మార్కండేయ మహా పురాణము

Table of Contents

21 - కువలయాశ్వుడు పాతాళలోకమునకు బోవుట

రాజపుత్రుడగు నా ఋతధ్వజుడు తల్లి దండ్రులకు వందనము జేయ వలెనని ప్రియపత్ని యగు మదాలసను జూడ వలయునను కోరికతో శీఘ్రముగా తన పట్టణమునకు బోయెను. రాజసూనుడు పట్టణమున ప్రజలు దుఃఖా క్రాంతచిత్తులై యుండుటను జూచెను. తనను జూడగనే దుఃఖము వదలి వెంటనే విస్మయాకార ముఖములతో సంతోష చిత్తులై యున్న పౌరులను జూచెను. కొందరు వికసించిన నేత్రములతో ఏమి భాగ్యమని అనుకొన సాగిరి. కొందరు అత్యంత స్నేహముచే కుతూహలముతో అన్యోన్యాలింగనము చేసుకొన సాగిరి. మరియు నా రాజపుత్రులు ఆనందముతో విప్పారిన నేత్రములు గల తన మిత్రులను ఆ సమయమున ఆలింగనము చేసుకొన సాగిరి. మరియు పురవాసులైన జనులు అతడిని చూసి ఏమి భాగ్యమని పలుకుచు, శుభయోగములు గల రాజపుత్రా! నీవు చిరంజీవి వగుదువు గాక. నీ శత్రువు లందరు నశించెదరు గాక.

తల్లిదండ్రుల మనస్సులకు, పౌరులగు మా మనస్సులకు , ఆనందమును కలుగజేయుము. ఇట్లు ప్రజలు పలుకుచూ వెంబడించు చుండ, తత్కాలము నందు కలిగిన ఆనందముతో జనకుని మందిరమునకు పోయెను. అప్పుడు తల్లిదండ్రులు, ఇతర బంధుగణము పరమానందముతో ఆలింగనము చేసుకొనిరి. “ఉరుకల్యాణా! నీవు చిరంజీవి యగుదువు గాక!”  అని ఆశిస్సులిడ సాగిరి. అనంతరము రాజపుత్రుడు వారందరికీ నమస్కరించి ఇది యంతయు ఏమి? అని విస్మయము చెందెను. పిమ్మట రాజకుమారుడు జనకుని అడిగెను. తండ్రి జరిగిన వృత్తాంత మంతయు చెప్పెను. రాజసూనుడు ప్రాణ ప్రియురాలగు భార్య మదాలస యొక్క మరణ వార్త విని ఎదుట నున్న తల్లిదండ్రులను జూచి, లజ్జతో శోక సాగరమున మునిగెను. నా భార్య నేను చనిపోయినట్లు విని తాను కూడ మరణించెను గదా యని దుఃఖించ సాగెను.

సాధ్వి యగుటచే జీవితమును త్యాగము జేసెను. నేను కఠిన మానవుడను. నీచుడను, నా నిమిత్తముగా ప్రాణ త్యాగము జేసినది. నేను మాత్రము నా ప్రియురాలు మరణించినను జీవించి యున్నాను. నేను దయా రహితుడను. అని యిట్లు దుఃఖించిన పిమ్మట మనస్సును నిగ్రహించుకొని అత్యంత కాతరుడై దీర్ఘములగు ఉచ్చ్వాస నిశ్వాసములను విడుచుచు మోహమును విడనాడి, చింతించ సాగెను. నా ప్రియురాలు నా కొరకు ప్రాణములను విడిచెను. నేను గూడ నా ప్రేయసి నిమిత్తము అసువులు బాసినచో ప్రయోజన మేమి యుండును? ఆమెకు ఏమి ఉపకారము చేసిన వాడనగుదును? హా ప్రియా! అని దీనముగా మాటి మాటికి ఏడ్చుట వలన ఆమెకు కలుగు ప్రయోజనమేమి? అట్లు ఏడ్చుట స్త్రీలు మాత్రమే చేయదగినది. పురుషుడ నైన నేను చేయదగినది కాదు. బలవంతుడ నయ్యను శోకాకులడను దీనుడను అయినచో రక్త హీనుడ నగుదును.

