప్రతిజ్ఞా! నీ వెప్పుడు ప్రార్థనా భంగ మెవ్వరికి చేయలేదు. రాజ కుమారా! నేను యజ్ఞము చేయవలసి యున్నది. ధర్మసిద్ధికై నే నభిలషించిన యిష్టులు (యజ్ఞాంగ విశేషములు) మరియు నగ్ని సంచయము జేయుదును. కాని నావద్ద యజ్ఞ దక్షిణ యిచ్చుటకు నేమాత్రము ద్రవ్యము లేదు. అందువలన నో వీర కుమారా! దక్షిణ కొరకు నీ కంఠమందు ధరించిన సర్వ భూషణములను నాకు ఇమ్ము. యజ్ఞ సంపూర్తి యగు నంత వరకు ఈ నా ఆశ్రమమును రక్షింపుము.

నేను జలము లందుండి, ప్రజా క్షేమములను గలుగ జేయు వేదమందలి వారుణ మంత్రములచే, జల జంతువులకు ప్రభువగు వరుణ దేవుని గూర్చి తపస్సు జేసి వచ్చెదను. అంతవరకు నా యాశ్రమమును రక్షించు చుండుము. నేను శీఘ్రముగనే వచ్చెదను. అని చెప్పిన యా కపట మునికి నమస్కరించి, యా రాజపుత్రుడు కంఠ భూషణము నిచ్చెను. మరియు నా రాజకుమారుడు వానిని జూచి, మహానుభావా! నా యందు విశ్వాసముంచి పొండు. మీ యాశ్రమ సమీపముననే యుండెదను. మీ యాజ్ఞానుసారముగా మీరు తిరిగి వచ్చు వరకు యిచ్చటనే యుండెదను. మీ ఆశ్రమమున కేవిధమైన బాధ లుండవు. మునిశ్రేష్టా! మీరు ఎంత మాత్రము శంకించక, నిశ్చల మనస్సుతో తల పెట్టిన యజ్ఞమును జేయుడు అని చెప్పెను. ఇట్లా మాయా ముని యగు తాళకేతుడు, రాజ నందనుడు చెప్పిన మాటలను వినిన పిమ్మట నదీ జలమందు మునిగెను.

ఆ రాజనందను డతని మాయారచిత మగు నాశ్రమమును రక్షించు చుండెను. తాలకేతు డచ్చటి జలాశయమున మునిగి యచ్చటి నుండి బయలుదేరి శత్రజిత్తు యొక్క నగరమునకు వచ్చెను. ఆ రాక్షసుడు మదాలస సమీపమునకు వచ్చెను. అచ్చట యనేక మంది యితర జనులు గూడ నుండిరి. వారందరి సమక్షమున వారితో వీరుడగు కువలయాశ్వుడు నా యాశ్రమ సమీపమున చంపబడెనని యనెను. కువలయాశ్వుడు బ్రహ్మ ద్వేషులగు రాక్షసులతో యధా శక్తి పోరాడుచు తాపస జన రక్షణ జేయుచుండ నొక రాక్షసుడు జంపెను. పాపియగు నా రాక్షసుడు మాయ నాశ్రయించి కువలయాశ్వుని శూలముతో వక్ష స్థలమున బొడిచెను. కువలయాశ్వుడు మరణించు చున్న సమయమున నీ కంఠ భూషణమును నాకిచ్చెను. అచ్చటి తాపస జనులు, నేను కలసి యాతని శరీరమును దహించితిమి. కువలయాశ్వుడు చనిపోవు నపుడు కన్నీటి జలములు గలవాడై భయము జెంది ఆర్తనాదము జేసెను.

