మార్కండేయ మహా పురాణము
121 - అవీక్షిత చరితము
ఓ మహారాజా! కరంధముడు అతని భార్య యగు వీరా మరియు ఇతర రాజులును రాజ కుమారుని బంధించిన విషయమును వినిరి. ఓ మహామునీ! ఆతనిని అధర్మ యుద్దముచే బంధించిరని విని రాజు సామంత రాజులతో చాలా సమయము వరకు ఆలోచన చేయు చుండెను. “ఏ ఏ రాజు లందరూ ఏకమై ఒక్క వీరుని అధర్మ యుద్దముచే బంధించినారో, వారందరో వధ్యులు”(అనగా చంపుట కర్హులు) అని కొందఱు పలికిరి. “ఇప్పుడు నిశ్చింతగా గూర్చున్నా రెందుకు? వెంటనే సేనను సమాయత్త పఱచి దుష్టు డగు విశాల రాజును, మఱియు అక్కడకు వచ్చి యున్న రాజు లందరినీ బంధింపుడు” అని మరి కొందఱు పలికిరి. “ముందుగా రాజ పుత్రుడే ఇచ్చగించని కన్యను అన్యాయముగా బలవంతముగా గ్రహించి ధర్మమును విడిచిరి అని” కొందఱు చెప్పిరి.
అంతే కాక అతడు అన్ని స్వయంవరము లందును ఇదే విధముగా రాజ పుత్రులను శత్రువులుగా చేసి కొనెను. ఈ కారణముచే వారందరు కలసి ఆతనిని బంధించినారు” అని కొందఱు అనిరి. వీర వంశీయురాలు, వీరపత్ని వీరమాత యైన “వీర” వారి ఈ వచనములు విని ప్రహర్షముతో, భర్త మఱియు ఇతర రాజుల ఎదుట ఇట్లు పలుక సాగెను. “ఓ పార్దివులారా! సంపూర్ణ రాజులను పరాజితుల జేసి నా కల్యాణాస్పద పుత్రుడు బలాత్కారముచే ఏ కన్యలను గ్రహించేనో, అది ఉత్తమమైన పనియే, అందుచే అధర్మ యుద్దములో ఒంటరి యైన రాజు పుత్రుని ఆ రాజు లందఱు బంధించిరి. దీని వలన నా కేమని బోదపడు చున్నది యనగా ఇట్లు చేయుట వలన నా పుత్రునికి హాని ఏమియు లేదు. ఇదే పురుషార్ధము. క్రోధమునకు వశీభూతమై చంపుటకు ఇష్టపడు నట్టి సింహము వలె అధర్మ యుక్తుడగు మనుష్యుడు నీతిని ఈ విధముగా లెక్కింప లేడు సన్మానితులైన అనేకానేక రాజుల ఎదుట బలాత్కారముచే నా పుత్రుడు స్వయంవర నిమిత్తమై యున్న చాలా మంది కన్యలను గ్రహించెను. ఎక్కడి క్షత్రియ కుల మండలి జన్మ, ఎక్కడి హీన జనోచిత యాచిత కార్యము? ఈ రెండింటి లోనూ చాల అంతర మున్నది.
అందు వలన క్షత్రియ గణాలు బలవంతుల ఎదుటనే తమ బలమును చూపి గ్రహించెదరు. ఒక వేల ధార్మిక మైన రాజుకు ఎవరయిననూ ఇనుప సంకెళ్ళు వేసి బంధించిననూ అతడు పిరికి తనముతో అతనికి వశమై నట్లు స్వీకరించ లేదు. కాని ముందు వీరత్వమును జూపి తిరిగి సహజముగానే వశమై శ్లాఘ నీయముగా తలంచు చున్నాను. మీ పూర్వులు కూడ శత్రువులను నాశనము చేసి ఆ రాజుల యొక్క భూమి, పుత్రాదికములగు ధనమును హరించిరి.