అందువలన శత్రువుల చేత పరాభవము పాలగుదును. శత్రు నాశనము, పితృ సేవయు, ముఖ్య కర్తవ్యము. నా జీవితము శత్రు వినాశనము పితృ సేవాది కార్యములకు ఆధీనమై యున్నది. కావున జీవన పరిత్యాగము చేయుట ఉచితము కాదు. ఇప్పుడు స్త్రీ భోగమును త్యజించుట మరియొక కర్తవ్యము కారు. స్త్రీ సుఖ త్యాగము గూడ ఆమె ఆత్మ శాంతికి ఉపయోగించునది మాత్రము గాదు. అయినాను ఉపకారమైనను, అపకారమైనను నాకు ఆమె యండలి కరుణా పూర్వకమైన కర్తవ్యము. నా నిమిత్తము ప్రాణములను త్యజించిన ఆమెకు నేను చేయుచున్నది స్వల్పము మాత్రమే.

ఋతధ్వజుడు ఈ విధముగా తలచి తన భార్యకు జల దానాది కర్మలు చేసెను. ఇట్లు పరలోక క్రియలు సమస్తము గావించిన పిదప ఋతధ్వజుడు అక్కడి వారితో ఈ విధముగా చెప్పెను.

ఈ జన్మలో నాకు మదాలసయే భార్య గాని యెడల, మరి యే స్త్రీయు భార్య కాజాలదు. గంధర్వ తనయ, మృగ శాబాక్షియు నగు మదాలసను గాక మరియే కాంతను ఆపేక్షించను. సహా ధర్మచారిణి యగు నట్టి భార్యను వీడి అన్యకాంతను వివాహ మాడను. ఇది ముమ్మాటికి సత్యము. తండ్రీ! అతడిట్లు చెప్పి సర్వ భోగములను త్యజించి సంపదచే తనకు తుల్యమగు స్నేహితులతో నాట పాటల యందు కాలము గడుపు చుండెను. అతని కోరిక మదాలస ప్రాప్తియే. అది యెట్లు సాధ్య మగును? ఈ కార్యము ఈశ్వరునకు కూడా అసాధ్య మనుచో నితరులకు ఎట్లు సాధ్యము గాగలదు?

కుమారులిద్దరు చెప్పిన వాక్యములను విని నాగరాజు ఆలోచింప సాగెను.

నాగరాజు విచారణ జేసి నవ్వుచు పుత్రులతో ఇట్లు పలికెను. కుమారులారా! మానవులు చేయ దగిన పనిని శక్యము గాదని ప్రయత్నము చేయ కుండినచో దోషము కలుగును. పిమ్మట అత్యంత దుఃఖమును పొందిన వారగుదురు. కావున పురుష ప్రయత్నమును విడనాడ కుండ చేయదగిన కర్మను చేయవలెను. దైవ ప్రయత్న, పురుష ప్రయత్నముల రెండింటి యందు కర్మసిద్ది స్థిరమై యున్నది. అందు వలన నేను రాజ కుమారుని పత్ని కొరకు మానవ ప్రయత్నము చేసెదను. త్వరలో కార్యసిద్ధి యగునట్లు తపస్సు చేసెదను.

ఆ నాగేంద్రుడు ఇట్లు జెప్పి హిమాలయ పర్వత మందలి “ప్లక్షా వతరణ” మను పేరు గల తీర్థమునకు పోయెను. అచ్చట కఠోర మగు తపస్సు చేయ మొదలిడెను. తన కభీష్టములగు వాక్కులతో సరస్వతిని స్తుతించెను.

నిశ్చల మనస్సుతో త్రికాలముల యందు స్నానము చేయుచు నియమ పూర్వకముగ మితాహారమును తీసుకొనుచు దేవిని ఇట్లు స్తవము జేసెను.