ఆ గుఱ్ఱమును గూడ నా దురాత్ముడగు దానవుడు తీసికొని బోయెను. దుష్కృత కారియగు నా పాపాత్ముడు చేసిన ఘాతుక కృత్యమును నేను చూచితిని. ఇప్పుడు మీరు చేయదగిన యుపకర్మలు చేయుడు. మీ హృదయ శాంతికై ఈ కంఠ భూషణమును తీసికొనుడు. మేము తపస్వులము కదా! మాకు సువర్ణముతో పని ఏమున్నది? ఇట్లు చెప్పి యా కంఠ భూషణములను భూమి యందుంచి యచ్చట నుండి వచ్చిన దారినే పోయెను. అనంతర మచ్చటి జనములు శోకార్తులై మూర్చలో మునిగిరి. ఆ రాజ స్త్రీలందరు కొంత సేపటికి మూర్చ దేరిరి. రాజు, రాజ భార్యలు, మహా దుఃఖముతో విలపించ సాగిరి. మదాలస భర్త యొక్క కంఠ భూషణమును జూచి దుఃఖించెను.

తరువాత భర్త మరణ వార్త వినిన మదాలస వెంటనే ప్రియములైన ప్రాణములను వదిలెను. అప్పుడు రాజ భవన మందాక్రందన ధ్వని బయలు వెడలెను. అటులనే పట్టణమందు, పౌర గృహములందు రోదన ధ్వనులు వినిపించు చుండెను. అనంతరము శత్రుజిన్మహారాజు దుఃఖితుడై, వారందరి దుఃఖమును గూడ జూచెను. ఇంతియే గాక మదాలస భర్తృ వియోగాముచే ప్రాణ త్యాగము జేయుట జూచెను. రాజు దుఃఖముతో నిండియున్న తన మనస్సును విమర్శించు కొని స్థిమితము జేసుకొని సమీప మందున్న జనులతో, దుఃఖించకుడు, మీకు గాని నాకు గాని విమర్శించగా దుఃఖించ వలసిన యవసరము లేదని యనెను మరియు నిట్లనియె. విచారించగా దారా పుత్రాది సంబంధము లన్నియు నిత్యములు గావు గదా! అందుచే కుమారుని గురించి విచారించినను కోడలి గురించి విచారించినను ప్రయోజన మేముండును? బాగుగా నాలోచించిన వీరిద్దరూ కూడా సత్కర్మలు జేసి మరణించిరి గాన విచారించ నక్కర లేదు. నా కుమారుడు పిత్రాజ్ఞా పాలనము జేసెను. ద్విజ రక్షణ జేసెను.

నా సుతుని శరీరము ముఖ్యముగా బ్రాహ్మణ రక్షణ కొరకే బలియైనచో, బుద్దిమంతు లగువారికి (చనిపోయిన నా కుమారుని గురించి) విచారింప వలసిన పని ఏమున్నది? గావున నా పుత్రుడు శరీర త్యాగము జేయుట యభ్యుదయ కాకియై యున్నది. ఈ కోడలయితే సత్కుల మందు బుట్టినది. భర్తతో అనుగమనము జేసినది. స్త్రీలకు భర్త కన్న వేరే దైవము గానరాదు. పతి దేవుని యనుసరించి పోయినందున యామెను గురించియు విచారింప వలసిన పనిలేదు. మాకు గాని మా బంధువులకు గాని దయావంతులైన యన్య మానవులకు గాని, పతి వియోగము జెందిన పిమ్మట జీవించి యుండిన యడల విచారింప వలసిన స్థితి ఏర్పడి యుండెడిది. అట్లు గాక పతి మరణ వార్త వినిన తత్క్షణమే ప్రాణ త్యాగము జేసినది. గావున పండితులగు వారికి భర్త ననుసరించి పోయిన ఈమెను గురించి దుఃఖింపవలసిన యవసరము లేదు. ఈమెకు భర్త వియోగము లేదు. భర్త వియోగము బొందియు జీవించి యున్నచో నట్టి కుల స్త్రీల జూచి మాత్రము విచారింప వలసి యున్నది.