మరియు వీని నిమిత్తము మీ మస్తకము లందు అస్త్రా ఘాతమై నప్పటికి కూడ శ్లాఘనీయమే. రాజులు భూమి, పుత్రాకది ధనము మఱియు భార్య ఇత్యాదులను సజ్జనుల నుండియే హరించి ప్రోగు చేసుకొనెదరు. మరియు అదియే వారి గౌరవమునకు హేతువగు చున్నది. అందు వలన యుద్దము కొఱకు వెంటనే సన్నద్ధులు కండు రథము నెక్కి వెంటనే సారథుల సహితముగా ఏనుగులు, గుఱ్ఱములను అలంకరింపుడు. అనేక మంది రాజులతో ఒకే ఒకడు చేయు యుద్దమును మీరు ఎట్లు యోచించు చున్నారు? శూరులు అల్ప యుద్దము నందే గొప్ప పరాక్రమమును పొంది అంతమందు సంతోషమును పొందుదురు. అల్పులగు నరేంద్రాది శత్రు సమూహములు మరియు ఎవరి వలన భయము ప్రాప్తింపదో, అట్టి పిరికి వారైన శత్రువులపై ఎవరు సామర్ధ్యమును జూపుటకు అభిలషింపరు? సూర్యుడు ఏ విధముగా దిగంత వ్యాప్తమై యున్న అంధకారమును నాశనము చేయునో, అట్లే ఏ శూరులు బల, వీర్యాదులచే భువన మందు వ్యాపించి యున్న శత్రువు లందరిని పరాజితుల చేసి విరాజిల్లుదురో, వారే యదార్ధ శూరులు.
ఓ మునీ! కరంధమ రాజు ఈ విధముగా భార్యచే ఉత్తేజితుడై పుత్రుని శత్రువులను వధించుటకై సైన్యమును సమాయత్త పరచ సాగెను.
అనంతరము పుత్రుడు బంధించి యుండగానే విశాల రాజుతో మఱియు ఇతర రాజులతో కరంధమ రాజునకు యుద్దము ప్రారంభ మయ్యెను. ఆ సమయమున విశాల రాజు యొక్క అనుచరులగు రాజులతో కరంధమునికి మూడు రోజుల పాటు యుద్దము జరిగిన పిమ్మట విశాలాది రాజు లందఱు పరాజితులైరి. అప్పుడు విశాల రాజు ఆతనిని పూజించుటకు అర్ఘ్యమును చేతి యందుంచుకొని కరంధముని సమీపమునకు వచ్చెను. కరంధముడు కూడా ఆ రాజుచే పూజింప బడి పుత్రుని బంధ విముక్తుని చేసెను. ప్రీతి పూర్వకముగా ఆ రాత్రి అచట సుఖముగా నుండెను. ఓ విప్రర్షీ! అటు పిమ్మట విశాల రాజు తన కన్యను తీసుకొని వచ్చెను. అవీక్షితుడు తండ్రి యెదుట వారితో నిట్లు పలికెను.
ఓ రాజా! ఏ కన్య ఎదుట నేను శత్రువులచే ఓడి పోయితినో, ఆ కన్యను ఎప్పటికీ స్వీకరింప లేను. మరియు ఏ కన్యను కాని నేను గ్రహించను. అందు వలన ఎవరు ఎప్పుడునూ శత్రువులచే అవమానింప బడలేదో, అట్టి అఖండ యశస్సు, వీర్య యుక్తుడైన మరెవ్వరికైననూ మీ కుమార్తె నిమ్ము. ఈ కన్య కూడ ఆతనినే వరించెను. పిరికి తనము గల అబల వలె నేను శత్రువుల వలన పరాజితుడ నైతిని. అందు వలన నాకు మానవత్వమే మున్నది? అందుచేత నాకును ఈ కన్యకును భేదము లేదు. స్వతంత్ర్యము ఎల్లప్పుడు మానవునికి అధీనము, మఱియు లలనా గణములు (స్త్రీలు) సదా పరాధీనులు. అందు వలన పురుషుడై నప్పటికినీ, ఎవరు పరాధీను రగునో. అతని యొక్క మనుష్యత్వ మేమున్నది? ఎవరి యెదుట నేను సమస్త రాజులచే ఓడి పోయితినో, ఆమెకు నా పూర్వ దృష్ట ముఖమును ఎట్లు చూపించ గలను?