నేను జగజ్జనిని, శుభప్రదవు, సరస్వతీదేవివి యగు నిన్ను ఆరాధించ దలచితిని. నేను బ్రహ్మ కారణమగు సరస్వతిని శిరస్సుచే నమస్కరించి స్తుతించెను. ఓ సరస్వతీ! మోక్షము, అర్థము, బంధము మొదలగు సత్, అసత్ రూపములన్నియు నీవే అయి యున్నావు. సమస్తము నీయందు లేకున్నను ఉన్నదాని వలె ఉందువు. నీవు అక్షర స్వరూపవు. నీయందు సర్వము నిలిచి యున్నది. కట్టె యందు భౌమాణువులు, అగ్నియు ఉన్నట్లుగా అక్షరము లన్నియు పరమాణువులతో సమానముగా నీ యందు ఉన్నవి. అక్షర స్వరూప పరబ్రహ్మవు నీవే. ఈ విశ్వమంతయు నీ యందే ఉన్నది. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి. అశేష ప్రపంచ మంతయు నీ స్వరూపము. నీ స్వరూపమైన ఓంకారము వర్ణములు నిత్యములు అనిత్యములు అగు చున్నవి.

అనగా సత్ అసత్ సంపూర్ణ పదార్థము లన్నియు నీ యందే యున్నవి. తల్లీ! త్రిలోకములు, త్రిమూర్తులు, వేద త్రయము, అగ్ని త్రయము (ధర్మ,అర్థ, కామములు) గుణ త్రయము (సత్వ, రజ, తమో గుణములు) శబ్ద త్రయము, దోష త్రయము, ఆశ్రమములు నీ స్వరూపమగు చున్నది. కాల త్రయము( భూత భవిష్యత్ వర్తమానములు) అవస్థా త్రయము( జాగ్రత్ స్వప్న సుషిప్త్యివస్థలు) పితృ దేవతలు అహో రాత్రులు మొదలగునవి యన్నియు దేవీ! సరస్వతీ! నీవే. మాత్రాత్రయ యుక్తమగు ఓంకారము నీ యొక్క స్వరూపమై యున్నది. వేరు వేరైన సంప్రదాయ యుక్తులగు పురుషుల కొరకు సోమ సంస్థా, అవిః సంస్థా, పాక సంస్థా, రూపములతో ఆద్యములు, సనాతనములు నగు ఏడు విధములగు వ్యాహృతులు వేద మందు నిరూపించబడి యున్నవి. గ్రంధ వేత్తలు ఈ సప్త వ్యాహృతులను నీ రూపముగానే ఉచ్చరించుదురు. ఇదియని చెప్పుటకు వీలుగాని ప్రణవ మంత్రము నందలి స్వరూపము నీవే.

వికార రహితము, దివ్యము, నాశ రహితము, పరిమాణ రహితము అయిన నీ రూపము వర్ణించుటకు నాకు శక్యము గాదు. ఎందు చేతననగా నీ యొక్క సంపూర్ణ స్వరూపము జిహ్వాతాలువు, ఓష్టములు మొదలగు వాటిచే కూడి ఉన్నను వర్ణించుటకు సాధ్యము గాదు. ఇంద్రుడు, వసువు, బ్రహ్మ, సూర్యచంద్రులు, తేజస్సు ఇవి యన్నియు నీ స్వరూపమై యున్నవి. విశ్వ మందున్నవి, విశ్వము యొక్క రూపము, విశ్వమునకు ఈశ్వరుడు పరమాత్మావు నీవే. సాంఖ్య వేదాంత తర్క శాస్త్రాదుల యందు నిరూపింప బడిన రూపములు నీవే. వేదము యొక్క అనేక శాఖల యందు నిర్ణయింప బడిన స్వరూపములు నీవే. ఆది మధ్యాంత రహితము, సత్, అసద్, ఏకము, అనేకము అన్నియు నీవే. సంసార మందలి భేదములచే నానా ప్రకారములతో నీ రూపము ప్రకాశించు చున్నది. మరియు నీ రూపము నామ రహితము. షడ్గుణాఖ్యము (మహత్తు, ధైర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము) చేత శోభిల్లు చున్నది. షడ్వర్గము (కామ, క్రోధ, లోభ, మోహము, మదము,మత్సరములు) త్రిగుణాశ్రయము. బహు ప్రకార శక్తి యుతులగు పురుషుల యొక్క శక్తి వైభవము నీవే.

