మార్కండేయ మహా పురాణము

Table of Contents

27 - నైమిత్తికాది శ్రాద్ధకల్పము

పుత్రా! గృహస్థునకు కర్తవ్యమగు కర్మలు మూడు విధములు. నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము. ఈ మూడింటి యొక్క విధానములను చెప్పెదను వినుము. నేను ఏ పంచ యజ్ఞముల గురించి చెప్పి యుంటినో వానిని నిత్య కర్మలని అందురు. ఇవి గాక కుమారా! జననాది సంస్కారములను నైమిత్తికములని అందురు. పండితులు పర్వశ్రాద్ధాది కర్మలను నిత్యనైమిత్తిక కర్మలని అందురు. వాటిలో మొదట నీకు నైమిత్తికమగు అభ్యుదయ శ్రాద్ధమును గురించి చెప్పెదను. వినుము. పుత్రుడు జన్మించిన సమయ మందు జాతకర్మ చేయునట్లే వివాహము లందు కూడా క్రమానుసారముగా అట్లే చేయవలెను. వివాహాది కార్యము లందు నాందీ ముఖమను పేరుగల ప్రసిద్ధమైన పూజను పితృ దేవతలకు సంయక్ప్రకారముగా చేయ వలెను. ఆ సమయములో యజమాని శ్రద్ధగా తూర్పు దిక్కు ముఖముగా కాని, ఉత్తరదిక్కు ముఖముగా గాని, కూర్చుని, పితరుల నుద్దేశించి దధి మిశ్రితమగు పిండములను ఇవ్వ వలెను. ఈ సమయ మందు వైశ్వ దేవ బలి దానము చేయ వలసిన అవసరము లేదని కొందరు చెప్పుదురు.

ఈ వైష్ణదేవ మందు ఇద్దరు బ్రాహ్మణులకు ప్రదక్షిణము చేసి అర్చన చేయ వలెను. ఇదే వృద్ధి శ్రాద్ధ మందు నైమిత్తికమని చెప్పబడు చున్నది. అటులనే ఔర్ధ్వ దైహిక కృత్య మందు చని పోయిన దినమున ఏకోదిష్టము అను నైమిత్తిక కర్మను చేయ వలెను. ఆ విధానమును వినుము. ఈ కర్మను దైవ హీనముగా చేయ వలెను. ఏక పవిత్రమునే ధరింప వలెను. ఏ కార్ఘ్యమునే ఇవ్వ వలెను. ఆవాహనము గాని అగ్నౌకారణము గాని ఉండదు. ఉచ్చిష్ట సన్నిధిలో ఒక్క పిండమును పెట్ట వలెను. మరియు చని పోయిన వాని నామమును సంకల్పించి అపసవ్యముగా అతనికి అక్షయ లోకములు కలుగవలె నని విపర విసర్జన స్థానమందు తిల తర్పణము చేయ వలెను.

కర్త బ్రాహ్మణులతో “అభిరమ్యతాం” అని చెప్ప వలెను. బ్రాహ్మణులు “అభిరతాఃస్మ” అని ప్రతివచనము చెప్పవలెను. ఇట్లు సంవత్సర పర్యంతము ప్రతి మాసము ఈ విధముగా చేయవలెను. సంవత్సరము పూర్తి అయిన పిమ్మట సపిండీకరణము చేయవలెను. దాని విధానమును చెప్పెదను. ఈ సపిండీకరణము కూడ దైవ విహీనము, అగ్నౌకరణ హీనము, ఆవాహన హీనమై యుండ వలెను. ఏ కార్ఘ్యము ఏక పవిత్రము దీని యందు విధియై యున్నది. దక్షిణ దిక్కు యందు జల సహిత పిండాదులను పూర్వోక్త విధానములతో పెట్ట వలెను. బేసి సంఖ్య గల బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. పర్వ శ్రాద్ధాదులు కూడా నిత్య నైమిత్తిక కర్మలు. వానిని కూడా చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. వత్సా! తిల, గంధ, ఉదకములతో కూడిన నాలుగు పాత్రలను స్థాపించ వలెను.

వాటిలో మూడు పాత్రలను పితృ దేవతల నుద్దేశించి, నాలుగవ పాత్రను ప్రేత నుద్దేశించి కర్మ చేయ వలెను. కుమారా! ఆ మూడు పాత్రల యందు ప్రేత పాత్రను అర్ఘ్యమును చేయవలెను. “యే సమానా” అను మంత్రమును స్మరించుచు, పూర్వము చెప్పిన విధానముగా అవసిష్ట కర్మను చేయ వలెను. స్త్రీల నుద్దేశించి కూడా ఈ ప్రకారముగానే ఏకోదిష్ట విధానము చేయ వలెను. పుత్రులు లేనిచో స్త్రీలకు సపిండీకరణ విధానము లేదు. పురుషునితో సమానముగా స్త్రీకి కూడా మరణ దినమున శక్తి ననుసరించి ఏకోదిష్ట కర్మను చేయ వలెను. స్రీలకు పుత్రులు లేని యెడల సపిండులు, లేని యెడల సహోదరులు పురుషునికి వలెనె స్త్రీకి కూడా చేయ వలెను. తల్లి యొక్క సపిండులు గాని, వారు లేనిచో సమానోదకులు గాని, వారి ఆభాసమున తల్లి యొక్క మనుమలు గాని ఈ కర్మను చేయ వలెను.

మాతామహుల నుద్దేశించి పుత్రులు లేని పక్షమున దౌహిత్రులు చేయ వలెను. ఇతనిని “ద్వ్యాముష్యాయుణుడు” అని చెప్పుదురు. నైమిత్తిక శ్రాద్ధముల ద్వారా మతామహ పితామహులకు కర్మలు చేయ వలెను. ఎవ్వరు లేనిచో తన భర్తకు స్త్రీ చేయ వలెను. స్త్రీలు చేయు కర్మ మంత్ర రహితముగా చేయ వలెను. చనిపోయిన వారికి భార్య కూడా లేనిచో రాజు తన పరివారముతో కర్మను చేయించ వలెను. అనగా సజాతీయ పురుషుల ద్వారా అతని దహనాది కర్మలు చేయించ వలెను. సమస్త వర్ణములకు రాజు బంధువు కాన రాజు చేయ వలెను. వత్సా! నేను నీకు నిత్య కర్మ, నైమిత్తిక కర్మలను గురించి చెప్పితిని. ఇప్పుడు శ్రద్దాసక్తితో కూడు కొనిన నిత్య నైమిత్తిక క్రియల గురించి చెప్పెద వినుము. చంద్రుని యోక్క క్షయాత్మకమగు కాలమును “అమావాస్య” అని చెప్పుదురు. ఈ అమావాస్యను నిమిత్తముగా చేసుకొని ఎల్లప్పుడూ దీనిని నిత్యమని సూచించెదరు. ఈ కారణముచే దీనిని నిత్య నైమిత్తిక కర్మ యని అందురు.