భూపతి యగు విశాలుడు రాజ పుత్రుని ఈ మాటలు విని కుమార్తెతో ఓ కుమారీ! ఈ మహాత్ముడు చెప్పినది నీవు విన్నావు కదా! ఇప్పుడు ఓ కల్యాణీ! నీవు ఇష్ట పడినచో వేరెవరి నయినా పతిగా వరించుము. లేక నీ యడల గల స్నేహముతో నేను తగిన వానిని చూచెదను. ఓ రుచిరాననా! ఈ రెండింటి యందు ఏదో ఒక దానిని స్వీకరింపుము.
తండ్రీ! ఈ రాజ కుమారుడు ధర్మ మార్గ మందే నిలిచి అనేకులతో యుద్దము చేసియు వీర్యమునకు హాని కరమగు యుద్దమున పరాజితుడు కాలేదు. యుద్దమునకు వచ్చిన అనేక మంది రాజులలో ఈతడే విధముగ సింహము వలె ఒంటరిగా యుద్దమున నిలిచి యుండెనో, దాని ద్వారా యీతని శౌర్యము విశేషముగా ప్రకాశించెను. ఈతడు ఒక్క యుద్ద క్షేత్రముననే కాదు, సంపూర్ణ రాజ మండలమును అనేక మారులు, పరాజితులను చేసి యథేష్ట పరాక్రమమును ప్రకాశింప చేసెను.
ఓ రాజపుత్రా! నా కుమార్తె చెప్పిన దంతయు యుచితముగా నున్నది. నీతో సమానుడగు కుమారుడు పృథ్వి యందు మరెవ్వరునూ కనుపించుట లేదు. నీ శౌర్యము అప్రతిహతము, పరాక్రమము అత్యధికము. ఓ వీర కుమార నీవే ఈ కన్యను గ్రహించి నా కులమును పవిత్రము చేయుము.
ఓ రాజా! నేను ఈమెను గాని లేక మరియే ఇతర కన్యను గ్రహించను. ఓ మనుజేశ్వరా! నేను నన్ను స్త్రీగా తలంచు చున్నాను.
అప్పుడు కరంధముడును పుత్రునితో చెప్ప సాగెను. ఓ కుమారా! ఈ కన్యను గ్రహింపుము. ఎందు వలన యనగా ఈ సుందరి యగు విశాల రాజ కన్య నీ యెడల దృఢ మైన అనురాగము గలదై యున్నది.
ఓ ప్రభూ! నేను ఇంతకు ముం దెన్నడు నీ ఆజ్ఞను భంగ పరువ లేదు. ఓ తండ్రీ! సమయము నందు కూడా నీవు నాకు ఎట్టి దానిని చేయుట యందు సమర్దుడనో, అట్టి దానిని అజ్ఞాపింపుడు.
విశాల రాజు రాజ పుత్రుని ఇట్టి స్థిర బుద్దిని ఎరిగి వ్యాకుల చిత్తుడై కన్యతో యిట్లనియె. ఓ కుమారీ! ఈతనిపై నుండి మనస్సును మారల్చుకొనుము. అనేక మంది రాజ పుత్రు లున్నారు. వారిలో ఎవరినైన తొందరగా వరింపుము.
ఓ తండ్రీ! ఈ రాజ కుమారుడు నన్ను అభిలాషింపనిచో, తపస్సు కాక ఈ జన్మ యందు నాకు అన్యు లెవరూ భర్త కాలేరు.