సుఖ, మహా సుఖము, దుఃఖము, మహా దుఃఖములు, నీ రూపములే. ఈ ప్రకారము సకల నిష్కల ప్రపంచ మంతయు నీచే వ్యాప్తమై యున్నది. అద్వైత బ్రహ్మవు నీవే. ద్వైత ప్రపంచ మందలి బ్రహ్మవు నీవే. అద్వైత నిరూపితవు. ద్వైత నిరూపితవు నగు బ్రహ్మవు నీవే. నిత్యా నిత్య పదార్థము లన్నియు నీవే. స్థూలములు, సూక్షాతి సూక్ష్మములు మరియు భూమి అంతరిక్షముల యందున్న అన్ని పదార్థములు సత్వములు నీ వలననే లభించు చున్నవి. ఓ తల్లీ! మూర్తములు,అమూర్తములు అయిన సమస్త ప్రాణుల యందు ఏ కొంచెమున్నను స్వర్గలోక, మర్త్యలోక అంతరిక్షముల యందుగాని మరి యే ఇతర స్థానముల యందు గాని వున్న వన్నియు నీ స్వరూపములే. నీ రూపములగు స్వర వ్యంజనముల వల్లనే సమస్త పదార్థముల యొక్క జ్ఞానము కలుగు చున్నది.

విష్ణుజిహ్వ యగు సరస్వతీ దేవి ఇట్లు నాగరాజగు నశ్వతరుడు జేసినా స్తుతికి సంతసించి మహాత్ముడు నాగు నతనితో నిట్లు పలికెను.

కంఇలుని సోదరుడవగు నాగరాజా! నీవు కోరిన వరమిచ్చెదను. నీ మనస్సు నందున్న దానిని తెలుపుము.

దేవీ! ప్రథమముగా కంబలునికి నాకును సమస్త సర్వ సంబంద్దమైన సంగీత జ్ఞానమును ప్రసాదించుము.

పన్నగ రాజా! ఈ దినము నుండి నా యనుగ్రహము చేత సప్త స్వరములు, సప్త గ్రామ రాగములు, సప్త గీతములు, సమస్త మూర్చనలు మీకు తెలియును గాక. మరియు ఏకోన పంచాశత్ (49) తాళములు, మూడు గ్రామములు ఇవన్నియు కంబళునకును నీకును సంప్రాప్త మౌను గాక. భుజగేంద్ర! నా దయ చేత చతుర్విధ తాళములు, త్రివిధములైన లయలు మీకు తెలియ గలవు. త్రివిధ గతులు చతుర్విధము లగు తాళ విశేషములు నా యనుగ్రహము చేత తెలియబడు గాక.

ముఖాంతర్గతమై స్వర వ్యంజనాదికము నాగు సశేష సంగీత శాస్త్రములను అనుగ్రహించితిని. నాగేంద్రా! మీ యిద్దరు స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందు సమస్త సంగీత శాస్త్ర ప్రణేతలగుదురు గాక. మీతో సమానమైన వాడు వేరొకడు ఉండక పోవుగాక.

సర్వ జిహ్వా స్వరూపిణియు, కమలముల వంటి నేత్రములు కలిగిన ఆ సరస్వతీ దేవి ఇట్లు చెప్పి తత్ క్షణమే అచటి నుండి అంతర్థాన మయ్యెను. ఆమె వర ప్రభావముచే ఆ ఇద్దరు సోదరులకు సంపూర్ణమైన సంగీత శాస్త్ర జ్ఞానము కలిగెను.

పద, తాళ స్వరాది విషయములందు విజ్ఞానము కలిగెను. తరువాత వారిద్దరు కైలాస పర్వత శిఖర స్థితుడు, పాప రహితుడు, కామ దహనుడునగు శంకరుని యొక్క అనుగ్రహము కొరకు తంత్రీలయ సప్తస్వరములచే గానము చేయుచు ఆరాధన చేయసాగిరి. ప్రాత ర్మధ్యాహ్న సాయంకాల సంధ్యాకాల సమయము లందే గాక రాత్రి భాగము నందు కూడ ఆ సోదరు లిద్దరు ఏకాగ్ర చిత్తులై సంగీత కళాయుక్తమగు వాక్యముల చేత పరమ యత్నముతో ఈశ్వరుని గూర్చి ఆరాధన చేసిరి.