కొందరు కులస్త్రీలు కష్టమనుకొని భ్రాంతులై ప్రాణ నాథునితో బాటు ప్రాణ త్యాగము జేయరు గాని యట్టివారు తమకు తమ వంశము వారికి దుఃఖము కలుగ జేయుదురు. ఈ మదాలస కృతజ్ఞురాల గుటచే భర్తృ వియోగ దుఃఖానుభవము పొందలేదు. ఇహలోక పరలోకముల రెండింటి యందును సమస్త సుఖముల నిచ్చు భర్తను ఏ స్త్రీ యైనను మానవ మాత్రునిగా నెట్లు భావించును? నేను గాని, నా భార్య గాని, నా కుమారుడు గాని, నా కుమారుని భార్యగాని, నల్వురము విచారింప దగిన వారము గాము. కారణమేమన బ్రాహ్మణ రక్షణార్థమై నా కుమారుడు ప్రాణములు త్యజించుటచే మేము నల్వురము తరించిన వారమైతిమి. మహా బుద్ధియగు నా పుత్రుడు అర్థ భుక్తమగు దేహమును త్యాగము జేసినందున బ్రాహ్మణుల యొక్కయు, నా యొక్కయు మరియు ధర్మదేవత యొక్కయు ఋణము దీర్చుకొనెను. నా సుతుడు ద్విజ రక్షణ నిమిత్తమై సంగ్రామమున ప్రాణ త్యాగము జేయుటచే తన తల్లి యొక్క సతీత్వమును నా యొక్క వంశ నిర్మలత్వమును తన యొక్క శూరత్వమును, వీటి నన్నిటిని నిజమైనవని ధృవ పరచెను.

పిమ్మట కువలయాశ్వుని తల్లి పుత్ర వధను విని తన భర్త యనిన మాటలను విని, తాను గూడ సంతోషము చెందినదై భర్తతో సమానముగా నిట్లు పలికెను. రాజా! ముని జనరక్షణ చేయు సత్కార్యములో పుత్రుడు చనిపోయినా డను మాటలను విని నేను ఆనందమును చెందితిని. ఇట్టి సంతోషము నా తల్లి వలన గాని నా సోదరి వలన గాని లేదు. బంధు గణములు దుఃఖించు చుండ ఆయాస పడుతూ వ్యాధి పీడితుడై చనిపోయిన వాడు విచారింప దగిన వాడు. అట్టివాడు తల్లికి వ్యర్థ సంతానము. గో బ్రాహ్మణుల రక్షణ యందు, యుద్దమందు నిర్భయ చిత్తముతో యుద్ధము జేసి శస్త్రములచే చని పోయిన వారు మానవులు అని అనిపించు కొందురు. యాచకులకు మిత్ర వర్గములకు శత్రువులకు వెనుకకు తిరుగని వాడు ఎవడయి యుండునో అట్టి వాడిని కన్నవాడు తండ్రి అనిపించు కొనును. వాడే పుత్రవంతుడు. వాని తల్లి వీరమాత యగును. ఆమెయే పుత్రవతి.

ఏ కుమారుడు రణమందు చని పోవునో, లేక శత్రువును జయించి మరలి వచ్చునో, అట్టి కుమారుని కష్టపడి కనినందుకు ఆ తల్లి యొక్క గర్భ క్లేశము సఫల మగుచున్నది.

పిమ్మట రాజు, కుమారునికి, కోడలికి సంస్కారములు చేసెను. నగర బాహ్య ప్రదేశమునకు పోయి అచ్చటి జలముల స్నానము చేసి వారిద్దరికీ జల తర్పణాదులు చేసెను. ఇచ్చట దానవాధముడగు తాలకేతుడు ఆ ప్రకారముగా జలము నుండి బైటకి వచ్చి ప్రేమ యున్నట్లుగా మధుర వచనములతో రాజ పుత్రునితో నిట్లు పలుక జొచ్చెను. ఓ రాజకుమారా! నీ వలన నేను కృతార్థుడ నైతిని. నీవు నాయీ స్థానమందు స్థిరముగా నుండి నా యాశ్రమమును రక్షించుట వలన నా మనోభీష్టమును నెరవేర్చితివి. ఈ కారణముచే మహాత్ముడు జలాధిపతి యగు వరుణదేవుని యజ్ఞ కర్మయు పూర్తి యైనది. నా వాంచితము సిద్ధించినది. గాన రాజపుత్ర! ఇక నీవు వెళ్ళుము. తరువాత నా రాజపుత్రుడు మాయా మునికి నమస్కరించి గరుడానిల సమాన వేగముగల యశ్వము నధిష్టించి తన తండ్రి గారి పట్టణమునకు పోయెను.