అనంతరము కరంధమ రాజు, విశాల రాజు సహితముగా అచ్చట ప్రసన్న చిత్తుడై మూడు రోజులు గడిచిన పిమ్మట తన నగరమునకు వెళ్ళెను. తండ్రి మఱియు ఇతర రాజులు అనేక ప్రాచీన దృష్టాంతములు తెలియ చెప్పిన పిమ్మట అవీక్షితుడు కూడ రాజధానికి వెళ్ళెను. మరియు ఆ విశాల రాజ కన్య కూడ ఆత్మ బంధువుల నుండి ఆనుజ్ఞ తీసుకొని వనమునకు పోయెను. వైరాగ్యముతో నిరాహారురాలై తపస్సు చేయ సాగెను. ఈ విధముగా నిరాహారురాలై మూడు నెలలు గడపిన పిమ్మట ఆమె శరీరము నందలి నాడి కంపింప సాగెను. ఆమె కృశించినదై అత్యంత దుఃఖితు రాలయ్యెను.
అప్పుడు అత్యంత దుర్భలమైన అంగములు గలదై మృత్యువు సమీపమున నున్న ఆ రాజ కన్య నిరుత్సాహముతో ప్రాణ త్యాగము చేయుటకు కృత నిశ్చయు రాలయ్యెను. ఇట్లు ప్రాణ త్యాగము చేయుటకు స్థిర నిశ్చయురాలగుట ఎగిరి దేవత లందఱు ఆమె వద్దకు ఒక దేవ దూత దూతను పంపిరి. దూత వచ్చి ఇట్లు పలికెను: “ఓ నృపాత్మజా! నేను దేవతలు పంపగా వచ్చిన దూతను. ఏ కార్యార్ధము దేవతలు నన్ను పంపిరో, దాని నెరిగించెదను వినుము.” “ఈ దుర్లభ మగు శరీరమును నీవు పరిత్యజింపకుము. ఓ కల్యాణీ! నీవు చక్రవర్తి యగు రాజునకు తల్లి వగుదువు గాక. ఓ మహాభాగా! నీ పుత్రుడు శత్రు కులమును నాశనము చేసి అప్రతిహత ప్రభావముచే చాలాకాలము వరకు ఈ సప్త ద్వీపములు గల భూమిని అనుభవించును.”
“దేవ శత్రువులైన తరుజిత్తు మఱియు క్రూరుడగు అయఃశంఖుడు దేవతల యెదుట ఆతని ద్వారానే వినాశానమును పొందుదురు. మఱియు ఓ భద్రా! అతడు విపుల, దక్షిణా యుక్తముగా ఆశ్వమేదాది అనేక విధములు గల ఆరువేల యజ్ఞములు చేయును.”
అనంతరము దివ్యమాలానులేప ధారియై ఆకాశము నందు నిలిచి యున్న ఆ దేవదూతను చూచి రాజ పుత్రిక మధుర స్వరముతో నిట్లు పలికెను. నీవు నిజముగా స్వర్గ లోకము నుండి వచ్చిన దేవదూతవు. ఇందు సందియము లేదు. కాని భర్త లేకుండ నాకు పుత్రు డెట్లు కలుగును?
“ఓ మహాభాగా! అధికముగా చెప్పుట వలన ప్రయోజనము లేదు. నిస్సందేహముగా నీకు పుత్రుడు జన్మించును. అందు వలన నీవు ఆత్మ త్యాగము చేసి అధర్మాచరణ చేయ వద్దు. ఈ వనము నందే యుండి క్షీణమైన దేహమును పోషించు కొనుము. నీ తపస్సు యొక్క ప్రభావముచే నీకు అన్ని విధాల శుభ మగును.”
దేవదూత ఇట్లు పలికి ఎచటి నుండి వచ్చెనో, అచటకు పోయెను. పిమ్మట ఆ సుందరి యగు రాజ కన్య నిత్యము తన శరీరమునూ పోషించు కొన మొదలిడెను.