వృషభ ధ్వజుడగు మహేశ్వరుడు చిరకాలమునకు వారి గానమునకు మిక్కిలి సంతోషించి ప్రత్యక్షమై వరము కోరు కొనుడు అని పలికెను.పిమ్మట కంబల సహితుడైన ఆశ్వతరుడు, ఉమాపతి శితికంఠుడు నగు మహాదేవునికి నమస్కరించి ఇట్లు విన్నవించెను. హి దేవా! త్రిలోచనా! భగవానుడా! నాయందు తమకు అనుగ్రహమున్నచో మా యిద్దరికీ అభీష్టమగు ఈ వరము నిమ్ము. దేవా! కువలయాశ్వుని పత్నియగు మదాలస చని పోయిన సమయ మందున్న వయస్సుతో నాకు పుత్రికగా జన్మించు గాక.

అట్లు నాకు జనించిన మదాలస మీ అనుగ్రహముచే యథా పూర్వముగా పూర్వ జన్మ జ్ఞానము కలదియు, క్షాంతి గలదియు యోగినియు యోగ జననియు అగును గాక.

పన్నగ శ్రేష్టా! నీవు అడిగినది యంతయు నా అనుగ్రహముచే సిద్దించును గాక. సందేహము లేదు. మరియు నొక విషయమును చెప్పెదను. వినుము. నీవు మదాలసను గురించి సంకల్పించి పితృ శ్రాద్దమును జేయుము. శ్రాజ్దావ సానమున మధ్యమ పిండమును భక్షించుము. అట్లు భుజించుటచే మంగళ దాయినియు, చక్కని కను బొమ్మలు కలిగి నట్టిదియు నగు మదాలస ప్రాణ త్యాగ సమయ మందున్న వయో రూపములతో తక్షణమే నీ యొక్క మధ్యమ ఫణము నుండి జన్మించును.

నీవీ ప్రకారముగా ఆ పిండమును స్వయముగా భుజించిన తర్వాత ఆమె తప్పక నీ మధ్యమ ఫణము నుండి జన్మించ గలదు. ఆ మాటలు విని అశ్వతర కంబళులు ఇద్దరు శివునకు నమస్కరించి సంతోష చిత్తులై రసాతల లోకమునకు బోయిరి. కంబళ సోదరుడైన ఆ ఆశ్వతరుడు అను నాగరాజు శివదేవుడు చెప్పినట్లుగా శ్రాద్ధ కర్మను చేసి మధ్యమ పిండమును భుజించెను. అట్లు నాగరాజు ఆ మధ్యమ పిండమును భుజించిన ఆ క్షణమునందే మదాలస పూర్వపు రూపముతో మధ్యమ ఫణము నుండి ఉద్భవించెను. ఆశ్వతరుడు ఈ విషయమును ఎవ్వరికి తెలియ పరచకుండా మదాలసను తన అంతఃపుర స్త్రీల రక్షణ మందు ఉంచెను.

ఆ నాగరాజు యొక్క పుత్రులిద్దరు అను దినమున రుతధ్వజునితో కలిసి దేవ కుమారుల వలె సంతోషముతో విహరించు చుండిరి. ఒకనాడు ఆశ్వతరుడు పూర్వము తాను చెప్పిన విధముగా చేయుడని కుమారులతో చెప్పెను. “కుమారులారా! ఉన్నతిని కలిగించు వాడును, నీకు సహాయ కరుడును అగు ఆ రాజ పుత్రుని ఇచ్చటకు తీసుకు రావలయును” అని పలికెను. తండ్రిచే ఆ ప్రకారముగా ఆజ్ఞను పొందిన వారై నాగ కుమారులు ఋతధ్వజుని పురమున కేగి అతనితో కలసి క్రీడించుచు కొన్ని దినముల తరువాత అతనిని తమ గృహమునకు రమ్మని సగౌరవముగా ఆహ్వానించిరి.

అపుడు రాజ పుత్రుడు వారితో ఇట్లనెను. స్నేహితులారా! నన్ను ప్రత్యేకముగా మీ గృహమునకు రమ్మను చున్నారు. ఇచట నాకు గల ధన వాహన వస్త్రాది వైభవ మెల్లయు మీదే కదా! మీ కభీష్టములైన ధన రత్నములను, నాగపుత్రులారా! నాయందు సఖ్యము, ఇష్టము, ప్రేమ కలదేని మీరు యధేష్టముగా వినియోగింపుడు. ఇప్పటి వరకు మీరు నా యింటిని మీ స్వగృహముగా భావింప నందున నేను దురాత్ముడను. దైవ వంచితుడను అయితిని. నా యందు అనుగ్రహము కలిగి, నాకు ప్రియము చేయుట మీ కిష్టమైన యెడల నా గృహమును ధనమును మీవేయని భావింపుడు. ఏది మీదో అది నాది కూడా. అట్లే ఏది నాదో అది మీది కూడ. ఈ విషయమును తెలిసికొనుడు. స్నేహితుడనగా బహిః ప్రాణము.

పన్నగ శ్రేష్టులారా! ఈ విధమైన మాది మీది అని భేద భావముతో నెపుడును పలుక దగదు. ప్రీతితో నా యందనుగ్రహ ముంచుడు. హృదయ పూర్వకముగా ప్రతిజ్ఞ చేసి చెప్పితిని. తరువాత స్నేహార్ద్ర హృదయులైన ఆ నాగ కుమారులు ఇద్దరూ తమపై ప్రణయము వలన కొంచెము కోపించి యున్న రాజపుత్రునితో యిట్లనిరి. మిత్రమా! ఋతధ్వజా! నీ వనినది నిస్సందేహము. మేము నీ మనస్సు యందున్న విధముగానే భావించు చున్నాము. మమ్ము అన్యదా భావించ వలదు. కాని మహాత్ముడు మా తండ్రి కూడా కుశాలయాశ్వుని చూడవలయు నను కోరిక కలదని మాటి మాటికి చెప్పుచున్నాడు. ఆ మాట విని నంతనే కువలయాశ్వుడు తన ఉత్తమాసనము నుండి లేచి నాయన గారీ విధముగా చెప్పినారా? యని నేలపై సాగిలబడి ప్రణామము చేసెను.

నన్ను చూచుటకు తండ్రి గారు ఆసక్తులైనందు వలన నేను ధన్యుడను. మిక్కిలి పుణ్యము చేసుకున్న వాడిని అయితిని. నాతో సమానుడైన వాడింక నేవడుండును? కావున లెండు పోవుదము. వారి పాద సాక్షిగా చెప్పు చున్నాను. తండ్రి గారి యాజ్ఞను ముహూర్త మాత్రమైనను ఉల్లంఘించుటకు నాకు అంగీకారము గాదు.

ఈ విధముగా జెప్పి ఆ రాజ కుమారుడు కువలయాశ్వుడు నాగ కుమారులతో నగరము నుండి ప్రయాణమై పుణ్య ప్రదమైన గౌతమీ నదిని చేరెను. వారు నదీ మధ్యమమున ప్రయాణించు చుండిరి. వారి గృహము నదీ తటమున కలదని రాజ పుత్రుడు భావించెను. పిమ్మట నాగ కుమారులు అతనిని తమతో పాతాళ లోకమునకు తీసికొని పోయిరి.

ఆ నాగకుమారు లిద్దరు మాయా మానవ రూపము వదలి తమ నాగ రూపములు ధరించిరి. ఆ నాగకుమారు లిద్దరు పాడగా యందున్న మణుల చేతను, స్వస్తిక చిహ్నములతోను ప్రకాశించు చుండిరి. రాజ కుమారుడు వారి స్వరూపమును చూచి విస్మయముతో వికసిత నేత్రుడు అయ్యెను. రాజ కుమారుడు వారిద్దరిని చూచి ప్రణయ పూర్వకముగా మిత్రులారా! నాగ కుమారులారా! మీ రూపములు చాలా బాగున్నవని సంతోషించెను. అనంతరము ఆ నాగ కుమారులు, పన్నగేశ్వరుడగు తమ తండ్రికి రాజ కుమారుని తీసుకొని వచ్చితిమని చెప్పిరి. అనంతరము రాజ కుమారుడు అత్యంత మనోహరము అగు పాతాళ లోక సౌందర్యమును చూసెను. మరియు ఆ కుమారుడు అన్ని వైపులా బాలక, యువక, వృద్ధ నాగ రాజులతో శోభాయ మానముగా నున్న పాతాళ నగరమును చూచుచు పోవు చుండెను. ఆకాశ మందలి తారల వలె మనోహరములగు కుండలములు హారముల నలంకరించుకొని క్రీడించు చున్న నాగ కన్యకలతో కొన్ని ప్రదేశములు వీణా వేరు స్వరముల ననుసరించి పాడుచున్న గీతములతో మనోరంజకముగా నుండెను.

మృదంగ ప్రణవాది వాద్య ధ్వనులచే గృహము లన్నియు ప్రతిధ్వనించుచు ఇష్టులగు నాగ కుమారులతో వారి తండ్రి యగు నాగరాజు గృహము ప్రవేశించెను. పిమ్మట వారు మణి విద్రుమ వైడూర్య ఖచిత కాంతులచే వ్యాప్త మైనదియు కాంచన మయమగు నాసనమున ఆశీనుడై యున్న వాడును స్వచ్చములగు ముక్తా ఫల లతల వలె మనోహరములగు కంఠహారములచే స్వర్ణమయములగు కర కంకణములచే శోభిల్లుచున్న వాడును, మహానుభావుడు నగు మణికుండల భూషణుడును, దివ్యమాల్యములు వస్త్రములు ధరించిన వాడును, మహాత్ముడు పన్నగాధిపతియు నగు ఆశ్వతరుని చూచిరి.

తరువాత నాగ కుమారులు ఈయనయే మా జనకుడు అని చూపించిరి. ఇతడే వీరుడైన కువలయాశ్వుడని తండ్రికి నివేదించిరి. పిమ్మట ఋతధ్వజుడు నాగేంద్రుని చరణములకు ప్రణమిల్లెను. అనంతరము నాగ రాజు తన పాదము లందు ప్రణమిల్లి యున్న రాజ కుమారుని బలాత్కారముగా పైకి లేవనెత్తి గాఢాలింగనము జేసుకొనెను. మూర్థాఘ్రాణము చేసి “చిరంజీవ” యని ఆశీర్వాదము జేసెను. వత్సా! శత్రు సంహారకుడవై తల్లి దండ్రులను సేవింపుము. నీవు ధన్యుడవు. నీ పరోక్ష మందు గూడ నీ సద్గుణములు కొనియాడ బడు చున్నవి. నా కుమారులు నీ సౌశీల్యాదులను చెప్పిరి. త్రికరణ శుద్ధములైన చేష్టితములచే విలసిల్లు నట్టి సద్గుణములతో వర్దిల్లుదువు గాక! గుణవంతుని జీవితము శ్లాఘించ దగినది. గుణహీనుడు జీవించి యున్నను మృతునితో సమానుడు. గుణవంతుడు తల్లి దండ్రులకు సుఖము కల్గించును. శత్రువులకు తాపము కలిగించును.

మహాజనులకు విశ్వాస పాత్రుడై ఆత్మకు హితములగు సత్కర్మలు చేసుకొనును. దేవతలు, పితరులు, విప్రులు, ఆర్థులు, బంధువులు, శోభన దేవతలు, గుణవంతుడగు వానిని చిరకాలము జీవించ వలెనని ఆశీర్వదింతురు. గుణవంతుడు పరులను నిందించడు. దుఃఖితులను చూచి దయగల వాడగును. ఆపత్కాలమున ఆశ్రయించిన వారిని రక్షించిన గుణవంతుని జన్మ సఫలము.

ఆ నాగరాజు ఆ రాజ కుమారునితో ఇట్లు చెప్పిన పిమ్మట తన పుత్రుల కిట్లనెను. మనము కువలయాశ్వునకు ఇష్టానుసారముగా స్నానపాన భోజనాదులను యదా క్రమముగా చేయవలెను. అతని మనస్సుకు ఉత్సాహము ఉల్లాసము కలిగించు కథలతో కొంచెము కాలము గడుపుదము.

అది అంతయు మౌనముగా వినుచున్న రాజ కుమారుడు మారు మాటాడక నాగరాజు మాటకును సమ్మతించెను. అపుడు ఉదారమతి యగు పన్నగ రాజు రాజ కుమారునకు ప్రియకరములగు కార్యక్రమములతో, కథా ప్రసంగముల తోడను కొంత కాలము గడిపెను. భోగవంతుడు, ఆత్మవంతుడు, సత్యభాషి, నాగరాజు యగు ఆశ్వతరుడు శత్రుజిత్తు యొక్క కుమారుడగు ఋతధ్వజునితోను తన కుమారులతోను కలసి ప్రసన్న చిత్తముతో అన్నపానాది మధుర పదార్థములతో యధేచ్చగా సమస్త భోగములను అనుభవించెను.